http://kovela.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
----The Ultimate happyness----
Updated: 21 min 36 sec ago

గుర్తుకొస్తున్నాయి...

Wed, 05/19/2010 - 11:55
రాష్ట్ర రాజకీయాల్లో మే 20 , 2009 ఒక సంచలనాన్ని నమోదు చేసిన రోజు.. తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించి వరుసగా రెండోసారి వైఎస్‌ఆర్‌ అధికార ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. ఏడాది తిరిగిపోయింది.. అంతలోనే ఎంత మార్పు...వైఎస్‌ఆర్‌ అకాల మరణం రాష్ట్ర రాజకీయాల రూపు రేఖల్ని సమూలంగా మార్చేసింది.. అధికార పార్టీలో నిరుటి వెలుగులు ఇవాళ కనిపించటం లేదు..
ఆరేళ్ల పాటు ఏక వ్యక్తి నేతృత్వంలో విజయపరంపరలతో కొనసాగిన కాంగ్రెస్‌ ఇప్పుడు బేలగా ఎందుకు తయారైంది.....

సరిగ్గా ఏడాది క్రితం లాల్‌బహదూర్‌ స్టేడియంలో అశేష జనవాహిని సాక్షిగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్న కలలను కల్లలు చేయటమే కాదు.. తెలంగాణా రాష్ట్ర సమితి తో సహా ప్రతిపక్షాలన్నింటినీ గుక్క తిప్పుకోకుండా చేసి చీలికలు, పేలికలు అయ్యే పరిస్థితిని తీసుకువచ్చారు..

వైఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రతిపక్షాలకు ఊపిరి తీసుకోవటమే కష్టమైంది. ఆపరేషన్‌ ఆకర్ష కానీ, ఆపరేషన్‌ స్వగృహలు కానీ, మరే పేరు కానీ,,, రాజకీయాల్లో చాణుక్యుడనుకున్న చంద్రబాబులో సైతం కల్లోలం రేపిన రాజకీయం వైఎస్‌ఆర్‌ది..
తొలిసారి అధికారంలోకి వచ్చి అయిదేళ్లూ, మూడు సంక్షేమాలు.. ఆరు ప్రాజెక్టులన్న రీతిలో విజయవంతంగా పూర్తి చేశారు... సాధారణ మెజారిటీయే అయినా, వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి వైఎస్‌ అందరినీ ఆశ్చర్యపరిచారు.. రాష్ట్రంలోనే సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రికార్డు సృష్టిస్తారనీ అంతా భావించారు. రెండో టర్మ్‌ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో విపక్షాలకు ఉనికే లేకుండా చేస్తారని భావించారు..కానీ అంతలోనే జరగరాని అనర్థం జరిగిపోయింది.. హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హఠాత్తుగా రాష్ట్ర ప్రజానీకానికి శాశ్వతంగా దూరమైపోయారు..
అప్పుడే తొమ్మిది నెలలు గడిచిపోయాయి.. వైఎస్‌ఆర్‌ లేరన్న లోటు స్పష్టంగానే కనిపిస్తోంది. అటు ప్రజల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ.. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ను వైఎస్‌ లోటు చీలికలు పేలికలు చేసింది...

కాలం చక్రంలా తిరుగుతూనే ఉంది.. వైఎస్‌ లేకపోవటం అన్నది ఇవాళ్టికీ అనూహ్యమైంది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు సంభవించిన ప్రతిసారీ, కొత్త సమీకరణాలు చోటు చేసుకున్న ప్రతిసారీ వైఎస్‌-- అధికార, విపక్షాలకు గుర్తుకురాని సందర్భం ఉండదు.. వైఎస్‌ అధికారంలో ఉన్నప్పటి రాజకీయానికీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు ఎక్కడైనా పొంతన ఉందా?
వైఎస్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించినప్పటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో ఆయన మాటే చెల్లుబాటు అవుతూ వచ్చింది.. ఆ తరువాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన తరువాత వైఎస్‌కు ఎదురే లేకుండా పోయింది.. ౨౦౦౪లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 2009 సెప్టెంబర్‌ 2న ఆయన ప్రమాద వశాత్తూ మరణించేంత వరకూ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి అన్నదే లేకుండా చేశారు.. అధిష్ఠానానికి ఏపి వైపు కన్నెత్తి చూసే అవసరమే లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్‌కు అన్నీ తానే అయ్యారు..
కాంగ్రెస్‌లో వైఎస్‌ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. ఆయన నాయకత్వంలో ఉన్నన్నాళ్లూ కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరం మచ్చుకైనా వినిపించలేదు.. ఆయన వినిపించనివ్వలేదు.. అధిష్ఠానానికి ఫిర్యాదులు లేవు.. ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనంలా మారిపోయింది..

కాంగ్రెస్‌లో పరిస్థితి ఇలా ఉంటే విపక్షాల పరిస్థితి అయోమయంలా మారిపోయింది.. వైఎస్‌ ఉన్నంతకాలం టిడిపి, టిఆర్‌ఎస్‌ల నాయకత్వాలు దాదాపుగా నిద్రలేని రాత్రులనే గడిపాయని చెప్పవచ్చు. నిత్య అసమ్మతులు, రాజీనామాలతో రెండు ప్రధాన పార్టీలు గందరగోళంలో పడిపోయాయి..

ఇప్పుడు.........వైఎస్‌ లేరు.. విపక్షాలు పుంజుకుంటున్నాయి.. కాంగ్రెస్‌లో పాత సంస్కృతి పూర్తిగా జడలు విప్పుకుంది... అధిష్ఠానం ఆశీస్సులతో మాత్రమే కొనసాగే ముఖ్యమంత్రి.. సహకరించని మంత్రులు.. అసమ్మతులు... పరస్పర ఆరోపణలు.. కాంగ్రెస్‌లో ఇంతకాలం మౌనంగా ఉన్న గొంతులన్నీ ఇప్పుడు స్వరం పెంచాయి.. అధిష్ఠానానికి ఫిర్యాదుల పైన ఫిర్యాదులు వెళ్తున్నాయి.. మీడియాలో ఒకరినొకరు తిట్టుకుంటున్నా ఆపేవారు లేరు..
రాజకీయం ఇలా ఉంటే.. వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమం మరోదారిలో వెళ్తోంది.. ఆయన అధికారంలో ఉన్నంతకాలం ప్రకటించిన సంక్షేమ పథకాలను ఏ విధమైన ఆర్థిక నిర్వహణతో ఆయన కొనసాగించారో.. ఆ విధమైన నిర్వహణ ఇప్పుడు కొనసాగే పరిస్థితి కనిపించటం లేదు.. వైఎస్‌ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా వ్యవహరించిన రోశయ్యే ఇప్పుడు సిఎంగా ఉన్నారు.. కానీ, ఆర్థిక నిర్వహణ మాత్రం భారంగా మారింది. వైఎస్‌ మొదలు పెట్టిన స్కీములన్నింటికీ క్రమంగా మంగళం పాడే పనిలో పడ్డారు.. ఎంతోమంది లబ్ధి పొందుతున్న ఈ స్కీములు ఆగిపోతే పరిస్థితి ఏమిటి అన్నది సామాన్యుల్లో మెదులుతున్న ప్రశ్న.. వైఎస్‌ ఒక నిర్దిష్టమైన దారిలో నడిపించిన కాంగ్రెస్‌ ఇప్పుడు దారీ తెన్నూ లేకుండా పోతోంది.. వైఎస్‌ ఒక ప్రణాళిక ప్రకారం మొదలు పెట్టిన పథకాలు ఒక్కటొక్కటిగా కనుమరుగవుతాయని వినిపిస్తోంది.. వైఎస్‌ మాత్రం అందరికీ గుర్తుకు వస్తూనే ఉన్నారు...
Categories: Middle

స్నేహితుడే హంతకుడు

Mon, 05/17/2010 - 11:02
నరహంతకుడు రామారావు హత్య కేసు మిస్టరీ వీడిపోతోంది.. పోలీసుల కళ్లు గప్పి ఇన్నాళ్లూ ఎవరి పంచన తలదాచుకుంటూ వస్తున్నాడో.. ఎవరి ద్వారా అన్ని రకాల సహాయాన్ని పొందుతూ వస్తున్నాడో.. ఇంతకాలం ఎవరిని అత్యంత విశ్వాస పాత్రుడిగా భావించాడో.. ఆ మిత్రుడే హంతకుడుగా స్పష్టమవుతోంది.. పోలీసులు ఈ విషయంలో దాదాపుగా నిర్థారణకు వచ్చేశారు..

నరహంతకుడు రామారావు ఎంత కిరాతకంగా మనుషుల్ని హతమార్చాడో.. అంతకంటే కిరాతకంగా అతను చనిపోయాడు.. రామారావు హత్య ఎవరినీ బాధపెట్టలేదు.. పైగా అందరినీ సంతోషపరిచింది.. చిక్కినట్లే చిక్కి ఎప్పటికప్పుడు పారిపోతూ, కనిపించిన చోటల్లా దోపిడీలు, హత్యలు చేస్తూ ఒకటిన్నర దశాబ్దంగా అల్లాడిస్తున్న రామారావు చనిపోవటం పోలీసులకు సైతం ఒకవిధంగా నమ్మశక్యం కావటం లేదు. రామారావు శవం ముందుగా కనిపించినప్పుడు పోలీసులే మట్టుబెట్టారని అంతా భావించారు. తమదైన రీతిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చి హతమార్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఓ మహిళతో అక్రమసంబంధం ఉన్న దన్న ఆరోపణపై ఆమె భర్తను విచారించినప్పుడు కేసు చిక్కుముడి నెమ్మదిగా వీడిపోవటం మొదలైంది..
పోలీసులు అరెస్టు చేసిన రాణి మేకల చలపతిరావుకు, రామారావుకు మొదట్నుంచీ స్నేహం ఉంది.. ఇద్దరూ కలిసి కొన్ని దొంగతనాలు కూడా చేసినట్లు సమాచారం.. దీని ప్రకారం.. జైలు నుంచి రామారావు పరారయి వచ్చిన ప్రతిసారీ, చలపతిరావే అతనికి షెల్టర్‌ ఇచ్చేవాడు.. మందు, మగువలను ఏర్పాటు చేసేవాడు.. అదే విధంగా ఈ నెల ౮న శ్రీకాకుళం జైలు నుంచి తప్పించుకున్న రామారావు కృష్ణా జిల్లా అగిరిపల్లికి నేరుగా చేరుకున్నాడు.. చలపతిరావు ఇంట్లోనే ఆశ్రయం పొందాడు.. కానీ, ఈసారి రామారావు స్నేహితుడికే ఎసరు పెట్టాడు.. తిన్నింటి వాసాలు లెక్కించాడు. చలపతి రావు భార్యపై రామారావు కన్నేయటంతో ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది.. ఆ కారణంగానే చలపతిరావు రామారావును హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది..
విచిత్రమేమంటే రామారావు హత్య జరిగిన ౪౮ గంటల తరువాత అతని మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు.. కానీ, అతనికి అంత్యక్రియలు చేసే దిక్కు లేకుండా పోయింది.. మృతదేహాన్ని గుర్తించేందుకు వచ్చిన బంధువులు సైతం పోస్ట్‌మార్టమ్‌ తరువాత దాన్ని తీసుకుపోయేందుకు రానే లేదు.. ఇన్నేళ్ల పాటు కిరాతకుడుగా అందరినీ గడగడలాడించిన రామారావు చివరకు ఎవరికీ కాకుండా పోయాడు..

Categories: Middle

అమ్మతో మాట్లాడుతున్నారా?

Sat, 05/15/2010 - 10:34
అమ్మ.... రెండు అక్షరాలు.. నిఘంటు అర్థాలకు అతీతమైనవి... మనిషి పుట్టుకకు మరో పేరు అమ్మ. నిశ్శబ్దంలోనూ వినిపించే ఒకే ఒక్క శబ్దం అమ్మ.. అమె తనువు బిడ్డలది.. ఆమె తపన తీరనిది.. ఆమె మమత కాలం కంటే వేగంగా హృదయాలను తాకేది.. అమ్మ గురించి ఎందరు ఎన్ని రాసినా ఏం చాలుతుంది.. సృష్టే ఆమె అయినప్పుడు ఆమెను సంపూర్ణంగా చూసేందుకు ఎన్ని కళ్లు చాలుతాయి?
మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా? భయంతో వణికిపోతున్నారా? జీవితంలో అన్నీ కోల్పోయానన్న ఆందోళనలో ఉన్నారా? ఏం చేయాలో తోచక.. దారి కనిపించక.. జీవితంపై విరక్తి కలిగినప్పుడు మీరేం చేస్తారు.. అర్థం కావటం లేదా? ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడండి.. ఒక్క క్షణం ఆప్యాయంగా ఆమె పలుకులు వినండి.. ఆమె మాట మీకు స్వాంతన చేకూరుస్తుంది.. అన్ని టెన్షన్లూ మటుమాయమవుతాయి.. ఎందుకంటారా? ఆమె అమ్మ కాబట్టి..

కాలంతో పోటీ పడి గెలిచే వాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటే టక్కున చెప్పగలిగే ఒకే ఒక్క జవాబు అమ్మ..
జన్మనిచ్చినప్పటి నుంచీ అమ్మకు పిల్లలే లోకం.. పిల్లలే తనువు.. పిల్లలే సర్వస్వం...
అన్నం తినటం దగ్గర నుంచి అక్షరాలు నేర్చే దాకా ఆదిగురువు అమ్మ..
మాట నేర్పేది అమ్మ.. మంచి నేర్పేది అమ్మ.. తన కళ్లతో లోకాన్ని చూపించేది అమ్మ..
బుడిబుడి అడుగులతో నడవటానికి ప్రయత్నిస్తూ బిడ్డ తడబడ్డప్పుడు ఆ తడబాటును సరిదిద్దేది అమ్మ..
పెద్దగా పెరిగాక తప్పు చేస్తే, ఆ తప్పును కాచి బిడ్డను తన చాటున ఉంచుకుని కాపాడుకునే ఆత్మబంధువు అమ్మ
మోకాలిపైదాకా చీర కట్టి ఎంత కష్టమైనా పడుతుందేమో కానీ, కన్నబిడ్డ కష్టాన్ని ఒక్కక్షణం కూడా చూడలేదు అమ్మ..
తీవ్రమైన ఆందోళనలో ఉన్నప్పుడు ఆమె స్పర్శ మనకు కలిగించే స్వాంతన ఎంత గొప్పది..
మనం ఆందోళనలో ఉన్నప్పుడు తలలో వేళ్లు ఉంచి సున్నితంగా నిమురుతూ అమ్మ ఇచ్చే ఓదార్పు మరెక్కడ లభిస్తుంది?
ఇవాళ ఉద్యోగాల కోసమో..వ్యాపారం కోసమో ఎక్కడెక్కడికో వలసలు వచ్చి బతుకుతున్న వాళ్లు ఎందరో ఉన్నారు.. ఎక్కడో సుదూరంగా ఊళ్లో ఉన్న తల్లి.. ఇంకెక్కడో నగరాల్లో క్షణమైనా తీరిక లేని సంతానం.. ఇద్దరి మధ్య పలుకే కరవైన పరిస్థితి.. ఈ దశలో ఒక్కసారి ఫోన్‌లోనైనా ఆమ్మ మాట వింటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఎంత ఉల్లాసంగా ఉంటుంది? ఇది ఎవరికి వారికే కలిగే అనుభవం...
విస్కాన్సన్‌ యూనివర్సిటీ దీనికోసం ఓ పెద్ద పరిశోధన చేసి మన ఒత్తిళ్లనుంచి దూరం చేసేది అమ్మ మాట అని తేల్చింది... ఇందుకోసం ఇంత పరిశోధన దేనికో అర్థం కాదు.. మన కల్చర్‌లోనే నరనరానా జీర్ణించుకుని పోయిన పదం అమ్మ... ఇంత గొప్ప సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.. ఇక్కడ అమ్మ అన్న మాట అత్యంత సాధారణంగా వినిపించేది..
కాస్త పక్కకు జరుగమ్మా..
ఏమ్మా బాగున్నావా
అలా కాదమ్మా ఇలా చేయి..
అనే మాటలు మన దగ్గర ఎక్కడైనా వినిపించేవి.. చిన్న దెబ్బ తగిలితే మొదట మన నోటి వెంట వచ్చే మాట అమ్మ.. అమ్మ ఆప్యాయతకు ఇంతకంటే అర్థం ఏం కావాలి.. అమ్మ.. తొలి అక్షరంతో పెదవి విచ్చుకుంటే.. మలి అక్షరంతో పెదవులు కలిసిపోతాయి.. మధ్యలో ఉన్న సమస్త సృష్టి రహస్యమే అమ్మ... అందుకే టెన్షన్‌లో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడండి.. హాపీగా ఉండండి..
Categories: Middle

టెర్రరిజం పాతబస్తీని క్యాన్సర్‌లా కాల్చేస్తోంది..

Sat, 05/15/2010 - 10:25
పాతబస్తీ... ఈ పేరు చెప్తేనే ఏదో గుబులు పుడుతోంది. శాంతి లేదు.. భద్రత లేదు.. ఎవరైనా.. ఎప్పుడైనా, యథేచ్ఛగా రావచ్చు. ఎన్నాళెユ్లనా ఉండవచ్చు. ఏమైనా చేయవచ్చు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రవాదులకు సేఫ్‌ జోన్‌గా మారిపోయింది పాతబస్తీ.. అక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ దాని ఉనికి నామమాత్రమే.. అందుకే టెర్రరిజం పాతబస్తీని క్యాన్సర్‌లా కాల్చేస్తోంది..

ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అమాయక కానిస్టేబుల్‌ అన్యాయంగా చనిపోవటానికి బాధ్యులు ఎవరు? పోలీసుల నిర్లక్ష్యం మాత్రమే కారణమా? టెర్రరిస్టులు పాతబస్తీలో తమ ఇష్టం వచ్చినట్లు మోటార్‌ సైకిళ్లపై తిరుగుతుంటే ఎవరూ ఎందుకు పట్టించుకోవటం లేదు..? అసలు వాళ్లు అలా ఎలా తిరగగలుగుతున్నారు? హుస్సేనీ ఆలం దగ్గర కానిస్టేబుల్‌ రమేశ్‌ను కాల్చి చంపి మహరాజుల్లా టెర్రరిస్టులు వెళ్లిపోయిన తరువాత ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్నలివి....
రాష్ట్ర రాజధానిలో మరెక్కడా లేని నిరంకుశత్వం పాతబస్తీలో రాజ్యమేలుతోంది. రాజధానిలో మరో ప్రాంతంలో ఎవరైనా కాస్త ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు వాళ్ల వెంట బడి తరిమి తరిమి పట్టుకుని జరిమానా విధిస్తారు.. నియమావళిని ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తారు.. కానీ, పాతబస్తీకి వచ్చేసరికి ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది.. అక్కడ ఏం చేసినా పోలీసులు ప్రశ్నించే సాహసం చేయరు.. నిలువరించే ప్రయత్నం చేయరు.. ఏకాస్త ప్రయత్నం జరిగినా అంతే సంగతులు..
పోలీసులకు కాళ్లూ చేతులూ కట్టేశారు.. నిఘా పూర్తిగా నీరుగారిపోయింది. అందువల్లే స్లీపర్‌సెల్స్‌ విజృంభిస్తున్నా ఏం చేయలేకపోయారు.. మానవబాంబులు ప్రవేశించాయని తెలిసినా ఏం చేయలేకపోయారు.. వీసా గడువు తీరిపోయిన తరువాత కూడా అక్రమంగా ఇక్కడ ఉంటున్న వాళ్ల సంగతి సరేసరి.. సెటిల్మెంట్లకయితే లెక్కే లేదు.. పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నా పోలీసులు కానీ, పాలకులు కానీ, సీరియస్‌గా తీసుకోకపోవటానికి కారణం ఒక్కటే... మత సంప్రదాయం మాటున ఉగ్రవాదం పాతబస్తీలో రాజ్యమేలుతోంది. మొదట్నుంచీ పాలకవర్గం ఈ అంశంపై దృష్టి సారించలేకపోవటం వల్లనే ఉగ్రవాదులకు సేఫ్‌ డెన్‌గా మారిపోయింది. ఈ ప్రాంతంలో ఉదారవాదులను ఎవరినీ ఎదగనీయకపోవటం, సంప్రదాయమే డామినేట్‌ చేయటం వల్ల దాని మాటున దాగున్న ఉగ్రవాదాన్ని నియంత్రించటం, నిరోధించటం సాధ్యం కావటం లేదు.. ఉగ్రవాదానికి మతం అంటూ ఉండదన్న వాస్తవాన్ని సామాన్య ప్రజానీకానికి తెలుసు. మతం వేరు.. టెర్రరిజం వేరు.. దురదృష్ట వశాత్తూ మన దేశంలో ఈ రెంటినీ ఒకే గాటన కట్టి చూడటం పాలకులకు, రాజకీయ పార్టీలకు అవసరమైంది కాబట్టే పాతబస్తీ టెర్రరిజం అనే క్యాన్సర్‌ బారిన పడి అల్లాడిపోతోంది.. దీనికి చికిత్స చేసేదెవరు? చేయటం సాధ్యమేనా?

Categories: Middle