http://ammaodi.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
Updated: 21 min 21 sec ago

పుకార్లతో చీరల వ్యాపారం - వీరప్పన్ వ్యవహారం! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 13]

Thu, 06/24/2010 - 00:11
తమ వ్యాపారాభివృద్ది కోసం కార్ఫోరేట్ సంస్థలు, దేశభక్తి వంటి ప్రజల మనోభావాల మీదే కాదు, మానసిక బంధాల మీద, ఇతర భావోద్రేకాల మీద కూడా స్ట్రాటజీలు, పుకార్లు ప్రయోగిస్తారు.

ఉండీ ఉండీ హఠాత్తుగా ఓ ప్రచారం ఊపందుకుంటుంది. ‘అందరూ ఇలా అనుకుంటున్నారు’ అని ఎవరికి వాళ్ళే అంటారు. అలాగే మీడియా కూడా ప్రచారిస్తుంది. ఆ ‘అనుకోవడాలు’ ఎలాంటి వంటే... ఫలానా బొమ్మ లేదా ఫలానా వస్తువు ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తోందని - ఇలాగన్న మాట. మనీ ప్లాంట్ పెంచితే, ఆ మొక్క పెరిగినట్లుగా సంపాదన పెరుగుతుందని, ఓ అర్ధ శతాబ్దం క్రితం వచ్చిన ప్రచారంతో, ఆకుపచ్చని పెద్ద ఆకులతో కూడిన ‘లత’ ఇంటింటా ప్రాకింది. ఇలాంటి వాటిలో అప్పుడెంత వ్యాపారం జరిగిందో తెలీదు గానీ, ఇంటి ముంగిట పచ్చదనం కాబట్టి నష్టం లేదు.

అయితే ఇలాంటిదే.... ఫలానా బొమ్మ లేదా xyz వస్తువు - అంటే, ఇక ఆ బొమ్మ లేదా వస్తు విక్రయాలు ఎంత ఊపందుకుంటాయో ఊహించండి. పోనీ, అలాగని ఆ బొమ్మ ఏదో, మన కొండపల్లి బొమ్మో, నిర్మల్ బొమ్మో ఉండదు. పక్కాగా ప్లాస్టిక్ బొమ్మో లేదా కార్పోరేట్ కంపెనీ ఉత్పత్తి చేసే బొమ్మో అయి ఉంటుంది. ఫిష్ ఎక్వేరియంలో గోల్డ్ ఫిష కూడా అలాంటిదే! vada ఫోన్ వాణిజ్యప్రకటనలో ఉన్న కుక్క జాతికి అమాంతం డిమాండ్ పెరగలేదూ, అలాగన్న మాట.

అలాంటి చోట, సదరు బొమ్మ లేదా వస్తువు ఉత్పత్తి తక్కువ చేసారనుకొండి. ఇక లభ్యత తక్కువైనప్పుడు సంభవించే డిమాండు ఎంతగా ఉంటుందో? అమ్మకాలు నల్ల బజారుకి వెళ్ళినా ఆశ్చర్యం ఉండదు.

మరో విషయం... చిన్నప్పుడు గుడ్డ ముక్కలతో మేం బొమ్మలు కుట్టుకుని, నల్లదారాలతో జుట్టుకుట్టేవాళ్ళం. అలాంటిదే అందంగా ఉన్న ప్లాస్టిక్ బొమ్మ ‘బార్బీ’ గురించి. దాని కుటుంబసభ్యులూ, బాయ్ ఫ్రెండ్సూ, ఇల్లూ ఫర్నిచర్! పిల్లల్లో ఎంత ప్రచారమో, ఎంత మోజో! ఏటా ఇన్ని మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందనీ, ప్రపంచవ్యాప్తంగా సెకనుకి ఇన్ని బార్బీబొమ్మలు అమ్ముడౌతున్నాయనీ మీడియా చేసే ప్రచారాలు... ఇలాంటివే!

క్రమం తప్పకుండా, ఎవరూ గమనించని నిర్ణీత కాల వ్యవధులలో... వివాహిత అన్నా చెల్లెళ్ళు, లేదా అక్కా తమ్ముళ్ళ గురించి ఒక పుకారు/ప్రచారం వస్తుంటుంది. అదేమిటంటే - పెళ్ళయిన అక్కలు తమ తమ్ముళ్ళనీ, చెల్లెళ్ళు తమ అన్నల్ని పిలిచి భోజనం పెట్టి, కొత్త బట్టలు పెట్టాలనీ, బదులుగా అన్నలూ చెల్లెళ్ళకు, శక్తి కొద్దీ బహుమతులతో పాటు కొత్త చీర పెట్టాలనీ, లేకపోతే ఇరువురుకీ అరిష్టం అనీ! ఎందుకలాగా అంటే - "ఏమో ఈసారి నక్షత్రాలు అలా వచ్చాయట" అనే అరగొర సమాధానం వస్తుంది. ఎవరికీ ఏదీ ఇదమిద్దంగా తెలియని స్థితి!

"సరే! పోనీలే! పెట్టేది మన తోడబుట్టిన వాళ్ళకే గదా! ఈ పేరుతో నన్నా బంధాలు గట్టిపడతాయి" అనుకుంటాము మనం. ఖర్చు నిభాయించుకోగలిగిన వాళ్ళకి బాధ లేదు. అప్పటికే ఆర్దికంగా అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళకి, తప్పని సరి కావటంతో, ఇది ఆర్దిక భారమే!

అలాంటి చోట బంధాలు గట్టిపడటం కన్నా.... అసంతృప్తితో మాటల ఈటెలు రేగటం కూడా, అక్కడక్కడా జరగటం పరిపాటే! ఇదంతా ప్రక్కన బెడితే... ఈ పుకార్లతో, చందన బొమ్మన వంటి కార్పోరేట్ వస్త్రదుకాణాలకి పెద్ద ఎత్తున వ్యాపారం నడుస్తుంది. చిన్న దుకాణాల వారికి అమ్మకాలు పెరిగాయన్నా కూడా, అంతిమంగా ఇబ్బడిముబ్బడిగా వ్యాపారం నడిచేది, కార్పోరేట్ టెక్స్ టైల్స్ సంస్థలు రిలయల్స్ లూ గట్రాలకే గదా?

ఇలాంటి ఉదాహరణలు కొకొల్లలు. ఎవరి కన్నూ పడకుండానే, అందరి మీదా అనవసర భారాలు పెంచుతూ, చాపక్రింద నీరులా ఆక్రమించి, జీవితాలు తడిచి మోపెడవుతాయి.

ఇక తమ వ్యాపారాభివృద్ది కోసం ప్రజలలో పెంచే వ్యసనాలకు తక్కువేం లేదు.

వెనకటికి మహాకవి శ్రీశ్రీ ‘కాదేదీ కవిత్వానికనర్హం’ అన్నాడు. కార్పోరేట్ కంపెనీలు ‘కాదేదీ వ్యాపారానికనర్హం’ అంటారు. అలాంటి వాటిల్లో జూదం, మద్యం వంటి వ్యసనాలది పెద్ద వాటా!

అసలు ప్రజలు వ్యసన పూరితులౌతున్నారంటేనే, సమాజం పతన దిశలో ఉందని అర్దం! మద్యపు అమ్మకాలు ఎక్కువైనాయంటే - ప్రజలపై వత్తిడి ఎక్కువ ఉందని సామాజిక శాస్త్రవేత్తలంటారు.

ఈ నేపధ్యంలో ... బెట్టింగ్ వ్యాపారం గురించి పరిశీలిద్దాం. క్రికెట్ లో ఈ వ్యాపారం మరింత పరిమాణంలో నడుస్తుంది. ఇటీవల సునంద పుష్కర్, శశిధరూర్ Vs లలిత్ మోడి వివాదాలతో మరోసారి హోరెత్తిన క్రికెట్ బెట్టింగ్ వ్యాపారంలో.... పాకిస్తాన్, ఐఎస్.ఐ.లు నిలబెట్టిన బొమ్మ దావూద్ ఇబ్రహీం, చేయితిరిగిన వాడన్న దుర్గంధం వెల్లువెత్తింది. అసలా ఐఎస్ ఐ, పాకిస్తాన్ లే.... నకిలీ కణిక అనువంశీయ గూఢచర్య వ్యవస్థ నిలబెట్టగా, సీన్ ఇవ్వగా, నిలబడిన బొమ్మలు!

పోతే... క్రికెట్ ఆటలో ఏ జట్టు గెలుస్తుందో ముందుగా ఊహించి పందేలు కట్టటమే బెట్టింగ్ వ్యాపారం. ఫలానా జట్టు గెలుపు లేదా ఓటమి అవకాశాలు ఇలా ఉన్నాయంటూ.... పుకార్లూ, ప్రచారాలూ, మీడియాలో సొల్లు విశ్లేషణలతో, బ్రహ్మడంగా జరిపించుకోగల వ్యాపారం బెట్టింగ్! ప్రజల్లో పందాలు కట్టే ఆసక్తినీ, ఉత్కంఠనీ రేపే విధంగా, మ్యాచ్ ఫిక్సింగ్ లతో రసకందాయంగా క్రికెట్ నాటకాన్ని నడిపించవచ్చు. వ్యక్తిగత స్కోర్ల మీద సైతం ఇదే దర్శకత్వం, మరింత వైవిధ్యభరితంగా సంఘటనలని జరిపించగలదు. ‘ఈ మ్యాచ్ లో లేదా సీరిస్ లో, ఫలానా ఆటగాడు ఫలానా రికార్డు చేరగలడా? లేదా?’ అన్న ఉత్కంఠ లేపితే చాలు, ఎంత వ్యాపారమో!

ఇక చిట్టచివర ఏ జట్టు గెలిస్తే.... అప్పటి వరకూ కట్టబడిన పందాలలో తమకి లాభమో, ఆ ప్రకారం గెలుపోటములు, క్రీడా మైదానంలో గాక, కంప్యూటర్ ముందు నిర్ణయించుకుంటారు.

ఈ బెట్టింగ్ వ్యాపారం క్రికెట్టు వంటి ఆటలతోనే గాకుండా, సెలబ్రిటీల జీవిత సంఘటనల మీద కూడా నడుస్తోందంటే - వ్యాపారంలోని అమానుషత్వం అర్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకి ‘సానియా మీర్జా వివాహం జరుగుతుందా? లేదా?’ వంటివి.

ఆ బెట్టింగ్ నిర్వాహకుల లాభనష్టాలని బట్టి, సదరు సెలబ్రిటీల జీవన పరిణామాలున్నా ఆశ్చర్యపోవలసింది లేదు. అదృష్టవశాత్తూ అంతటి స్థితి ఇప్పటికి వచ్చి ఉండకపోవచ్చు.

వ్యసనాలలో, ఈ బెట్టింగు వ్యసనం లాంటివి మరికొన్ని ఉన్నాయి. పాన్ పరాగ్, సిగరెట్, శీతల పానీయాలు, మత్తు పానీయాలు. చివరికి సెల్ మోడల్స్ ని మార్చడం కూడా! అశ్లీల చిత్రాల్ని చూడటం, మాదక ద్రవ్యాల వాడటం మరింత తీవ్రమైనవి. మీడియా వాటికిచ్చే కవరేజ్, వాటిని మరింత పాపులర్ చేయటానికే తప్ప, నిర్మూలించటానికి అన్నట్లు ఉండదు.

శీర్షికలు మాత్రం, సమాజంలో నెలకొన్న ఈ స్థితి పట్ల మీడియా విచారం వెలిబుచ్చుతున్నట్లే ఉంటుంది. 1992 కు ముందరైతే చాలా సినిమాలలో... స్కూళ్ళలో, కాలేజీలలో విద్యార్ధులంతా, బ్రౌన్ షుగర్ వంటి మాదకద్రవ్యాలు వాడుతున్నారన్నట్లే చూపబడేవి. అవి ఎలా దొరుకుతాయో, ఎలాంటి నెట్ వర్క్ వాటి అమ్మకాల వెనక ఉంటుందో, అందులో లాభాలెలా ఉంటాయో, ఆ వ్యాపారంలోకి ఎలా ప్రవేశించవచ్చో.... ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, వివాదాలు.... సదరు సినిమాలలో, మీడియా ప్రచారంలో ఉండేవి.

సినిమా అంతా ‘హింస, శృంగారాలు’ చూపించి, చివరలో ముక్తసరిగా, మొక్కుబడిగా ‘ఇదంతా తప్పు’ అంటూ ఓ నీతి వాక్యం జోడించినట్లుగా ఇదంతా ఉండేది. ‘ఆయా మాదక ద్రవ్యాలు వాడితే ఎంత గమ్మత్తుగా ఉంటుందో ఓ సారి ప్రయత్నం చేద్దామా’ అని కుతుహలం రేపేటట్లుగానే ఉండేది చిత్రీకరణ!

1992లో, ఢిల్లీలో రోడ్డు ప్రక్కన కూర్చున్న యువకుడు, కాగితం మీద వేసుకున్న మాదకద్రవ్యాన్ని, మరో కాగితపు గొట్టంతో పీల్చడాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాను. దాన్ని ‘హంటింగ్’ అంటారని అప్పటికే సినిమాలలో చూసి ఉన్నాను.

ఇదంతా ఎంతో చక్కగా ప్రొజెక్ట్ చేసే మీడియా, అలాంటి మాదకద్రవ్య స్మగ్లింగ్ నీ, వినిమయాన్నీ నిరోధించటానికి ప్రభుత్వం ఏం చేస్తోందో, ఏం చెయ్యాలో చెప్పేది కాదు. ప్రజలు ఆ దుష్టపరిణామాలకి ఎలా స్పందించాలో చెప్పేది కాదు. పిల్లలు వాటి బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి అన్న దానిమీద, అప్పుడప్పుడూ మాత్రం, నిపుణుల కౌన్సిలింగ్ లు వేసేది.

ఇంకా ఇప్పుడు ఆ విషయమై మీడియా దూకుడు కొంత తగ్గింది. అప్పట్లో అయితే.... ఒక దశలో, ఆనాటి పెద్దలు, యుక్తవయస్సులో ఉన్న తమ పిల్లల్ని విద్యాసంస్థలకి[ఢిల్లీ, ముంబై లాంటి చోట], యూనివర్సీటీలకి పంపటానికి కూడా సందేహించారు. ఎంతో ఆశ్చర్యం గొలుపుతూ మీడియా ఈ విషయంలో పాజిటివ్ ముఖం పెట్టుకుని నెగిటివ్ రోల్ పోషించింది.

అచ్చంగా ఇప్పుడు.... నేరాలు-ఘోరాలు, క్రైం రిపోర్ట్, క్రైం స్టోరీ గట్రా శీర్షకలతో, సమాజంలో జరిగిన నిజ జీవిత నేరాలని, ఉద్రేకభరితంగా ప్రజెంట్ చేస్తుంది చూడండి. సరిగ్గా అదే స్ట్రాటజీ అప్పుడూ ప్రయోగించింది.

ఇదే స్ట్రాటజీ.... చందనం, కలప స్మగ్లర్ వీరప్పన్ విషయంలోనూ పాటించారు. విషయాంతరమే అయినా, ఆ స్ట్రాటజీ ఇక్కడ ప్రసావనార్హమే! కలప దొంగ వీరప్పన్ కౄరుడు, నీచుడు! ఎందరో అమాయకుల్ని, పోలీసుల్ని చంపాడు. దేశ ద్రోహి, నేరగాడు!

అలాంటి వాడి గురించి మీడియా ఎన్ని విశేషాలు వ్రాసేదో! అతడికి కోతి రక్తమంటే ఇష్టమనీ, పచ్చినెత్తురు తాగుతాడనీ! చిత్తం వచ్చినట్లు ప్రవర్తించే మూడీ ఫెలో అనీ, మొండి వాడనీ! ఎవరికీ చిక్కని చాకచక్యం అతడి సొంతమనీ! నిజానికి, అడవి నుండి అతడు పంపే సరకు, బయట కొనే నాగరిక నేరగాడెవడో ఉండి ఉండాలి కదా!?

వీరప్పన్ అడవిలో ఉండే రాక్షసుడైతే, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్న రాక్షసులు. అలాంతి రాక్షసులెవరి సహాయసహకారాలో లేకుండా వీరప్పన్, తన దొంగ వ్యాపారం ఎలా చేసేవాడు? సంపాదించిన సొమ్ముతో జీవితాన్ని ఎలా ఆనందించే వాడు? అడవిలో పచ్చినెత్తురు తాగేవాడికి అంత డబ్బు సంపాదించినా ఒకటే, సంపాదించక పోయినా ఒకటే కదా!

స్టార్ హోటల్ లో చైనీస్ దగ్గరి నుండి అన్నిదేశాల వంటకాలు రుచి చూస్తూ జీవితాన్ని ఆనందించనపుడు, ఊరికే ఎందుకు డబ్బు సంపాదిస్తాడు? అందునా నేరాలు చేసి మరీ? అలాంటప్పుడు బయట నుండి వ్యాపార, అధికార, రాజకీయ వర్గాల నుండి వీరప్పన్ లాంటి వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు ఉండి ఉండాలి.

నిజానికి వీరప్పన్ లే కాదు, చాలామంది అటువంటి అజ్ఞాత జీవితం గడిపే నేరగాళ్ళు, టెర్రరిస్టులూ.... ప్రచ్ఛన్న నామాలతో, ప్రచ్ఛన్న వేషాలతో, సీమాంతరాల్లో పంచతారల అతిధిగృహ సత్కారంలో ఆనందిస్తారని, తర్వాతి రోజుల్లో [1992 తర్వాత] వెల్లడి అయ్యింది. అలాంటి నేరగాడే కత్తుల సమ్మయ్య అనేవాడు, విమానం ఎక్కబోతూ, బాంబు హెచ్చరికతో జరిగిన తోపులాటలో మరణించటంతో ఈ విషయం దృష్టాంతపూరితం అయ్యింది. చందానగర్ హోటల్ గదిలో బాంబు పేలి గాయపడ్డ మొద్దు శీను వ్యవహారంతో అలాంటివి మామూలైపోయాయి.

ఇలాంటి నేపధ్యం వెనక నుంచుకొని కూడా, మీడియా, అడవి దొంగ వీరప్పన్ గురించి ఎంతో ఉద్వేగ పూరితంగా వ్రాసేది. సదరు వీరప్పన్ ని, నక్కీరన్ పత్రిక గోపాలన్ తప్ప మరెవ్వరూ కలుసుకోలేక పోయేవాళ్ళు. అతడి ఉనికి తెలిసినా, గోపాలన్, వీరప్పన్ పట్లే నిబద్దతతో ఉండేవాడు తప్పితే, ఆ నేరగాడి చిరునామా ప్రభుత్వానికి చెప్పేవాడు కాదు.

‘చెబితే ఈసారి వీరప్పన్ తనకి కూడా ఇంటర్యూ ఇవ్వడట. దాంతో అసలే సమాచారమూ తెలియకుండా పోయే ప్రమాదం ఉందట!’ ఎంత చక్కని పైకారణమో![over leaf reason]

ఇలాంటి సొల్లు కారణాలు చెబుతూ మీడియా, ఎంతో చక్కగా తన బాధ్యతలు విస్మరించింది. హక్కుల్ని మాత్రం ఎలుగెత్తి అరిచి సాధించుకునేది. ఎటూ వేదకాలంలో మునుల్ని గౌరవించినట్లు, ప్రజలు మీడియాని గౌరవిస్తారు, నమ్ముతారు. స్వాతంత్ర సమర సమయంలో కూడా, మీడియా ఒక పవిత్ర బాధ్యతని ఎంతో బలంగా, నిజాయితీగా నెరవేర్చింది. అందుకే ప్రజలు మీడియాని నిస్సందేహంగా నమ్ముతారు. అందుకే నకిలీ కణిక వ్యవస్థ, మీడియా ముసుగు వేసుకున్నది!

ఇక వీరప్పన్ వ్యవహారాన్ని ఇంతటితో ఆపి, తమ వ్యాపారం కోసం వ్యసనాలు పెంచే కుట్ర దగ్గరికి తిరిగి వస్తే.... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, ప్రపంచవ్యాప్తంగా ఈ మాదకద్రవ్య వ్యాపారం నిర్వహిస్తుంది. ఆఫ్ఘన్, పాకిస్తాన్ లలోని పేదరైతులకి, ఒకప్పుడు, దాదాపు 100% పంట పాపీ పంటే! ప్రపంచవ్యాప్తంగా దాన్ని మార్కెట్ చేసిపెట్టిన మాఫియా, నకిలీ కణిక వ్యవస్థకి అనుబంధ అనుచర వ్యవస్థే!

మాదక ద్రవ్య వ్యసనంతో మనిషి జీవితం, ఎంత దుఃఖ భాజనమౌతుందో వాళ్ళకి అనవసరం. సమాజం ఎంత భ్రష్టమౌతుందో అంతకంటే అనవసరం! ఇందులో వ్యాపార మొక్కటే విషయం కాదు. తత్ఫలితంగా ప్రజలు వ్యసన పూరితులే కాదు, తమో గుణపూరితులూ అవుతారు. అదే అసలు లక్ష్యం నకిలీ కణిక వ్యవస్థకి!

ప్రపంచవ్యాప్తంగా ప్రజలని తమోగుణంతో నిస్తేజ పరిస్తే.... ప్రస్తుతం కింగ్ మేకర్స్ గా ఉన్న నకిలీ కణిక అనువంశీయులు, భవిష్యత్తులో కింగ్ లు కాగలరు. ప్రస్తుతానికి కింగ్ కన్నా కింగ్ మేకర్ గొప్ప. ఎందుకంటే కింగ్ లు, అంటే - దేశాధ్యక్షులూ, ప్రధానమంత్రులూ గట్రా పదవులు, తాత్కాలికమైనవి, తక్కువ కాలవ్యవధి గలవి.

కాబట్టే - పరిస్థితులన్నీ సమకూడాక, తామే శాశ్వత కింగ్ లైతే.... క్రీస్తు పూర్వం నుండి అలెగ్జాండర్ ది గ్రేట్[?] లు కలలు కనీ, సార్ధకం చేసుకోలేక పోయిన దాన్ని, తాము సాక్షాత్కారింప చేసుకోగలరు. బ్రిటీషు వాడు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఆ కలను సాక్షాత్కారింపచేసుకున్నాడు.

ఇక్కడో గమ్మత్తు ఏమిటంటే - అలెగ్జాండర్, అతడి తండ్రికి ఉంపుడు గత్తె కొడుకే. నకిలీ కణిక అనువంశీయులకు తొలితరం వ్యక్తీ వేశ్యాపుత్రుడే! అందుకేనేమో, నకిలీ కణికులకి, అలెగ్జాండర్ పట్ల విపరీత ప్రచారం ఇచ్చేంత అమిత ప్రేమ!!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

క్రికెట్ ఒక మతం - ఒక మెగా మోజు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 12]

Wed, 06/23/2010 - 00:04
మరో మెగా మోజు - క్రికెట్!

క్రికెట్ మోజులో నడిపించే వ్యాపారానికి అంతనేదే లేదు. ఆటగాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ లై, కాలి బూట్ల దగ్గరి నుండి నెత్తి మీద టోపీల దాకా అమ్మి పెడతారు. బట్టలూ, వాచీలూ, కూల్ డ్రింక్ లూ, హెల్త్ డ్రింకులూ, జాం లూ, చెత్తలూ చెదారాలు!

అమ్మానాన్న చెప్పినా, గురువు చెప్పినా వినని పిల్లలు, టీవీలో క్రికెటర్లు చెప్పారంటే వేదవాక్కులా పాటించేటంతటి ‘కిక్కు’ క్రికెట్ ది! "మా వాడు, ఫలానా ఆటగాడంటే పడి చచ్చిపోతాడు" అంటూ తల్లిదండ్రులే గొప్పగా, కళ్ళార్పుతూ చెప్పేచోట పిల్లల మోజులు మరింత పెరగవా మరి!?

మోడళ్ళుగా క్రికెటర్ల వాణిజ్య ప్రకటనలతో జరిగే వస్తు విక్రయాలు తెర మీద వ్యాపారమైతే, మ్యాచ్ ఫిక్సింగులూ బెట్టింగులూ తెర వెనక వ్యాపారం!

క్రికెట్ పండగ, క్రికెట్ సంరంభం, క్రికెట్ సందడి, క్రికెట్ సంగ్రామం, క్రికెట్ యుద్దం.. క్రికెట్ xyz... నిరంతరాయంగా హోరుమనిపించే ప్రచారం! రెండు సంవత్సరాల పిల్లాడి దగ్గరి నుండి, పండుముసలి దాకా, అధికుల్లో కనబడే మోహం ఇది!

క్రికెట్ ఆట, ఆటగా ఉంటే పర్లేదు. వ్యసనంగా మారి.... ఎన్ని పనిగంటలూ, ఎంత మానవశక్తి వృధా అవుతోందో ఊహకందదు. మా వెనక వీధిలో పిల్లవాణ్ణి, క్రికెట్ ఆడకుండా నిరోధించలేక, సంవత్సరానికి 50 వేల రూపాయలు కట్టుకొని హాస్టలులో చేర్చి చదివించుకుంటున్నారు, ఆ పిల్లాడి తల్లిదండ్రులు. తమకు భారమైనా సరే!

బెట్టింగులూ, మ్యాచ్ ఫిక్సింగులతోనే గాక, క్రికెట్ మోజులతో.... ఆహార పదార్ధాల దగ్గర నుండీ, ఆహార్య విహారాల దాకా, ఎన్నివేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయో? కాబట్టే.... రాజకీయ నాయకుల బంధు మిత్ర సపరివార సమేతంగా క్రికెట్ ఫ్రాంఛైసీల వేలం పాటలలో సన్నాయి రాగాలు పాడారు. సినీ తారలూ, కార్పోరేట్ అధినేతలూ పోటీలు పడి మరీ [వేలం] పాటలు పాడారు.

ఒకప్పుడు సంతలో బానిసల్ని , పశువుల మాదిరిగా వేలం వేసేవారట. అది అనాగరికం అన్నారు. అవే నోళ్ళు ఇప్పుడు, క్రికెట్ తారల వేలాన్ని , వేలం వెర్రిగా మరీ ప్రచారించారు. ఇది నవనాగరికం కాబోలు! బహుశః నాటి బానిసలు బండచాకిరి చేసేవాళ్లు. నేటి క్రికెట్ తారలు అలాంటివేం చేయరు గనక ఇవే వేలంపాటలు గాకుండా పోయాయోమో!

[నాకో పెద్ద అనుమానం. తరచి చూస్తే ప్రచార పటాటోపమే తప్పితే, క్రికెట్ తారల బ్రతుకులు కూడా, నాటి బానిస బ్రతుకులకీ, పంజరంలో చిలకల బ్రతుకులకీ తీసిపోవేమో! ఖచ్చితంగా తెలియదనుకొండి, అనుమానం మాత్రమే! కాకపోతే బానిసలకి స్వంత సంపదలుండవు, వీళ్ళకి సంపదలుంటాయి. అంతే తేడా!]

ఇక క్రికెట్ మ్యాచ్ లున్న రోజుల్లో, అవి టీవీలలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న రోజులలో.... పాఠశాలలో, కళాశాలల్లో, కార్యాలయాలలో హాజరు చాలా తక్కువగా ఉంటుంది. మార్కెట్టు ప్రాంతాలలో కూడా, జనం గుంపులూ దుకాణాలలో టీవీల దగ్గర చేరి, క్రికెట్ చూస్తూ, స్కోరు గురించి చర్చస్తూ ఉంటారు. మ్యాచ్ ఫిక్సింగులూ చేసుకుని, ఆటని ఆడటం గాకుండా, నటిస్తారని తెలిసినా కూడా! అదీ మీడియా రేపగల మోజుల బలం!

అందరూ అంతగా తన్మయం చెంది, టీవీలో క్రికెట్ చూసే వేళ, దొంగలు పడి సర్వమూ దోచుకుపోయినా దిక్కుండదేమో నన్పిస్తుంది. 2002 లో, హైదరాబాద్ నగర కార్పోరేషన్ ఎన్నికల వేళ, జూబ్లీ హిల్స్ వంటి ధనిక కాలనీలో, పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉండింది. కారణం క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం!

ఈ విషయమై ఓ టీవీ ఛానెల్ వారు, ఓ విద్యావంతురాలైన ధనిక మహిళని ఇంటర్యూ చేస్తే, ఆవిడ అతిశయంగా "ఈ రోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందండి. ఏం చేయమంటారు? ఓటూ, క్రికెట్టూ రెండూ ముఖ్యమే! అయినా మ్యాచ్ వదులుకొని, పోలింగ్ బూత్ కి వెళ్ళలేక పోయాం" అంది. [ఇలాంటి వాళ్ళ ఓట్లకీ, ఓటు అమ్ముకునే దిగువస్థాయి వాళ్ల ఓట్లకీ విలువేం ఉందిలే అనుకొని, సోనియా ఈవిఎం లని Tamper చేసేసుకోవటం మొదలెట్టేసినట్లుంది.]

నిజానికి ఇతర ఆటలకి గానీ, ఆటగాళ్ళకి గానీ, ఇంత మోజు సృష్టింపబడలేదు. నిజానికి క్రికెట్టు ఆటలో, జుట్టు సభ్యుల మధ్య కో ఆర్డినేషన్ గానీ, నైపుణ్యాల స్థాయి గానీ, మరికొన్ని ఆటలతో పోలిస్తే తక్కువ. ఉదాహరణకి, దేశవాళీ ఆట అయిన ‘కబడ్డీ’ని తీసుకుంటే.... క్రికెట్ కి లాగా బ్యాటు, బంతి, పాడ్స్, హెల్మెట్టూ గట్రా సామాగ్రి అవసరం లేదు. పిచ్ గట్రాలూ అక్కర్లేదు. పదిమంది కలిస్తే ఎక్కడైనా ఆడుకోవచ్చు. పైగా, జట్టుగా ఎదుటి ఆటగాణ్ణి ఓడించటం, పట్టుకోవటం... ఒక జీవశక్తిలా అన్పిస్తుంది. ఎంత సేపు దమ్ముపట్టగలరో అన్నదే ఈ ఆటలో ఆటగాడికి బలం!

పెద్దలు ‘ధైర్యం’కి పర్యాయపదంగా ‘దమ్ములుండటం’ అనే పదాన్ని వాడతారు. గుండెల్లో దమ్ము అంటే - ఎక్కువ గాలిని పీల్చి, ఎక్కువ సేపు మళ్ళీ గాలి పీల్చకుండా నిబ్బరించుకోగలగటం! దమ్మెక్కువ సేపు పట్టగల వాళ్ళు, పెద్దయ్యాక మరింత ధైర్యవంతులుగా, అలసట లేకుండా పనిచేయగల పనిమంతులుగా ఉంటారట.

[ఇందులో నిజమెంతో నాకు తెలియదు గానీ..చిన్నప్పుడు మా స్కూలు కబడ్డీ టీం కు నేనే కెప్టెన్ ని. ఎక్కువ సేపు కూత పెట్టగలననీ, ఎదుటి జుట్టు సభ్యులు మన బరిలోకి వచ్చినప్పుడు నేర్పుగా పట్టుకొని ‘ఔట్’ చేయగలననీ, మా పీఈటీ పంతులమ్మ నాకు జట్టు నాయకత్వం కట్టబెట్టింది. అర్బన్ వాళ్లతో బాగానే ఆడేం గానీ, రూరల్ పిల్లలతో ఓడిపోయాం!]

కబడ్డీ ఒక్కటే కాదు, పుట్ బాల్, త్రోబాల్ వంటి ఆటలకు కూడా, పెద్దగా వస్తుసామాగ్రి అవసరం లేదు. రెండు జట్లలోని ఆటగాళ్ళందరికీ, ఆడే అవకాశం, వ్యాయామం లభిస్తాయి.

క్రికెట్లో బ్యాటింగ్ చేసే జట్టులో ఆ క్షణం ఆడుతున్న వాళ్ళు తప్ప, మిగిలిన వాళ్ళు డ్రెస్సింగ్ రూంలో కూర్చొ గలరు. చాలాసార్లు.... ఫిల్డింగ్ చేయాల్సిన ఆటగాళ్ళు, బంతి మీద గాక ప్రేక్షకులకి ఆటోగ్రాఫులూ, అభివాదాలు చేయటం మీదే శ్రద్ద కనబరచారనే విమర్శలు, ఇటీవల బాగానే వినబడ్డాయి.

కబడ్డీ, ఫుట్ బాల్ గట్రా ఆటల్లో అలాంటివేం కుదరవు. అందరూ, ఆట ఆడుతున్నంత సేపూ చెమటోడ్ఛాల్సిందే! క్రికెటేతర ఆటలలో కూడా ‘మజా’ ‘కిక్కు’ ఉన్నా కూడా, కేవలం క్రికెట్టు ఆటకే అంత మోజు ఎందుకొచ్చిందీ అంటే - క్రికెట్ లో వ్యక్తిగత రికార్డులు సృష్టించటం తేలిక. ఆ వ్యక్తిగతం ద్వారా చాలా వ్యాపారం చేయెచ్చు. మిగతా ఆటలలో వ్యక్తిగత రికార్డులను క్రికెట్ లో ఉన్నన్ని రకాలుగా సృష్టించలేరు. మిగతా ఆటలలో టీమ్ గా పనిచేయాలి. ఫలితం కూడా దాదాపుగా మొత్తం టీమ్ కే దక్కుతుంది. అదే క్రికెట్ లో అయితే వ్యక్తిగత రికార్డు సంపాదిస్తే చాలు, మ్యాచ్ ఓడినా, గెలిచినా ఒకటే!

అంతేగాక.... అన్ని ఆటలకి మోజులు సృష్టిస్తే, నియంత్రించటం శ్రమతో కూడుకున్న విషయం! అదే ఒకే ఆటకి మోజులు సృష్టిస్తే, అంతా మోనోపలే! అప్పుడు బెట్టింగూ, మ్యాచ్ ఫిక్సింగూ, కప్పం వసూళ్ళు లేదా కమీషన్లు... అన్నీ సులభం! అందుకే, ఆటలలోనూ కొన్నిటికే మోజులు! ఆటగాళ్ళల్లోనూ కొందరే సెలబ్రిటీలు! ఇప్పుడు మీడియా ఏకంగా క్రికెట్ భారత్ లో ఒక మతం అని, సచిన్ క్రికెట్ దేవుడని కూడా కీర్తిస్తోంది.

[మనిషికి విచక్షణని నేర్పేది, మంచి చెడు తెలియజెప్పేది మతం. ఏ మతం అయినా సరే! అలాంటి చోట క్రికెట్ ఏ విధంగా మతం అయ్యిందో ప్రచారించే మీడియాకే తెలియాలి.]

సెలబ్రిటీలు కదిలినా మెదిలినా దగ్గినా తుమ్మినా వార్తే! మిగిలిన ఆటగాళ్ళు చెమటోడ్చి గెలిచినా, కనీస గుర్తింపు కూడా లేనట్లు, వేస్తే ఓ మూల అప్రాధాన్య వార్త లేస్తారు, లేకపోతే అదీ లేదు! అదే సెలబ్రీటిలకైతే, చెప్పుకోదగిన విజయాలేం లేకపోతే... వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నా ప్రచురించి, ప్రజల మెమరీలో లైవ్ గా ఉంచుతారు.

ఫలానా సెలబ్రిటీకి ఫలానా కూరంటే ఇష్టమనో, ఫలానా నగలు కొన్నదనో, ఫలానా బ్రాండ్ బైకో, కారో కొన్నారంటూ....!

ఇక ఇలాంటి మోజుల్ని కొనసాగించటానికి, మరికొన్ని వైవిధ్యభరితమైన ఉపాయలున్నాయి. ఫలానా క్రికెట్ తారకీ, ఫలానా సినిమా తారకీ మధ్య ప్రేమాయణమో, శృంగారమో నడుస్తోందనీ, ఫలానా రెస్టారెంట్లో కనబడ్డారనీ మీడియా వ్రాస్తుంది, కోడై కూస్తుంది. ఆపైన విమర్శలూ, ప్రతివిమర్శలూ కూడా వేడి వార్తలౌతాయి లెండి!

ఇలాంటివే వాళ్ళ ముద్దుపేర్లు కూడా! ఉదాహరణకి మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్, దాదా గంగూలీ, ధనాధన్ ధోనీ లేదా జార్ఖండ్ డైనమైట్ ధోనీ, ముషారఫ్ మెచ్చిన క్రాఫ్ ధోనీ... ఇలా! అదేదో యూనివర్శిటీలు ప్రదానం చేసిన డాక్టరేట్లో, ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మశ్రీలో అన్నట్లుగా! యూనివర్శిటీ డాక్టరేట్లూ గట్రా కూడా పైరవీలతో వచ్చేస్తాయి లెండి, సానియా మీర్జాకి డాక్టరేట్ ఇచ్చినట్లు.

ఇంతకీ... 2007-08 ల్లో ‘పాకిస్తాన్ ప్రెసిడెంట్ ముషారఫ్ మెచ్చిన జులపాల జుట్టు ధోని’ అంటూ ప్రచారం జరిగింది! అంతలో ఏమయ్యిందో, హఠాత్తుగా ధోనీ, పొడుగాటి జులపాల జుట్టుని కాస్తా పొట్టిగా కత్తిరించేసుకున్నాడు. ఇలా.... ఎప్పుడు ఆయా క్రీడాతారల గురించి ప్రస్తావించినా, ముందుగా ఈ మీడియా ప్రసాదిత బిరుదులని తప్పకుండా తగిలిస్తారన్నమాట. ‘టెన్నిస్ సంచలనం సానియా మీర్జా’ లాగా!

ఇవి చాలక, సంచలనాల కోసం తారలతో, క్రీడా తారల ప్రేమాయణ ముచ్చట్లు ఉండనే ఉన్నాయి. మీడియాలో వ్రాయబడే ఈ సొల్లుతో.... పత్రికలూ టీవీలూ, ఏ విధంగా ప్రజా సేవ చేస్తున్నట్లో మీడియా నవాబులకే తెలియాలి. డీడీ సహితం, రాష్ట్ర జాతీయ వార్తలు కూడా ఎత్తేసి, క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

పైపెచ్చు ప్రైవేటు క్రికెట్ వ్యాపార సంస్థ అయిన బిసిసిఐ ని, అదేదో ప్రభుత్వ సంస్థ అన్నట్లుగా ఉంటుంది మీడియా కవరేజి! టీం ఇండియా అంటూ , అక్కడికి ఆ క్రికెట్ ఆటగాళ్ళ జట్టు.... ప్రభుత్వం తరుపునా, అధికారిక ప్రాతినిధ్యంతో ఆడుతున్నట్లుగా పిక్చర్ ఇవ్వబడుతుంది. ఒలింపిక్స్ లోనో, ఏషియాడ్ లోనో భారత క్రీడాకారులు ఆడినట్లుగా!

నిజానికి.... క్రికెట్ మ్యాచ్ లన్నీ బిసిసిఐ, ఐసిసి, ఐపిఎల్ వంటి ప్రైవేటు నిర్వాహకుల సంస్థలు నిర్వహించేవే! ఇప్పుడంటే సునంద పుష్కర్, శశిధరూర్, లలిత్ మోడీల పాపమా అని, వివాదాలు రచ్చకెక్కి, అవన్నీ ప్రైవేటు వ్యవహారాలని బయటపడింది గానీ, అంతకు క్రితం చాలామందికి, బిసిసిఐ అంటే ప్రభుత్వ పరమైనదే అనుకునేవాళ్ళు ఇప్పటికీ ఈ విషయమై ఎంతమందికి స్పష్టత ఉందో అనుమానమే!

బిసిసిఐ, ఐపిఎల్ గట్రాలు.... ప్రైవేటువైతే నేమిటీ, ప్రభుత్వపరమైనవైతే ఏమిటి అంటారేమో? రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వ పరమైనవైతే లాభాలు ప్రజలవౌతాయి. ప్రైవేటువైతే.... భావోద్వేగాలు ప్రజలవి, లాభాలు మాత్రం ప్రైవేటు వ్యక్తులవీ అవుతాయి. ఆటగాళ్ళు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామంటారు గానీ, వ్యక్తిగత ఆస్తులే సమకూర్చుకుంటారు.

అయితే భారత జట్టు అంటూ, ప్రభుత్వపరంగా అధికారికంగా ప్రాతినిధ్యం ఉన్నట్లుగా, మీడియా ప్రచారించడం వల్ల కూడా, దాదాపు ప్రజలందరూ పిల్లా పాపా, యువకులూ, వ్యక్తులతో సహా, భావోద్వేగాలకు గురి అవుతారు. మరో మాటలో చెప్పాలంటే వ్యాపారాభివృద్ది కోసం, తాము సృష్టించిన మోజులకు.... దేశాభిమానం, దేశభక్తిని అదనపు మద్దతుగా, ఆకర్షణగా అద్దుతున్నారు.

దేశాభిమానపు పరిమళం అద్దకపోయినా, క్రికెట్ క్రేజ్ ఉండవచ్చుగాక! అయితే ఇంత పరిమాణంలో ఉండదు. ప్రజలకు సహజంగా తమ మాతృభూమి మీద ఉండే ప్రేమని, వ్యాపార వనరుగా మార్చుకోవటమే ఇది.

మీడియా చేయదలుచుకుంటే... ఇదే విధంగా, ప్రజలకి తమ మాతృదేశం మీద ఉండే ప్రేమని, దేశాభివృద్దికి తోడ్పడే విధంగా కూడా, యువతలో ట్రెండ్ సృష్టించగలదు. కానీ చేయదు. తమ వ్యాపారం కోసం మాత్రం, ప్రజల మనోభావాలని ప్రభావితం చేస్తుంది. దేశభక్తి మాత్రమే కాదు, మానవ బాంధవ్యాలను కూడా!

అదెలాగంటే......

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

హేతువాద సంఘాలు ఎందుకు కిమ్మనవో? [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 11]

Mon, 06/21/2010 - 23:48
ప్యాకింగ్ మారిన బ్రిటీష్ దోపిడి వ్యాపారమే నేటి కార్పోరేటిజం! ఎలాగంటే - పార్టీల కతీతంగా నేతలంతా క్యూకట్టి మరీ, ఎకరా రూపాయకీ, వందరూపాయలకీ బడా బాబులకి కట్టబెట్టిన సెజ్ లని పరికించండి. దేశాభివృద్ది పేరుతో భూమిని సెజ్ ల కిచ్చారు. సదరు సెజ్ లలో, భారత రాజ్యాంగం అంగీకరించిన కార్మిక చట్టాలేవీ చెల్లవు.

సెజ్ యాజమాన్యపు ఇచ్ఛానుసారం పనిగంటలూ, కార్మిక వేతనాలూ ఉంటాయి. అంతేకాదు ఆయా సెజ్ లలో ఉత్పత్తి అయిన సరుకు ఒక యూనిట్ నుండి మరొక యూనిట్ కి పంపబడితే, కొత్త నిర్వచనాల ప్రకారం ‘ఎగుమతి’ చేసినట్లేనట! కనీసం సరుకు విదేశాలకి ఎగుమతి చేయబడితే, విదేశీ మారక ద్రవ్యం వంటి దేశ ప్రయోజనాలన్నా నెరవేరతాయి.

మరో వైపు సెజ్ లకి భూమితో సహా మౌలిక వసతులూ, ముడి సరకులూ కూడా చౌకగా కట్టబెడతున్నారు. శ్రమ దోపిడి చేసుకునేందుకు ఈ ప్రత్యేక ఆర్దికమండళ్ళు[Special Economic Zone] కి, తమవైన ప్రత్యేక చట్టాలతో కూడిన రాజ్యాంగం ఉన్నట్లే! ఎంత కన్నాలతో కూడినది అయినా, భారత రాజ్యాంగం, సెజ్ లలో వర్తిందట మరి! ఎటూ ఈ సెజ్ లలో తయారయిన వస్తువుల విక్రయ ధర, ఆయా యాజమాన్యాలే నిర్ణయించుకుంటాయి కదా! మరింత సమాచారం కోసం ‘కడలి తరంగం’ బ్లాగులో చూడగలరు.

ఇది ప్యాకింగ్ మారిన బ్రిటీష్ నాటి వ్యాపార దోపిడి గాక మరేమిటి? విచిత్రం ఏమిటంటే - ఈ సెజ్ లతో కార్మికుల బ్రతుకులను మరింత దిగజార్చింది కమ్యూనిస్ట్ దేశమైన చైనా! సెజ్ ల తాలూకూ సంపూర్ణదోపిడి కూడా, ఇప్పటికే చైనాలో పూర్తిస్థాయిలో నడుస్తోంది. ఇది చెప్పటం లేదా.... ఏ ఇజమైనా నిజం కాదని, దగాకు మరో రూపమేనని!

అన్నిటి వెనకా ఉన్నది నకిలీ కణిక వ్యవస్థ గనకే.... ఏ దేశమైనా, ఏ ఇజమైనా.... ఇదే నడుస్తోంది!

ఇక సెజ్ ల విషయాన్ని ప్రక్కన బెడితే...

కార్పోరేట్ వ్యాపారం కోసం సృష్టించే మరికొన్ని మోజుల్ని పరిశీలిద్దాం!

మీడియా ముకుమ్మడిగా ఎత్తుకుందంటే దేన్నైనా హిట్ చెయ్యగలదు. అచ్చం డిజైనర్ చీరలు, దుస్తులూ, చెప్పులూ లాగా! ఒక్కసారిగా అన్ని పత్రికలూ హోరెత్తిస్తే, ఎటు చూసినా డిజైనర్ వస్త్రాలే అయిపోయాయి చూడండి, అలాగన్న మాట! ఇక ఈ మోజుల దృక్పధాన్ని, ఎంతగా ప్రజలలో ప్రవేశ పెడతారంటే -

కొన్ని సబ్బులకి, మాయిశ్చరైజర్లకీ టీవీలో వచ్చే వాణిజ్య ప్రకటనలని గమనించండి. ఓ చిన్నారి, మరో చిన్నారి దృష్టి నుండి, తాము వాడుతున్న సబ్బుని దాచేసి, తర్వాత తల్లి దగ్గరికి పరుగెట్టుకెళ్ళి "మమ్మీ! నువ్వు కూడా రాహుల్ వాళ్ళ మమ్మీలా మారిపో మమ్మీ!" అంటుంది. కాబట్టి ఫలానా సబ్బు లేదా షాంపూ లేదా మరో సౌందర్య ఉత్పత్తి వాడమని మారాం చేస్తుందన్న మాట!

ఇది విదేశాలలో [మన దేశంలో కూడా] ఎంత దూరం పోయిందంటే - పిల్లలు మన ఇంట్లో కార్పోరేట్ కంపెనీల ప్రతినిధుల్లా పనిచేస్తున్నారని నిపుణులు ప్రకటించారు. వస్తువు ఎలాంటిదైనా, అది తమకు సంబంధించనదైనా కాకపోయినా, చిన్నారులు, ఫలానా బ్రాండు వస్తువులే కొనాలని తల్లిదండ్రులని డిమాండ్ చేస్తున్నారట. ఫలానా కంపెనీ కారు లేదా మొబైల్ లేదా కంప్యూటర్ గట్రా కొనాలని.

టీవీ యాడ్స్ ప్రభావమూ, సహధ్యాయులతో పోటి మనస్తత్వమూ ఇందుకు కారణాలట. దాంతో కార్పోరేట్ కంపెనీలు, ఇప్పుడు తమ అమ్మకాల కోసం, పిల్లల మీద దృష్టి కేంద్రీకరించేయనీ, తమ వాణిజ్య ప్రకటనలన్నీ పిల్లల మనస్తత్వం మీదే గురిపెడుతున్నాయనీ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2008, జనవరి ఒకటో తేదీన ‘మన ఇంట్లో ఇతరుల ఏజంట్లు’ శీర్షికన ఈనాడులో పూర్తి వివరాలతో ఇదంతా ప్రచురితమైంది కూడా!

ఇక ఇలాంటి వ్యాపారంలో ఏపాటి విచక్షణ ఉంటుంది? బాల్య చాపల్యమే వ్యాపార ముడి సరుకు కావటమే కదా ఇది!? ఇదేదీ కార్పోరేటిజంకి పట్టదు. కావాల్సింది వ్యాపారాభివృద్ది మాత్రమే! దాని మూలంగా సమాజంలో, ఏ విధమైన శారీరక మానసిక రుగ్మతలు పెరిగినా వాళ్ళకి అనవసరం. "అవన్నీ ఆలోచిస్తే సంపాదించలేరు. ఫలానా కంపెనీ ఈ రకపు వ్యాపారం చేయక పోతే మరొకరు చేస్తారు" అంటూ కొంతమంది, సదరు కార్పోరేట్ సంస్థల్ని వెనకేసుకు రావటం కూడా కద్దు.

విషయం ఏమిటంటే - ఆ ఫలానా వాళ్ళు ఎవరైతే వాళ్ళే ఈ విమర్శకు పాత్రులు. అంటే - ఈ రకపు వ్యాపారం రిలయన్స్ చేస్తే రిలయన్స్ నీ, మరో xyz కంపెనీ చేస్తే ఆ కంపెనీని ఉద్దేశించిన విమర్శ తప్ప, ఈ విశ్లేషణలో, నా వ్యక్తిగత అభిమానమో, అసహ్యమో.... ఏ కంపెనీ పట్లా లేవని గమనించగలరు.

ఇక ఇలా సృష్టించబడే మరో రకపు ట్రెండ్ లను గమనించండి. ప్రజా దృక్పధంలో ప్రవేశపెట్టే ట్రెండ్ లు.... ఫలానా వస్తువు[సెల్లో, బైకో] లేదా ఫలానా బ్రాండు వస్తువో కలిగి ఉండటం [పరువుకి] ప్రిస్టేజ్ కి సంబంధించినది. ఫలాన వస్తువు లేకపోవటం పరువు తక్కువ, కొండొకచో అవమానం కూడా." పదే పదే అదే ప్రచార వ్యూహంతో, ఇలాంటి కుహనా భావనలు సమాజంలోకి చొప్పించబడ్డాయి. దాంతో అధికశాతం ప్రజలు.... వస్తువునీ, వస్తువినిమయాన్ని ఆస్వాదించటం మరిచిపోయారు. వస్తువు కలిగి ఉండటం మీదే వాళ్ళ శ్రద్దంతా!

ఖరీదైన విలాస వస్తువులు ఇంట ఉండి, ఆనందించే తీరిక లేకుండా, క్షణం ఇంట ఉండలేనట్లుగా పరుగులెత్తే జీవితంలో మిగిలేదేమిటి? నీతా అంబానీ, 26 అంతస్థుల విలాస నివాసభవనం కలిగి ఉండినా, కారులో కునుకు తీయాల్సిన బ్రతుకు గడిపినట్లే! కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, మనసు తీరా ఆత్మీయులతో కబుర్లు... ఇవేవీ లేని జీవితంలో, సంపద ఉండీ ఉద్దరించేదేముంది?

ఇలా....‘వస్తువుని కలిగి ఉండటమే ప్రతిష్ఠకు నిదర్శనం’ అనే భ్రమలు పెరిగి.... సదరు వస్తువుల్ని సమకూర్చుకోలేక పోయినపుడు, అభం శుభం తెలియని కొందరు పిల్లలు, భావోద్రేకపూరితులై యువకులూ.... నిరాశానిస్పృహలకీ, ఆత్మన్యూనతకీ గురికావటం కూడా జరుగుతోంది. తాము కోరిన సెల్ ఫోన్ తండ్రి కొననందుకు, బైక్ కొననందుకు ఆత్మహత్యలు చేసుకున్న పదేళ్ళ పిల్లల నుండి, ఇరవై ఏళ్ళ యువకుల గురించి, ఎన్నో వార్తలు అప్రధాన్య అంశాలుగా వెళ్ళిపోతుంటాయి.

భావాలని, బంధాలని, అనుభూతుల్ని ఆనందించటం మాని, కేవలం వస్తువులూ, ద్రవ్యమూ, డబ్బే ఆనందదాయకమనుకొని, ఎండమావుల వెంట పరుగు పెడుతున్న పరిణామ ఫలితం ఇది!

జీవితంలో ఆకలి కేకలు వేసే వేళ, అనుభూతులకి విలువ లేదు.

అలాగే అనుభూతించని చోట సంపద సమకూడినా వ్యర్ధమే!

జీవితంలో పగలూ రాత్రి ఎంతో.... అనుభూతులూ అనుబంధాలూ, సిరిసంపదలూ అంతే!

భావవాదమూ, పదార్ధ వాదమూ రెండూ తగినంత పరిమితిలో ఉన్నప్పుడే మనిషి జీవితం సుఖదాయక మౌతుంది.

దాన్నే గీత
‘యుక్తాహార విహారస్య’ అంటుంది.

ఈ సత్యాన్ని ప్రజలు గుర్తించగలిగే వాళ్ళు ఒకప్పుడు! ఇప్పుడది.... నకిలీ కణికుల గూఢచర్య వ్యూహాల కారణంగా, పదేపదే అదే ప్రచారం హోరులో మరుగున పడింది.

ఎప్పుడైతే ప్రజలు.... సత్యమూ, నిజాయితీ, జ్ఞానమూ, విలువలూ, క్రమశిక్షణతో కూడిన జీవనసరళే, జీవితానికి అంతిమ గమ్యమని గుర్తిస్తారో.... అప్పుడు సమాజంలోని ఈ చెడు అంతరిస్తుంది.

ఎందుకంటే - ‘మంచిగా బ్రతకటం, ధర్మం పాటించడం, సత్యం పలకడం అంటేనే మట్టి గొట్టుకు పోవడం’ అని నకిలీ కణిక వ్యవస్థ ప్రచారించింది. గూఢచర్య బలంతో దృష్టాంతపూరితం చేసింది. నీతి నిజాయితీలతో బ్రతక ప్రయత్నించిన వాడు, ఉన్నది ఊడగొట్టుకుని, దారిద్ర్యపు బారిన పడటాన్ని సంఘటనాత్మకం చేసి, మీడియా ద్వారా మరింత ఫోకస్ చేసి ప్రజలని ప్రభావపరిచింది. "ఇవాళా రేపూ చెడుకే రోజులు!" అంటూ చెవినిల్లు కట్టుకు చెప్పి మరీ, ప్రజా దృక్పధాన్ని ప్రభావపరిచింది.

నకిలీ కణికులు తరాల తరబడి, శతాబ్దాల తరబడి, మానవ జాతి మీద ప్రయోగించిన కుట్రలో ‘ప్రజా దృక్పధాన్ని ప్రభావపరచటం’ అన్నది ప్రధాన అంశం!

అందుకోసం మోజులు సృష్టించటం, భ్రమలు కల్పించటం, ఏదైనా చేసారు, చేస్తున్నారు. మరికొన్ని ఉదాహరణలు....!

కార్పోరేట్ కంపెనీల వ్యాపారం కోసం సృష్టించబడిన ‘వాలంటైన్స్ డే’ ఇలాంటి వాటిల్లో ఒకటి! టీవీల్లో, పత్రికల్లో వార్తాంశాలుగా, ప్రత్యేక శీర్షికలుగా హోరెత్తించి చేసుకునే వ్యాపారాలు కోట్లలోనే! పూలబొకేలు, గులాబీలు, గ్రీటింగ్ కార్డులు, మిఠాయిలు, కేకులూ, చాక్లెట్లూ... చల్లగా వజ్రపు టుంగరాలు, నగా నట్రాల వంటి గిప్టులూ!

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మోజులలో, ఎందరు అమాయక లేత వయస్సు బాలబాలికలు నలిగిపోతున్నారో, ఈ వ్యాపారులకి అనవసరం! ఏటికేడాది మీడియా మళ్ళీ మళ్ళీ హోరెత్తిస్తూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజున ఇన్ని కోట్ల గులాబీలు అమ్ముడయ్యాయనీ, ఇన్ని టన్నుల చాక్లెట్లు హాంఫట్ అయ్యాయనీ, తెగ ఊరించి వ్రాసేస్తుంది. "ఆ ‘దినం’ జరుపుకోక నువ్వే నష్టపోయావు. అందరూ తెగ బావుకున్నారు" అన్నట్లు పాఠకులకి/ప్రేక్షకులకి, ఎవరికి వాళ్లకి ‘తలంటు’ పోసేస్తుంది.

ప్రజల నుండి ఎన్ని విమర్శలు వచ్చినా వ్యాపార సంస్థలకి పట్టదు. ఎందుకంటే - ప్రభుత్వం స్పందించి ఆటంకపరిస్తే తప్ప, విమర్శల వల్ల తమకొచ్చే నష్టం ఏదీ లేదు. పార్టీలకతీతంగా ప్రభుత్వాలూ, మీడియా సంస్థలూ, తమ జేబులో బొమ్మలే అయినప్పుడు, తమ కొచ్చే కష్టమూ, నష్టమూ ఏముంది? ఎటూ గూఢచర్యమిళితమై, మీడియా అధినేతలూ, ప్రభుత్వాధినేతలూ, కార్పోరేట్ అధినేతలూ... ఈ వ్యాపారంలో ఎవరి వాటా వాళ్ళు పుచ్చుకుంటున్నారు కదా? ఇంత విస్తారమైనది ఈ ఆర్దికపరమైన కుట్ర!

ఇలాంటి తాజా ఉదాహరణ అక్షయ తృతీయ! ఈ పండగ గురించి గానీ, ఆ రోజు బంగారం కొనే సెంటిమెంటు గురించి గానీ, ఎప్పుడూ ఎక్కడా చదివి ఉండలేదు, విని ఉండలేదు. ఇటీవల కాలంలో కార్పోరేట్ బంగారు నగల షోరూంలు వచ్చాక, అక్షయ తృతీయ గురించి అనూహ్య ప్రచారం వచ్చింది. ‘అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే, లక్ష్మీ దేవికి మన మీద అనుగ్రహం కలిగి మన ఇంటికి వస్తుంది’- అనే నమ్మకం, ప్రజల్లో కలిగి తెగ కొనేస్తున్నారంటుంది మీడియా! అమ్మకాలు నడిచాయంటాయి వర్తక సంస్థలు!

ఒకప్పుడు, ప్రజల ముఖ్యంగా హిందువుల గుడ్డి ఆచారాల గురించి, మూఢనమ్మకాల గురించి గర్జించిన హేతువాద సంఘాలు, జన విజ్ఞాన వేదికలూ, ఈ కొత్త నమ్మకాల గురించి ఎందుకు కిమ్మనరో వాళ్లకే తెలియాలి.

ఇలాంటి మెగా మోజు మరొకటి ఏమిటంటే -

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

ప్యాకింగ్ మారిన బ్రిటీష్ దోపిడి వ్యాపారమే కార్పోరేటిజం! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 10]

Sun, 06/20/2010 - 22:10
కార్పోరేట్ వ్యాపార సంస్థల్ని అనుచర వర్గంగా, సిఐఏ ఐఎస్ ఐ వంటి ఆయా దేశాల నిఘా సంస్థల్ని సహచర వర్గంగా.... కలిగి ఉన్న, తరతరాలుగా గూఢచర్యం నెఱుపుతున్న నకిలీ కణిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ప్రయోగిస్తున్నది, ప్రజల రక్తాన్ని పీల్చి డబ్బుగా మారుస్తున్న దోపిడినే!

ఈ గూఢచర్యాన్నే.... పాలనా యంత్రాంగంలో రెడ్ టేపిజం అనీ, పాలక వర్గంలో రాజకీయమనీ, అధికార వర్గంలో అవినీతి అనీ, వ్యాపార వర్గాల్లో కార్పోరేటిజమ్ అనీ, మాఫియా అనీ, మతోన్మాదమనీ, రకరకాల నేపధ్యాలలో రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. అన్నిటిలో ఉన్నవి అవే పది స్ట్రాటజీలు! నకిలీ కణిక అనువంశీయులకు తెలిసింది అంతే!

అయితే.... ఈ గూఢచర్యంతో మిళితమైన వ్యాపారం, కార్ఫోరేటిజం లతో ‘పేదలు మరింత పేదవాళ్ళవ్వటం, ధనికులు మరింత ధనికులవ్వటం’ అన్నది మాత్రం అనులోమాను పాతంలో పెరుగుతూ పోతోంది. కూలీ, తోపుడు బళ్ళమీద చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళల్లో, చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే - ఇంటి యజమాని తాగుడు వ్యసనపూరితుడైతే ఇక ఆ కుటుంబం పైకి వచ్చే అవకాశమే ఉండదు. తల్లీ పిల్లల రెక్కల కష్టం, బ్రతుకు గడవటానికే సరిపోతుంది. అలాంటి కుటుంబాల నుండి పిల్లలు చదువుకొని పైకి రావటం, ఆర్దిక స్థాయి పెరగటం అంటే - అసాధ్యం కాదు గానీ, కష్ట సాధ్యం!

ఇక ఇంటి యజమాని వ్యసనపరుడు కాకపోయినా కూడా.... వయస్సు, శరీర ధృఢత్వం ఉన్నన్ని సంవత్సరాలూ బాగా కష్టపడతాడు. అయితే వరసగా పనిచేస్తుండటంతో అనారోగ్యం బారిన పడుతుంటాడు. ఒకసారి అనారోగ్యం బారినపడ్డారా, ఇక ఆ కుటుంబపు స్థితి తలక్రిందులై పోతుంది.

నంబూరు పల్లెలో ఉన్నప్పుడూ, హైదరాబాద్ నానల్ నగర్ లో ఉన్నప్పుడూ కూడా .... ఇలా, సంవత్సరాల పాటు ఒంటి చేత్తో కుటుంబాన్ని పోషించే ప్రయత్నంలో కూలీ పనులతో కాయకష్టం చేస్తూ, దానికి తగినంతగా ఆహారపు అండలేక, ఎముకలు గుల్లయి పోగా, అనారోగ్యం పాలైన వాళ్ళని చూశాను.

ఇవేవీ అవగాహన లేని ఆ కుటుంబాల వాళ్ళు, "మా ఇంటాయనకి ఆరోగ్యం బావున్నప్పుడు మాకు ఏ లోటూ ఉండేది కాదక్కా! ఇప్పుడు ఆయనకి ఒంట్లో బాగుండక, పనికిపోవట్లా! ఎక్కళ్ళేని డబ్బు ఆసుపత్రులకే చాలట్లా" అని వాపోయిన మహిళల్నీ, వాళ్ళ జీవన స్థితిగతుల్నీ దగ్గరి నుండి పరిశీలించాను.

కుటుంబం పట్ల బాధ్యత తోనూ, కుటుంబ సభ్యుల మీద ప్రేమతోనూ, వాళ్ల అభివృద్ది కోసం అహర్నిశలూ కష్టపడుతూ, దానికి తగినంత పోషణ లేక కృశించిన పేద గృహస్థులని స్వయంగా చూశాను. ఆర్దికంగా కొంత పైస్థాయికి ఎదిగిన మధ్యతరగతి వాళ్లు కూడా, ఆ స్థితికి చేరటానికి.... కుటుంబ జీవితాన్ని, కనీస విశ్రాంతి వినోదాలని త్యాగం చేయటం పరిశీలించాను. అందరిదీ ఇదే స్థితి అనను గానీ, ఎక్కువమందిది ఇదే స్థితి అని చెప్పగలను.

ఇక ప్రభుత్వమే ఈ కుట్రలో భాగస్వామియై ప్రజలని దోపిడికి గురి చేస్తోందనటానికి గతంలోనూ, ఇప్పుడూ దృష్టాంతాలు కొకొల్లలుగా ఉన్నాయి.

ఒక ఉదాహరణ చూడండి. 1980 వ దశకంలో... అప్పట్లో ఎన్టీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హఠాత్తుగా అతడికి ఓ రోజు తెల్లవారు ఝామున [అతడి మాటల్లో బ్రహ్మ ముహుర్తం!] ఓ బ్రహ్మండమైన ‘ఐడియా’ వచ్చింది. దాంతో అతడు రాష్ట్రంలోని ద్విచక్ర వాహన దారులంతా శిరస్త్రాణం [హెల్మెట్] ధరించాలంటూ ఆర్డరు వేసేసాడు. ఆ బ్రహ్మముహుర్తంలో అతడికి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారి గురించి తట్టిందట, ప్రజల క్షేమ శ్రేయస్సుల మీద శ్రద్దతో సదరు జీవో వేసేసాడు.

ప్రజల మీద అతడికున్న శ్రద్దా సక్తుల సంగతేమో గానీ, ఇక్కడ బహు గమ్మతైన విషయం ఒకటుంది. అతడికి ఒకానొక బ్రహ్మముహుర్తంలో ఇలాంటి ఆలోచన వస్తుందన్న విషయం, కేవలం స్టడ్స్ హెల్మెట్ తయారీ కంపెనీ మాత్రమే పసిగట్టగలిగింది!? దాంతో ఎన్టీఆర్ నిర్ణయం తర్వాత, మార్కెట్ లో వెల్లువెత్తిన డిమాండ్ ని, స్టడ్స్ కంపెనీ మాత్రమే అందిపుచ్చుకోగలిగింది. అందునా హెల్మెట్ ధారణకి నిర్దిష్ట గడువు నిర్ణయించి, ఆ తేదీ దాటితే హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి జరిమానా విధిస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో హెల్మెట్లకు ఎక్కడ లేని గిరాకీ ఏర్పడింది. బ్లాకులో అమ్మకాలు కూడా జరిగాయి.

ఇతర కంపెనీలు ఈ పరిణామానికి సిద్దపడి లేక పోవటంతో, పెద్దగా మార్కెట్ ని దక్కించుకోలేకపోయాయి. హడావుడిగా సరుకు దించినా, స్టడ్స్ కి ఇచ్చిన పోటీ తక్కువే! ఎన్టీఆర్ అనే రాజకీయ నటుడికి ‘సీన్’ ఇచ్చిన దర్శకుడు రామోజీరావుతో, స్టడ్స్ కంపెనీ లాలూచీ పడితే చాలు. బ్రహ్మముహుర్తంలో ‘ఐడియాలు’ వస్తాయి, వ్యాపారాలు నడుస్తాయి.

ఇప్పుడున్న ఈ పాటి అవగాహన కూడా ఆరోజు ప్రజలకి లేదు. మీడియాని బాగా నమ్మేవాళ్ళు. ఇంతగా మీడియా నిజరూపం అప్పుడు బహిర్గత పడలేదు. దాంతో ఎవరూ అనుమానించలేదు గానీ, ఒక్క కలం పోటుతో, భారీ మొత్తంతో స్టడ్స్ కంపెనీ నుండి ఎన్టీఆర్ కీ, నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తి రామోజీరావుకీ, ధన ప్రవాహం నడిచింది.

ఇక్కడ ఓ విషయం ప్రస్తావిస్తాను. ఎన్టీఆర్ పుట్టుకతో నటుడు. రాజకీయుడు కాదు. కాబట్టే అప్పుడప్పుడూ.... ఈ రాజకీయ దర్శకుడూ, నకిలీ కణిక అనువంశీయ గూఢచార వ్యవస్థలో కీలక వ్యక్తీ అయిన, రామోజీరావు పట్ల అవిధేయత కూడా చూపేవాడు. అలాంటప్పుడు.... రామోజీరావు, ఎన్టీఆర్ ని నాలుగు పీకి కూర్చోబెట్టేవాడు. కాకపోతే అవి భౌతిక దెబ్బలు గాక, స్ట్రాటజీ పరమైన దెబ్బలై ఉండేవి.

అలాంటిదే - ఓ సారి ఎన్టీఆర్ కు చెందిన రామకృష్ణా స్టూడియోలో మెటడోర్ వ్యానులో బస్తాల్లో డబ్బు కట్టలు దొరికటం! అప్పట్లో ఓ రోజు ఉదయాన్నే ఈనాడు తెరిస్తే... పేపర్లో పెద్దచ్చరాల్లో ప్రచురింపబడిన వార్త ఇది! ‘శివాజీ’ సినిమాలోనూ, ‘బంపర్ ఆఫర్’ వంటి సినిమాల్లోనూ చూసినట్లు ఏ ట్రిక్కులు ప్లే చేసారో గానీ, భారీ మొత్తంలో డబ్బు బయటపడి, ఫోటోలతో సహా పేపరుకెక్కింది. అచ్చం ఇప్పుడు హరిబాబు & చంద్రబాబుల ఏడుకోట్ల మాదిరిగానే, అప్పుడు ఎన్టీఆర్ కూడా ఆ డబ్బు తనది కాదన్నాడు.

‘పైకి నవ్వుతూ నాది కాదని, ఇంటికెళ్ళి ఏడ్చుకుని ఉంటాడని’ అప్పట్లో జోకులు కూడా పేలాయి. అసలుకే ఎన్టీఆర్, ఒకో కొడుకుకీ కనీసం 200 కోట్ల ఆస్థి కట్టబెట్టాలని కంకణం కట్టుకున్నాడని అప్పట్లో ఓ ప్రచారం ఉండేది.

స్టడ్స్ కంపెనీలతో లాలూచీలు అది నిజమేనని చెప్పకనే చెప్పాయి. అలాంటి అవినితేదీ లేనట్లయితే...కేవలం ముఖ్యమంత్రిగా వాహన చోదకుల క్షేమమే లక్ష్యమై ఉంటే - శిరస్రాణధారణకు రెండువారాల గడువులుండవు. [మరో వారం పొడిగించారు లెండి.] రెండో మూడో నెలలు గడువిచ్చినట్లయితే స్టడ్స్ కి మాత్రమే వ్యాపారం పండేది కాదు. అంతేగాక ఆరునెలలు తిరగక ముందే, సదరు జీవో అమలు అటకెక్కి పోయేది కాదు. కాబట్టి ఎన్టీఆర్ ప్రభుత్వ శ్రద్ద, శిరస్త్రాణాలు కొనిపించటం మీద మాత్రమే అన్నది, ఆ విధంగా నిరూపించబడింది.

ఇక ఈ విషయం వదిలేసి మళ్ళీ కార్పోరేట్ వ్యాపార దోపిడి దగ్గరికి తిరిగి వద్దాం. అయోడైడ్ సాల్ట్! అయోడిన్ లోపం వలన ధైరాయిడ్ సమస్యలు వస్తాయి కాబట్టి, ఉప్పులో అయోడిన్ కలిపి అమ్మాలని, అన్ అయోడైడ్ ఉప్పు అమ్మరాదని ప్రభుత్వం ‘రూల్’ పాస్ చేసింది. అప్పుటి వరకూ ఉప్పు పండించే రైతుల వ్యాపారవకాశాలు స్వేచ్ఛగా ఉండేవి. ఉప్పు అమ్ముకుని సాధారణ కుటుంబాలేన్నో బ్రతికేవి. దెబ్బతో ఉప్పు రైతుల మార్కెట్ అవకాశాలు కేవలం కార్ఫోరేట్ కంపెనీలకి పరిమితమయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఉప్పు పొలాలు కార్పోరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయాయోమో! బండి మీద పోసుకుని ఉప్పమ్మ వచ్చే వారి ఉపాధి అవకాశాలు పోయాయి.

కార్ఫోరేట్ కంపెనీలు అన్నపూర్ణా[బిర్లా కుటుంబాలు], టాటా, కెప్టెన్ కుక్, ప్రియ గట్రాలు మార్కెట్లోకి వచ్చాయి. దైనందిన ఆహారంలో ఉప్పు తప్పనిసరి గనక, వ్యాపారం భారీ మొత్తంతో ఉంటుంది. చౌకధరల దుకాణాలలో ఇదే అయోడైడ్ ఉప్పు కిలో నాలుగైదు రూపాయలకు అమ్మేవారు. ఇప్పుడు అదీ అమ్మటం లేదు.

ఒకప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం, ఉప్పు మీద పన్ను వేసినందుకు, బాపూ నాయకత్వంలో ప్రజలు గర్జించారు. ప్రభుత్వాన్ని గడగడలాడించారు. పిడికెడు ఉప్పు స్వాతంత్రాన్ని తెచ్చిపెడుతుందంటే నవ్విన బ్రిటీష్ వాళ్ళు, దండి సత్యాగ్రహానికి కదలిన దండుని చూసి దడుచుకున్నారు.

దండి యాత్ర స్వాతంత్ర సమర చరిత్రలోనే అపూర్వమైనది, స్ఫూర్తిదాయకమైనది. అలాంటి భారతదేశంలో ప్రస్తుత ప్రభుత్వాలు, ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం కంటే హేయంగా ఉన్నాయి. ఆనాటి భారతీయులతో పోలిస్తే ఈనాటి భారతీయులు, దోపిడిని మామూలుగా ఒప్పుకునేంత తామసంతో ఉన్నారు. దానికి తోడు, కార్ఫోరేట్ కంపెనీలు, తమ వాణిజ్య ప్రకటనలతో ప్రజలకు ఎన్ని మాయా మోహాలు, మోజులు కల్పిస్తాయంటే - సదరు కార్ఫోరేట్ ఉప్పులు తింటే పిల్లలకి జ్ఞాపకశక్తి అమాంతం పెరిగిపోతుందనీ, ఠక్కున ఐఏఎస్ అధికారులై పోతారనీ అన్నంతగా!

దీనికి కొసమెరుపు ఏమిటంటే - రెండేళ్ళ క్రితం అమెరికా లో, నిపుణుల బృందం - అయోడిన్ ఉప్పు వాడకానికీ, గతంలో చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలకీ సంబంధం లేదని తేల్చారు. పైగా తమ వ్యాపారం కోసం శాస్త్రవేత్తలనీ, ప్రభుత్వాలనీ కూడా, ఈ రకమైన ఆరోగ్య నివేదికలు ఇవ్వాల్సిందిగా, ప్రకటించాల్సిందిగా కార్ఫోరేట్ కంపెనీలు ప్రభావపరచాయని ముక్తాయించారు. ఆ జాబితాలో అయోడైడ్ ఉప్పుతో పాటు మరికొన్ని అంశాలూ ఉన్నాయి.

ఇదీ.... కార్ఫోరేటిజం నిర్వహించే వ్యవస్థీకృత దోపిడి! ఏది సత్యమో ప్రజలకి అర్ధం కానివ్వని దోపిడి! పిల్లల్ని కాపాడాల్సిన తల్లిదండ్రులే పసివాళ్ళని దోపిడి చేస్తే, వాళ్ళకి దిక్కెవరూ ఉండరు, దైవం తప్ప! అలాగే ప్రజల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే వాళ్ళని దగా చేస్తే, ప్రజలకీ దిక్కుండదు. మద్యపు వ్యాపారంలో తలమునకలుగా మునిగి, ఆదాయం కోసం ఏదారైనా తొక్కే ప్రభుత్వాన్ని చూశాక.... ఇది మన మేలు కోరే ప్రభుత్వం అనే భరోసాని కోల్పోయాక.... అది చెప్పే నివేదికలని, ఇచ్చే ప్రకటనలని, జారీ చేసే ఆదేశాలని, ఏమని నమ్మగలం?

కార్ఫోరేట్ కంపెనీలతో కుమ్మక్కై, భూగర్భ సంపదని దోచి పెడుతున్న ప్రభుత్వాధినేతలు, అదే కార్పోరేట్ కంపెనీలతో కుమ్మక్కై ఎలాంటి చట్టాలనైనా చేస్తారు. అదే ఇప్పుడు చూస్తున్నాం!

ఇక ప్రభుత్వ సహకారం సంగతి ప్రక్కన బెడితే....కార్పోరేట్ వ్యాపారంలోని మరికొన్ని కోణాలని చూద్దాం!

తమ వ్యాపారం కోసం కార్పోరేట్ కంపెనీలు ప్రజలలో ఎన్ని మోజులు పుట్టిస్తాయో, వాటిని మీడియా ఎంత ఇతోధికంగా [పెయిడ్ ఆర్టికల్స్ సాక్షిగా] ప్రచారిస్తుందో ఇప్పుడు మనందరం చూస్తున్నదే!

ఆరునెలల వయస్సులో పిల్లలకి అన్నప్రాశన చెయ్యటం మన సాంప్రదాయం. అప్పటి నుండీ పిల్లలకి ఘనాహారం ఇస్తుంటాము. ఒకప్పుడు గుజ్జన గుళ్ళు పేరుతో [ఈ పేరుతో చిన్నారుల ఆట కూడా ఉందని విన్నాను.] బియ్యమూ, కందిపప్పు, పొట్టు తీసిన పెసర పప్పు వేరువేరుగా దోరగా వేయించి, సన్నని రవ్వ చేసి, జీలకర్రా ఉప్పు కలిపి ఉడికించి, నెయ్యితో కలిపి మెత్తగా చేసి, పిల్లలకి తినిపిస్తారు. ఒకోసారి జీలకర్రా ఉప్పు బదులుగా, పాలూ చక్కెరా కలిపి తినిపిస్తారు. మొదట్లో తిరస్కరించినా, పిల్లలు తర్వాత ఇష్టంగా తింటారు. క్రమంగా గుజ్జన గుళ్ళులో, వేయించిన లేక ఉడికించిన కూరగాయ ముక్కల్ని [వంకాయ, బీరకాయ టమాటో గట్రాలు] కలుపుతూ, సంవత్సరం తిరిగే సరికల్లా పిల్లలకి అన్నీ అలవాటు చేస్తారు.

ఇలా ఘనాహారానికి అలవాటు పడిన పిల్లలు, పెద్దయ్యాక కూరలు తినటానికి మారాం చెయ్యరు. ఇది మా పాపతో నాకు స్వానుభవం. మా ఇంట్లో నా చిన్నప్పటి నుండీ, మా చిన్నమ్మల పిల్లలతో చూసిన అనుభవం కూడా!

ఇక ఈ గుజ్జన గుళ్ళు స్థానే, కార్పోరేట్ కంపెనీలు ఫారెక్సులూ, సెరిలాక్ లూ ప్రవేశపెట్టాయి. ముద్దులు మూటగట్టే బొద్దుపాపాయిల నవ్వులతో, ఆకర్షణీయమైన వారి వాణిజ్య ప్రకటనలు ఏ తల్లిదండ్రులనైనా ఊరిస్తాయి. అయితే, ఆయా ఘనాహారాలతో, తర్వాత సంవత్సరాల్లో, పిల్లలు ఊబకాయం [ఓబేసిటి]తో బాధపడటం, చాలామందిలో సంభవిస్తొందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ నిజాలు, ప్రచార హోరులో సామాన్య ప్రజలకు వినబడను కూడా వినబడవు. అంతంత మాత్రపు అదాయం కలవాళ్ళు కూడా, ఫారెక్సుల వెంటపడటం నేను పరిశీలించిన అంశమే!

ఓ ఉదాహరణ చెబుతాను. శ్రీశైలంలో మా క్రింది అంతస్థులో ఓ సెక్యూరిటి గార్డు కుటుంబం ఉండేది. తర్వాత రోజుల్లో వాళ్ళు మమ్మల్ని వేధించినా, తొలిరోజుల్లో సంబంధాలు బాగానే ఉండేవి. ఓ రోజు గుడికి వెళ్ళి వస్తుండగా, వాళ్ళ అబ్బాయి గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఆరేడు నెలలుంటాయి.

"అయ్యో! చిన్నబాబు ఎందుకలా ఏడుస్తున్నాడు?" అంటూ సానుభూతిగా అడిగాము.

"షల్లాక్ అయిపోయింది సార్! షాపులో అడిగితే లేదన్నాడు. ఇప్పుడు సరుకులోడ్ వస్తే ఇస్తానన్నాడు. తేడానికి పోతున్నా" అన్నాడు.

మాకేమీ అర్ధం కాలేదు. షల్లాక్ అంటే - రెక్సిన్ ను అతకడానికి వండ్రగి వాళ్లు ఉపయోగించే ఓ రకమైన జిగురు! వివరాలడిగితే తెలిసిందేమిటంటే పిల్లవాడు ‘సెరి లాక్’ కోసం ఏడుస్తున్నాడు.

ఉత్పత్తి పేరు పలకటమే రానివాడికి, ప్రయోజనాలేం తెలుస్తాయి? కానీ టీవీలో, అందమైన పిల్లల, చురుకైన నవ్వుల, వాణిజ్య ప్రకటన మాత్రం ఆకర్శిస్తుంది. అది వాడితే తమ పిల్లలూ.... అంత అందంగా, చురుగ్గా పెరుగుతారని ఆశ! అదీ నట్టింట టీవీ పుట్టించే మోజుల ప్రభావం!

అలాంటిదే ప్రామ్, వాకర్ వంటి వస్తువుల వాడకం కూడా! వాకర్ లతో పిల్లలకి పసితనంలోనే, మెదడులో నమోదు కావాల్సిన, గురుత్వాకర్షక అనుభవాలు దూరం కావటం గురించి, గతటపాలలో వ్రాసాను. ఇక ప్రామ్! సినిమాలలో, టీవీలలో చూస్తే... ప్రామ్ లో కూర్చొని దిక్కులు చూసే పాపాయి ఎంతో ముద్దుగా ఉంటుంది. ఇంకా చిన్నపసిగుడ్డయితే... గుప్పిళ్ళు మూసుకుని, చేతులకి గ్లోవ్స్, కాళ్ళకి సాక్స్ వేసుకుని ప్రామ్ లో నిద్రించే చిన్నారి, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తల్లిదండ్రులు కబుర్లు చెప్పుకుంటూ ప్రామ్ తీసుకు వెళ్ళటం చూస్తే చాలా బాగుంటుంది. మోజు పడి కొనుక్కోవాలనిపిస్తుంది.

అయితే, తల్లి చేతుల్లో, తల్లి గుండెలకు దగ్గరగా ఎత్తుకోబడ్డ బిడ్డలో భద్రతా భావం ఉంటుంది. అలాంటి వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ధైర్యగుణం చూపుతారు. అదే ప్రామ్ లో షికార్లు తిరిగిన పిల్లల్లో ఈ లక్షణం తక్కువ. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకునే విషయం.

ఈ విధంగా కార్పోరేట్ కంపెనీలు, మీడియా మద్దతు [పెయిడ్ న్యూస్ లాంటి ఆర్టికల్స్]తో సృష్టిస్తున్న మోజుల సుడిగాలితో ‘వ్యాపారం’ చేస్తున్నారు అనుకుంటాము. కానీ అది పైకారణం[over leaf reason] మాత్రమే!

వ్యాపారం మాటున.. తల్లిగర్భంలో పిండంగా రూపుదిద్దుకునే టప్పుడు మందుల రూపంలో,
శిశువుగా తల్లి పొత్తిళ్లల్లోకి చేరేటప్పటికి బేబీ ప్రాడక్ట్ రూపంలో,
అడుగులేసే నాటికి వస్తువులతో,
‘అ ఆ’ లు నేర్చేనాటికి కార్పోరేట్ చదువులతో,
మనిషి మనుగడలోని ప్రతిదశలో తామసాన్ని పెంచిపోషించి, సత్వరజోగుణాల్ని నాశనం చేసే ప్రక్రియ నడుస్తోంది.
ఇది గూఢచర్యం.
ప్రపంచవ్యాప్తంగా నకిలీ కణిక వ్యవస్థ కార్పోరేటిజం ముసుగు మాటున నిర్వహిస్తున్న గూఢచర్యం.

కాబట్టే... సామాజిక శాస్త్రవేత్తలు గానీ, మానసిక విశ్లేషకులు గానీ, మనో విజ్ఞానవేత్తలు గానీ, ప్రభుత్వాలు గానీ, సర్వే సంస్థలు గానీ... ఏవీ ఈ విషయాన్ని ఫోకస్ చేయవు.

ఎందుకంటె - సత్త్వ గుణం ఆలోచన రేపుతుంది.
రజోగుణం తిరుగుబాటు చేయిస్తుంది.
అదే తమోగుణమైతే... చెప్పుచేతల్లో చెప్పినట్లు పడుండేటట్లు చేస్తుంది.
అందుకే నకిలీ కణిక వ్యవస్థ అన్ని రంగాల ద్వారా నిర్వహిస్తున్న ఈ కుట్రలో ప్రపంచవ్యాప్తంగా సామాన్యప్రజల మీద గురిపెట్టింది ‘తమో గుణ పూరితుల్ని చేయటమే!’

అప్పుడే ఇబ్బడిముబ్బడిగా శ్రామిక చీమలు దొరుకుతాయి మరి!

గమనించి చూడండి. ఆనాడు బ్రిటీష్ వాళ్ళు, మన దేశం నుండి ముడి సరుకు చౌకగా తీసుకుని [అదీ బలవంతాన], సామాన్య కార్మికుల చేత బండచాకిరి చేయించుకుని ఉత్పత్తిగా మార్చి, తిరిగి ఆ సరుకుని సామాన్య వినియోగదారులకి తము చెప్పిన అధిక ధరకు అమ్మేవాళ్ళు.

అదే ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలు చేస్తున్న వ్యాపారమైనా! ప్యాకింగ్ మారిన బ్రిటీష్ దోపిడి వ్యాపారమే కార్పోరేటిజం!!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

ఈ దేశం గాలి సోదరులదీ, అంబానీ సోదరులదేనా? [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 09]

Fri, 06/18/2010 - 23:36
కార్పోరేటిజమ్ అంటేనే వ్యాపార దోపిడి! మరి కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

‘రిలయన్స్’ కార్పోరేట్ సంస్థ.... పళ్ళు, కూరగాయలు, వంటింటి సరుకులూ అమ్మే వ్యాపారంలోకి అడుగుపెట్టింది. రిలయన్సే కాదు, మోర్ గట్రాలు కూడా! నిజానికి... ఉప్పులూ పప్పులూ, తోటకూర కట్టలూ అమ్మడానికి కోటీశ్వరులైన కార్పోరేట్లు కావాలా?

అవి చిన్న పెట్టుబడిదారులు పెట్టగల వ్యాపారాలు. వాటిల్లోకి కూడా కార్పోరేట్ దిగ్గజాలు అడుగుపెట్టటం అంటే - చిన్న వారి వ్యాపారావకాశాలని, ఉపాధి అవకాశాలని దెబ్బ కొట్టటమే! దీన్ని కట్టడి చెయ్యాల్సిన ప్రభుత్వం చేతులు ముడుచుకుని, మద్యం వ్యాపారం చేతుల నిండా చేసుకుంటూ కూర్చొంది.


ఇక..... ఈ కార్ఫోరేట్ మదుపుటేనుగులు[దిగ్గజాలంటే అవే మరి!] ఈ చిల్లర సరుకుల వ్యాపారంలోకి రాక ముందు వరకూ... గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా రిటైల్ గా పళ్ళు, కూరగాయలూ అమ్మే నెట్ వర్క్ ఉండింది. తాజా పళ్ళు, కూరగాయలని తోపుడు బళ్ళ మీద, గంపల లోనూ పెట్టుకుని, తల మీదో సైకిలు మీదో మోస్తూ, మన ఇళ్ళ దగ్గరి కొచ్చి, చిన్న వ్యాపారులు అమ్ముతుంటారు.

వీళ్ళు చిన్న, పేద వ్యాపారులు. కార్ఫోరేట్ స్ట్రాటజీలతో పోటీ పడగల వారు కాదు.

కార్పోరేట్ రిలయన్స్ ఫ్రెష్ లూ, మోర్ లూ గట్రాలు.... మొదట్లో ఈ గంపల వ్యాపారుల కంటే తక్కువ ధరకు, ఆకర్షణీయమైన ప్యాకింగులలో పళ్ళు, కూరగాయలని వినియోగదారులకి అమ్ముతారు. ఏసీలోనూ, ఫ్రిజ్ లోనూ ఉంచి, మరింత తాజా పళ్ళనే అమ్మగలరు.

సహజంగానే వినియోగదారులు కార్పోరేట్ ఫ్రెష్ ల వైపూ, సూపర్ మార్కెట్లు వైపూ ఆకర్షితమౌతారు. అన్నిరకాల వస్తువులూ ఒకే చోట, వైవిధ్య భరితంగా, తాజాగా, తక్కువ ధరకు దొరకటం - తప్పకుండా వినియోగదారులని ఆకర్షిస్తుంది. పైగా.... కొంతకాలం పాటు లాభాలని వదులుకొని లేదా నష్టాలు భరించి అయినా, కార్పోరేట్ సంస్థలు, తమ ఉత్పత్తిని చౌకగా ఆఫర్ చేస్తాయి.

అచ్చంగా ఈస్టిండియా కంపెనీ ఉచితంగా టీ ఇచ్చినట్లు... ఇదంతా కూడా, వ్యాపార పెట్టుబడిలో భాగంగానే, సదరు కార్పోరేట్ కంపెనీలు భావిస్తాయి. ఇలా కొంతకాలం గడిచే సరికి.... పోటీ తట్టుకోలేని గంపల మీద పళ్ళూ, కూరగాయలూ అమ్మవచ్చే చిన్న వ్యాపారులు కనుమరుగైపోతారు.

వాళ్ళంతా మరింత పేదలౌతారు. కూలీలూ గానూ, కొండకచో సూపర్ మార్కెట్లలో స్వీపర్లు గానూ రూపాంతరం చెందుతారు. రెండు చేతులా ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తూ ఆదాయపు పన్ను కట్టేంత ఆర్జనాపరుల గాక పోవచ్చుగాక, కానీ పెద్దగా చదువుకోని ఈ గంపల మీద పళ్ళమ్మే వారు గౌరవనీయంగా, స్వేచ్ఛగా బ్రతుకుతున్న వ్యాపారులు! ఆ స్థితి నుండి కూలీలుగా, పనివాళ్ళుగా మారడం - ఆత్మాభిమానం రీత్యానే కాదు, ఆర్దిక రీత్యా కూడా దారుణమే!

ఒకసారి ఆయా ఊళ్ళల్లో, కాలనీలలో, గంపల మీద అమ్మవచ్చే వ్యాపారుల నెట్ వర్క్ అదృశ్యమయ్యాక.... ఇక అప్పుడు ఈ కార్పోరేట్ కంపెనీలు తమ వస్తు విక్రయ ధరలని అమాంతం పెంచుకుంటాయి. ఇన్నాళ్ళు వేచి ఉన్న సమయానికి వడ్డితో సహా, పెట్టుబడినీ, లాభాన్ని తిరిగి రాబట్టు కుంటాయి. సూపర్ మార్కెట్లకీ, మన వీధి చివరల్లో కనబడే చిల్లర అంగళ్ళకీ మధ్య ఉన్నది కూడా ఇదే స్థితి! ఇక ప్రత్యామ్నాయం లేని స్థితికి వినియోగదారుడు నెట్టబడ్డాక, అసలైన దోపిడి అప్పుడు మొదలౌతుంది. ఇప్పటికే కొన్ని మెట్రో పాలిటన్ నగరాలలో ఈ స్థితి అనుభవంలోకి వచ్చింది.

దీన్నంతటిని నియంత్రించగల ప్రభుత్వం, ఎత్తి చూపించగల మీడియా.... ఎంచక్కా కార్పోరేట్ కంపెనీలకే వత్తాసు పలుకుతూ, అదే అభివృద్ది అంటాయి. మోనోపలి వ్యాపారుల ఆస్తులనీ, ఆదాయాలని చూపించి.... ఆర్దిక గణాంకాలూ, అంచనాలూ, సర్వేలూ అంటూ గ్రాపులూ, బార్ డయాగ్రం లూ చూపిస్తారు. ఇదే స్థితీ, సంబంధమూ.... అన్ని కార్ఫోరేట్ కంపెనీలకూ, వస్తు విక్రయాలకూ, సేవల విక్రయాలకూ వర్తిస్తుంది.

ఇది చాలక రిలయన్స్ వాళ్ళు ఇప్పుడు మంగలి షాపులు కూడా పెట్టి, క్షౌర వ్యాపారంలోకి కూడా దిగుతారట. అందుకు తన వంతు సహకారంగా, ఇప్పటికే ప్రభుత్వం, మంగలి దుకాణాలలో కుర్చీకి ఇంతని పన్ను వడ్డించి, మంగలి వాళ్ళ నడ్డి విరిచింది. ఇప్పటికే.... ఉదయాన్నే మంగలి పొది చంకలో పెట్టుకుని, ఇంటికొచ్చి క్షౌరం చేసి వెళ్ళే సేవలు అంతర్దానమైపోయాయి. మా చిన్నప్పుడు చూసిన దృశ్యమిది.

ఇక ఇప్పుడు వీధి చివర మంగలి దుకాణాలు కూడా కనుమరుగవ్వనున్నాయి. ఆ తర్వాత.... ‘ఇలా ఫోన్ చేస్తే చాలు! అలా కారులో లేదా రిలయన్స్ వ్యానులో వచ్చి, క్షౌరం చేసి వెళ్ళే, సూటూ బూటూతో రిలయన్స్ యూనిఫామ్ వేసుకున్న బార్బార్’ గురించిన టీవీ యాడ్స్ త్వరలో చూడనున్నామన్న మాట!

అమలులో ఉన్న నెట్ వర్క్ నీ, ఉన్న స్థితినీ నాశనం చేసి.... తిరిగి దాన్నే గొప్పగా చెబుతూ వ్యాపారం చేయటం - కార్పోరేట్ లకి బాగా వచ్చిన విద్య. అచ్చంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని ధ్వంసం చేసి, ఇప్పుడు దాన్నే గొప్పగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటూ అమ్ముతున్నట్లు!

ఇక అప్పుడు భారతీయ సామాన్యులకి ఉన్న మార్గాంతరాలూ రెండే.
ఒకటి: రిలయన్స్ వంటి కార్పోరేట్ మంగలి[బార్బర్] వాడి చేత, గడ్డం తలలతో పాటు, జేబునీ క్షౌరం చేయించుకోవటం!
రెండు: ఆది మానవుడి [బార్బేరియన్]లాగా పొడవాటి గడ్డంతో, జుట్టుతో తిరగటం!!

ఇప్పటికే డ్రెస్ డిజైనర్ల పేరిట టైలర్లూ, హెయిర్ స్టైలిస్ట్ ల పేరిట మంగలి వాళ్ళూ, సెలబ్రిటీలని కస్టమర్లుగా కలిగి ఉండి, వినియోగదారులకి అపాయింట్ మెంట్లు ఇస్తున్నారని మీడియా గొప్పగా ప్రచారం చేస్తోంది.

ఉన్న అవకాశాలు తొలగించి, అవసరాలు సృష్టించి వ్యాపారం చేసే ‘కార్పోరేట్’ల రాజ్యంలో... మామూలు టైలర్ల, మంగళ్ళ, చాకళ్ల సేవలకు కూడా అలాంటి మోజులు పుడితే.... ఇక ఇటు సామాన్యులు, అటు ఆయా సేవలందించే వృత్తిదారుల జీవితాలు కూడా, దారుణమైన దోపిడి వైపుకు దూసుకెళ్లటం ఖాయం. స్వేచ్ఛావ్యాపారులైన టైలర్లూ, మంగళ్ళూ, చాకళ్ళూ కార్పోరేట్ సంస్థల ఉద్యోగులైతే శ్రమదోపిడికి గురవుతారు. కార్పోరేట్ out let తప్ప గత్యంతరం లేకపోతే, సామాన్య వినియోగదారులు ధరల దోపిడికి గురవుతారు. రెండువైపుల నుండీ లాభాలు ఆర్దించగలిగేది కార్పోరేట్ కంపెనీలే అవుతాయి.

‘ఈ విధమైన నెట్ వర్క్ ని ఎంత బలంగా తయారు చేస్తే, అంతగా తమకు కప్పం కట్టించుకోవచ్చు’ గనక, నకిలీ కణిక వ్యవస్థ, తన గూఢచర్య వలయాన్ని వినియోగిస్తోంది. కాబట్టే - ప్రభుత్వాలు, మీడియా ఇతోధికంగా ఇందుకోసం పాటుపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని రంగాలు, ఈ విధమైన ప్రజా దోపిడికి ప్రాతిపదికలై పోయాయి, విద్యారంగం లాగా!

ఇలాంటి దోపిడే వ్యాపారం గనక.... రిలయన్స్ ముఖేష్ అంబానీలు, వేల కోట్ల రూపాయలతో 26 అంతస్థుల విలాసమైన నివాస భవనాన్ని కడుతున్నాడు. లక్ష్మీ మిట్టల్ లు లండన్ లో అత్యంత ఖరీదైన కాలనీలో అత్యంత విలువైన భవనాన్ని కొని అంతకంటే విలాసవంతంగా మెరుగులు దిద్దాడు. ‘ఇన్ని స్విమ్మింగ్ పుల్ లతో, ఇన్ని ఎస్క్ లేటర్లతో, ఇన్ని వేల కోట్లతో, ముఖేష్ అంబానీ ఇల్లు కడుతున్నాడంటూ’ ఈనాడు వంటి పత్రికలు వార్తాంశాలు వ్రాసాయి. తన ఇంటి పైభాగంలో హెలీపాడ్ నిర్మించుకొని, నేరుగా హెలికాప్టర్లతో తన కార్యాలయానికి చేరాలని కలలుగన్న ముఖేష్ కి, ముంబైలోని నేవీ అధికారులు ‘నో’ చెప్పారంటూ బాక్సు కట్టి మరీ వ్రాసేసారు.

ఆయా ధనికుల పట్ల ఈర్ష్యతోనో, అక్కసుతోనో ఇదంతా నేను వ్రాయటం లేదు. ప్రత్యక్షంగా కార్పోరేట్ మోసాలకు గురై అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విషయాలు ఇవి. కష్టపడి డబ్బు సంపాదించిన వాడు, దాన్ని ఆనందించకూడదని నేను ఆనటం లేదు. వేలమంది పాదచారులు నడుస్తూ కష్టపడుతుంటే ధనికులు కారుల్లో వెళ్లటం తప్పని నేను అనను. [అయితే అది ధర్మబద్దంగా సంపాదించిందా, చట్టబద్దంగా సంపాదించిందా? ప్రభుత్వమే ఈ కార్పోరేట్ల దోపిడికి అనుకూలంగా చట్టాలు సవరించి, కొత్తగా చట్టాలు చేసి మరీ వీలుకల్పిస్తున్న చోట, వీళ్ళ వ్యాపారాలు, సంపాదనలూ ఏపాటి ధర్మబద్దం, ఏపాటి న్యాయబద్దం?]

అయితే దేనికైనా ఒక పరిమితి ఉంటుందని అంటాను. "వరదొచ్చి ఓ ప్రక్క జనం అల్లాడుతుంటే, తిండి లేక పస్తులుంటే, నువ్వు పరమాన్నం తింటావా?" అంటే - ఈ ప్రపంచంలో ప్రతీరోజూ ఎక్కడో చోట.... వరదలో, కరువులో, భూకంపాలో, సునామీలో వస్తూనే ఉంటాయి. ఇక ఆ లెక్కన ఏ రోజూ, ఎవరూ, పరమాన్నం తినకూడదు. అలాంటి కుహనా భావవాదాన్ని [psudo idealism] ని నేను ప్రతిపాదించటం లేదు.

అయితే.... స్వార్దం, నిస్వార్ధం పాటించటంలో కూడా పరిమితులు ఉంటాయంటున్నాను. "ఈ దేశంలో, ఇందరు ఆకలితో, కూడు గూడు లేక అల్లాడుతుంటే.... హద్దులు లేనట్లుగా దొచుకుంటూ, అంత విలాసవంతమైన జీవితం గడపటం లో మానవత్వపు చిరునామా ఎక్కడ?" అనుకుంటాను. ఎంతగా హద్దులు లేకపోవటం అంటే ... ఆరుగురున్న కుటుంబానికి వేల కోట్ల రూపాయలతో 26 అంతస్థుల నివాస భవనం ఉండేంత! భార్యకు పడక గదులూ, వంట గదులున్న విలాసవంతమైన నౌకలూ, విమానాలూ కానుకలుగా ఇచ్చేంత!

అందునా ప్రభుత్వ సాయంతో, మీడియా సహకారంతో, అధికారుల అండదండలతో.... చమురు గ్యాస్ నిక్షేపాల వంటి ప్రకృతి వనరులని, గనులని కొల్ల గొడుతూ! ఇనుపగనులు గాలి సోదరుల గుత్తసొత్తు, చమురు అంబానీల అబ్బసొత్తూ అయిపోవటానికి.... ఈ దేశం గాలి సోదరులదీ, అంబానీ సోదరులదీ మాత్రమే అయిపోయిందా?

‘ఈ గడ్డ ఎవరి సొత్తు?’ అని ఆనాడు తెల్లతోలు వాళ్ళని నిలదీయగలిగారు గానీ, ఈనాడు నల్లతోలు కప్పుకున్న కార్పోరేటిజంని కళ్ళప్పగించి చూస్తున్నారు ప్రజలు! నిలదీసే నాయకత్వం ప్రతి గుండెలోనూ పుట్టాలి.

నాయకుడు ఆకాశం నుండి ఊడిపడడు. ప్రజా చైతన్యమే నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రతీ మనిషిలో తామసం నశించి, రజోగుణం రగిలితే, కార్పోరేటిజం... ఆ కార్చిచ్చులో కాలి బూడిదవుతుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

కప్పకాళ్ళు – కాఫీ టీ లు ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 08]

Thu, 06/17/2010 - 22:46
ఇప్పుడు ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో నడుస్తున్న మస్కిటో రిపెల్లెంట్ల వ్యాపారానికి, 30-35 సంవత్సరాల క్రితమే పునాదులు వేయబడ్డాయి. గత టపాలలో చెప్పిందే అయినా మరోసారి అది ప్రస్తావనార్హమే!

1975-80 లలో దేశంలో ఓ ప్రచారం హోరున ప్రాకింది. చైనీయులకి కప్పకాళ్ళతో చేసిన వంటకాలంటే ఎంతో ఇష్టమనీ, ఆరీత్యా మన దేశం నుండి చైనాకి కప్ప కాళ్ళు రహస్యంగా రవాణా అవుతున్నాయనీ! ఇలాంటి పుకార్లు పాకాయంటూ మీడియా, ఈ విషయానికి పరోక్ష ప్రచారం ఇచ్చింది. క్రమంగా ప్రత్యక్ష ప్రచారానికి దిగింది. [ఈ మధ్యకాలంలో ఆవేవో పాములు లక్షన్నర ధర పలికాయంటూ ఒక ప్రచారం వస్తోంది చూడండి, అలాగన్న మాట. ఆ ప్రచారపు ఆశతో జనాలు కనబడిన పాములనల్లా పట్టి చంపి అమ్మాలనుకుంటారు. వెరసి పాముల సంఖ్య తగ్గుతుంది.]

అడపాదడపా కప్పకాళ్ళలోడుతో ఉన్న లారీలు దేశంలో అక్కడా ఇక్కడా పట్టుబడ్డాయనే వార్తలు ప్రచురింపబడ్డాయి. కోల్ కతా[అప్పట్లో కలకత్తా]నుండి రోడ్డుమార్గం ద్వారా మియన్మార్ [అప్పట్లో బర్మా], బంగ్లా దేశ్ ల మీదుగా, చైనాకు కప్పకాళ్ళ దొంగరవాణా చేయబడుతున్నాయనే వార్తలు/పుకార్లు ప్రచారింపబడ్డాయి.

కమీషన్ పద్దతి తో కప్పకాళ్ళని కొనుగోలు చేసేందుకు ఏజంట్లు పల్లెలని అప్రోచ్ అవుతున్నారనీ, ఇదంతా చట్ట విరుద్దం గనకా, అడ్రసు గట్రాలు పైకి పొక్కకుండా పని చక్కబెట్టుకుంటున్నారనీ, కాబట్టి కమీషన్ ఏజంట్ల కోసం వెదకనవసరం లేకుండా వాళ్ళే గ్రామీణులని కలుసుకుంటున్నారనీ.... ఇలా రకరకాల ప్రచారాలు!

ఈ ప్రచారానికి హంగులద్దుతూ ‘ఎక్కడో ఎవరో’ ఇలాంటి వ్యాపారాలతో బాగా సంపాదించారనే వార్తలూ వినబడ్డాయి. నిజానికి దీని వెనక ఉన్నది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల తాలూకూ గూఢచర్యమే! కాబట్టే అలాంటి అసత్య వార్తలకు మీడియా ఇతోధికంగా ప్రచారం ఇచ్చింది. వార్తాంశాల శీర్షికలు ఎలా ఉన్నా... లోపల మాత్రం ‘ఇదంతా నిజమే సుమా! కప్పకాళ్ళని సేకరిస్తే ఒక్క దెబ్బతో పెద్ద మొత్తంలో డబ్బు కళ్ళ చూడవచ్చేమో’ అనిపించేలా వ్రాయబడ్డాయి. దానికి తోడు, కప్పకాళ్ళ లోడుతో పట్టుబడ్డ లారీల వార్తలు ఫోటోలతో సహా వచ్చాయి.

ఎవరు ఎవరికి రవాణా చేస్తున్నారో వివరాలు తెలియలేదంటూ ముక్తాయించబడ్డాయి. వీటికి మరింత బలం చేకూర్చేందుకు, నాలుగైదు లారీలను అలాంటి లోడులతో నింపి, పట్టుబడించే సంఘటనలని నిర్వహించగల గూఢచర్య సామర్ధ్యం గురించి గానీ, స్ట్రాటజీల గురించి గానీ, సామాన్యులకి అవగాహన ఉండదు కదా! ఆనాటి ప్రభుత్వానికీ, నిఘా సంస్థలకీ ఆత్మరక్షణకే అధిక సమయం సరిపోయేది. గూఢచర్య పరంగా బలహీన స్థితే కాదు, అయోమయ స్థితి కూడాను. దాంతో మీడియా మద్దతుతో నిర్వహింపబడిన ఈ స్ట్రాటజీ వెనక గల కుట్ర, గుట్టు చప్పుడు గాకుండా నడిపింపబడింది.

ఆనాటికి మీడియాని కుట్రలో భాగస్వామ్యంగా ఎవరూ కనీసం ఊహించను కూడా లేదు. ఊహించగలిగినా, నిరూపించలేని నిస్సహాయత కూడా ఉండేది. కాబట్టి యధేచ్ఛగానే, మీడియా ఈ కప్పకాళ్ళ ప్రచారాన్ని నిర్వహించింది. ఆనాటి పత్రికల ప్రచారాన్ని పరిశీలించినా, జ్ఞాపకం తెచ్చుకున్నా లేదా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నా ఈ విషయం మీకు మరింత స్పష్టపడగలదు.

ఇక, ఇంత పకడ్బందీగా ప్రచారాలు నడిచాక... కొంతమంది గ్రామీణులు దురాశతోనూ, వేరెవ్వరో తెగ డబ్బు సంపాదించారన్న భ్రమతోనూ, కాల్వల్లోనూ, మురుగు గుంటలలోనూ బ్రతికే కప్పల్ని వెదికి వేటాడి చంపారు. నగరాలు, పట్టణాల్లో కప్పల బెకబెక కర్ణకఠోరంగా ఉందన్న ఏహ్యత... ఒక దశలో అదో ట్రెండ్ గా మారింది. ఫలితంగా మురుగు నీటి గుంటల్లో రసాయనాలు కలిపి మరీ కప్పల్ని చంపారు.

పల్లెల్లో గ్రామీణుల కప్ప కాళ్ళ వ్యాపారం ఏమయ్యిందో ఎవరికీ తెలియదు గానీ, ఈ ప్రచారల ఒరవడి అంతా చల్లారాక.... కొన్నేళ్ళు గడిచే సరికి కప్పల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వర్షం కురిసిన రాత్రుల్లో కప్పల సంగీతం మూగబోయింది. అది గమనించక ముందే, దోమల బెడద పెరిగిపోయింది. దోమలకు ప్రకృతి సహజ శతృవులైన కప్పలు అంతరించటంతో, మురికి నీటిపై దోమల లార్వాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.

ఇంకేముంది? తిరిగి చూసేసరికి ఆల్ అవుట్, జెట్, టార్టాయిస్,కాస్పెర్.... గట్రా పేర్లతో మస్కిటో రిపెల్లెంట్లు మార్కెట్లో వెల్లువెత్తాయి.

పరిశీలించి చూస్తే... చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్యల ఇంటికి వెళ్ళి, ఆరుబయట మంచాలు వేసుకుని, చుక్కల్నీ చంద్రుణ్ణీ మబ్బుల సయ్యాటల్ని చూస్తూ, కబుర్లు చెప్పటం, అమ్మమ్మ తాతాయ్యల దగ్గర కథలు చెప్పించుకుంటూ నిద్రపోవటం.... ఇప్పుడు కష్ట సాధ్యం. అప్పుడు దోమల బెడద అంతగా ఉండేది కాదు. హాయిగా ఆరుబయట నిద్రపోయే వాళ్ళం. ఇప్పుడు? ఒక్క నిముషమైనా దోమల చేత ఇంజక్షన్లు పొడిపించుకోకుండా బయట గడపలేం!

ఇదేమాట మనం అంటే.... కుట్ర మద్దతుదారులూ, లేదా కుట్రదారుల చేత నియోగింపబడిన వాళ్ళు.... సుత్తి సిద్దాంతాలు చెబుతారు. "చెత్త పెరిగి దోమలు పెరిగాయనీ, దోమలకు రోగనిరోధక శక్తి పెరిగి పోతోందనీ, అందుకు సామాజిక శాస్త్రం ప్రకారం xyz కారణమనీ, లేదా xyz సిద్దాంతరీత్యా అంతేననీ!"

నిజానికి గత కాలంలోనూ మురికి గుంటలున్నాయి. పల్లెల్లో ఇళ్ళ ప్రక్కనే నైదిబ్బలూ, పశువుల పాకలూ కూడా ఉండేవి. అయినా ఇప్పటితో పోలిస్తే అప్పుడే దోమలు తక్కువ ఉండటమే ఇక్కడ వ్యాపార రహస్యం!

ఎందుకంటే - ఇప్పుడు కార్పోరేట్ వ్యాపారంలో గూఢచర్యం మిళితమైంది మరి! కాబట్టే... భవిష్యత్తులో అమలు జరపబోయే వ్యాపార వ్యూహాలకి పునాదుల వంటి కార్యాచరణ, దానికి మూడు నాలుగు దశాబ్దాల క్రితమే ఆచరణలోకి వస్తుంది. అంత ముందుగానే ప్రణాళికలు రచింపబడతాయి! ఇదే కార్పోరేటిజం!

నిజానికి ఈ కార్పోరేటిజం కి ఆద్యులు యూరోపియనులే! దానిలో యూరోపియనల నిర్ధయి కి, అమానుషత్వానికీ, గూఢచర్యాన్ని మిళితం చేసింది మాత్రం నకిలీ కణిక వ్యవస్థ! వివరంగా చెప్పాలంటే... ఒకప్పుడు యూరోపియనులు చేసే వ్యాపార దోపిడి పచ్చిగా ఉండేది. బహిరంగపడుతూ ఉండేది కూడా! నకిలీ కణిక వ్యవస్థ దానికి గూఢచర్యాన్ని జోడించాక, వ్యాపార దోపిడిలో ద్వంద్వాలు సృష్టించబడ్డాయి. దాంతో దోపిడికి పైకారణాలు [over leaf reasons] ఏర్పడ్డాయి.

దీనికి కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

భారత దేశంలో ఈస్టిండియా కంపెనీతో సహా విదేశీ కంపెనీలు, వ్యాపారం కోసం భారత దేశం రావటం గురించి మనం చరిత్రలో చదువుకున్నాం. 1498లో వాస్కోడగామా అనే పోర్చుగీసు నావికుడు, కేరళలోని కళ్ళి కోటని చేరటంతో, భారత దేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టాడు. అతడి వెనకే ఇతరులూ వచ్చారు. అప్పట్లో కొందరు యూరోపియనులే, ఈ నావికుల మీద జోకులు వేసేవాళ్ళు. నావికులని, ఆయా దేశాల రాజులు ఆర్దిక సాయం చేసి, కొత్త దీవులనీ, దేశాలకి మార్గాలనీ కనిపెట్టెందుకు ప్రోత్సహిస్తున్నప్పుడు... సదరు నావికుల గురించి "సముద్రపు దొంగల గుంపులు దోపిడికి బయలు దేరాయి" అనే వాళ్ళు.

ఆ ‘ఎరా’లో యూరోపియనులు ఏ ప్రాంతానికి వెళ్ళినా[ఆస్ట్రేలియా, ఆఫ్రికా గట్రా] ఆయా దేశాలలో అంటురోగాలు, కొత్త జబ్బులు స్థానికులలో ప్రబలాయట. దాంతో స్థానికులలో అధికులు దుర్బలయ్యేవాళ్ళు. మరి కొందరు మరణించే వాళ్ళు. దాంతో పెద్దగా ప్రతిఘటన లేకుండానే, ఆ ప్రాంతాన్ని ఈ యూరప్ కంపెనీల వాళ్ళు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఒక రకంగా చోటు ఖాళీ చేయించటం వంటిది. [ఆ పనిని ఇప్పుడు టెర్రరిజంతో చేస్తున్నారు. కాశ్మీరు, పాకిస్తాన్, ఆఫ్గాన్ లో లాగా!]

దానికి తోడు, అప్పట్లో ఆయా దేశాలలోని స్థానికుల దగ్గర ఆయుధాలు కత్తి డాలు, బాణాల వంటివే. యూరోపియన్ వ్యాపార దొంగల దగ్గర తుపాకులూ, మందుగుండూ ఉన్నాయి.

అప్పట్లో అయితే స్థానికులలో అంటురోగాలు ప్రబలటానికి కారణాలు, పాపం అప్పటి ప్రజలకి తెలియదు గానీ, ఆనాటి యూరోపియన్ కంపెనీల అమానుషత్వం తెలిసిన మనం ఆ కారణాలని ఊహించగలం కదా! ఆనాటి యూరోపియన్ కంపెనీల వారసులే నేటి కార్పోరేట్ కంపెనీలు! నిజానికి ఇప్పటికి అమెరికా వంటి దేశాలలో కార్పోరేట్ దిగ్గజాల మూలాలు ఇంగ్లండులో ఉన్నాయి. ఎన్నో కంపెనీల వేళ్ళు లండన్ లోనే కూరుకున్నాయి.

ఇంత నలుపు తమ క్రింద ఉంచుకుని, గురివింద గింజల వంటి ఈ యూరోపియన్ దేశాలు, ఇప్పుడు మానవ హక్కులంటూ గర్జించటం ఎంత హాస్యాస్పదం!?

సరే! ఇలా అంటు రోగాలు సృష్టించీ, ఆయుధాలు ప్రయోగించీ... వలస రాజ్యాలు స్థాపించారు. వాళ్ళు చేసిన వ్యాపార నిర్వాకం ఎంత మోసపూరితమంటే.... అప్పట్లో మన దేశంలో రైతులు, పొద్దునే చద్దన్నంలో పెరుగు వేసుకుని ఊరగాయో, ఉల్లిపాయో నంజుకుని తినేసి, పొలం బాట పట్టేవాళ్ళు. అంత కఠోరశ్రమకి పెరుగన్నం అయితేనే నిలదొక్కు కోగలరు మరి!

అలా పొలాలకి వెళ్ళే రైతులకి, కూడళ్ళలో నిలబడి, గ్రామీణులకి విచిత్రంగా కనిపించే వేష భాషలతో యూరోపియన్ వ్యాపారులు ‘టీ’ ఆఫర్ చేసే వారట. చాలా రోజులు రైతులు స్పందించకపోయినా, ప్రతీరోజూ చూస్తే ఓ కుతుహలం వస్తుంది కదా! పదే పదే అదే ప్రచారం అన్న స్ట్రాటజీ అది! దానికే నకిలీ కణిక వ్యవస్థ మరింత మెరుగులు దిద్దింది.

కుతూహలం కొద్దీ కొన్నాళ్ళకి, కొందరు రైతులు టీ రుచి చూడటానికి ముందుకు వచ్చారు. ఎటూ ఉచితమే కదా! నాలుగు రోజులు వరసగా తాగితే, యాంత్రికంగా మరోసారి తాగాలనిపించటం టీ కాఫీలకి సహజం. లేకుంటే తలనొప్పి రావటం కద్దు. అందునా దానికి కొంచెం నల్లమందును కూడా తగిలిస్తే... ఇక వినియోగదారుడు కాస్తా వ్యసనపరుడు కావటం ఖాయం. టీ, కాఫీ, చాక్ లెట్, శీతల పానీయాలని మార్కెట్టలో ప్రవేశపెట్టిన తొలినాళ్ళలో, నల్లమందు కలిపారని, ఆయా సమయల్లో వదంతులు[?] వినబడటం, ఒకోసారి నిర్దారణ కావటమూ కూడా జరిగాయి.

ఏమైతేనేం... మెల్లిగా జనాలు అలవాటు పడ్డాక, ఉచితాలు ఎత్తివేయబడి ‘వెల’ అడగటం ప్రారంభమౌతుంది. ఉచితంగ పంపిణీ చేయటం అన్నది కూడా పెట్టుబడిలో ఓ భాగంగా లెక్కలేసుకుని, తమ ఉత్పత్తిని విక్రయించటమే ఇక్కడ స్ట్రాటజీ!

ముందు ఉచితం.
క్రమంగా అలవాటు!
ఆపైన వ్యసనం!!
ఇదే కార్పోరేట్ సూత్రం!!!

ఒక చమత్కారాన్ని చెప్పి ఈ టపా ముగిస్తాను.

గుబ్బిలాల గుంపుని ఇంగ్లీషులో ‘కాలనీ’ అంటారట.
బ్రిటీష్ వాళ్ల వలస రాజ్యాలని కూడా కాలనీలనే అంటారు. ఔచిత్య ప్రయోగం అంటే ఇదేనేమో!

చిలుకల సముహన్ని ‘కంపెనీ’ అంటారట. ఒకప్పుడు వేశ్యా గృహన్ని ‘కంపెనీ’ అనేవాళ్ళు. ఇప్పుడూ అదే పేరు!
కార్పోరేట్ వ్యాపార సంస్థల్ని కూడా కంపెనీలనే అనటం చమత్కారమే!

కోతుల గుంపుని ‘ట్రూప్’ అంటారట.
నాట్య కళాకారుల గుంపుని డాన్స్ ట్రూప్ అనీ, నాటక బృందాన్ని డ్రామా ట్రూప్ అనే అనటం ఆ కళాకారులని గౌరవించటమా, వెక్కిరించటమా!
ఇంగ్లీషు వాళ్లకే తెలియాలి.

గుడ్లగూబల గుంపుని ‘పార్లమెంట్’ అంటారట.
ఇది మాత్రం బహుచక్కని పేరే!
ప్రజాస్వామ్యం సాక్షిగా... ఏ దేశంలోనైనా ప్రస్తుతం పార్లమెంటులలో ఉన్నది గుడ్ల గూబలే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

ఉల్లిపాయలు – ముంగారు మొలకలు – ఈగా, మజాకా !? [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 07]

Wed, 06/16/2010 - 22:52
తమ అనుయాయూలైన కార్పోరేట్ కంపెనీలకు, ఇబ్బడిముబ్బడిగా వ్యాపారావకాశాలు ఇచ్చేటందుకు, నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య వలయం సృష్టించే కృత్రిమ వస్తు కొఱత గురించి పరిశీలిస్తే...

గత టపాలో వివరించిన, సిమెంట్ తయారీదారుల సిండికేట్ ఒక ఉదాహరణ! ప్రయత్నపూర్వకంగా, ఉమ్మడిగా, ఉత్పత్తి తగ్గించి, మార్కెట్టులో కృత్రిమంగా కొరత సృష్టిస్తారు. సహజంగానే లభ్యత తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కదా! ఇక నల్లబజారు విక్రయాలకి హద్దుండదు. సంబంధిత శాఖ అధికారులూ, మంత్రులూ, ఇతర రాజకీయ నాయకులందరూ ప్రేక్షక మాత్రులే!

తెర వెనక ఎంతగా లంచాలు గుమ్మరించారో గానీ, తెర మీద, సిమెంట్ సిండికేట్, సాక్షాత్తూ ప్రభుత్వాన్ని... సిమెంట్ ధర పెంచుకోవటానికి అనుమతించటంతో పాటు, తమ ఇతర కోరికలు అంగీకరించకపోతే, ఉత్పత్తి ఆపి వేస్తామని బాహాటంగా బెదిరింపు [అల్టిమేటమ్] ఇచ్చారు. ఇదంతా 2008లో వార్తాపత్రికల ప్రధాన శీర్షికల సాక్షిగా జరిగిందే!

రాష్ట్రంలో ఉల్లి వ్యాపారుల వ్యవహారం మరో ఉదాహరణ! రైతుల నుండి ఉల్లి పంటని కోనే కమీషన్ వ్యాపారులు వీళ్ళు. అక్రమంగా ఉల్లి నిల్వలు చేసి మార్కెట్టులో కొరత సృష్టించారు. తర్వాత చేసేది ఉల్లి ధర అమాంతం పెంచటమే! అంతా ఏకఛత్రాధిపత్యమే![Monopoly] ఇది అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.

ఎనిమిది తొమ్మిదేళ్ళ క్రితం, అంటే 2001, 2002 లలో, తెదేపా అధికారంలో ఉన్నప్పుడు, మీడియా తొలిపేజీ వార్తలుగా ఈ విషయం ప్రకటింపబడింది. కర్నూలుకు చెందిన కేవలం ఆరుగురు ఉల్లి కమీషన్ [ఉల్లి] వ్యాపారులు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉల్లి మార్కెట్ ని నియంత్రిస్తున్నారని, ఈనాడు పెద్ద అక్షరాలలో వ్రాసింది కూడా! అప్పట్లో ఉల్లిధర చాలా ఎక్కువగా ఉండింది.

యధాప్రకారం, ప్రభుత్వం[నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు] సదరు కమీషన్ వ్యాపారులని గానీ, వాళ్ళ వ్యాపారాన్ని గానీ నియంత్రించ లేదు. నియంత్రించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. మీడియా కూడా, వార్తలు వ్రాసిందే తప్ప, ప్రభుత్వం ఆ దిశలో పనిచేసేటట్లుగా ఒత్తిడి చెయ్యలేదు.

కేవలం, సదరు ఉల్లి వ్యాపారుల గురించి ప్రొజెక్ట్ మాత్రమే చేసింది. ఆ వార్తల్లో... `ఉల్లి అక్రమ వ్యాపారం, దందా' ఎలా నడుస్తుందో, కేవలం ఆరుగురితో కూడిన ఉల్లి సిండికేట్ ఎంత శక్తివంతమైనదో, వాళ్ల ముందు ప్రభుత్వం ఎంత ఆశక్తమైనదో, వాళ్ళ లంచగొండి వ్యాపారం ఎంత బలమైనదో, చదువరుల బుర్రలకి ఇంకేంత చక్కగా వ్రాయబడింది.

ఆ విధంగా... జయప్రదంగా, వ్యూహాత్మకంగా... చెడు బలమైనదనీ, సమాజంలో చెడే ఉందనీ, చెడ్డవాడే బాగుపడగలుగుతున్నాడనీ, ప్రభుత్వం ఏమీ చెయ్యలేదనీ, మంత్రులూ అధికారులూ కూడా లంచాలతో మునిగి తేలుతూ ఏదీ పట్టించుకోవటం లేదనీ, ప్రజలకి ఇంకించే ప్రయత్నం కొనసాగించబడింది.

‘కాబట్టి ఇవాళ్ళా రేపూ అవినీతిదే రాజ్యం, డబ్బు సంపాదనే లక్ష్యం! డబ్బున్న వాడు ఏంచేసినా చెల్లుతుంది. అక్రమాలు బయటపడినా ప్రమాదం ఏమీ లేదు, పైగా పేపర్లో పడి పరపతి పెరుగుతుంది’ అన్నట్లు పరిస్థితి తయారయ్యింది.

ఈ విధంగా ప్రజా దృక్పధాన్ని ప్రభావపరిచే ఏ అవకాశాన్నీ మీడియా వదులుకోదు కదా?

మరో ఉదాహరణ రైతులకి విత్తనాల పంపిణీ! ఇవన్నీ పీరియాడికల్ గా సంభవించే వ్యవహారాలన్న మాట. ప్రతీ సంవత్సరం తిరిగి తిరిగీ సంభవిస్తూనే ఉంటాయి. కార్పోరేట్, ప్రైవేట్ విత్తన కంపెనీలు, వీలయినంత గరిష్ఠ స్థాయిలో రైతులను దగా చేస్తూనే ఉన్నాయి.

విత్తన కంపెనీల వాణిజ్య ప్రకటనలు రైతులని ఆకర్షిస్తాయి. వాళ్ళ ప్రచార క్యాంపెయిన్లు రైతులని ఆకర్షిస్తాయి. కానీ వాళ్ళ విత్తనాలు మాత్రం రైతులని కుప్పకూలుస్తాయి. ఒకోసారి విత్తనాలు మొలకెత్తవు. ఒకోసారి మొలకలొస్తాయి, మొక్కలు బలంగా, ఏపుగా పెరుగుతాయి, కానీ కాయవు. గొడ్డుమోతు మొక్కల్లా పొలం నిండా నిలబడతాయి. ప్రభుత్వం, మీడియా పాత్రలు ఇందులో కూడా యధాతధం!

ఈ కార్పోరేట్ విత్తన కంపెనీలు రాక ముందు, ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేయటం మొదలు పెట్టక ముందు, పూర్వకాలం రైతులు ఏం చేసే వాళ్ళో ఈనాటి యువరైతులకి, నడి వయస్సు రైతులకీ, తెలియను కూడా తెలియదు. తరం నుండి తరానికి సంక్రమించాల్సిన వారసత్వ వాస్తవ విజ్ఞానధార, వ్యవహార జ్ఞానధార, ఎప్పుడో రెండు తరాల క్రితమే సన్నగిల్లింది. క్రమంగా అంతరించింది. ఇన్ స్టంట్ పుడ్ లాంటి ఇన్ స్టంట్ వ్యవహారాలకి అలవాటుపడ్డారు, పడుతున్నారు.

మొదట్లో ‘మన రైతులది మూర్ఖత్వమనీ, పాతరాతి యుగపు వ్యవసాయమనీ, ఆధునిక పద్దతులు తెలియవనీ, కాబట్టే దిగుబడి ఎక్కువగా సాధించలేక పోతున్నారనీ’ ఊదర బెట్టబడింది. ‘వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, ఆధునిక వ్యవసాయ జ్ఞానం పాటించాలి’ అంటూ హోరెత్తించబడింది. మొదట్లో కొందరు శాస్త్రవేత్తలు నిజాయితీగా రైతు శ్రేయస్సు కోరి పని చేసారు.

తర్వత్తర్వాత, లంచగొండులు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వరదలా ప్రవేశించటంతో, ఆ ఒరవడిలో ఈ నిజాయితీ పరులు ఎప్పుడో గల్లంతయి పోయారు. ఇప్పుడు అక్కడక్కడా మిగిలి ఉన్నారు. ఇదే స్థితి ఏ ప్రభుత్వ యంత్రంగానిదైనా.

ఇక ఈ స్థితి వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు..... క్రమంగా ఉన్న స్థితిని ధ్వంసం చేయవచ్చు. ఆధునిక వ్యవసాయ జ్ఞానాన్ని టాంపర్ చేస్తే సరి! మొత్తంగా దేశంలో... వ్యవసాయ రంగంలో నైపుణ్యాలు, వాస్తవిక జ్ఞానం పులుసులో కలిసిపోతుంది. అదే జరిగింది.

చిన్న ఉదాహరణ గమనించండి. సామాజిక అడవుల పేరిట, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు ఇచ్చిన సలహాల ప్రకారం, సరుగుడు చెట్లు పెంచబడ్డాయి. వాటితో పాటు సుబాబుల్ కూడా! ముఖ్యంగా సర్వి చెట్లు/యూకలిప్టస్ చెట్లు! ఎవరైనా ధనవంతులు, ఊరు చివర భూములు కొన్నప్పుడు కూడా.... ఊరు పెరిగి వాటికి ధర పెరిగే వరకూ వేచి ఉండాల్సి వచ్చినప్పుడు... అవి దురాక్రమణలకు గురి కాకుండా ఉండేందుకు, సామాజిక అడవులు అంటూ సర్వి, యూకలిప్టస్ గట్రా చెట్లు పెంచారు. [వాచ్ మెన్ లని నియమించుకుని భూముల్ని కాపాడుకోవటం ఖర్చుతో కూడుకున్నది.] అందుమూలంగా చాలా లాభాలుంటాయంటూ దూరదర్శన్, ఆకాశవాణి వ్యవసాయదారుల కార్యక్రమాలలో కూడా చెప్పబడింది.

అయితే.... సర్వి చెట్లు, యూకలిప్టస్ చెట్లతో కలప, ఔషధ ప్రయోజలుండవచ్చుగాక, కానీ, వాటి మూలంగా భూగర్భ నీటి నిల్యలు పడిపోతాయనీ, ఈ దుష్పరిణామం ఇటీవలే గుర్తించబడిందనీ 1992 లో డీడీ వార్తల్లో చూశాను. అవి మేము గూఢచర్యం గురించి ‘అ ఆ’ లు తెలుసుకుంటున్న రోజులు.

సదరు ఊరి చివరి బీడు భూముల్లో సర్వి, యూకలిప్టస్ ల బదులు మరేవైనా చెట్లు పెంచుకోవచ్చు. అదీ భూగర్భ జనవనరులని దెబ్బతీయని చెట్లని! సామాజిక అడవుల పేరుతో... సర్వి, యూకలిప్టస్ చెట్లని పెంచితే వచ్చే ‘సత్ర్పయోజనాలు, దుష్పయోజనాలని’ పరిశీలిస్తే... వచ్చే లాభం [కలప, ఔషధ తయారీ] తక్కువ, పోయే నష్టం ఎక్కువ! భూగర్భ జలాలు అడుగంటితే, దశాబ్దాల తర్వాత వచ్చేది దారుణ క్షామమే!

ఇప్పుడు గమనించి చూడండి. ఒకప్పుడు బస్సులో ప్రయాణిస్తూ, కిటికీ నుండి చూస్తుంటే, చాలా చోట్ల సరుగుడు, యూకలిప్టస్ చెట్లతో నిండిన స్థలాలు కన్పించేవి. ఇప్పుడవి నామమాత్రంగా కనిపిస్తాయి.

ఈ విషయంలో... గతంలో ప్రభుత్వమే ప్రజలకి, రైతులకి... ‘బీడు నేలల్లో ఖాళీ భూముల్లో సరుగుడు, యూకలిప్టస్, సూబాబుల్ పెంచమంటూ’ సలహాలిచ్చే విధంగా... మొత్తం జాతినే Misguide చేయటం... నకిలీ కణికుల కుట్రలో భాగమే! అదే స్థితి కొనసాగి ఉంటే, ఇప్పటి కంటే తీవ్రమైన నీటి యెద్దడిని, ఈ పాటికే అనుభవిస్తూ ఉండేవాళ్ళం.

ఇలాంటి చాలా విషయాల్లో, నకిలీ కణికులు అప్పటి వరకూ [1992 వరకూ] ప్రజల దృష్టికి రాకుండానే నెరవేర్చుకుంటూ వెళ్ళిన కుట్ర కోణాలని, అదే విధంగా పీవీజీ, ఆయన సమీకరించిన నెం.5 వర్గం, ప్రజల దృష్టికి రాకుండానే ఛేదించుకుంటూ నడిపిస్తున్నారు.

వాస్తవిక వ్యవహార జ్ఞానం, తరం నుండి తరానికి సంక్రమించ వలసిన అనుభవ సారం, అనుశృతంగా నడవకుండా, ధ్వంసం చేయటమే పరమావధిగా.... నకిలీ కణిక వ్యవస్థ పనిచేసింది. ఇందుకు మరో ఉదాహరణ పరిశీలించండి.

ఇటీవల వృద్ద రైతులు ఒకరు చెప్పగా వార్తపత్రికలో ఓ మూల అప్రాధాన్యా వార్తగా వచ్చిన అంశం ఇది. ఆ వృద్ద రైతులు, వ్యవసాయంలో దిట్టలు, జ్ఞానులు. క్రింది వార్తాంశాన్ని పరిశీలించండి.

[>>>రైతుల మేథస్సుకు భద్రతసాగు మెలకువల రక్షణకు సాఫ్ట్‌వేర్‌ఐఐటీ, బయో డై వర్సిటీ బోర్డు సంకల్పంకోచి, అక్టోబర్‌ 6:
'ముంగారు మొలక' అంటే తెలుసా? మీకే కాదు... నేటితరం రైతుల్లో చాలామందికి తెలియకపోవచ్చు! వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది? విత్తనాలు ఎప్పుడు వేయాలి? ఇలాంటి విషయాలపై ముందే అంచనాకు వచ్చేందుకు పాతకాలం రైతులు చేసే ప్రయోగమిది.
సరిగ్గా ఉగాది రోజున పూచే ఈ మొలకకు వచ్చే పువ్వుల సంఖ్యను బట్టి, రైతులు వర్షాకాలంపై అంచనాకు వస్తారు. అంటే.. సీజన్‌ ప్రారంభానికి మూడు నెలల ముందే, వానలపై రైతులు అవగాహన పెంచుకుంటారు. ఇది పాతతరం రైతులకు మాత్రమే తెలిసిన కిటుకు.
ఇలాంటి సంప్రదాయ సాగు విజ్ఞానం మన రాష్ట్ర రైతుల్లో అపారం. ఇలాంటి మెలకువలను భద్రపరిచి భవిష్యత్‌ తరాలకు అందించేందుకు, ఇతరులు కాపీ కొట్టకుండా పేటెంట్‌ సాధించేందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ తయారవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ప్రత్యేకం.
ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌ బయో డైవర్సిటీ బోర్డు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సాగులో పాటించే మెలకువలను ఆయా రైతులతోనే చెప్పిస్తారు. ఈ వివరాలతో ఆడియో - వీడియో టేపులు తయారు చేస్తారు. వీటిని ఆంగ్లంలోకి అనువదిస్తారు.
అంతర్జాతీయ మేథోసంపత్తి హక్కుల సంస్థ వెబ్‌సైట్‌కు అప్‌లింక్‌ చేసి... పేటెంట్‌ పొందుతారని రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు కార్యదర్శి బీజీ రమణ మూర్తి తెలిపారు. ఈ ఏడాది ఉగాది పర్వదినం రోజునే ఈ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. కేరళలోని కొచ్చిలో ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడాడుతూ "ముంగారు మొలకపై తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా పరిశోధనలు సాగిస్తోంది.
ఈ మొలక సరిగ్గా ఉగాదిరోజే పూస్తుందని రుజువైంది. గ్రామ పంచాయతీల స్థాయిలో 12వేలు, మండలాల స్థాయిలో 1100, జిల్లాల స్థాయిలో 28 జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలను నియమించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం'' అని వివరించారు. బహుళ జాతి కంపెనీల దాడి నుంచి సాంప్రదాయ సాగు పద్ధతులను కాపాడేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ]
ముంగారు మొలక నాటటం ద్వారా, మూడు నెలల ముందే ఆ సంవత్సరం వర్షాలు ఎలా కురుస్తాయో తెలుసుకోవటం లెక్క కట్టగలరు. ఒకప్పుడు ఇలాంటి వాటినే, ‘అదంతా ట్రాష్!’ అనీ ‘మూఢనమ్మకం’ అనీ ఆనాటి ఆధునిక శాస్త్రం అన్నది. చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలూ అదే అన్నారు.

నాలుగు దశాబ్దాల గడిచే సరికి, రైతు, రెంటికీ చెడ్డ రేవడైనాడు. తరాల నుండి సంక్రమించిన అనుభవ జ్ఞానమూ శూన్యమైంది. ఆధునిక వ్యవసాయ శాస్త్రం, ఆర్దిక శాస్త్రంతో కలిసి... మన్మోహన్ సింగ్ లూ, ఆహ్లు వాలియాలూ, చిదంబరాలు, ప్రణబ్ ల వంటి ఆర్దిక మేధావుల సాక్షిగా... రైతు బ్రతుకునే శూన్యం చేసింది.

ముంగారు మొలక ముడుచుకుపోయింది. బంగారు పంటలు పాటల్లోనూ, వాణిజ్య ప్రకటనల్లోనూ మాత్రమే మిగిలిపోయాయి.

కొసమెరుపు ఏమిటంటే - పైన ఉటంకించిన అనుభవజ్ఞానాన్నీ, ముంగారు మొలకకూ శాస్త్రీయత ఉందనీ ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించటమూ!

ఇక ఈ విషయాన్ని ఇంతటితో ఆపి ‘వ్యాపారం కోసం కృత్రిమంగా వస్తు కొరతలని సృష్టించటం’ దగ్గరికి తిరిగి వస్తాను.

గతంలో జరిగిన ఒక సంఘటన.

అవి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజులు! హఠాత్తుగా పిల్లలు పాలపొడి డబ్బాలకు కరువొచ్చింది. పాలడబ్బాలు... నెస్లే వంటి కార్పోరేట్ కంపెనీలు ఉత్పత్తి చేసేవి! హఠాత్తుగా, ఒక్కసారిగా, మీడియా ఈ విషయమై గగ్గోలు మొదలెట్టింది. వేడి వ్యాఖ్య ఏమిటంటే - "ఒక మహిళ పరిపాలిస్తున్న దేశంలో, పసిబిడ్డ తల్లులకు పిల్లల పాలపొడి డబ్బాలకు కూడా కరువొచ్చింది" అన్నది!

నా చిన్నప్పుడు జరిగిన ఈ సంఘటన నాకు బాగా గుర్తుంది. అప్పట్లో పెద్దలు మాట్లాడుకోవటం విన్నాను. మా నాన్న, ఇతరులతో చర్చిస్తూ "ఏమిటీ పాల డబ్బాల గోల? వేల ఏళ్ళుగా ఈ దేశంలో తల్లులు లేరా, పిల్లలు లేరా? తల్లిపాలకి ఏం లోటువచ్చిందని డబ్బాపాల గోల? సీసాతో పాలు పట్టేందుకైనా ఆవుల్లేవా, గేదేల్లేవా?" అంటూనూ, "అందం చెడుతుందని ఆడవాళ్ళు పిల్లలకు పాలివ్వడం మానేసారట. ఇదేం ఘోర కలి?" అంటూనూ అనుకోవటం విన్నాను.

అయితే ఈ తర్కాన్ని గానీ, సందేహాల్ని గానీ, డబ్బాపాల మోజుల గురించి గానీ, మీడియా మాట్లాడలేదు. మీడియాతో సహా ప్రతిపక్ష నాయకులు, కొందరు అధికార పక్ష నాయకులు కూడా, ఈ పాల డబ్బాల కొరత గురించి తగినంతగా గోల చేసారు. కొద్ది రోజుల తర్వాత ఇది పత్రికల ప్రధాన శీర్షికల నుండి ప్రక్కకి వెళ్ళిపోయింది. రాజకీయ నాయకులూ గమ్మున ఉండిపోయారు.

ఇక్కడ ఒక చిన్న స్ట్రాటజీ ఉంది. బాలింతలకు వాడే మందులలో, తల్లిపాలు[Brest Milk] తగ్గేటట్లుగా మందుల కాంబినేషన్ ఉన్న మందులను వాడిస్తే చాలు! బాలింతలు అనివార్యంగా పిల్లలకు డబ్బా పాలనే వాడతారు. ఆ కంపెనీలకి ఇబ్బడిముబ్బడిగా వ్యాపారం. ఆ పాల డబ్బాల ఉత్పత్తిని తగ్గిస్తే చాలు, పిల్లలకి పాల బాధలే కదా! ఈ వ్యాపార సూత్రం, కుట్రకోణం ఆనాటి ప్రజలకు తెలియదు. ఎందుకంటే - అంతంటి మోసాన్ని ఊహించాలంటేనే తప్పు చేస్తున్నామనే భావన ఉండేది. అన్నింటిలోనూ ఉండేది ‘మంచే’ అనుకోవాలనుకునే తత్త్వం!

నిజానికి స్వాతంత్ర సమరపు రోజులలోనూ, అంతకు ముందూ కూడా.... నకిలీ కణిక వ్యవస్థ, మనదేశం మీద పనిచేస్తూనే ఉంది. అయితే బ్రిటీషు వాళ్ళ వెనక దాక్కుంది! స్వాతంత్ర సమరం నాడు, స్వతంత్రం వచ్చాక... దేశంలో ఉన్న రాజకీయ నాయకులలో ఎక్కువమంది నిస్వార్ధపరులూ, దేశభక్తులూ ఉండటంతో... నకిలీ కణిక వ్యవస్థ యొక్క వ్యవహార సరళి, కుట్రతీరు కొంత తక్కువ వేగంతో ఉండేవి. మెల్లిగా నిజాయితీ పరులని తరిమేసారు.

ముఖ్యంగా ‘కోడలి’ నంటూ సోనియా ప్రధానమంత్రి ఇంట పాగా వేసాక, నమ్మకం పోగు చేసుకున్నాక... కుట్ర వేగం అన్యూహంగా పెరిగింది. ఇక ఇప్పుడు ఈ ఇటలీ మహిళ ప్రభుత్వ చోదక శక్తిగా అవతరించాక, కుట్ర వేగం అత్యధిక మవ్వటమే కాదు, బాహాటంగా కూడా పరిణమించింది. అప్పుడు పరోక్షం, ఇప్పుడు ప్రత్యక్షం. అంతే వ్యత్యాసం!

ఈ కుట్రలో భాగమే... పాల డబ్బాల కొరతల వంటివి. ఇవే కాదు, కొత్తగా అవసరాలు కూడా సృష్టిస్తారు. గత దశాబ్దాలలో... ‘చైనాలో గిరాకీ ఉందంటూ’ పల్లెల్లో పట్టణాల్లో కప్పల్ని హతమారిస్తే... ఇప్పుడు వేల కోట్ల రూపాయల కొద్దీ మస్కీటో రిపల్లెంట్ల వ్యాపారం నడుస్తోంది. దీని గురించి గత టపాలలో వివరించాను.

ఇక ఇప్పుడు చూడండి... All Out ఇక నుండి దోమల్ని తరమటం కోసమే కాదు, ఈగల్ని తరమటానికి కూడా పనికి వస్తుందట. ఇక కాచుకోండి! ఇబ్బడిముబ్బడిగా దోమలు పెరిగినట్లు, రోజు రోజుకీ దోమల ఇమ్యూనిటీ పెరిగి పోయినట్లు... ఇక నుండీ ఈగలు పెరుగుతాయి. ఇప్పటి దాకా రాత్రుళ్ళు మాత్రమే వాడబడుతున్న All Out వంటివి, ఇక నుండి పగలూ రాత్రీ వాడాలి కాబోలు! ఈగలూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. వాటికీ [ఇమ్యూనిటీ] రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతకంతకూ శక్తివంతమైన, ప్రభావ శీలమైన రిపల్లెంట్లు, మార్కెట్టులోకి వస్తాయి. అలాగే అలర్జీలు, అంతు తెలియని రోగాలు వస్తాయి.

‘ఈగా? మజాకా?’ - అనుకోవాల్సిందే మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

అప్పుడు ఆయుధాలు – ఇప్పుడు ఆరోగ్యాలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 06]

Mon, 06/14/2010 - 23:38
కొన్ని దశాబ్దాల క్రితం.... ఆయుధ తయారీ సంస్థలు, దేశాల మధ్య యుద్దాలు సృష్టించి, యుధ్ధభయాలను పుట్టించి ఆయుధాల వ్యాపారం చేసుకునేవన్నది ప్రకటిత సత్యం. దాని వెనక ఉన్నది నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్యమే!

అదే నెట్ వర్క్ .... ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా, రోగాలనీ, కృత్రిమ వస్తు కొరతలనీ, మోజులనీ, పర్యావరణ అసమతుల్యతనీ సృష్టించి సరికొత్త వ్యాపారాలు చేస్తోంది. ఎందులోనైనా అదే స్ట్రాటజీ! అదే కుట్ర! అదే గూఢచర్యం! నారద నీతికి విపర్యయం, కణిక నీతికి పర్యాయం!

ముందుగా రోగాల గురించి పరిశీలిద్దాం!

వైద్యరంగంలో నకిలీ కణికుల కుట్ర గురించి నా ఆంగ్ల బ్లాగు Coups on World లో Coup on Medicines and Medical Field అనే శీర్షిక క్రింద వివరించాను. ఇప్పుడు కేవలం నకిలీ కణిక వ్యవస్థ, కార్పోరేట్ కంపెనీల ద్వారా సమాజంలోకి ప్రవేశపెడుతున్న రుగ్మతలూ, ఇతర దుష్పరిణామాల గురించి వివరిస్తాను.

ఉదాహరణకి మార్కెట్టులో లభించే పళ్ళని తీసుకోండి. ఈ రోజు, అరెటిపళ్ళ మొదలు అన్నిరకాల ఫలాలు ‘కార్భైడ్’ అని పిలవ బడే రసాయన పదార్ధంతో కృత్రిమంగా మగ్గ వేస్తున్నారు. [Acetilene Gas ని ఉత్పత్తి చేసేందుకు బ్యాటరీ తయారీ రంగంలో ఈ కెమికల్ ని ఉపయోగిస్తారు.] ఒకప్పుడు వరిగడ్డి పరచిన గదిలో పళ్ళని, వారం పైగా నిల్వ ఉంచితే పళ్ళు మాగేవి. అందుకోసం ‘గదుల’ అద్దె ఎక్కువ అవుతుంది.

అదే..... రసాయనం ఉపయోగిస్తే, నాలుగు గంటలలో ఒకే గదిలో ఎన్నో ఫళ్ళు మాగపెట్టవచ్చు. రసాయనంతో ఆకర్షణీయమైన రంగులో పండినట్లుగా అవుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ పళ్ళని మాగేసి మార్కెట్టుకి పంపించేయవచ్చు. అవి తింటే దాదాపు నూటికి 80 మందికి అలర్జీలొస్తాయి. [ఉప్పునీటిలో కొన్ని నిముషాలు నానబెట్టి, ఆపైన కడిగి తింటే, కొంత వరకూ ఆ రసాయన దుష్పలితాన్ని అరికట్టవచ్చు.]

ఇప్పుడు మార్కెట్ లో లభించే పనస వంటి పళ్ళు తప్ప దాదాపు అన్నిరకాల పళ్ళు కార్భైడ్ తో, చక్కని రంగు సంతరించుకొని, వినియోగ దారులని ఆకర్షిస్తున్నవే! ఇలా పండించినవి త్వరగా కుళ్ళుతాయి. కార్భైడ్ తో మగ్గబెట్టిన పళ్ళని ఫ్రిజ్ లో పెట్టి చూడండి. పసుపు రంగులో మెరుస్తూ నోరూరించే మామిడిపళ్ళు కూడా, ఆకుపచ్చని కాయలుగా [అక్కడక్కడా పసుపు మచ్చలుంటాయి లెండి] మారిపోతాయి.

ఏ పళ్ళైనా, కార్బైడ్ తో మాగ పెట్టినవి తింటే.... కడుపునొప్పి, అలర్జీలు, ముఖంపైన చిన్న చిన్న గుల్లలు లేవటం వంటి బాధలు తప్పవు. దాంతో ఔషధాల[మందుల] వాడకమూ తప్పదు.

ఇలాంటి పళ్ళే కాదు, కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్ధాలు కూడా ఔషధ వ్యాపారాన్ని ఇతోధికంగా పెంచేవే! ఔషధాలలోనూ నకిలీ వి, నాణ్యత లేనివి, సైడ్ ఎఫెక్టులు కలిగించేవి ఎక్కువగా చలామణిలో ఉన్నాయి. కొత్త రోగాలు, రకరకాల రోగాలకు.. మందులు వాడతాం. వాటితో మరికొన్ని కొత్త బాధలు పుడతాయి. మళ్ళీ మందులు. మళ్ళీ కొత్త రోగాలు. ఇలా ఇదో చక్రం. ఒక దాని వెంట ఒకటి అనుసరించే వలయం. కావలసినంత వ్యాపారం.

నిజానికి ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న ఔషధాలలో అధిక శాతం విదేశాలలో నిషేధింపబడినవే! దుష్పలితాలినిస్తున్నాయనీ, రోగ నివారణ కంటే వ్యతిరేక ఫలితాలే ఎక్కువగా ఉన్నాయనీ నిర్దారింపబడినవే! చట్ట రీత్యా ఇబ్బందులు రాకుండా, చాక చక్యంగా, మూల పదార్ధాల కాంబినేషన్ ని మార్చి, పేర్లు మార్చి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. వీటి మీద ప్రభుత్వం కిమ్మనదు సరికదా, కార్పోరేట్ ఫార్మాస్యూటికల్ కంపెనీలకి, తమ ఔషధాలను విక్రయించుకునేందుకు తగినంత సహాయ సహకారలందిస్తుంది. మీడియా సరేసరి!

మైదా పిండికి రంగు రుచి వాసనలద్ది మందుబిళ్ళలంటూ, ఐదు పైసల ఖరీదు చెయ్యని వాటిని, మూడు రూపాయల యాభైపైసలకు అమ్ముతూ, విజయవాడ ఫార్మాస్యూటికల్స్ పట్టుబడినా.... నాలుగు రోజుల హడావుడీ తప్ప అన్నీ మామూలై పోయాయి. ఆ మందు ఖరీదు విషయంలో రోగి పడే దగా కంటే, మందులు వాడుతున్నామంటూ, రోగం తగ్గుతుందని ఆశపడుతూ, నమ్మకంతో వేచి చూస్తూ పడే దగా... ప్రాణాంతకమైనది. అయినా మీడియా గానీ, ప్రభుత్వం గానీ కిమ్మనదు.

పైగా... ఆయుర్వేదం, ప్రకృతి సహజ పదార్ధాలతో చికిత్స, గట్రాలని ఒకప్పుడు మీడియా బాగానే విమర్శించింది. వెక్కిరించింది. చెట్టు బెరళ్ళూ, వేళ్ళూ నూరుకు తాగుతారనీ, ఆకులు నములు తారనీ... గట్రా చెణుకులు ఆ ఔషధాల మీదా, ఔషధాలని వినియోగించే వారి మీదా వేసింది.

ఆయుర్వేదం గురించి పాజిటివ్ చెబుతున్నట్లు శీర్షికలున్నా, లోపల మాత్రం సదరు ఔషధాల వాసన, రుచి భరించటం కష్టం అనీ, జబ్బు తగ్గడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందనీ, పధ్యాలుండవలసి ఉంటుందనీ బాగా చెప్పబడింది. ఎంత బాగా అంటే - మనసుకి ఎక్కేటంతగా! క్రమంగా ఆయుర్వేద వైద్యం సమాజంలో బాగానే అంతరించింది.

మళ్ళీ ఈ ఒకటిన్నర దశాబ్దంలోనే, ఆయుర్వేద వైద్యం వాడకం గురించి బాగా వినబడుతోంది. గతంలో అయితే, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలల్లో ప్రభుత్వ వైద్యులు హాయిగా పనేం లేకుండా తీరికగా జీతాలు తీసుకునే వాళ్ళు. [శ్రీశైలంలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఉంది.]

ఇప్పుడు అవే ఆయుర్వేద ఔషధాలు, సౌందర్యోత్పత్తులూ, ఆయుర్వేద సబ్బులూ, కార్పోరేట్ కంపెనీలకు కాసులు కురిపిస్తున్నాయి. కలబంద కాస్తా అలోవెరా అయిపోతే కావాల్సినంత వ్యాపారం! కలబంద మొక్క వ్యాపారానికి పనికి రాకూడదనీ, కలబందకు ఆదరణ రాకూడదనీ నేను ఆనటం లేదు.

అదే కలబంద పొలం గట్ల మీద, తుప్పల్లో ఉన్నప్పుడు, దానికి ఏ గుర్తింపూ లేదు. ఎప్పుడైతే మీడియా దాన్ని అలోవెరా గా, అద్భుత సౌందర్య ఆరోగ్యదాయిని గా ప్రొజెక్ట్ చేసిందో, ఆ తర్వాత ఊపందుకున్న వాడకం, ఆపైన కార్పోరేట్ ల ప్రవేశం గురించి పరిశీలించమంటున్నాను. వాటి మధ్య కార్యకారణ సంబంధం చూడమంటున్నాను.

దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం నాటికి... క్రమంగా వంటింటి వైద్యం కూడా మూలబడింది. వంటింటి దినుసులతో జలుబూ, జ్వరం, చిన్నపాటి ఆరోగ్య ఇబ్బందులకి చేసే వైద్యం గురించిన పరిజ్ఞానం... క్రమంగా ఆనాటి వృద్దులకి పరిమితమై, అంతరించే దిశలో ఉండింది.

అదృష్టవశాత్తూ మళ్ళీ ఈ మధ్య కాలంలో, ఈ ఒకటిన్నర దశాబ్దాలలో.... వారపత్రికలలో, వార్తా పత్రిక మహిళల పేజీలలో మళ్ళీ చిట్కా వైద్యాలు దర్శనమిచ్చి, మళ్ళీ ఆ వారసత్వ వాస్తవిక జ్ఞానం సజీవ దిశ వైపుకు ప్రయాణిస్తోంది.

ఈ నేపధ్యంలో.... ఆసుపత్రులు కూడా ‘కార్పోరేట్’ అయిపోవటం అందరూ ఆహ్వానించిన, ఆనందించిన పరిణామం. ఆ ‘కార్పోరేట్’ ముసుగు మాటున ఉన్న అమానుష వ్యాపారం తెలియని అమాయకత్వంతో, మొదట్లో కార్పోరేట్ ఆసుపత్రులని చాలామంది ఆహ్వానించారు. వాటి రాకని ఆనందించారు.

కార్పోరేట్ ఆసుపత్రి వ్యాపార దోపిడి అనుభవంలోకి వచ్చాక గానీ.... తళతళలాడే కార్పోరేట్ ఆసుపత్రి భవనాలు, ఫెళఫెళ్ళాడే ఆసుపత్రి సిబ్బంది యూనిఫారంల లాగే ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయో, డాక్టర్లూ రిసెప్షనిస్టులూ నర్సులూ గట్రా సిబ్బంది నవ్వు ఎంత రమణీయంగా ఉంటుందో, అంతే నిర్ధాక్షిణ్య వ్యాపారం నడుస్తుందని అర్ధం కాలేదు.

ఈ విషయమై ప్రజలకి అవగాహన కలిగించటానికి బదులు, ప్రజల అవగాహనని కూడా ఏమారుస్తూ, ప్రభుత్వం.... ‘ఆరోగ్యశ్రీ’ లంటూ ఆకర్షణీయమైన పేర్లు పెట్టి, పేదలకి కార్పోరేట్ వైద్యం అందిస్తున్నామంటూ ప్రజాధనం కార్పోరేట్ ఆసుపత్రులకు ధారాదత్తం చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వటం, సిబ్బందిని నియమించటం, నిధులు మంజూరు చెయ్యటం ఎంచక్కా మరిచిపోతోంది, పోయింది.

నాయకులలో లేని సేవా తత్పరత, సిబ్బందికి ఎక్కడి నుండి వస్తుంది? ఒకప్పుడు ఉచితంగా, భరోసాతో పొందిన పెద్దాసుపత్రి సేవలు ఇప్పుడు గత చరిత్ర అయిపోయాయి. జలుబూ, జ్వరం లాంటి చిన్న జబ్బుల దగ్గరి నుండి గుండెజబ్బుల దాకా, ఉచిత వైద్యం మా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మా చిన్నప్పుడు లభించటం నాకు ప్రత్యక్షంగా తెలుసు!

ఇవేవీ మాట్లాడకుండా.... మంత్రులూ, ముఖ్యమంత్రులూ, ఇతర అధికారులూ ఆరోగ్యశ్రీ కార్డు పేరిట భారీ ప్రకటనలు గుప్పించి మరీ, కార్పోరేట్ ఆసుపత్రులకు ప్రతినిధుల్లా పనిచేసారు. [వై.యస్. మరణం తర్వాత టీవీ ప్రకటనల ఉధృతి కాస్త తగ్గింది లెండి.]

ఇక మీడియా ముసుగు వేసుకున్న కుట్రదారులు, జన బాహుళ్యంలో చిన్నపాటి జబ్బులకు కూడా ‘స్పెషలైజేషన్ చేసిన డాక్టరు చేతే వైద్యం చేయించుకోవటం మంచిది’ అనే భావాన్ని బలంగా ప్రవేశపెట్టారు. ఎంతో వ్యూహాత్మకంగా, సుదీర్ఘ కాలంగా, చాపక్రింద నీరులా పనిచేసి మరీ, ప్రజాదృక్పధాన్ని ప్రభావపరిచారు.

వైద్యం అన్నది ప్రాణాలకూ, శారీరక బాధకూ సంబంధించినది కావటంతో ఎవరూ రిస్క్ తీసుకోరు. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, గూఢచర్యాన్ని మిళితం చేసి అమలు చేసిన ఈ కుట్రలో, క్రమంగా MBBS డాక్టరు అర్దడాక్టరు గా మిగిలిపోయాడు. దాంతో M.S., MD వంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ , స్పెషలైజేషన్ చేయటం వైద్యవిద్యార్ధులకి అనివార్యమైంది.

ఇక ఊహించండి, కార్పోరేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో వైద్య విద్యకు ఎంత డిమాండ్ ఉంటుందో! అడ్డదారులలో ప్రవేశాలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. ఈ రోజు[15 జూన్, 2010] ఈనాడులో వచ్చిన గంగాధర్ రెడ్డి వార్తాంశమే దీనికి చక్కని ఉదాహరణ.

అంత ఖర్చుపెట్టి చదువుకు వచ్చిన తర్వాత సదరు వైద్య విద్యార్ధులు, ఎంత లేసి ఖరీదైన వైద్యం చేస్తే, తమ పెట్టుబడి తిరిగి పొందేట్లు? ఇక లాభాల సంగతేమిటి?

పరిశీలించండి. ప్రభుత్వాధికారంలో ఉన్న రాజకీయులూ, బ్యూరాక్రాట్లు, మీడియా ఎంతో అంతర్గత సహాయ సహకారాలతో, ప్రజలని మరింతగా దోపిడి చేయటానికి తగినట్లుగా చట్టాలు మారుస్తుంటారు, కొత్త చట్టాలు, జీవోలు తెస్తుంటారు. ప్రజా దోపిడిని నియంత్రించేందుకు ఉద్దేశించిన చట్టాల అమలును ప్రయత్నపూర్వకంగా నీరుగారుస్తుంటారు.

రెడ్ టేపిజం, లంచగొండితనం, అవినీతి, పైకారణాలుగా[over leaf reasonsగా] చెప్పబడుతూ, పెంచి పోషించబడుతుంటాయి. అంతర్గత కారణం ఒక్కటే!
గూఢచర్యం!
అది కుట్ర!
భారతదేశం మీద కుట్ర!
మానవత మీద కుట్ర!
కుట్రదారులు నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీ గట్రాలు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

తాగుడు వ్యసనపు విన్యాసం !

Sat, 06/12/2010 - 23:49
తాగుడు వ్యసనపు విన్యాసం ఒకదాన్ని, ఈ ఆదివారం పూట సరదాగా చదువుతారని....

ఇది నా బాల్యస్నేహితురాలు చెప్పిన వాస్తవ సంఘటన. వైద్యులైన నా మిత్రురాలు, ఆమె భర్త, ఖమ్మం జిల్లా మంధని దగ్గర పనిచేసేవాళ్ళు.

విశాఖ స్టీల్ ఫ్లాంటు కనుకుంటా, అక్కడి నుండి ఇనుప ఖనిజం వెళ్ళేది. ఒకసారి, నెల ఒకటో తారీఖున, అందరికీ జీతాలు వచ్చాయి. ఆ నెలలో కొత్తనోట్లు పంపిణీ చేయబడ్డాయట. వాళ్ళ కాంపౌండర్ కూడా జీతం తీసుకున్నాడు. అప్పటికి అతడికి ప్రభుత్వం ఇస్తున్న జీతం మూడు వేలు. 30 వంద నోట్లు. ఫెళ ఫెళ్ళాడుతున్నాయి.

ఆ రోజు అతడి భార్య ఊళ్ళో లేదట. ఓ వందపెట్టి ఈ కాంపౌండర్ పూటుగా తాగేసాడు. ఇంటికెళ్ళి, పక్కనే కట్టేసి ఉన్న గేదె ప్రక్కన కూర్చుని, మత్తులో ఊగుతూ, జేబులో నుండి ఒకో వంద నోటు తీసి గేదెకి ప్రేమగా తినిపించేసాడు. "తినమ్మా తిను! నా బంగారు తల్లీ, తిను! నా బుజ్జి కన్నా, తిను!" అంటూ.... ఒకో నోటు దాని నోటి కందించాడట.

గేదె కూడా, పచ్చగడ్డి వదిలేసి ఇతడందించిన పచ్చనోట్లని పరపరలాడించేసింది. ‘అందరూ ఈ నోట్ల కోసమే కదా అన్ని తంటాలు పడుతున్నారు, చూద్దాం ఇవెంత రుచిగా ఉంటాయో?’ అనుకుందో, ‘అందరూ గడ్డికరుస్తారు అంటారు కదా, నేను నోట్లు కరుస్తాను!’ అనుకుందో, ‘ఇంత ప్రేమగా తినిపిస్తున్నాడు కదా’ అనుకుందో గాని, ఎంచక్కా తినేసింది.

చుట్టుప్రక్కల వాళ్ళు చూసేసరికే చివరి నోట్లు తినిపిస్తున్నాడట. వాళ్ళు ‘వద్దురా’ అని పక్కకి లాగబోతే, బండబూతులు తిట్టి వీరంగం చేసాడట. మర్నాడు ఉదయం, ఊరి నుండి ఇంటి కొచ్చిన అతడి భార్య నెత్తీ నోరు బాదుకుని ఏడ్చి, అతణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందట.

మత్తు దిగాక అతడూ, నెల జీతం మొత్తం గేదెకి తినిపించినందుకు బావురుమన్నాడట. దాదాపు రెండు దశాబ్దాల క్రితపు సంఘటన ఇది. అప్పటికి మూడు వేలంటే - నెలంతా ఓ సగటు మానవుడి ఇల్లు హాయిగా గడిచిపోయేంత మొత్తమే.

ఏడుపు తగ్గాక, పోయి, గేదెని నాలుగు బాదాడట. చుట్టుప్రక్కల వాళ్ళు "రాత్రి తాగిన మత్తులో దాన్ని బ్రతిమాలి నోట్లు తినిపించి, ఇప్పుడు చావబాదితే ఏం లాభం? గేదె చచ్చిందంటే మరింత నష్టం!" అనేసరికి చతికిలబడ్డాడు.

నెలంతా దాని పేడ ఎత్తుతూ... ఏడుస్తూ.... తిట్టుకుంటూ....!

తర్వాత నుండి, జీతం అతడి భార్య చేతికి ఇచ్చే ఏర్పాటు చేశారని చెప్పింది నా స్నేహితురాలు.

ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే నవ్వొస్తుంటుంది.

కొసమెరుపేమిటంటే : ‘అంత బాధపడ్డాడు, గేదెని తిట్టాడు, తన్నాడు గానీ, తన తాగుడు వల్లనే కదా అని మద్యాన్ని గానీ, ఆ అలవాటును గానీ, తనని తాను గానీ తిట్టుకోలేదు’ అని నా స్నేహితురాలు అన్నది. నిజమే! వ్యసనపరులయితే ఇంతేనేమో!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

సిమెంట్ సిండికేట్ – మీడియా సహకారం! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 05]

Sat, 06/12/2010 - 04:37
ఏదైనా ఒక కార్పోరేట్ కంపెనీ తాలూకూ ఉత్పత్తి, మార్కెట్లోకి ప్రవేశపెట్టబడినప్పుడు, సదరు కార్పోరేట్ కంపెనీల మధ్య ఉన్న నెట్ వర్క్ రీత్యా నడిచే, పరస్పర సహాయ సహకారాలని గమనిస్తే.... తెలుగులో మన పెద్దలు చెప్పిన ‘దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారన్న’ సామెత చక్కగా సరి పోలుతుంది.

ఇప్పటికే, కంటికి కనిపిస్తూ, దందాగిరి చేసే నేరస్తులూ, రియల్ ఎస్టేట్ మాఫియా గట్రలు, వాళ్ళల్లో వాళ్ళు ప్రదేశాలని పంచుకోవటం, ‘మీటింగు’లు పెట్టుకుని అగ్రిమెంట్లు సెటిల్ మెంట్లూ చేసుకోవటం, బెదిరించి భయపెట్టి చావగొట్టి ప్రజల నుండి పైసలు వసూలు చేసుకోవటం, చూస్తూనే ఉన్నాము. చివరికి ముష్టి ఎత్తుకునే బిచ్చగాళ్ళు కూడా, కాలనీలని పంచుకుంటారని విని ఉన్నాము. అసలు ముష్టి వాళ్ళని కూడా నియంత్రిస్తూ, వాళ్ళ దగ్గర మామూళ్ళు వసూలు చేసుకోవటం వంటి చర్యలకు పాల్పడే నేరవ్యవస్థ ఉందని కూడా వినబడుతుంది.

కార్పోరేట్ కంపెనీల తెరచాటున ఉంది కూడా అదే మాఫియా! మామూలు నేరగాళ్ళు కత్తులూ, తుపాకులూ పట్టుకు తిరిగితే... కార్పోరేట్ కంపెనీల అధినేతలూ, సీఈవో వంటి అధికారులూ, సూట్లేసుకు తిరుగుతారు.

పరిశీలించి చూస్తే.... వేల, లక్షల కోట్ల రూపాయల టర్నోవరు కలిగిన కార్పోరేట్ కంపెనీలు, ఒక నెట్ వర్క్ కలిగి ఉండటం ఎలా సాధ్యం? అందునా కొన్ని నియమాలని అనుసరించే నెట్ వర్క్, అత్యంత శక్తివంతమైన నెట్ వర్క్? ఎవరికి వారే అయితే, ఎప్పుడో ఒకప్పుడైనా, నియమాలని అతిక్రమించరా? వివాదాలు వెల్లువెత్తవా? ఒక బలమైన వ్యవస్థ లేదా వ్యక్తి దీన్నింతటినీ నియంత్రిస్తే [Control చేస్తే] తప్ప, ఇది సాధ్యం కాదు.

అలా నియంత్రించే వ్యవస్థనే ‘నకిలీ కణిక వ్యవస్థ’ అని పిలిచాను. వ్యక్తిని ‘నకిలీ కణిక అనువంశీయుడని’ చెప్పాను. ఈ కార్పోరేట్ దిగ్గజాలతో కూడిన వలయాన్నే ‘నెం.10 వర్గం’గా చెప్పాను.

ఇంత బలమైన గూఢచర్య వ్యవస్థ దీనివెనక లేకపోయినట్లయితే - ఒక కొత్త ఉత్పత్తి మార్కెట్టులోకి ప్రవేశించినప్పుడు, మిగిలిన పోటీ ఉత్పత్తిదారులు పోటీ ఇవ్వకుండా, తమ ఉత్పత్తుల అలభ్యతతో సహకరిస్తూ, తమ నెట్ వర్క్ నియమాలని తాము పాటిస్తుండ వచ్చుగాక, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?

ఈ పరిస్థితులనీ, దోపిడినీ ప్రభుత్వం ఎందుకు నియంత్రిచటం లేదు? అసలా ప్రయత్నమే ఎందుకు చేయటం లేదు? ఏ వస్తువు గురించైనా సరే డిమాండ్ - సప్లై స్థితిని పరిశీలిస్తూ, నియంత్రించాలి కదా?

ఒకప్పుడు ప్రభుత్వాలు, మార్కెట్టులో ఇలాంటి అసాధారణాలని గుర్తించేవి. ఛేదించేందుకు ప్రయత్నించేవి. అందుకే ఇందిరాగాంధీ నకిలీ కణికుల అనువంశీయులకి అంతగా బద్ద శత్రువయ్యింది. సాక్షాత్తూ రామోజీరావే, ఈ విషయం స్వయంగా వప్పుకుంటూ.... తాను [నాటి] కాంగ్రెస్ కి వ్యతిరేకినని, లిఖిత పూర్వకంగా చెప్పుకున్నాడు. కాకపోతే ‘ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలు, వారసుల్ని ప్రజల నెత్తిన రుద్దటాలు నచ్చక, పోరాడానన్న’ పైకారణాన్ని [over leaf reason] చూపెట్టాడు.

మరి ఇప్పుడు, ఈ ఇటలీ మహిళ గురించైతే.... అధిష్టానం ఆగ్రహంగా ఉందంటూ వ్రాస్తాడు... అది నియంతృత్వ పోకడ కాదు కాబోలు! ఇక ఆమె వారసుడు రాహుల్ గురించైతే ‘సొట్టబుగ్గల అందగాడనీ, అమ్మాయిల కలల రాకుమారుడనీ’ బూస్టప్ వ్రాస్తుంటాడు.

అంత పరిమాణంలో, రామోజీరావుకి, ఇందిరాగాంధీ పట్ల శతృత్వం ఎందుకంటే - పేదలని ధనికులు పీడించకుండా, వ్యాపార దోపిడి చేయకుండా ఉండేందుకు, నాడు ఆమె బ్యాంకుల్ని జాతీయం చేయటం ఒక కారణం. ఆనాడు ధనికుల ప్రధాన వ్యాపారం.... వడ్డీ వ్యాపారమే! ఇప్పుడూ అదే లెండి.

ఇక ఇందిరాగాంధీ హయాంలో.... బ్యాంకుల్ని జాతీయం చేసి పేదలకి ఋణ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తే,
ఈ ఇటలీ మహిళ హయాంలో.... బ్యాంకులే [ప్రభుత్వ, ప్రైవేట్] కాదు, సూక్ష్మ ఋణాలు ఇచ్చే సంస్థలు కూడా ‘రికవరీ అధికారుల’ పేరుతో గూండాలని నియమించుకుని మరీ, దందాగిరీ చెలాయిస్తున్నారు. దెబ్బతో పేదలు బ్యాంకులో ఋణాల మాట ఎప్పుడో మరిచిపోయారు. అదే బ్యాంకులు, కార్పోరేట్ కంపెనీల ఋణాలని, తిరిగిరాని ఖాతాల క్రింద రద్దు చేస్తున్నాయి.

ఈ విషయం ప్రక్కన బెడితే.... ప్రభుత్వం... కార్పోరేట్ కంపెనీలు [ఉత్పత్తి దారులు] కుమ్మకై, ప్రజలని దోచుకోకుండా, నల్ల బజారు విక్రయాలు నడవకుండా, డిమాండు - సప్లై పద్దతిని నియంత్రించాలి. ఆ పని ప్రస్తుత ప్రభుత్వం నూటికి నూరు శాతం చేయటం లేదు.

ఆహార నియంత్రణాధికారి [Food Controlar], Drug Controlar, Health Inspector, ఏ ఒక్కరూ, ప్రత్యక్ష కార్యరంగంలో పని చెయ్యటం లేదు. అధికారులూ, ఉద్యోగులూ, డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. జీత భత్యాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులూ అన్నీ నడుస్తాయి. పని మాత్రం జరగదు.

ఉదాహరణలు చూడండి....

సిమెంటు కంపెనీలు కుమ్మకై, కృత్రిమ కొరత సృష్టించి, ధర పెంచి, నల్ల బజారు అమ్మకాలు సైతం నిర్వహించినా, ప్రభుత్వం సినిమా చూస్తున్నట్లు చూసింది, చూస్తోంది. సిమెంట్ కంపెనీల వాళ్ళు చేసే మరో దోపిడి చెప్పమంటారా?

కుమ్మకై ధర బాగా పెంచుకుంటారు. దాంతో మధ్యతరగతి జనాలు.... స్వంత ఇంటి కలనీ, ఆకాంక్షనీ వదులుకొని గమ్మునున్నారనుకొండి. సిమెంటు అమ్మకాలు బాగా పడిపోతాయి. ఇక లాభం లేదనుకున్నప్పుడు, సిమెంటు కంపెనీ యజమానుల సిండికేట్, లోపాయకారిగా నిర్ణయాలు తీసుకుని ధర అమాంతం, ఆకర్షణీయంగా ఉండేటట్లుగా తగ్గిస్తాయి. అదే సమయంలో ఇసుకా, ఇనుము రేట్లు కూడా కొంచెం తగ్గుతాయి.

రూపాయి రూపాయి కూడబెట్టి, ఓ బెత్తెడు జాగా కొనుక్కుని, అద్దె ఇళ్ళ వెతలతో విసిగిపోయి, స్వంత ఇల్లు కట్టుకోవాలని గంపెడాశ పెట్టుకున్న సామాన్య ప్రజలు.... ఆశతోనూ, మళ్ళీ ధరలు పెరుగుతాయోమోనన్న ఆతృతతోనూ, లోన్లు తీసుకునీ, పొదుపు చేసి దాచుకున్న సొమ్ము బయటకు తీసి గృహనిర్మాణాలు చేపడతారు.

సిమెంట్ అమ్మకాలు ఊపందుకుంటాయి. దాంతో తమ అంచనాలకు తగినంతగా వ్యాపారం పెరిగాక, అప్పుడు కలిసికట్టుగా, అందరూ కలిసి సిమెంటు ధరలు పెంచేస్తారు. తదనుగుణంగా ఇసుకా, ఇనుమూ, పెయింట్లు అన్నిటి ధరలూ పెరుగుతాయి. ఆ విధమైన సంకేత భాష.... ఆయా ఉత్పత్తిదారుల, వ్యాపార వేత్తల మధ్య ఉంటుంది.

ఇక నిర్మాణపు పనులు చేపట్టిన సామాన్య ప్రజల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉంటుంది. సగంలో నిర్మాణం ఆపలేరు. ఆశ ఊరుకోదు. ఏదో తంటాలు పడి పూర్తి చేయమంటుంది. అంతేగాక, సగంలో నిర్మాణం వదిలేస్తే నష్టం వస్తుంది. అప్పటి వరకూ పెట్టిన ఖర్చు ఎటూ గాకుండా పోతుంది. సగంలో ఆగిన నిర్మాణం, త్వరగా శిధిలం అవుతుందన్న భయమూ ఉంటుంది.

ఇప్పుడు ఆపితే మళ్ళీ పునఃప్రారంభించలేమనీ, పూర్తి చెయ్యలేమనీ నిరాశ ఆవరిస్తుంది. అది వాస్తవం కూడాను! దాంతో మరింతగా అప్పులు చేసి, ఉన్న బంగారం తనఖా పెట్టి లేదా అమ్మి, నిర్మాణం పూర్తి చేస్తారు.

చాలాసార్లు ‘ఇంతవుతుందని మొదలు పెడితే రెట్టింపు ఖర్చయ్యింది. దాంతో పరిస్థితంతా తలక్రిందులయ్యింది. ఖర్చు అంచనాలకు మించిపోయింది’ అంటూ ఎంతోమంది నిట్టూర్చడం మనకి తెలిసిందే! చాలామందికి ఇదే స్వానుభవం కూడాను!

ఇది చాలా చాకచాక్యంగా జరుగుతున్న దోపిడి. పైకారణాలుగా "ఫలానా అందుకు సిమెంటు రేటు పెరిగింది. అంతర్జాతీయంగా ఫలానా సంఘటన జరగటంతో ఇలా అయ్యింది" అంటూ సొల్లు కబుర్లు మంత్రులూ, ముఖ్యమంత్రులూ, ప్రధానమంత్రీ చెబుతారు.

ఇది ఒక్క సిమెంటు విషయంలోనే కాదు.... బియ్యం పప్పు మిల్లర్ల దగ్గరి నుండి, ఎన్నో వస్తువుల విషయంలో ఇలాంటి దోపిడీనే జరుగుతోంది.

ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకి.... కృత్రిమ కొరతల సృష్టి, కృత్రిమ డిమాండ్ సృష్టి, నల్ల బజారు అమ్మకాలు, వక్రమార్గాల ద్వారా పెంచుకునే అమ్మకాలు చెయ్యటం అంటే - ‘ప్రజలని చట్టబద్దంగా మోసం చెయ్యటం’ అని తెలియదా? వాటాలు పుచ్చుకుని, చట్టాలు చేసి మరీ, వ్యాపార దోపిడికి సహకరిస్తున్న ప్రభుత్వానికి.... స్వయంగా తామే వ్యాపారం చేస్తున్న ప్రభుత్వానికి.... తెలియదనుకుంటే, మనకి లోకజ్ఞానం తెలియదన్న మాటే!

మరి ఇదంతా మీడియాకి తెలియదా? మరైనా ప్రజలని కాపాడేందుకు గానీ, ప్రజల తరుపున పోరాడేందుకు గానీ, ప్రభుత్వాన్ని అధికారులని [చివరి దాకా] నిలదీసేందుకు గానీ, ఎందుకు ప్రయత్నించదు? ఒక రోజు వార్త వ్రాసేసి చేతులు దులుపు కుంటే సరిపోతుందా? అదేమంటే - సమస్యని ఎత్తి చూపటంలో తమ బాధ్యత తీరినట్లే నన్న కొత్త భాష్యాలు, మీడియా చెబుతోంది.

అలాగైతే... స్వాతంత్ర్య సమరం రోజుల్లో ఆనాటి పత్రికలు ‘స్వాతంత్ర్యం లేకపోవటంలోనే మనకిన్ని బాధలు!’ అంటూ సమస్యనెత్తి చూపి, ఊరికే ఉన్నాయా? ప్రజలకి అవగాహన కలిగించి, వారిలో పోరాట స్ఫూర్తి కలిగించి, స్వాతంత్ర సిద్ది జరిగే వరకూ, సమస్య పరిష్కరింపబడే వరకూ, ప్రజల కోసం పని చేసాయి కదా?

అవేవీ చేయవు గానీ, ఈనాటి మీడియా... ‘పత్రికాస్వేచ్ఛ, ప్రసార స్వేచ్ఛ’ అంటూ హక్కుల కోసం అరుస్తుంది. భాద్యతలు గుర్తుండవు గానీ, హక్కులు మాత్రం గుర్తుంటాయి. ఇంకా ఈ రెండేళ్ళ నుండి, మీడియా నవాబు రామోజీరావు, అంతగా అరవటం లేదు గానీ, గతంలో అయితే.... ‘బ్లాక్ బిల్లు, పత్రికాస్వేచ్ఛకు చిల్లు’ అంటూ గొంతు చించుకునే వాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

అండర్సన్ లు - అధిష్టానాలు - ఎన్ని విషవాయువులో!

Fri, 06/11/2010 - 07:38
ఒక బాలగేయం, దాని అనువర్తనతో ఈ చిన్ని టపా!

ముందుగా బాల గేయం...

క్రొత్తగా పెళ్ళై అతవారింటికి వచ్చిన ఓ చిన్న కోడలు, తనని తీసికెళ్ళడానికి అన్నలు వచ్చినందున, పుట్టింటికి వెళ్ళేందుకు ఉమ్మడి కుటుంబమైన అత్తగారింట అనుమతి అడుగుతుంది. ఆ సందర్బంలోనిదీ గేయం!

పిడకల్లు చేసేటి పిన్నత్త గారూ! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - పెద్దత్త నడుగు!

పెరుగు తోడేసేటి పెద్దత్త గారూ! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - మీ అత్త నడుగు!

అరిటాకు కోసేటి ఓ అత్తగారు! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - మీ మామ నడుగు!

మంచి మాటలు చెప్పేటి మా మామ గారు! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - మీ బావ నడుగు!

భారతమ్ము చదివేటి ఓ బావ గారు! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - మీ అక్క నడుగు!

అరిసెల్లు చేసేటి ఓ అక్క గారు! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - నీ భర్త నడుగు

చిరునవ్వు నవ్వేటి ఓ భర్త గారు! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
చిలకల్ల పలుకుల ఓ చిన్న కోడలా!
ఏమడిగ వచ్చావు? ఏల ఏడ్చుచున్నావు?

చల్లగా పోయిరా కన్నవారింటికి!
నవ్వుతూ నడిచిరా నా ఇంటి గడపకి!!

~~~~~
ఇదండీ బాల గేయం!

అది కుటుంబ వ్యవహారం, అందునా సూటి వ్యవహారం గనుక, అడగవలసిన వాళ్ళని [భర్తని]గాకుండా, ఎవరిని అడిగినా ‘నేనెఱుగ నేనెఱుగ’ అనే సమాధానమే వచ్చి ఉండొచ్చు. నిజానికి ఉమ్మడి కుటుంబాలలో, చిన్నకోడలు ముందుగా అడాగాల్సింది పెద్దల్నే కదా! పిల్లలకి చమత్కారాన్ని తెలియజేప్పే చిన్ని గేయం ఇది.

ఇందులో, చిన్నకోడలి భర్త గారి మాట తప్పితే.. మిగిలిన అందరూ ‘నాకు తెలియదు, వాళ్ళనడుగు, వీళ్ళనడుగూ’ అంటారు. కోడలు తన పుట్టింటికి వెళ్ళటానికే.... ఇంత తతంగం, ఉమ్మడి కుటుంబాల్లో ఆ రోజుల్లో ఉండేది.

దీనికి విపర్యయంగా ఉంది భోపాల్ గ్యాస్ లీకేజీ ప్రధాన ముద్దాయి కేసు! ముద్దాయి అండర్సన్ ను, అందరూ కూడబలుక్కుని, ఎంచక్కా జిల్లా కలెక్టర్, ఎస్పీ టాటా చెప్పి మరీ, విమానం ఎక్కించి పంపించారు.

ఇరవై ఆరేళ్ళ క్రితం 1984, డిసెంబరు 2 అర్ధరాత్రి 3 తెల్లవారు ఝామున భోపాల్ లో విషవాయువు లీక్ అయ్యింది. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని పదుల వేలమంది అనారోగ్యం బారిన పడ్డారు.

యూనియన్ కార్భైడ్ అప్పటి అధిపతి వారెన్ అండర్సన్ పేరును కూడా ఉచ్ఛరించకుండా, ఇప్పుడు స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. మిగిలిన నిందితులకి ‘ముసలి వాళ్ళయిపోయారంటూ’ సానుభూతి చూపించి, రెండేళ్ళ శిక్ష విధించింది. ఇప్పుడు 80 పైచిలుకు వయస్సున్న సదరు నిందితులకి, ఇరవై ఆరేళ్ళ క్రితమైతే 55+ ఏళ్ళుండేవి.

న్యాయం చేయటానికి దశాబ్దాల కాలం తీసుకుని, ఆపైన "ముసలాళ్ళయ్యారు. అనారోగ్యంతో ఉన్నారు. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. పోన్లే వదిలేద్దాం?" అనే పాటి దానికి, ఇంత ఖర్చులు భరించి, ఈ న్యాయ స్థానాలని, న్యాయమూర్తులని పోషించటం ఎందుకు? పైగా మళ్ళీ బెయిళ్ళు, పై కోర్టుకి అప్పిళ్ళు!

కోర్టులూ, చట్టాలూ, నేరగాళ్ళని కాపాడేందుకే ఉన్నాయనటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదేమో!

ఇక ఈ విషయంలో... పై బాలగేయానికి అనువర్తన ఏమిటంటే - ఈ కేసులో ఇంత జాప్యం జరగటానికీ, న్యాయం జరగకపోవటానికి కారణం ‘మేము కాదు వాళ్ళు, వీళ్ళు’ అని ఎవరికి వాళ్ళు అనటం!

సీబిఐ మాజీ డైరెక్టరు బి.ఆర్. లాల్ వంటి విశ్రాంత అధికారులు, అప్పట్లో సీబిఐ మీద ప్రధానమంత్రి కార్యాలయం వత్తిడి తెచ్చిందంటారు. కాదు కాదు, గృహమంత్రి కార్యాలయం వత్తిడి తెచ్చిందని మరో వాదన. ‘న్యాయం సమాధి చెయ్యబడిందంటూ’ గంభీరంగా విషాద ప్రకటనలు చేసాడు వీరప్ప మొయిలీ! ‘[అయిపోయిందేదో అయిపోయింది] ఈ విషయాన్ని పక్కనబెట్టి.. సహాయ పునరావాస కార్యక్రమాలు, న్యాయం అందించడంపై దృష్టి సారిస్తే మంచిదని’ ప్రతిపక్షాలకు, విపక్షాలకు సలహా ఇచ్చింది జయంతి నటరాజన్!

ఇలాంటి ప్రమాదాలు జరిగితే నేరస్తులను శిక్షించటానికి సరియైన చట్టాలు లేవట. దురదృష్ట వశాత్తూ రేపు మరేదైనా అణుప్రమాదం జరిగి, మరో చర్నోబిల్ లాంటి ప్రమాదం జరిగితే, 500కోట్ల రూపాయల జరిమానతో న్యాయం జరుగుతుందా? ఇరవై ఆరేళ్ళల్లో కఠిన చట్టాలని ఏర్పరచలేకపోయాయి కాబోలు, ఈ ప్రభుత్వాలు?

మధ్యప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి అర్జున్ సింగ్, కేసు తీర్పు రాగానే, హడావుడీగా, అధినేత్రి పాదాలు పట్టుకునేందుకు పరుగెట్టి వెళ్ళాడు. ఇతడి కది అలవాటే! బహిరంగవేదిక పైనే 2008లో, గజగజ వణుకుతూ విధేయత ప్రకటించిన ‘ధీరు’డితడు. ఇప్పుడు నోరు విప్పుటమే లేదు. ఎవరు ఏ ప్రశ్నలు గుప్పించినా మాట్లాడితే ఒట్టు!

ఇందులో కీలక పాత్ర ఎవరిది? దుర్ఘటన జరిగింది 1984 డిసెంబరులో! అప్పట్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే! తీర్పు వెలువడింది 2010 లో! ఇప్పుడు అధికారంలో ఉన్నదీ కాంగ్రెస్సే!

1984 లో దుస్సంఘటన జరిగేనాటికి, ఇందిరా గాంధీ హత్య చేయబడింది. తాత్కాలికంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. దేశం సార్వత్రిక ఎన్నికల దశలో ఉంది. 1980లో, సోదరుడు సంజయ్ గాంధీ, ప్రమాదవశాత్తు మరణించటంతో రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ, తల్లి ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రధానమంత్రి అయినా, అప్పటికి రాజకీయాల్లో ‘అ ఆ’లు అంతంత మాత్రంగా నేర్చిన వాడు మాత్రమే! గూఢచర్యంలో అయితే ‘అ ఆ’లు కూడా రాని వాడు.

అప్పట్లో ప్రధానమంత్రి భార్యగా, పరోక్ష చోదకశక్తిగా సోనియా, చాలానే చక్రం తిప్పింది. కొంతకాలం పాటు ప్రధానమంత్రికి కార్యాలయ కార్యదర్శిగా కూడా పని చేసింది.

ఇక ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికీ, కాంగ్రెస్ పార్టీకీ ప్రత్యక్ష, అధికారిక చోదకశక్తి! మరి ఈవిడ ఏ చోద్యం చూస్తోందట?

మహిళా బిల్లు, విద్యాహక్కు, ఆహారహక్కు గట్రా చట్టాలు తెస్తున్నామంటూ తెగ ప్రచారాలు చేసుకున్న ఈ ప్రభావశీల మహిళ, ఇప్పుడు యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ కేసు తీర్పు మీద నోరు విప్పదేం? నాడు అండర్సన్ ని దేశం నుండి అమెరికాకి సురక్షితంగా పంపేందుకు ఎవరు ఏ రకంగా సహకరించారో వెలికి తీస్తాననదేం? అండర్సన్ పోకలోని పాపం గురించి పెదవి విప్పనంతగా, ఏ సమస్యల సుడిగుండంలో ఉందో?

అసలుకే అధిష్టానం.... దేశం లోపలా, పార్టీ లోపలా కూడా.... చెప్పుకోలేని, చెప్పులేనన్ని తల నొప్పులతో ఉంది. పైకి కనబడే కడప ఎంపీ జగన్ ల వ్యవహారాలు కొన్నయితే, కనబడని వ్యవహారాలు మరికొన్ని!

ఆపైన ఇటీవల శ్రీలంక రాజపక్సేల దగ్గర నుండీ, చాలా దేశాల అధ్యక్షులూ, అధిపతులూ, భారత్ కి వస్తుండగా.... కేంద్రమంత్రులు చైనా,అమెరికా వంటి దేశాల పర్యటనలు ‘ఎందుకనో’ తెగ చేసేస్తున్నారు.

‘సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవీ’ అయితే ‘అధిష్టానపు కష్టాలు అధిష్టానానివి’ ఎందరితో ఎన్ని వ్యవహారాలు బ్యాలెన్స్ చెయ్యాలో, ఎంత లాబీయింగ్ చెయ్యాలో! ‘పుత్రుణ్ణి ప్రధానమంత్రిని చెయ్యటానికి’ అన్న పైకారణం ఏపాటి అతుకుతుందో అంతబట్టకుండా ఉందయ్యె!

ఇంకెన్ని విషవాయువులు వెలువడతాయో, వేచి చూడాల్సిందే మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

ఆముదం – కార్పోరేట్ కంపెనీల ఉత్తుత్తి పోటీ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 04]

Wed, 06/09/2010 - 23:31
సేంద్రియ ఎరువుల బదులుగా రసాయనిక ఎరువుల వినియోగం వల్ల లాభనష్టాలేమిటో, నాటి రైతులకి తెలియక పోవచ్చు, నాటి భారతీయులకి తెలియకపోవచ్చు. కానీ, అప్పటికే విదేశాలలో రసాయనిక ఎరువులతో సహా, ఎన్నో కృత్రిమ పదార్ధాలను వాడటంతో సంభవించిన దుష్పలితాలు, కార్పోరేట్ కంపెనీలకి, మీడియాకి ఖచ్చితంగా తెలుసు కదా?

అంతేకాదు, ఏ రసాయనిక లేదా కృత్రిమ ఉత్పత్తి నైనా మార్కెట్టులోకి ప్రవేశపెట్టే ముందు, కార్పోరేట్ సంస్థలైనా, ఇక్రిశాట్ వంటి ప్రభుత్వ సంస్థలైనా.... కొన్నేళ్ళపాటు ఆయా ఉత్పత్తుల ప్రభావ ఫలితాలని అధ్యయనం చేయాలి. దుష్పలితాలు వస్తే, వాటిని అధిగమించే వరకూ పరిశోధనలు కొనసాగించి, తుది ఉత్పత్తినే ప్రజలకి అందుబాటులోకి తేవాలి. ఆ పరిశీలన అనంతరమే మార్కెట్ లోకి విడుదల చేయాలి.

ఈ నియమాలు, చట్టాలు అన్నీ కాగితాల మీద ఉంటాయి. కార్పోరేట్ కంపెనీలు ఇవేవీ పట్టించు కోకుండా, ప్రజలని మభ్యపెట్టి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మానవ జాతి మీదే కాదు, ప్రకృతి మీదా, పర్యావరణం మీదా కూడా కుట్రే! మీడియా, రాజకీయ నాయకులూ, కార్ఫోరేట్ వ్యాపారులూ కుమ్మక్కై నిర్వహిస్తున్న కుట్ర!

ఈ వ్యాపార కుట్రలో.... కృత్రిమ డిమాండ్ సృష్టించుకునేందుకు... సహజ వనరులని కలుషితం చేయటం, వీలైతే నాశనం చేయటం, ఆపైన తమ కృత్రిమ ఉత్పత్తులకు మార్కెట్లు సృష్టించుకోవటం - ఇదే కార్పోరేట్ వ్యాపారం! సేంద్రియ పళ్ళు, కూరగాయలు అందుకు ఒక ఉదాహరణ అయితే, మంచినీటి వ్యాపారం మహా ఉదాహరణ.

పాతికేళ్ళ క్రితం, ఎక్కడైనా నిర్బయంగా నీళ్ళు తాగే వాళ్ళం. ఇప్పుడో? బయటికెళ్తే... బస్టాండుల్లోనో, రైల్వేస్టేషన్లలోనో నల్లా నీళ్ళు పట్టుకుని తాగటం అంటే సాహసమే! నోరు మూసుకుని కిన్ లే, ఆక్వా వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిందే!

అలాంటప్పుడు పరిశ్రమల కాలుష్య నివారణకు ప్రభుత్వ కేంద్రం పేరుకే ఉంటుంది. మహా అయితే అధికారులు ఆటోలని, టాక్సీలని, లారీలని పట్టుకుని ఫైన్లు వేస్తారు. లంచాలు గుంజుతారు. నదుల్లోకి పారిశ్రామిక వ్యర్ధాలు వదిలే, రాజకీయ నేతలు కమ్ పరిశ్రమాధిపతుల దగ్గరికి వెళ్ళి, దండం పెట్టి, ఇచ్చింది పుచ్చుకుని ఇంటికి పోతారు. అంతే! నీటిని కలుషితం చేస్తే... ఎన్ని వేల కోట్ల వ్యాపారం, మంచినీటి మీద నడుస్తుంది!?

ఇలాంటిదే మరో ఉదాహరణ, ఆముదం! అవును ఆముదమే! ఒకప్పుడు భారతీయ సమాజంతో విడదీయరాని బంధం ఆముదానిది. ఎన్నోరకాలుగా ఆముదాన్ని ఉపయోగించేవాళ్ళు. నువ్వుల నూనె గట్రాలతో కలిపి దీపారాధన దగ్గర్నుండీ, పిల్లలకి విరోచన కారి దాకా!

ఎండలో పొలం పని చేసి గిటక బారిన చర్మానికీ, కండరాలకీ ఆముదపు మర్ధనా చేసుకునేవాళ్ళు. పిల్లలకి తలకి పట్టించేవాళ్ళు. ఇంట పసిబిడ్ద పుట్టిందంటే, పెద్ద సీసా ఆముదమే ముందు సేకరించబడేది. స్నానానికి ముందు, కాళ్ళమీద పడుకో బెట్టుకుని, పేదింటి తల్లి పసిబిడ్దకి ఆముదంతో వళ్ళు మర్ధనా చేస్తే, గొప్పింటి తల్లి వెన్నతో మర్ధనా చేసేది. ఒక పద్దతి ప్రకారం కాళ్ళు చేతులు మర్ధిస్తూ, ప్రత్యేకమైన పదాలేవో పాడుతూ, మాలీష్ చేస్తుంటే, పాపాయి బోసి నోరు తెరిచి కిలకిలలాడటం, నా చిన్నతనంలో చాలాసార్లు చూశాను.

ఇప్పుడు సింక్ లో చేపని రుద్ది కడిగినట్లు, స్లీవ్ లెస్ గౌనులు వేసుకున్న ఆధునిక భారతీయ అమ్మలు, టేబుల్ మీద ‘బేబీ’ని పడుకోబెట్టి, జాన్సన్ లేదా విప్రో బేబీ ఆయిల్ తో మాలీష్ చేయటం, ఆపైన టబ్బులో వేసి ఒళ్ళు కడగటం టీవీల్లో చూస్తున్నాను.

నిజానికి ఆ కార్పోరేట్ కంపెనీల సువాసనల బేబీ ఆయిల్ కంటే, ఆముదం అక్షరాలా లక్షరెట్లు నయం. జిడ్డు, వాసన ఉండటం నిజమే. కానీ తడి ఒంటి మీద, ఆముదం నువ్వుల నూనె కలిపి రుద్దితే, అది పేరున్న బ్రాండ్ మాయిశ్చరైజర్ కన్నా కూడా, నాణ్యతగా పనిచేస్తుంది. కాకపోతే తువ్వాళ్ళు నల్లగా అయిపోతాయి కాబట్టి, చలికాలంలో స్నానానంతరం, పాతబడిన నేత వస్త్రాలతో వళ్ళు తుడుచుకుంటే, ఆముదం+నువ్వుల నూనె మిశ్రమాన్ని మించిన మాయిశ్చరైజర్ లేదు.

చలికాలంలో చర్మం పగిలి, నెర్రెలిచ్చిన నేలలా ఉండకుండా, తగినంత మాయిశ్చరైజర్ వాడాలంటే, ఒక్కొక్కరికి నెలకు మూడువందల రూపాయలు మినిమమ్ ఖర్చువుతుంది. అదే ఆముదం అయితే, ముప్ఫై రూపాయలు కూడా పట్టదు.

ఆముదం జీర్ణశక్తినిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, మాయిశ్చరైజర్ గా మాత్రం చాలా సమర్ధంగా పనిచేస్తుందని ఘంటాపధంగా చెప్పగలను. దశాబ్దాల నుండి ఆముదం భారతీయుల దైనందిన జీవితంలో వినియోగింపబడుతూ ఉంది.

గతంలో, పల్లెల్లో, ఎద్దులతో నడిపించే నూనె గానుగలో ఆముదం, నువ్వుల నూనె , కొబ్బరినూనె, వేరుశనగ నూనె తయారు చేసేవాళ్ళు. వంట నూనెలుగా ఉపయోగించే నువ్వుల, పల్లీల నూనెలకు ప్రత్యేకంగా కొవ్వు వడపోత [Fileration] అవసరమయ్యేది కాదు. తగినంతగా శారీరక శ్రమ చేసేవాళ్ళు గనుక, అలాంటి నూనెలని జీర్ణించుకోవటం వాళ్ళకి సమస్య కాదు. మారిన జీవన శైలిలో మనకిప్పుడు అంత సీన్ లేదు.

రైతుపొలంలో పండిస్తే.... ఆముదం గింజల్ని గానుగలో ఆడిస్తే అందరికీ అందుబాటులో ఉండే ఆముదం... కార్పోరేట్ కంపెనీలు ఉత్పత్తి చేసే బోలెడన్ని సౌందర్య ఉత్పత్తుల్లో ముడిపదార్ధమే అయినా....

తాము ఉత్పత్తి చేసి,
అందమైన సీసాలో పెట్టి,
అంతకంటే అందమైన ప్యాకింగ్ చేసి,
కళ్ళు చెదిరే రంగులలో పేరు ముద్రించి,
అందమైన అమ్మాయి[మోడల్] అవసరమున్నా లేకపోయినా గోచీ ధరించి మరీ నటించగా చిత్రించిన వాణిజ్య ప్రకటనతో కలిపి, తాము వ్యాపారం చేసుకోవటానికి వీల్లేకుండా ప్రజల అవసరాలు తీరిస్తే ఎలా?

అందునా, పెట్టిన పెట్టుబడికి పదింతలు MRP ముద్రించి తాము వ్యాపారం చేసుకోవాలయ్యె! ఇవేవీ లేకుండా, ఆముదం నేరుగా ప్రజా వినియోగంలో ఉంటే, తము ఇంత వ్యాపారం ఎలా చేసుకునేట్లు?

అందుకే... ఆముదపు రుచి, వాసనా, జిడ్డుతనాల మీద జోకులు, సెటైర్లు వేయబడ్దాయి. ఆముదం వాడేవాళ్ళని జిడ్డు పెనాలని, నూనె కళాయిలనీ, గ్రీజు ముఖాలనీ, పల్లెటూరి గబ్బిలాలనీ, ఫ్యాషన్ తెలియని బైతులనీ... ఇలా!

పదే పదే అదే ప్రచారం. నల్ల మేక - నలుగురు దొంగలు కథలా!

మెల్లిగా ఆముదపు వాడకం తగ్గింది. [నిజానికి కొందరు ఆముదమే కాదు, ఏ నూనె రాసినా, తల నుండి ధారగా కారేటట్లు రాసుకుంటూ ఉంటారు. మా స్కూలులో పిల్లల్ని ఆ విషయంలో ఎంతో సంస్కరించాల్సి వచ్చింది. వాళ్ల తల్లులకి కూడా చెప్పాల్సి వచ్చింది.]

ఇక ఈ ఆముదపు వ్యవహారంలో వింతేమిటంటే - పల్లెల్లో ఇప్పటికీ కిలో 50-60 రూపాయలకి దొరికే ఆముదం, మెట్రో పాలిటన్ సిటిలలో దొరకకపోవటం! ఒకసారి హైదరాబాద్ లో ఉండగా, మాకు ఆముదం అవసరమై విచారించగా, వీధి చివరి చిల్లర కొట్టుల్లో దొరకలేదు సరికదా, సూపర్ మార్కెట్లులొ వెదకగా.... చివరికి కిలో ఆముదం 360/-రూ.ల ఖరీదు చేస్తూ.... వంద ml ల అందమైన సీసా కనబడింది. జిడ్డు లేకుండా ఫిల్టర్ చేయబడిన ఆముదం, అందమైన బ్రాండు ముద్రించిన ఆ సీసాలో నుండి పలచగా, పారదర్శకంగా కనిపించింది.

తమ వ్యవస్థీకృత కమీషన్ నెట్ వర్కుతో కార్పోరేట్ వ్యాపారులు, ఏ వస్తువు లభ్యత, అలభ్యల నైనా, నియంత్రించగలరు. చిన్న రిటైల్ షాపుల దగ్గర నుండి హోల్ సెల్ షాపుల దాకా! కాబట్టే ఆముదమే కాదు, అలాంటి మరికొన్ని వస్తువులు కూడా, చిన్న దుకాణాలలో దొరకకపోవటం, పెద్ద పెద్ద సూపర్ బజార్ లలో అధిక ధరకు బ్రాండు సరుకులుగా లభ్యం కావటమూ పరిశీలించాను.

నిజానికి సూపర్ మార్కెట్లలో Caster Oil కిలో 360/- రూ.లు ఎలా పలుకుతోంది? అదే ఆముదం గింజలు రైతు దగ్గరైతే గిట్టుబాటు కూడా కావటం లేదేం? పరిశీలించి చూస్తే... ఇలాంటి మతలబులు ఇంకా చాలానే జాబితా చేయవచ్చు.

ఇక్కడ మీకు మరింత స్పష్టమైన వివరణ ఇస్తాను.

ఉదాహరణకి... ఒక కార్పోరేట్ కంపెనీ, ఏదైనా సబ్బుగానీ, డిటర్జంట్ పౌడర్ గానీ, వంట పాత్రలు శుభ్రపరిచే పొడి గానీ, మరో ఉత్పత్తి గానీ, మార్కెట్ లోకి ప్రవేశపెట్టిందనుకొండి. టీవీ గట్రా ఎలక్ట్రానిక్ మీడియాలో, వార్తాపత్రికలూ వారపత్రికలూ గట్రా ప్రింట్ మీడియాలోనూ, వ్యాపార క్యాంపెయిన్లతోనూ, ఒక ప్రచార సునామీ సృష్టించబడుతుంది. రోడ్ల మీద పెద్దపెద్ద హోర్డింగ్స్ పెట్ట బడతాయి. సదరు కంపెనీ తమ ఉత్పత్తిని విక్రయించుకునేందుకు పెట్టుబడి పెట్టి ఆ ప్రచారమంతా నిర్వహిస్తుంది. ఇది చట్టబద్దమే! అందులో తప్పేం లేదు.

సదరు ఉత్పత్తి [సబ్బు లేదా సబ్బు పొడి గట్రా] చౌకధరలో, మిగిలిన కంపెనీల అదే తరహా ఉత్పత్తితో పోల్చుకుంటే మరింత తక్కువ ధరలొ అందుబాటులో ఉంటుంది. అమ్మకాలని ప్రోత్సహించేందుకు ఉచిత బహుమతులూ, లాటరీ కూపన్లు కూడా జతపరచబడతాయి. అన్ని రిటైల్, హోల్ సెల్ షాపుల్లోనూ, సూపర్ బజార్లలోనూ, ఇవి అధిక మోతాదులో అందుబాటులో ఉంటాయి. సదరు కంపెనీ తమ ఉత్పత్తి అమ్మకాలని పెంచుకునేందుకు, ప్రారంభంలోనే జయప్రదంగా ఉత్పత్తిని విక్రయించుకునేందుకు, ఇదంత నిర్వహిస్తుంది. ఇదీ చట్టబద్దమే! ఇందులోనూ తప్పేమీ లేదు.

ఇక్కడ ఆశ్చర్యకరమైనదీ, చట్టబద్దం కానీదీ, ఏమిటంటే - కొత్తగా మార్కెట్ లోకి ప్రవేశ పెట్టబడిన సదరు కంపెనీ ఉత్పత్తికి పోటీ ఇచ్చే, ఇతర కంపెనీల ఉత్పత్తుల లభ్యత తగ్గిపోతుంది. అంటే, A అనే సబ్బు మార్కెట్ లోకి వస్తే, అప్పటి దాకా మార్కెట్ లో ఉన్న B,C,D గట్రా సబ్బులన్నీ, తాత్కాలికంగా, రిటైల్ హోల్ సెల్ షాపుల్లోనూ, సూపర్ మార్కెట్లలోనూ లభ్యం కావు. స్టాక్ ఉండదన్న మాట. "రావాలండి. ఇంకా రాలేదు" లాంటి జవాబులు విన్పిస్తాయి. నగరాలలో కంటే పట్టణాలు, గ్రామాలలో ఈ స్థితి బాగా ఎక్కువగా ఉంటుంది.

దాంతో వినియోగదారులకి, అంటే మనకి, అనివార్యత [un alternate situation] ఏర్పడుతుంది. కొత్త సబ్బు పట్ల మనకి వ్యతిరేకత ఏదీ ప్రత్యేకంగా లేనందునా, అప్పటికే వాణిజ్య ప్రకటనల సునామీతో ఏర్పడిన కుతూహలం వలనా, ‘సరే ఓసారి ప్రయత్నిద్దాం’ అనుకొని, ఆ సబ్బుని కొంటాం. నచ్చిందా, మళ్ళీ కొంటాం. లేదా మన పాత బ్రాండునే మళ్ళీ మనం కొనసాగిస్తాం. ఇది వినియోగదారుల మనస్తత్వం, వ్యవహార సరళి! ఇందులోనూ తప్పేం లేదు.

కానీ....

A అనే సబ్బు మార్కెట్ లోకి తొలిసారిగా వచ్చినప్పుడు, అప్పటికే మార్కెట్ లో పోటిగా ఉన్న B,C,D గట్రా సబ్బులు లభ్యం గాకపోవటం లేదా తక్కువగా లభ్యం కావటం అనే విషయం మీద... `A' ని ఉత్పత్తి చేసే కంపెనీకి పోటీదారులైన B,C,D గట్రా సబ్బుల ఉత్పత్తి కంపెనీలు, ఎందుకు మౌనంగా ఉంటున్నాయి?

ఇలాంటి విషయాలు మీద మీడియా కూడా, ఎందుకు గప్పుచుప్పుగా ఉంటుంది? ఇక్కడ ఉన్న కుట్ర కోణం విస్మయం కలిగిస్తుంది. అదెలా జరుగుతుందంటే....

ఏ కంపెనీకి చెందినదైనా సరే... మార్కెట్ లోకి ప్రవేశపెట్టబడ్డ కొత్త ఉత్పత్తి [`A' అనే సబ్బు] ఇబ్బడిముబ్బడిగా లభ్యం కావటం, అదే సమయంలో అప్పటిదాకా మార్కెట్ లో ఉన్న పోటీ ఉత్పత్తుల [B,C,D గట్రా సబ్బులు] లభ్యత లేకపోవటం లేదా తక్కువగా ఉండటం - అనే ప్రక్రియ వెనక ఉన్నకారణం.... అన్ని ఉత్పత్తి కంపెనీల మధ్య అంతర్లతంగా ఒక అవగాహన, సర్ధుబాటు ఉండటమే!

ఈ ప్రక్రియ కొంతకాలం గడిచి, సదరు కొత్త ఉత్పత్తి కొంత పాపులారిటీనీ, వ్యాపారాన్ని సంపాదించుకున్నాక, అప్పుడు దాని ధర పెంచబడుతుంది. తొలినాళ్ళలో, నిలదొక్కుకునే దశలో, ఉన్న నాణ్యత తగ్గించబడుతుంది. అప్పటికే కొంత చొచ్చుకుపోయినందున, పెద్దగా మార్కెటింగ్ సమస్యలుండవు.

ఒకసారి మార్కెట్ లోకి ఇన్ స్టాల్ అయ్యాక అలా కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ కొత్త ఉత్పత్తి మార్కెట్ లోకి ప్రవేశపెట్టబడినా, అది ఏ కార్పోరేట్ కంపెనీకి చెందినదైనా, ఇదే పద్దతి, ఇదే రకమైన అవగాహనా, సహకారమూ, కార్పోరేట్ కంపెనీల మధ్య ఉంటుంది. [అదే... చిన్న కంపెనీలు, షాపు వాళ్ళకి ఎంత కమీషన్ ఇచ్చినా, ఎంతగా ప్రకటనలు ఇచ్చినా ఈ పరిస్థితి ఉండదు. అంతేకాదు, సరిగ్గా అప్పుడే, భారీ ఎత్తున కార్పోరేట్ కంపెనీల ఉత్పత్తులు మార్కెట్ లోకి దిగుమతి అవుతాయి.]

ప్రతీ కంపెనీకి తమదైన వంతు వస్తుంది కదా! ‘తాము కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టినప్పుడు, ఇతరులు తమకి సహకరించాలంటే తాము ఇతరులకి సహకరించాలి’ అన్న సూత్రం ఇక్కడ అమలవుతుంది. తాత్కాలికంగా తమ ఉత్పత్తులకి మార్కెట్ లో లభ్యత తగ్గించటం ద్వారా, కొత్త ఉత్పత్తికి తమ నుండి పోటీని నివారించటం ద్వారా సహకరిస్తారు కాబట్టే, మొత్తం ఈ వ్యవహారం మీదా నిశ్శబ్దం పాటిస్తారు.

మీడియా సైతం ఈ విషయమై మౌనం పాటించటమే కాదు, వినియోగదారులు ఏ మాత్రం దీన్ని గమనించకుండా, వాళ్ళ దృష్టిని హైజాక్ చేస్తుంది కూడా!

అదే సమయంలో ‘స్థానిక చిల్లర దుకాణాల వారూ, [రిటైల్&హోల్ సెల్ షాపుల వాళ్ళతో సహా] అధిక కమీషన్ వస్తుందన్న ఆశతో క్రొత్త ఉత్పత్తిని అందుబాటులో ఉంచుతున్నారు. మిగిలిన ఉత్పత్తులని పట్టించుకోవటం లేదు’ అనే పైకారణం[over leaf reason] కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ విధంగా... చాలా పకడ్బందీగా, బలమైన, చక్కని సహకారం, సర్ధుబాటు, అవగాహనలతో కూడిన నెట్ వర్క్, ఈ కార్పోరేట్ కంపెనీల మధ్య ఉంటుంది. ఇది ఎంత బలమైన నెట్ వర్క్ అంటే - వాళ్ళ మధ్య ఎటువంటి వివాదాలు, నిందారోపణలు వెలుగు చూడవు. ఒకవేళ ఏవైనా పొరపొచ్చాలు సంభవించినా తెర వెనుకే పరిష్కారమైపోతాయి.

అడపా దడపా కొన్ని మాత్రం వెలుగుచూస్తాయి. అలాంటి వాటిల్లో కొన్ని సహజత్వం కోసం, ప్రజలనీ, దేశం పట్ల నిబద్దత గల నిఘాసంస్థల్నీ, ప్రభుత్వాలనీ నమ్మించేందు కోసం, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నట్లు పిక్చర్ ఇవ్వటం కోసం కూడా, వెలుగుచూస్తాయి.

ఇంత బలమైన నెట్ వర్క్ ఉంది కాబట్టే, దాదాపు అన్ని వస్తువుల ఉత్పత్తినీ చేజిక్కించుకొని, ప్రభుత్వాల మీదా, సమాజం మీదా, పట్టు బిగించింది కార్పోరేట్ కంపెనీలతో కూడిన నకిలీ కణిక వ్యవస్థ!

కాబట్టే, ఇప్పుడు చూసుకుంటే చిన్నతరహా పరిశ్రమలు, లఘ కుటీర పరిశ్రమలు కనుమరుగై పోయాయి. ఆలూచిప్స్ అమ్ముకునే మార్వాడీ మిఠాయి బండి, తుక్కు సామాన్ల కొట్టు కెళ్ళిపోయింది. లేస్, అంకుల్ చిప్స్, తోరణాల్లా వేలాడుతూ దుకాణాల్లో కన్పిస్తున్నాయి.

మళ్ళీ ఈ పదిహేనేళ్ళ నుండే.... డ్వాక్రా సంఘాల పేరిట, గ్రామీణ మహిళా సంఘాలు, చేగోడీలు జంతికలూ పచ్చళ్ళు అమ్మగలుగుతున్నారు. ఇప్పడవీ ఇబ్బందుల్లో పడ్డాయేమో!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

కాగితపు కట్టడం – ఆర్దిక గణాంకాలు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 03]

Tue, 06/08/2010 - 23:43
ఈ టపాల మాలికలో నా ఆంగ్ల బ్లాగు Coups On World లోని Coup On Business and Commercial Field అనే శీర్షికని తెలుగులోకి అనువదిస్తున్నాను. అయితే, ప్రస్తుతానికి అనువాదానికి అంతరాయం కలిగిస్తూ, ఆర్దిక రంగంలో నడుస్తున్న ఒక మాయా జాలాన్ని మీ ముందుంచాలని, ఈ టపా వ్రాస్తున్నాను.

ముందుగా ఒక చిన్న కథతో ప్రారంభించి, దాని అనువర్తనతో..... నడుస్తున్న మాయా జాలాన్ని వివరిస్తాను.

అనగా అనగా.....

ఒక విశాలమైన, సుభిక్షమైన రాజ్యం ఉండేది. ప్రత్యేకంగా రాజంటూ ఎవరూ లేకపోయినా.... ఎక్కడి కక్కడ.... వయస్సు, వివేకం, తెలివి ఉన్న మంచి వాళ్ళను పెద్దలుగా మన్నిస్తూ ప్రజలు జీవించే వాళ్ళు. ఏ సమస్య వచ్చినా ఆ పెద్దల దగ్గరే... తలా ఓ మాట వేసి, పరిష్కరించుకునే వాళ్ళు. పెద్దగా కొట్టాటలూ లేవు. నేరాలూ లేవు.

‘ దొంగతనాలూ దోపిళ్ళు ఉండవా?’ అంటే ఉండేవి. కాకపోతే ఘరానా దొంగలుండేవాళ్ళు కాదు. బందిపోటు గుంపులు వచ్చి, ఊళ్ళని దోచుకుపోయేవి. దాన్ని నివారించటం కోసం, ఎక్కడి కక్కడ, కొంత సైన్యంతో పాలకులుండేవాళ్ళు. కొన్ని చోట్ల యువకులే, దండుగా ఏర్పడి తమ ప్రాంతాలలో ప్రజల మాన ప్రాణాలను, ఆస్థిపాస్తులనూ కాపాడుకునే వాళ్ళు.

సాంఘిక, రాజకీయ స్థితి ఈ విధంగా ఉంటే... ఆ సువిశాల రాజ్యంలో, ఆర్దిక స్థితి సర్వస్వతంత్రంగా ఉండేది. దాదాపు ప్రజలంతా ఉత్పత్తి రంగంలోనే ఉండేవాళ్ళు. రైతులు వరి గోధుమల వంటి ఆహార ధాన్యాలు, పప్పులు ఇతర అవసరాలను తీర్చే పంటలు పండించే వాళ్ళు. పొలం గట్ల మీద కూరగాయలూ పండించేవాళ్ళు. ఇంటి పెరళ్ళలో పండ్ల మొక్కలు పెంచేవాళ్ళు. కోళ్ళు మేకలతో మాంసాహారానికీ కొదవుండేది కాదు. ఆవూ, గేదేలతో పాడిపంటలకూ లోటులుండేది కావు.

రైతులంతా ఒకే పంట వేయకుండా, వాళ్ళల్లో వాళ్ళు కూడబలుక్కుని, కొందరు తిండి గింజలు పండిస్తే, కొందరు నూనె గింజలు, మరికొందరు ప్రత్తి వగైరాలు ఎన్నుకునే వాళ్ళు. ప్రతీ ఏడాది వంతులు మార్చుకుంటూ, మొత్తంగా ఊళ్ళో అందరి అవసరాలు తీరేటట్లు, వాళ్లల్లో వాళ్ళు సర్ధుబాటు చేసుకుంటారు. ఏ గొడవా లేకుండా పెద్దల సర్ది చెప్పేవాళ్ళు, యువకులు సఖ్యంగా ఉండేవాళ్ళు.

ఊళ్ళల్లో రైతుల వంటి ధాన్యోత్పత్తి దారులే గాక, కుమ్మరి కమ్మరి వంటి వస్తూత్పత్తి దారులూ ఉండేవాళ్ళు. నేతపనివాళ్ళు, కంసాలిలూ గట్రా సకల వృత్తుల వాళ్ళు, కలిసి మెలిసి జీవిస్తూ, తమ ఉత్పత్తులనీ, సేవలనీ ఒకరి కొకరు ఇచ్చిపుచ్చుకుంటూ జీవించేవాళ్ళు.

కష్టపడి ఓపిగ్గా పనిచేయటం, హాయిగా తినటం, సుఖంగా నిద్రపోవటం - ఇదే తెలుసు వాళ్ళకి. తీరిక దొరికితే పెళ్ళాం బిడ్డలతో మాటామంతీ, ఇరుగు పొరుగులతో కథలూ కబుర్లు! అంతకంటే ఎక్కువ అవకాశాలూ లేవు వాళ్ళకి! వాళ్ళల్లో పాడటం వచ్చినవాళ్లు పాడేవాళ్ళు, చిందేయటం వచ్చిన వాళ్ళు ఆడేవాళ్ళు.

జీవితంలో పరుగు పెట్టటానికి కనిపిస్తూ, లక్ష్యమేదీ లేదు. కడుపారా తినటం, మనసారా మాట్లాడటం, కన్నారా నిద్రపోవటం! గుడే వినోదం, విజ్ఞానం.

ఒళ్ళొంచి పనిచేసే చోట, తిన్నదేదీ అరగకపోవటం ఉండదు. అధవా రోగమెచ్చినా ఏదో వైద్యం! ఒకవేళ చచ్చినా ‘అది ఎప్పుడో ఒకప్పుడు ప్రతివాడికి వచ్చేదే కదా ’ అన్న వైరాగ్యం. వైరాగ్యమో... నిర్వేదమో? అనివార్యం అన్న సత్యదర్శనమో!

రోజులు సాఫీగా గడిచిపోయేవి! తము ఉత్పత్తి చేసిన వస్తువునో, చేయగల సేవనో ఎదుటి వాళ్ళకి ఇవ్వటం, ఎదుటి వారి ఉత్పత్తినో, సేవనో పొందటం. మిగులు ఉత్పత్తి పొందగలిగేంత కష్టం చేయగలిగితే నగానట్రాలతో సంపద! ఇంకొంచెం పెద్ద ఇల్లు, ఇంకా పెద్ద చావడి. ఎద్దుల బండి కాస్తా గుర్రపు స్వారీ అయ్యేది.

మహా అయితే పొరుగూరి ప్రయాణం, పుణ్యక్షేత్రాల దర్శనం! అభివృద్ది తక్కువే గానీ, ఆనందం తక్కువ కాని స్థితిలో, తీరికగా, ప్రశాంతంగా ప్రజలంతా బ్రతుకుతున్న రోజులు!

ఇంతలో అక్కడికి ఓ వింత వ్యక్తి వచ్చాడు. తనని తాను ఆర్ధిక వేత్తగా పరిచయం చేసుకున్నాడు. అంటే ఏమిటో ప్రజలకు అర్ధం కాలేదు. "అదంతే! మీకర్ధం కాదు. ఎందుకంటే నేను మేధావిని" అన్నాడు, గంభీరంగా!

"మీకు నేను వ్యాపారం నేర్పిస్తాను" అన్నాడు.

ప్రజలు అయోమయంగా చూశారు. పట్టించుకోవటం మానేసారు. "ఇప్పుడు మీరు చేస్తుందంతా పనికిమాలిన పద్దతి. వడ్లు కొలిచి కుండలు తీసుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడితే వచ్చే వడ్లెక్కడ, ఆర్రోజులు కష్టపడితే వచ్చే కుండెక్కడ?" అన్నాడు గొప్ప తార్కికంగా!

‘నిజమే’ అన్పించింది రైతుకి!

ప్రమాదంగా తోచింది కుమ్మరికి!

"అయ్యా! ఆరుగాలం పండించిన వడ్లన్నీ రైతు నాకు ఇవ్వటం లేదు. వాళ్ళ ఇంటికి సరిపడా, నేను ఎన్ని కుండలిస్తానో, అంతకు సరిపోయినంత ధాన్యమే నాకు కొలుస్తారు. ఆరురోజులు కష్టపడితే నా కుండలు తయారౌతాయి, నిజమే! అయితే ఊరందరి కోసం, నేనూ సంవత్సరమంతా కుండలు చేస్తూనే ఉంటాను కదా?" తనకు వచ్చిన పద్దతిలో తనవైపు వాదన చెప్పబోయాడు కుమ్మరి. పాపం! ఆర్దిక వేత్త చెప్పినంత అందంగా, దబాయింపుగా చెప్పలేకపోయాడు.

ఇదే సన్నివేశం.... కమ్మరి, వడ్రంగి,దర్జీ... అన్ని వృత్తుల వారికీ ఎదురయ్యింది. క్రమంగా రైతుకి, తానన్ని రోజులూ, అనవసరంగా, అందరికీ, తన కష్టం ధారపోసాననిపించింది. ఇతర వృత్తుల వాళ్లకీ.... తాము దగా పడ్డామనీ, పడుతున్నామనీ, పడబోతున్నామనీ అన్పించింది.

వాళ్ళల్లో వాళ్ళకి స్పర్ధలు పుట్టాయి. ఈలోగా ఆర్దికవేత్త కనబడకుండా పోయాడు. అయితే, అతడు పెట్టిన నిప్పు , మహాగ్ని గోళంలా మండ సాగింది. అప్పటి దాకా ప్రశాంతంగా, పరస్పర సహకారంగా ఉన్న రాజ్యమంతా, రచ్చరచ్చగా తయారయ్యింది.

ఇంతలో హఠాత్తుగా ఆర్ధికవేత్త తిరిగి ప్రజల మధ్యకు వచ్చాడు. ఈసారి తన లాంటి మరి కొందరిని వెంట తెచ్చాడు.

"ఏమయిపోయావు? ఎంత గొడవయ్యిందో తెలుసా?" అన్నారు ప్రజలు.

"తెలుసు!" గంభీరంగా చెప్పాడు ఆర్దికవేత్త!

"ఏం చెయ్యాలి?" అన్నారు ప్రజలు ఆరాటంగా!

"ఇక నుండీ వస్తువులు మారకం వేసుకోకండి. ఇదిగో వీటిని, మీ వస్తువులకు మారకంగా ఉపయోగించండి" అంటూ కొన్ని గవ్వల్ని చూపించాడు.

"ఇవి గవ్వలాగున్నాయే?" అన్నారు ప్రజలు కళ్ళింత చేసుకుని!

"తప్పు. వీటిని గవ్వలన కూడదు. ‘డబ్బులు’ అనాలి. మీకు ఆ లెక్కలు పద్దతులు నేర్పడానికే వీళ్ళందరినీ తెచ్చాను" అన్నాడు ఆర్ధికవేత్త, తన వెంటనున్న బృందాన్ని చూపుతూ!

ప్రజలంతా వాళ్ళ వైపు వింతగా, ఆసక్తిగా చూసారు. గడ్డం దువ్వుకుంటూ గంభీరంగా చూశారు ఆర్దికవేత్తలు! పాఠాలు మొదలయ్యాయి. ఊరంతా మారిపోయింది. తెరచాటున ఆర్దికవేత్తలు కొన్ని వస్తువులకి ఎక్కువ గవ్వలు మారకం అయ్యేటట్లు కొరతలు, ప్రచారాలు సృష్టించారు. దాంతో వస్తువు విలువలు ఎవరికీ అర్దం కానంతగా మారిపోయాయి.

"చూశారా! ఎంత అభివృద్దో!" అన్నారు ఆర్దికవేత్తలు.

"కాబోలు" అనుకున్నారు ప్రజలు.

కొన్నాళ్ళకు "అవున్నిజమే!" అనీ అన్నారు.

క్రమంగా కొందరి దగ్గర చాలా గవ్వలు పోగయ్యాయి. కొందరి దగ్గర చిల్లిగవ్వ లేకుండా పోయింది.

కొన్నాళ్ళకి, గవ్వల స్థానంలో వెండి బంగారు నాణాలొచ్చాయి. కాలక్రమేణా గవ్వలు రకరకాల పేర్లు, రకరకాల రూపాలు సంతరించుకున్నాయి. ఒకోచోట ఒకో పేరు, ఒకో రూపం! అంతే కాదు, రకరకాల కొత్త వృత్తులొచ్చాయి. ఏ వస్తువునీ ఉత్పత్తి చేయకుండానే ‘డబ్బులు సంపాదించే వృత్తులు ఏర్పడ్డాయి. అవి చదువు చెప్పటం, వైద్యం చేయటం, పూజాదికాలు నిర్వహించటం, మంచీచెడూ తెలియచెప్పే సత్సంగ నిర్వహణ... ఇవేవీ కాని కొత్తవి కావటం చేత, చాలామందికీ ఆకర్షణీయం అయ్యాయి.

కేవలం ‘డబ్బులు’ లెక్కలు కట్టటం, ‘డబ్బు’ లక్షణాలు, ప్రవాహాలు పసిగట్టటం, వంటి కొత్త కొత్త వృత్తులూ వచ్చేసాయి.

అప్పటికే ఆర్దికవేత్తలు, ప్రజలకి చిత్రవిచిత్రమైన వస్తువుల్ని పరిచయం చేసారు. సేవల్ని కూడా ‘డబ్బుల’ లెక్కల్లోకి మార్చుకోవటం నేర్పించారు. దాంతో, గతంలో పాడటం వచ్చినవాడు ఇప్పుడు ఉచితంగా పాడటం మానేసాడు. ఆడటం వచ్చిన వాడు ఉచితంగా ఆడటం మానేసాడు. క్రమంగా ఆటాపాటా వంటి వినోదాలే కాదు, మంచీ మర్యాదా మాటామంతీ వంటి భావాలు కూడా ‘డబ్బుల’తో కొనుక్కోవాల్సి వచ్చింది. ఇక ప్రేమ, అనుబంధం వంటి అనుభూతులు, డబ్బుల గలగలల్లో విలవిల్లాడాయి.

ఈ గలాభాలో పడిపోయిన ప్రజలు గుర్తించని మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే - ఆర్దికవేత్తలు ప్రవేశపెట్టిన చిత్రవిచిత్ర వస్తువినిమయాలూ, సేవలూ, మాటల వ్యాపారాలతో, కేవలం కొందరి దగ్గరే డబ్బులు పోగవ్వటం! ఆ కొందరూ ఆర్దికవేత్తల అనుచరులూ సహచరులే అవ్వటం!!

ఇప్పుడు ప్రజలలో.... గతంలో ఉన్న తీరిక లేదు, ప్రశాంతత లేదు. సహకారమూ లేదు. పోటీ మాత్రమే ఉంది. ఎవరి కంటే ఎవరి దగ్గర ‘డబ్బులు’ ఎక్కువ పోగయ్యాయో అన్న ఆత్రం మాత్రమే ఉంది. అది తెచ్చిపెట్టిన అసూయ ఉంది.

క్రమంగా ప్రజలంతా.... వర్గాలుగా, గుంపులుగా, చివరికి వ్యక్తులుగా విడిపోయారు. ఎవరి గొడవా ఎవరికీ పట్టదు. ఎవరి కష్టం వాళ్లదే! ఎవరి సుఖమూ వాళ్లదే!

డబ్బుల కోసం పెనుగలాటలు పెరిగాయి. డబ్బులు పంచుకోవటం తప్ప, ప్రేమనీ అనుభూతుల్ని పంచుకోవటం మానేసారు. మానేసారు అనటం కంటే మరిచిపోయారు అనటం సబబు. పాపం వాళ్ళని మాత్రం ఏమంటాం? అసలంత తీరిక వాళ్ళకెక్కడ మిగిలిందని?

ఇలా.... రోజులు గడుస్తుండగా....

హఠాత్తుగా ఓ రోజు, ఆర్దికవేత్తల బృందం ఆర్భాటంగా, అందర్నీ ఆహ్వానించింది. తిరిగి చూస్తే ఏముంది?

రాజ్యం నడిబొడ్డున, ఓ భారీ నిర్మాణం ఉంది. అప్పటి దాకా ఆ రాజ్యపు ప్రజలకి తెలిసిన ఏ పదార్ధమూ కాదది. ప్రజలకి తెలిసింది పూరిళ్ళు, మిద్దెలు, భవంతులూ! మట్టికట్టడాలు లేదా రాతి కట్టడాలు! కలప తెలుసు. అయితే వాళ్ళకి తెలిసిన ఏ పదార్ధం తోనూ నిర్మింపబడలేదు ఆ కట్టడం.

"ఏమటది?" అన్నారు ముక్తకంఠంతో!

"కాగితం" అన్నారు ఆర్దిక వేత్తలు అంతే గట్టి కంఠంతో!

"ఎందుకిది?" అన్నారు ప్రజలు.

"మేమూ, మాలాంటి మేధావులందరమూ కలిసి, మీ కోసం నిరంతరం ఆలోచించాము. మీ అభివృద్ది కోసమే దీన్ని నిర్మించాము" అన్నారు.

"ఇదో గొప్ప ప్రక్రియ! లోపలి కొచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. చక్కగా అర్ధం చేసుకుంటే ఇది అందంగా,అపురూపంగా కనబడతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అందమైన అమ్మాయి లాంటిదే! దీన్ని బట్టి డబ్బుల లెక్కలు తెలుసుకోవచ్చు. అభివృద్ది ఎంతో గణించవచ్చు. మీరెంత సుఖంగా ఉన్నారో కూడా ఇట్టే తెలిసి పోతుంది. ఏ వస్తువుకు ఎంత ఖరీదు ఉందో కూడా తెలుస్తుంది. అసలు దీని ప్రభావంతో మీ జీవితాలే మారిపోతాయి" అని ఒక్క క్షణం ఆగారు ఆర్దికవేత్తలు.

అప్పటికీ అర్ధంకానట్లు చూశారు ప్రజలు!

గొంతు సవరించుకుని, మళ్ళీ ప్రారంభించారు ఆర్దికవేత్తలు!

"ఎప్పటికప్పుడు ఈ నిర్మాణం, మన రాజ్యంలో జరిగే అన్ని వ్యవహారాల గురించి లెక్కలు గడుతుంది. విశ్లేషణలు చేస్తుంది. దాన్నిబట్టి మనకన్నీ తెలిసిపోతాయి. మనకన్ని అమరిపోతాయి కూడా! ఇన్ని మాటలెందుకు? మనం తినే తిండి, పప్పుబియ్యం, కూరగాయల ధరల నుండి, వస్తు వాహన ఆభరణాది అన్నిటి ధరలపైనా, దీని ప్రభావం ఉంటుంది. కొన్నాళ్ళుపోతే మీకే అర్దం అవుతుంది" అన్నారు ఆర్దికవేత్తలు భరోసాగా! సర్లెమ్మనుకున్నారు ప్రజలు! రోజులు గడిచాయి.

ఆర్దికవేత్తలు "కాగితపు కట్టడం అందంగా ఉంది. కాబట్టి పప్పు దగ్గర నుండి అన్నిటి ధరలూ పెరుగుతాయి. చూడండి! గతంలో మీకు వంద డబ్బుల ఆదాయం వస్తే ఇప్పుడు వెయ్యి డబ్బులు వస్తున్నాయి. ఇది అభివృద్ది కాదా?" అన్నారు. కొందరు అవునన్నారు. కొందరు ‘అవునేమో ’ ననుకున్నారు.

కొద్దిమంది మాత్రం "వంద డబ్బుల ఆదాయం వచ్చినప్పుడు 90 డబ్బులు ఖర్చయిపోయేవి. పది డబ్బులు మిగిలేవి. ఇప్పుడు వెయ్యి డబ్బులు వచ్చినా.... వెయ్యి పైన, వంద డబ్బులు ఖర్చవుతున్నాయి. వెరసి వంద డబ్బుల అప్పులు లేదా అవసరాలు మిగిలిపోతున్నాయి. ఇదేం అభివృద్ది?" అన్నారు.

ఆర్దికవేత్తలు వాళ్ళని గదమాయిస్తూ "నోరు మూయ్యండి. మీకు లెక్కలు తెలియవు. మేం మేధావులం. మేం చెప్పినట్లే అన్నీ నడుస్తున్నాయి. అంటే అధికారం మాది. కాబట్టి మేం చెప్పిందే మీరు వినాలి, నమ్మాలి. గతంలోని వంద డబ్బుల ఆదాయంతో పోలిస్తే వెయ్యి ఎక్కువా, కాదా? అంటే అభివృద్ది జరిగినట్లే కదా!? ఇక మాట్లాడకండి!" అని కోరస్ గా అరిచారు.

ఆ బృందపు బృహద్ ధ్వనిలో, పాపం, ఈ కొద్దిమంది గొంతు, పీలగా మారింది. కొన్నాళ్ళకి మూతబడిపోయింది.

ఇంతలో, కాగితపు భారీ కట్టడం, అందమైన అమ్మాయిలా గాకుండా, వికృతమైన దెయ్యంలా కనబడుతోందన్న మాట, ఆ నోటా ఈ నోటా పొక్కింది. అయినా బియ్యం పప్పుల దగ్గర నుండి అన్ని వస్తువుల ధరలూ పెరిగాయి. సదరు కట్టడం అందంగా ఉన్నా, వికృతంగా ఉన్నా, ధరలు మాత్రం తగ్గడం లేదు. అదే అభివృద్ది అన్నారు ఆర్దికవేత్తలు. అప్పులు పెరిగి అల్లాడుతున్నారు ప్రజలు.

ప్రజలలో కొందరు, అసలా కాగితపు కట్టడంలో ఏముందో తెలుసుకోవాలని, తొలినాళ్ళలోనే అందులోకి ప్రవేశించారు. కొందరికి అసలేం అర్ధంకాలేదు. "అందమైన అమ్మాయిలా లేదేమిటి?" అనడిగారు.

"అది మీరు చూసే దృష్టిని బట్టి ఉంటుంది. మీకు ఆర్దిక విషయాల మీద అవగాహన లేదు. అందుకే పోల్చుకోలేక పోయారు. ఈ కాగితపు కట్టడం బయటికి చూడటానికి ఏ ఆకారమూ లేని భారీ ఆకృతిలా ఉన్నా, లోపల, పొందికగా ఉన్న చక్కని అమ్మాయిలా ఉంది. మీకే అర్దం కావటం లేదు" అన్నారు ఆర్దికవేత్తలు.

అదేమిటో తెలుసుకొందామని ప్రయత్నించారు, ఆ కొందరు! అర్ధంగాక బయటికొచ్చేసిన వాళ్ళు కొందరైతే, అర్ధం చేసుకోలేక పిచ్చివాళ్ళు అయ్యారు, అందులో కొందరు! మిగిలిన వాళ్ళకి అర్ధమయ్యి కానట్లుండంతో, ఇప్పటికీ ఆ లోపలే గిరగిరా తిరుగుతున్నారు.

ఈ లోగా గడిచిన కాలంలో.... కాగితపు కట్టడం అందంగా ఉన్నా, వికారంగా ఉన్నా.... ధరలు పెరగటం ఆగనే లేదు.

ఇలా ఉండగా హఠాత్తుగా ఓ రోజు...

మండే సూర్యుడి కన్నే నిప్పు కణిక గా రాలిందో,

ఆర్దిక అంచనాలు అర్దం గాకపోయినా, అంతశ్చేదన హెచ్చరికతో సామాన్యుడి గుండే మండిందో గానీ....

కాగితపు నిర్మాణానికి నిప్పంటుకుంది.

ఆరకుండా మండి, మసి కుప్పగా మారింది. మంటనార్పేందుకు ఆర్దిక వేత్తలు ఎన్ని మాటలు చెప్పినా, చెంబులతో నీళ్ళు కుమ్మరించినా, ప్రయోజనం లేకపోయింది. అంత భారీ నిర్మాణం తగలబడుతుంటే నీళ్ళ చెంబులు[ఉద్దీపనలు] నిప్పు నార్పలేవు కదా!

గమ్మత్తేమిటంటే.... కాగితపు నిర్మాణం నిలువునా మసికుప్పగా మారిపోయినా.... ధరలు తగ్గలేదు. పెరగటం ఆగలేదు. అప్పులూ తప్పలేదు.

అప్పటికి గానీ ప్రజలకి అర్ధం కాలేదు, తమ జీవితాల మీద ఈ కాగితపు నిర్మాణపు ప్రభావం ఏమిలేదనీ, దాని లెక్కలూ, విశ్లేషణలూ తమకు అందించిన అభివృద్ది భ్రాంతేనని!

తిరిగి చూస్తే ఆర్దికవేత్తలందరూ.... తమ మోసం బయటపడినందుకు, లోలోపల గజగజా వణుకుతూ, పైకి గంభీరంగా ముఖం పెట్టి, దీన్ని ఇంకా ఎలా మభ్యపట్టటమా అని ఆలోచిస్తూ ప్రజల ముందు నిలబడి ఉన్నారు!

కాగితపు నిర్మాణం కంటే ఎత్తుగా భగభగలాడుతూ.... ప్రజలు ఆర్దికవేత్తల ఎదురుగా ఉన్నారు!!

ఇదండీ కథ!

ప్రజల కోపాగ్నికి ఆర్దికవేత్తల గతేమీ కానున్నదో మనకి తెలియదు గానీ, ప్రస్తుతం మనం, ఈ కథకి అనువర్తనని పరిశీలిద్దాం.

1]. ఆర్దికవేత్తలు సృష్టించిన కాగితపు భారీనిర్మాణం, ద్రవ్యోల్భణం లెక్కల వంటిది. ద్రవ్యోల్పణం పెరిగిందన్నా, సున్నా అయ్యిందన్నా, చివరికి వ్యతిరేక ద్రవ్యోల్పణం లోకి వెళ్ళిందన్నా, నిత్యావసరాల, ఇతర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

మొన్నామధ్య.... సుప్రసిద్ద ఆర్దికవేత్తా, ఒబామాకి గురుగారూ, మన ప్రధానమంత్రీ అయిన శ్రీమాన్ మన్మోహన్ సింగుల వారు "వ్యతిరేక ద్రవ్యోల్బణం [-ve Inflation] లోకి వెళ్తే.... కంపెనీలకి నష్టం గానీ, ప్రజలకి లాభమే! ఎందుకంటే ధరలు తగ్గుతాయి" అని సెలవిచ్చారు. ద్రవ్యోల్పణం పాజిటివ్ నుండి సున్నాకి చేరింది, ఆపైన నెగిటివ్ లోకి పోయింది. మళ్ళీ తిరిగి పాజిటివ్ లోకే వచ్చింది. అయినా ధరలు మాత్రం తగ్గింది లేదు. ఏకోన్ముఖంగా పెరుగుతూనే ఉన్నాయి.

అచ్చంగా కాగితపు నిర్మాణం.... అందంగా ఉన్నా, వికృతంగా ఉన్నా.... ధరలు పెరిగినట్లే!

2]. మరో విధంగా చెప్పాలంటే - కాగితపు నిర్మాణం.... వృద్దిరేటు [GDP], తలసరి ఆదాయం, స్థూల జాతీయ ఉత్పత్తి, గట్రా లెక్కల వంటివి. వాటి దారిన అవి, ఎంత శాతం పెరిగినా, తరిగినా.... ప్రజల జీవితాల్లో మార్పుండదు. ధరలు తగ్గవు, అదాయ వ్యయాల నిష్పత్తీ మారదు. ఆదాయపు మిగులూ ఉండదు. ఇంకా అప్పులే మిగులుతాయి.

3]. ముఖ్యమైన అనువర్తన ఏమిటంటే - కాగితపు నిర్మాణాన్ని.... స్టాక్ ఎక్చేంజ్ గా చెప్పవచ్చు. సెన్సెక్స్ [కాకపోతే డోజోన్స్, నాస్ డాక్స్, ఏదైనా ఒకటే] ఆకాసాని కెగిసినా, పతనావస్థకి చేరినా, ప్రజల స్థితి గతులలో మార్పుండదు. ప్రజల అభివృద్దికి స్థూల ప్రతిబింబాలైన కార్పోరేట్ కంపెనీల షేర్లు, అచ్చంగా కాగితపు సంపద. అది ఆవిరి అయిపోయినా, మసిమసి అయిపోయినా.... అంతా కాగితాల మీదే!

అచ్చంగా కథలోని కాగితపు కట్టడం లాగానే! కాబట్టే, షేర్ మార్కెట్లో రాత్రికి రాత్రి లక్షలు సంపాదించవచ్చని నమ్మి, కూడబెట్టిన డబ్బు ముటగట్టుకు పోయిన సామాన్యులలో, ఆ మాయాజాలం అర్ధంగాక, పిచ్చివారయి వెనక్కి వచ్చింది కొందరు. పెట్టింది పోగొట్టుకుని, ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన వాళ్ళు మరి కొందరు. అర్ధమయ్యీ గాక అక్కడక్కడే పడి తిరుగుతున్న వాళ్ళు ఇంకొందరు.

సూక్ష్మంగా చెబితే స్టాక్ ఎక్చేంజి లోపల జరిగేది ఇది.

ఇక స్థూలంగా ఆ మాయాజాలాన్ని చెప్పాలంటే మరికొన్ని టపాలు తప్పవు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

కుంకుడు కాయలు - రసాయనిక ఎరువులు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 02]

Mon, 06/07/2010 - 23:14
కార్పోరేట్ కంపెనీల దగాకోరు వ్యాపారాలకు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం!

దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితం, అత్యధిక శాతం మంది భారతీయులు, తలంటు స్నానాలకు కుంకుడు కాయలు లేదా షీకాయ వాడేవాళ్ళు. ఇంటి పెరళ్ళల్లో, ఊరి బయళ్ళల్లో, విస్తృతంగా అడవులలో కుంకుడు చెట్లు ఉండేవి. ఇప్పుడు పెరళ్ళే లేవు లెండి. చింకి చేటంత జాగాలో, చీమచింత చెట్టున్నా కొట్టిపారేసి, ఓ రేకుల షెడ్డు వేసి అద్దెకిస్తే ‘నెలకు వెయ్యి రూపాయలొస్తాయి’ అన్న దృక్పధం ప్రబలి పోయింది.

అంత ఇరుకుగా గాలీ వెలుతురూ తగ్గినా పట్టించుకోకుండా, అదనపు గదులు వేసి అద్దెల కిస్తే, కళ్ళకు కనబడుతూ నెలకు వెయ్యి రూపాయలొస్తాయి, నిజమే! కానీ ఆ ఇరుకు స్థలంలో ఎక్కువ మంది జీవించడం వల్ల వచ్చే వత్తిళ్ళు, పుట్టే రోగాల లెక్క తెలియదు. అంతిమంగా ఎంత సొమ్ము, అదనంగా మందుల షాపులకీ, డాక్టర్లకీ చెల్లిస్తున్నారో కూడా తెలుభారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర సుకోలేరు.

అంతకంటే, ఒక చిన్న రేకుల గది వేసే జాగాలో, పది కూరగాయలు మొక్కలు పెంచినా.... పచ్చని నేల, చక్కటి గాలీ, తాజా కూరలు వస్తాయి. డబ్బూ ఆదా అవుతుంది. కూరల బిల్లూ, రోగాల బిల్లులతో సహా! కానీ ఈ లెక్కల సత్యాన్ని గ్రహించేంత ఓపికా, తీరికా, అవగాహనా, బస్తీల ప్రజలకి లేవు. అవగాహన కలిగించగల స్వచ్ఛంద సంస్థలు కాదు కదా, ప్రభుత్వ సంస్థలూ లేవు.

ఈ విషయం ప్రక్కన బెట్టి మళ్ళీ ‘తలంటు’ కార్యక్రమం దగ్గరి కొస్తే.... దాదాపు భారతీయులందరూ కుంకుడు కాయలకు అలవాటు పడి ఉన్నప్పుడు, అందమైన ఆకర్షణీయమైన వాణిజ్యప్రకటనలతో [ముందుగా సినిమా ముందు ప్రకటనలతో, తర్వాత టీవీ ప్రకటనలతో] ‘షాంపూలు’ పరిచయం చేయబడ్డాయి. కేవలం షాంపూల సద్గుణాలు [Advantages] మాత్రమే చెప్పబడ్డాయి. [Project చేయబడ్డాయి.] తలస్నానం సులభమనీ, కుంకుళ్ళు కొట్టటం నానేయటం వంటి బాదర బందీ లేవీ లేవని, పాకెట్ చింపటం, జుట్టు శుభ్ర పరుచుకోవటమేననీ చెప్పబడింది.

కుంకుడు కాయ రసంలా కళ్ళల్లో పడి మంట బెట్టటం, కళ్ళెర్ర పడటం ఉండదని ఊరించబడింది. జుట్టు పొడవుగా, చిక్కుల్లేకుండా, అందంగా మెరుస్తూ, ఆకర్షణీయంగా ఉంటుందనీ, పట్టులా మెత్తగా మెరిసి పోతుందని ఊదర పెట్టబడింది. అంతేగాక, ఆకట్టుకునే పరిమళాలతో, చౌకగా లభ్యమౌతుందని హోరెత్తించబడింది. ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉందిలెండి.

కుంకుళ్ళు, షీకాయ వంటి సాంప్రదాయ పద్దతుల్లో జుట్టు రాలి పోతుందనీ, చుండ్రు పడుతుందనీ, షాంపులు అత్యుత్తమమైనవనీ.... ఇప్పట్లానే అప్పుడూ.... సెలబ్రిటీలు, నిపుణులూ అభిప్రాయ పడ్డారు. అదే పత్రికలూ ప్రచారించాయి. కాకపోతే అప్పటి పోకడల్లో, అప్పటి పరిమాణంలో!

అంతే తప్ప, షాంపుల దుష్పలితాలు ఎవరూ ఎక్కడా చెప్పలేదు. జుట్టు రాలటమూ, చుండ్రు గట్రా సమస్యలే కాదు, మొదట్లో గోధుమ రంగు [brown, or biscuit color] కి మారే జుట్టు, క్రమంగా తెల్లబడుతుందని అప్పటికి సెలబ్రిటీలూ, నిపుణలతో సహా దేశంలో బహుశః ఎవరికీ తెలియదు.

అయితే అప్పటికే, విదేశాలలో షాంపూల వాడకం ఉంది. అక్కడ షాంపూ వాడకంలోని Advantages, Disadvantages, అప్పటికి భారతీయులకి తెలియక పోవచ్చు. ప్రచారానికి సహకరించిన సెలబ్రిటీలకి, నిపుణులకి కూడా తెలియక పోవచ్చు. కానీ మీడియాకి తెలుసు కదా! కార్పోరేట్ కంపెనీలకి తెలుసు కదా? సామాజిక బాధ్యతనీ, ప్రజా శ్రేయస్సునీ రెండు భుజాల మీదా మోస్తున్నామనే మీడియాలో, ఒక్కరు గాకపోతే ఒక్కరు కూడా, షాంపూల వంటి రసాయనిక ఉత్పత్తుల దుర్లక్షణాల గురించి, Disadvantage గురించి, ఒక్కమాట కూడా చెప్పలేదు. ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నాలు చేయలేదు.

అంతేగాక, అలాంటి రసాయనిక ఉత్పత్తులని తయారించే కార్పోరేట్ కంపెనీలకి, నూటికి నూరు శాతం ప్రచారం ఇచ్చి మరీ సహకరించింది. వాణిజ్య ప్రకటనల కక్కుర్తి కానివ్వండి, కుట్రలో తమవైన వాటా కానివ్వండి, పైకారణం ఏదైనా, మీడియా మాత్రం ఈ దగాకోరు వ్యాపారానికి శతవిధాలా సహకరించి ప్రోత్సాహించింది. [ఇలాంటి ఉత్పత్తులను మొదట చిన్న కంపెనీలు మొదలుపెట్టి, వాటికి జనం బాగా అలవాటు పడ్డాక, అప్పుడు పెద్ద కంపెనీలు ఆ రంగంలోని ప్రవేశిస్తాయి. ఉదాహరణకు నిర్మా వాషింగ్ పౌడర్, చిక్ షాంపూలు గట్రా!]

గతంలో వందలూ, వేల సంవత్సరాలుగా, భారతీయ మహిళలు కుంకుడు కాయలే వాడుకున్నారు. అరాళకుంతల అనీ, అలి నీలవేణి అనీ కవులు వర్ణించేంతగా, ఒత్తైన బారు జడలు కలిగి ఉన్నారు. ఎప్పటి దాకానో ఎందుకు? మా చిన్నప్పుడు మా అమ్మ, చిన్నమ్మలందరి జుట్టు, పొడవైన జడలతో, కవులు వర్ణించే కరినాగుల్లా ఉండేవి. [షాంపూలు తెలియక ముందు నా జుట్టు కూడా పొడవుగా ఉండేది. షాంపూల దెబ్బకి సన్నగా తాడులా తయారైందని కత్తిరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బుద్దిగా కుంకుడు కాయలు వాడుకుంటున్నాను. ]

అదే ఇప్పుడు చూడండి. టీవీలలో షాంపూ అడ్వర్టయిజ్ మెంట్లలో తప్ప, పొడవైన ఒత్తైన జుట్టు మన చుట్టు ప్రక్కల ఎంత మందికి ఉంది? అంతేకాదు, చిన్నవయస్సులోనే, స్త్రీ పురుష భేదం లేకుండా, జుట్టు తెల్లబడటం అనే సమస్య కూడా మెండుగా ఉంది. ముందుగా జుట్టు నలుపు రంగు మారి, ఎరుపు మిళితమై, brown or biscuit రంగుల్లోకి మారుతుంది.

ఇదీ ఒక ట్రెండ్ అన్పించేటట్లు సినిమా తారల జుట్టూ అదే రంగుల్లో చూపిస్తూ మోజులు పుట్టించటం ఇక్కడ మరో స్ట్రాటజీ. ఉదాహరణకి ఆర్తీ అగర్వాల్ గట్రాలు. అంతేకాదు గోద్రేజ్ గట్రా కంపెనీలు కూడా, ఆ రంగు జుట్టు మీద అందరూ మోజు పడుతున్నారంటూ వాణిజ్య ప్రకటనలు గుప్పిస్తుంటాయి.

ముందుగా నలుపు విరిగి ఎరడాలు రంగుకి తిరిగిన వెంట్రుకలు, క్రమంగా తెల్ల బడతాయి. ఇక చూస్కోండి! ఎంతగా [hair dyes] జుట్టు రంగుల వ్యాపారం నడుస్తుందో!?

ఈ విధంగా నాలుగైదు దశాబ్దాలు గడిచే సరికి, షాంపూ వినియోగంలోని కష్టనష్టాలు [Disadvantages] అన్నీ అనుభవంలోకి వచ్చాయి. అయితే అవగాహనకి రాలేదు. [అలా అవగాహనకి రానివ్వకుండా, మీడియా కార్పోరేట్ కంపెనీలు విశ్వప్రయత్నం చేస్తాయనుకొండి.]

ఇప్పుడు మళ్ళీ అదే కార్పోరేట్ కంపెనీలు, షాంపూల వాడకంలోని Disadvantages ని తొలగించటానికి, మరికొన్ని ప్రత్యేక ఉత్పత్తులని మార్కెట్టులోనికి ప్రవేశపెడుతున్నాయి. ఇవీ రసాయనిక ఉత్పత్తులే! ఇవి ఎలాంటి వంటే... షాంపూతో తలంటుకున్నాక జుట్టు చిక్కుబడకూడా After Shower అట. ఇలాంటివే చాలా!

గతంలో.... కుంకుళ్ళతో తలంటుకుంటే జుట్టు చిక్కుపడుతుందనీ, షాంపూతో ఆ బాదర బందీ ఉండదని కదా ప్రచారించారు? మళ్ళీ ఇప్పుడు షాంపూ తర్వాత, జుట్టు straight గా చిక్కులు బడకుండా ఉండేందుకు, After Shower అట, తొక్కా తోలట! చుండ్రు నివారణకి ప్రత్యేక షాంపూలట. ఇవి చాలా ఖరీదుగా ఉంటాయి మళ్ళీ! కండిషనర్లు, hair Sprayలు! మళ్ళీ మళ్ళీ మరిన్ని రసాయనిక ఉత్పత్తులు!

పైగా ఈ దోపిడికి ఎంతో మెరుపుల జలతారు తెరలు వేస్తూ.... సౌందర్యనిపుణులు [ఆ పేరుతో మీడియా కొందరిని ప్రచారిస్తుంది] సిన్సియర్ ముఖాలు పెట్టి గంభీరంగా చెబుతారు ‘షాంపూతో బాటుగా, ఆఫ్టర్ షవర్ లోషనూ, హెయిర్ ఆయిలూ, హెయిర్ స్ప్రే గట్రాలన్నీ ఒకే కంపెనీవి అంటే ఒకే బ్రాండువి కొనాలని!’ అప్పుడే మెరుగైన ఫలితాలుంటాయట. ఎంత నాజూకు దోపిడినో ఇది!?

ఇక్కడ మరో కోణం కూడా ఉంది! షాంపూల వంటి రసాయనిక ఉత్పత్తుల Disadvantage ని నివారించటానికి, కార్పోరేట్ కంపెనీలు, భారీ ప్రకటనలతో కొన్ని ప్రకృతి సహజ ఉత్పత్తులు [herbal products] ని విడుదల చేస్తాయి. ఇదంతా, అసలుకే జీవితపు పరుగు వేగంలో పడి అల్లాడుతున్న సామాన్యులని గుక్క తిప్పుకోనివ్వదు.

అధవా ఎవరైనా ఓపిక తీరికా చేసుకుని, ఈ దోపిడీకి విసిగిపోయి, జుట్టు రాలి బోడి గుండవ్వటమో లేక జుట్టు తెల్లబడి ముగ్గు బుట్టవ్వటమో తట్టుకోలేక, తామే, సహజ ఉత్పత్తులైన కుంకుళ్ళు, షీకాయి వంటి వాటి వైపు మొగ్గారనుకొండి....! ఎప్పటి కప్పుడు మార్కెట్ సర్వే, వినియోగదారుల ట్రెండ్ పైన పరిశీలనా చేసుకునే కార్పోరేట్ కంపెనీలు, అప్పుడు మరికొన్ని స్ట్రాటజీలు బయటకు తీస్తాయి.

షాంపూలూ తదితరాల వంటి రసాయనిక ఉత్పత్తులు అందుకు కారణం కాదనీ, వ్యక్తులను నమ్మించ ప్రయత్నాలు ప్రారంభమౌతాయి. డాక్టర్లూ ఇలాగే చెబుతారు. మరి పదుల లక్షలు ఖర్చుపెట్టి డాక్టర్లయ్యాక, ఉన్న నిజం చెప్పేసి, వచ్చిన పేషంట్లని వదులుకుంటారేమిటి?

నీ శరీర తత్త్వమే అంత అనో, ఫలానా కొత్తరోగం పుట్టుకొచ్చి తలలో చుండ్రు వచ్చిందనో, లేక జుట్టు రాలటం తెల్లబడటం జరిగిందనో, ఆహార మార్పు వలన ఇలా అయ్యిందనో చెబుతారు. అలాంటి xyz రోగాలనే మీడియా కూడా ప్రచారిస్తుంది. ఫలానా సెలబ్రిటికి లేదా ఆటగాడికి వచ్చిదంటుంది. వెరసి షాంపూలు గట్రా రసాయనిక ఉత్పత్తుల లోపమేమీ లేదని, వినియోగదారులని చెవినిల్లు గట్టుకుని, నల్లమేక - నలుగురు దొంగలు కథలో ముసలి వాణ్ణి నలుగురు దొంగలు నమ్మించినట్లు, నమ్మించ ప్రయత్నిస్తుంది. భారీ ప్రచారంతో మరీ ప్రయత్నిస్తుంది.

ఇక ఆ ప్రచారంలో ఎన్ని కోణాలుంటాయంటే - షాంపూల వంటి ఆధునిక ఉత్పత్తుల్ని గాక కుంకుళ్ళ వంటి సాంప్రదాయ ప్రాకృతిక పదార్ధాలని వాడే వారి మీద చెణుకులు, సైటైర్లు, జోకులు కూడా.... టీవీ, సినిమా, పత్రికలు గట్రా అన్ని మాధ్యమాలలో వస్తాయి. వెంగళప్ప జోకులు మాదిరిగా నన్నమాట. పల్లెటూరి బైతు, ఫ్యాషన్ తెలియని టార్జాన్ గట్రా బిరుదులూ పుడతాయి.

అంతేగాక, ప్రజలకి షాంపూల వంటి రసాయనిక ఉత్పత్తుల వినియోగాన్ని అనివార్యం చేయడానికి, కార్పోరేట్ ఉత్పత్తుల మీద ఆధారితుల్ని చేయటానికీ, ప్రకృతి వనరులు నాశనం చేయబడతాయి. ఇప్పుడు వెదికి చూసినా ఇంటి పెరళ్ళలోనూ, ఊరి బయళ్ళలోనూ కుంకుడు చెట్టు కనిపించడం అరుదై పోయింది కదా? అలాగన్న మాట!

ఇన్ని చేసినా, ఇంకా జనం కుంకుళ్ళ వంటి ప్రకృతి సిద్ద వస్తువుల వైపే జరిగారనుకొండి. అప్పుడిక కార్పోరేట్ కంపెనీలు సరికొత్త అవతారం ఎత్తుతాయి. పేటెంట్ హక్కులతో, సామాన్యులు తమ ఇంటి పెరళ్ళలో కూడా వాటిని పెంచరాదంటూ చట్టాలు తీసుకొచ్చి, సదరు కుంకుడు చెట్లను కూడా.... కార్పోరేట్ స్థాయిలో, కార్పోరేట్ వ్యవసాయ క్షేత్రాల్లో, బ్రాండ్ పేర్లతో ఉత్పత్తి చేసి అమ్మకాలు చేపడతాయి.

ఇతరులు సదరు ప్రకృతి సిద్ద వస్తువుల్ని పండించినా, ఉత్పత్తి చేసినా, లాభాలు పొందడానికి వీల్లేకుండా, వ్యాపార చట్టాల్ని తెస్తుంది. ఎటూ ప్రభుత్వాలూ కార్పోరేట్ కంపెనీలకే అనుకూలంగా ఉంటాయి కదా!

ఇదంతా మన కళ్ళు ముందు, ఎన్నో విషయాల నేపధ్యంలో జరుగుతున్నవే! కాకపోతే చూడగల కన్ను, అర్ధం చేసుకునేంత తీరికా సామాన్యులకి లేకుండా, అనివార్యమైన పరుగు జీవితాల్లో నిండిపోయింది. అసలు అలాంటి నిజాలేవీ తెలుసుకోకుండా ఉండేందుకే ఇంతగా పరుగులు తీయిస్తున్నారు, ప్రజలని! ప్రజలకి నిజాలు తెలిస్తే తమ దోపిడిలు సాగవు కదా మరి!

ఇదంతా తెలిసినా మీడియా కిమ్మనదు. ఎందుకంటే మీడియా అధిపతులే ప్రధాన కుట్రదారులు కనుక! ప్రభుత్వాలూ ఈ కార్పోరేట్ దందాని ఆపే ప్రయత్నాలు చేయవు. ఎందుకంటే వాళ్ళ వాటా వాళ్లకి అందుతుంది గనక! ఇదే స్థితి ఉన్న అధికారులదీ, రాజకీయ పార్టీల అగ్రనాయకులదీ, సెలబ్రిటీలదీ, పాత్రికేయులదీ, కాలమిస్టులదీ కూడా! అదీ కాక స్వేచ్ఛా వ్యాపారం అన్న ముసుగు ఎలాగూ ఉంది కదా!

ఈ విధంగా.... ఉన్న ప్రకృతి సిద్ద వనరులని నాశనం చేసి, కృత్రిమ పదార్ధాలు సృష్టించి, డిమాండ్ గా అమ్ముకోవటమే, బడాయిగా నిర్వహిస్తున్న కార్పోరేట్ వ్యాపారం! ఇందుకు మరొక ఉదాహరణ బయో ఉత్పత్తులు i.e.బయో[ఆర్గానిక్] పండ్లు కూరగాయలు!

బయో ఉత్పత్తులు అంటే రసాయనిక ఎరువులు, తెగులు మందులూ ఉపయోగించకుండా, పూర్తిగా సేంద్రియ ఎరువులని ఉపయోగించి పండించిన పళ్ళు, కూరగాయలు, ఇతర దినుసులూ ధాన్యాలన్న మాట! ఇదీ షాంపూల వంటి తంతే!

సుమారు నాలుగైదు శతాబ్దాల క్రితం, మనదేశంలో, దాదాపు మొత్తం వ్యవసాయం, సేంద్రియ ఎరువుల మీదే ఆధారపడి ఉండేది. పశువుల పేడ, మూత్రాలతో కుళ్ళబెట్టిన గడ్డి, చెత్తలతో.... ఇంటి పెరళ్ళలో, పశువుల పాకల ప్రక్కన, కొన్ని చోట్ల ముంగిట ప్రక్కన కూడా ‘నై దిబ్బలు’ పేరిట, రైతులు ఎరువు దిబ్బలు వేసేవాళ్ళు. సంవత్సరానికి కొకటి రెండుసార్లు, దాన్ని తీసికెళ్ళి పొలాల్లో చల్లుకునే వాళ్ళు. పురుగులూ, తెగుళ్ళకు కూడా.... వేప, పసుపు, మిరప పొడులను కలిపిన ద్రావణాలను, ఇతరత్రా సేంద్రియ ద్రావణాలూ వాడేవాళ్ళు.

ఈ స్థితిలో రసాయనిక ఎరువుల Advantages గురించి - తక్కువ సమయంలో ఎక్కువ పంట చేతి కొస్తుందనీ, నాణ్యమైన పంట పండుతుందనీ, రుచికరంగానూ ఉంటుందనీ చెబుతూ....

సమాంతరంగా, సేంద్రియ ఎరువుల Disadvantages గురించి - కావలసినంత పరిమాణంలో లభ్యం కావనీ, పంట దిగుబడి గొప్పగా ఉండదనీ, ఊదర బెట్టారు. రైతు చెవికే కాదు, ప్రతీ ఒక్కరి చెవికీ ఎక్కేదాకా ఊదర బెట్టారు. షాంపూలు అలవాటు చేసిన విధంగానన్న మాట!

సహజంగానే అందరూ ఆ వాదనను నమ్మారు. "నిజమే రోజులు మారాయి. మనమూ మారాలి. సాంప్రదాయ పద్దతులూ మారాలి. ఇవాళా రేపూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇంకా వెనకటి పద్దతులంటే ఎలాగా? జనం పెరిగిన స్థాయిలో తిండి గింజల ఉత్పత్తి పెరగకపోతే, ఆహార లభ్యత తగ్గిపోదా? కాబట్టి రసాయనిక ఎరువులు వాడకం తప్పదు" అన్నారు, అనుకున్నారు.

పైగా రసాయనిక ఎరువుల వాడకం సులభం. నైదిబ్బని పోగెయ్యటం, పొలానికి తోలుకెళ్ళటం, వెదచల్లటం, ఆపైన నేల దున్నటం... ఇదంతా చాలా శ్రమతో కూడుకున్నపని మరి!

గ్రోమోర్ యూరియా వంటి ఎరువులయితే ఏముంది? గోతాం చింపటం, పల్లెగలో పోసి పొలంలో చల్లటమే! ఎంత హాయి! దాంతో అంతా బాగానే అనిపించింది. రసాయనిక మందులు వాడకం పెరిగే కొద్ది మరిన్ని రసాయనిక మందులు వాడవలసి వచ్చింది. దాంతో రైతు ఖర్చు పెరిగింది. దాంట్లోనూ నకిలీ మందులు బెడద ఎలాగూ ఉంది. దెబ్బకి రైతు దివాళా తీసాడు.

నిజానికి.... కాలాన్ని బట్టేకాదు, పరిస్థితులని బట్టి, అవసరాన్ని బట్టి మనమూ మారాల్సిందే! అది నిజం! అయితే ఎప్పుడూ కూడా, పాత నుండి అయినా, కొత్త నుండి అయినా.... సాంప్రదాయం నుండైనా ఆధునికత నుండయినా.... మంచి గ్రహించాలి, చెడు వదిలెయ్యాలి!

అయితే ఈ రసాయనిక పదార్ధాలు వినియోగంలోని చిక్కేమిటంటే... ఉపయోగించి చూడనిదే మంచిచెడుగులు తెలియవు. అయితే కార్పోరేట్ కంపెనీలకి, మీడియాకి, మనకంటే ముందున్న ఇతర దేశాల్లో, సదరు రసాయనిక ఉత్పత్తుల్ని వాడి ఉన్నందున, వాటి మంచి చెడుగులు బాగానే తెలుసుమరి!

ఇంకా చెప్పాలంటే....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

బట్టతల మీద జుట్టు – ప్రజల అభివృద్ది !

Sun, 06/06/2010 - 23:01
ఒక చిన్న కధ, మన జీవితాల్లో దాని అనువర్తనతో, నా బ్లాగు పాఠకులని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా.....

అద్దంలో చూసుకుంటూ క్రాఫు దువ్వుకుంటున్నాడు సుందర్రావు.హఠాత్తుగా అతనికి తన జుట్టు పలచబడిపోతుందన్న అనుమానం వచ్చింది. అసలే ముదిరిపోయిన బెండకాయలా నలభైఏళ్ళొచ్చినా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. పాతికేళ్ళ వయస్సులో ఉండగా కట్నం చాల్లేదని సుందర్రావు తల్లి, పిల్ల నచ్చలేదని సుందర్రావు, పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చారు.

ఈ లోపునే కాల్షీటు అయిపోయిన నటిలాగా సుందర్రావు తల్లి పైలోకాలకి ప్రయాణించింది. సుందర్రావుకి పెళ్ళి చేసే బాధ్యత ఎవరూ తీసుకోకా, సుందర్రావుకి చాకచక్యం చాలకా, సాంపద్రాయ పద్ధతిలో పెళ్ళి చేసుకునేందుకు పిల్లని చూసుకోలేకపోయాడు. పోనీ ప్రేమ వివాహం చేసుకుందామని, ఎంతో ముచ్చటగా ముస్తాబై ఆఫీసుకి వెళ్ళినా, ఎదురైన ఆడపిల్లలందరూ సుందర్రావుని చూసి మొహం తిప్పుకుంటున్నారే గానీ, మోహంలో పడటం లేదు. కన్నెత్తి చూడటమూ లేదు, పన్నెత్తి పలకరించటమూ లేదు.

సుందర్రావు ఈ బాధలో ఉండగానే... ఇదిగో, ఇలా... బట్టతల వచ్చేస్తుందేమోనన్న భయం పట్టుకుంది. ఆ బెంగతో తల తడుముకుంటుండగానే, ఆర్నెల్లు తిరిగేసరికల్లా, నెత్తి నున్నగా ఇత్తడి చెంబులా తయారయ్యింది. ‘మళ్ళీ తన తల, ఒంకీలు తిరిగిన క్రాపుతో ఉండాలంటే ఏం చెయ్యాలా?’ అని ఆరా తీయసాగాడు.

ఇంతలో ఓ రోజు దినపత్రికలో సౌందర్య చికిత్సాలయం గురించి వాణిజ్య ప్రకటన కనబడింది. బట్టతల మీద జుట్టు మొలిపిస్తామనీ, ఒకో సిటింగ్ కీ అయిదు వేల ఫీజుంటుందనీ, ఆఖరి సిట్టింగ్ పూర్తయ్యే సరికల్లా నెత్తి మీద వెంట్రుకలు క్రిక్కిరిసి ఉండకపోతే ఫీజు వాపసు చేస్తామనీ, ఆ ప్రకటన సారాంశం. సుందర్రావుకి ఒక్కసారిగా గుండెల్లో గంటలు మోగాయి.

మరుక్షణమే సదరు సౌందర్య చికిత్సాలయానికి పరుగెత్తాడు. గంభీరంగా అతడి సమస్యని విన్న సౌందర్య నిపుణుడు, క్షుణ్ణంగా సుందర్రావు బట్టతలని పరిశీలించి "మీ శరీర తత్త్వాన్ని బట్టి చూస్తే మీ తల మీద వెంట్రుకలు మొలిపించలేం గానీ, నాటవచ్చు. కాకపోతే ఎక్కువ సిట్టింగ్స్ పట్టవచ్చు!" అన్నాడు, గొంతులో నిండా నిజాయితీ ధ్వనింపచేస్తూ!

"ఎన్ని సిట్టింగ్స్ పట్టవచ్చు?" అనుమానంగా అడిగాడు సుందర్రావు.

"చెప్పలేం! చికిత్సకి మీ తల స్పందించే తీరుని బట్టి ఉంటుంది" అన్నాడు సౌందర్య చికిత్సానిపుణుడు ముందు జాగ్రత్తగా!

ఒక్కసారిగా నిరాశ ఆవరించింది సుందర్రావుకి. అప్పటి దాకా ఆశతో తళతళ్ళాడిన కళ్ళు టప్పున వెలుగారిపోయాయి.

అతణ్ణి ఉత్తేజపరుస్తూ సౌందర్య చికిత్సా నిపుణుడు "కానీ ఒకటి! ఖచ్చితంగా మీ బట్టతల మీద జుట్టు నాటవచ్చు. కొన్నాళ్ళ తర్వాత చూస్తే... మాగాణి చేలో వరిపైరులా మీ తల మీద జుట్టు వయ్యారంగా ఊగుతుంటుంది" అన్నాడు ఊరిస్తూ!

సుందర్రావులో తెగింపు వచ్చేసింది. ఎంత ఖర్చయినా సరే! బట్టతలని మాయం చేసి, ఒత్తైన క్రాపుతో ఉన్న తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలనుకున్నాడు. చికిత్సకి తేదీలతో సహా అన్ని ఏర్పాట్లూ నిర్ధారించుకున్నాడు.

అప్పుడు మొదలైంది సుందర్రావుకి అసలు తంటా! ఒకో సిట్టింగ్ కి అయిదువేల చొప్పన, అంతేసి డబ్బు ఎక్కడి నుండి తేవటం!? తన కొచ్చే సాదా సీదా జీతంతో, ఏదో గుట్టుగా మరికొంత బెట్టుగా బ్రతక గలడేమో! ఇంత ఖర్చు భరించాలంటే ఏదో దారి తొక్కక తప్పదు.

వెధవది తనది ప్రభుత్యోద్యోగమూ కాదు, జీతం కంటే లంచాలు భారీగా పట్టొచ్చు అనుకోవడానికి! ఏం చెయ్యటం! తీవ్రంగా ఆలోచించి దొంగతనాలు చెయ్యటం ప్రారంభించాడు.

ఆ డబ్బుతో నెత్తి మీద జుట్టు నాటించుకునే వాడు. మర్నాడే తదుపరి సిట్టింగ్ కోసం ‘ఎలా, ఎక్కడ దొంగతనం చేయాలా?’ అని ఆలోచించేవాడు. అలా ఆలోచించేసరికి, ఆ వత్తిడికి అంతకు ముందు నాటించుకున్న వెంట్రుకలలో సగానికి సగం రాలిపోయేవి. సౌందర్య చికిత్సా నిపుణుడు తాపీగా "అది మీ శరీర తత్త్వం. ఓపిక పట్టండి, మరికొన్ని సిట్టింగ్స్ తో అంతా సరవుతుంది" అనేవాడు.

ఇలా నెలలు, సంవత్సరాలు గడిచాయి.

దొంగతనం చెయ్యడం.... ఆ డబ్బుతో జుట్టు నాటించుకోవటం. మళ్ళీ డబ్బుకోసం మళ్ళీ దొంగతనం చేయటం. ఈ లోపున నాటిన జుట్టు కాస్తా రాలడం!

వెరసి సుందర్రావు తల తోమిన తపాళాలాగా తళా తళా మెరుస్తుండేది.

ఇదీ కథ!

నిజంగానే కర్నూలు జిల్లాలో దొంగతనాలకి పాల్పడిన ఓ దొంగ కథ ఇది.

ఇప్పుడు ఈ కథకు అనువర్తన చూద్దాం!

1]. మొదటి ఉదాహరణగా ఏపీయస్ ఆర్టీసీని తీసుకుందాం. సంస్థ నష్టాల్లో ఉందంటూ, టిక్కెట్టు ఛార్జీలు పెంచుతారు. ఆపైన లాభాలు వస్తున్నాయి కాబట్టి, ఆర్టీసీ ఉద్యోగులు తమ జీతాలు పెంచమంటారు. ప్రభుత్వం ముందు కాదంటుంది. సిబ్బంది సమ్మెలు చేస్తారు. చివరికి బేరం కుదురుతుంది. చర్చలు ఫలిస్తాయి. ఫలితంగా సిబ్బంది జీత భత్యాలు పెరుగుతాయి. మరికొన్నాళ్ళకి మళ్ళీ సంస్థ నష్టాల్లో ఉంటుంది. ఖర్చులు పెరిగినప్పుడు నష్టాలు సహజమే కదా? మళ్ళీ టిక్కెట్టు ఛార్జీలు పెరుగుతాయి.

వెరసి సుందర్రావు జుట్టు నాటించుకునేందుకు దొంగతనాలు చేస్తాడు, జుట్టు నాటించుకుంటాడు. ఎలా దొంగతనం చెయ్యాలా అని బుర్రబద్దలు కొట్టుకోగా జుట్టురాలిపోతుంది. మళ్ళీ దొంగతనం, మళ్ళీ జుట్టు నాటించుకోవటం. ఇదో వృత్తం. ఈ వృత్తంలో ఎప్పుడూ సుందర్రావుకి జుట్టు మిగలదు. దొంగతనం తప్పదు. వెరసి బాగు పడింది ఎవరయ్యా అంటే సౌందర్య చికిత్సా నిపుణుడు మాత్రమే! ఒక రకంగా సదరు నిపుణుడికి ఆదాయం సమకూర్చటం కోసమే, సుందర్రావు దొంగతనాలు చేసి మరీ డబ్బు సంపాదించినట్లన్నమాట!

సరిగ్గా అలాగే... ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది. ఛార్జీలు పెంచుతారు. మళ్ళీ సిబ్బంది జీతాలు పెరుగుతాయి. మళ్ళీ నష్టాలు! ఈ వృత్తంలో ఆర్టీసీ నష్టాలు తగ్గవు.... ఛార్జీలు పెరుగుతాయి. వెరసి లాభపడేది మాత్రం ఆర్టీసీ సిబ్బంది![ఉద్యోగులు, ఆర్టీసీకి జోన్ల ఛైర్మన్లు, ఆర్టీసీ ఛైర్మన్, రవాణాశాఖ ఉన్నతాధికారులు, మంత్రులూ, అందరూ ఆ సిబ్బంది లో భాగమే!]

2]. చమురు సంస్థలది కూడా ఇదే కథ. అచ్చంగా ఆర్టీసీ కథ లాగే ఇది కూడా!

3]. ఇలాంటిదే మరో ఆసక్తికరమైన కథ ప్రభుత్వం చెబుతుంది. అభివృద్ది కోసం పచ్చని వ్యవసాయ భూముల్ని కూడా సెజ్ ల పేరుతో, ఇండస్ట్రీయల్ పార్కుల పేరుతో, బడా కంపెనీలకి కట్టబెట్టేస్తుంది. ఆపైన వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం దిగుబడి తగ్గింది కాబట్టి ధరలు పెరిగాయంటుంది. సాగు విస్తీర్ణం తగ్గిస్తూ సెజ్ లు! దిగుబడి తగ్గిందంటూ ధరల మంట! ఇదో వృత్తం. ఇందులో లాభపడేది పక్కాగా రాజకీయులే! ఎకరాలకి ఎకరాలు రూపాయికీ, వందకీ కట్ట బెట్టేసి, వందల కోట్లు వెనకేసే ఈ రాజకీయవృత్తంలో, వీళ్ళు సౌందర్య చికిత్సా నిపుణులన్నమాట.

4]. ఇదే మాదిరి పన్నుల వ్యవహారం కూడా! అభివృద్ది కోసం పన్నులు హెచ్చింపు. వృద్దిరేటు కాగితాల మీద మాత్రమే ఉంటుంది. సుందర్రావు జుట్టుకోసం నానా దొంగతనాలు చేసి డబ్బు సంపాదిస్తే.... ప్రజలు, పన్నులూ ధరలూ అందుకోవటం కోసం, నానా తంటాలు[అనివార్యంగా చాలామంది అవినీతికి పాల్పడి కూడా] పడి డబ్బు సంపాదిస్తున్నారు. సుందర్రావుకి జుట్టు పెరిగింది లేదు. ప్రజలకి అభివృద్ది అందింది లేదు. సిట్టింగ్ కి ఫీజులు సుందర్రావు చెల్లిస్తే, ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారు.

ఇందులోనూ లాభ పడుతోంది అధికారంలో ఉన్న రాజకీయ నాయకులూ, ప్రభుత్యోద్యోగులే! ఇద్దరూ లంచాలు బాగానే దండుకుంటున్నారు.

5].ఇక మరో తాజా దృష్టాంతం ఏమిటంటే - ఇటీవల వార్తల్లో తరచుగా కనిపిస్తున్న... హిందూ దేవాలయాలలోని వ్యవహారం. కొన్నిరోజుల క్రితం కుప్పకూలిపోయిన శ్రీకాళహస్తీశ్వరుని రాజగోపురం సాక్షిగా.... శైవ వైష్ణవాలయాలన్న వివక్ష లేకుండా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుస్తున్న అన్ని దేవాలయాలలో.... సామాన్య భక్తులు దైవభక్తితో వస్తుంటారు. ఆపదలు తీరినందుకు మొక్కులు చెల్లించుకోవటానికో, ఆపదల నుండి రక్షించమని భగవంతుణ్ణి వేడుకోవటానికో... ఏదీ లేకుండానే ఒకింత భక్తితోనో, గుడులకు వస్తుంటారు. టిక్కెట్లు కొని దర్శనాలు, కేశ ఖండనాలు, ఇతర పూజలు చేస్తుంటారు. హుండీల్లో కానుకలు వేస్తుంటారు.

అయితే దేవాలయాలున్నది మాత్రం వీఐపీల సేవలకు, దర్శనాలకు మాత్రమే అన్నట్లు అక్కడి వ్యవహారాలు నడుస్తాయి. మంత్రులూ, ట్రస్ట్ మండళ్ళూ, మండలి ఛైర్మన్ల దగ్గరి నుండి, ఆ శాఖలో క్రింది స్థాయి ఉద్యోగి వరకూ, అందరూ, ఆలయాల ఆదాయంలో అందిన చోట అందినంత నొక్కేస్తారు. ఉద్యోగులు తమ బంధుమిత్రులకు ప్రాధాన్య పూరితంగా దైవ దర్శనాలు చేయించటంలో, దేవాలయ పరిధిలో ఇతర వ్యాపారాలు చేసుకోవటంలో మహా బిజీగా ఉంటారు. వెరసి గుడికి వచ్చిన సామాన్య భక్తులు మాత్రం యమ ఇక్కట్లు పడుతుంటారు.

తిరుపతి శ్రీవెంకటేశ్వరుని దర్శించగోరి, నానా వెతలూ పడి క్యూలో వెళితే ’గోవిందా’ అని పలికేందుకు గో...అనే లోగానే అక్కడి సిబ్బంది `GO' అంటూ భక్తుల్ని ఆవలికి తోసిపారేస్తారు. దేవాలయాలకు ప్రధాన ఆదాయాన్ని సమకూర్చేది సామాన్య భక్తులే! వాళ్ళకి మాత్రం అక్కడి ఆదరణ కరువు.

భక్తితో ఆలయాలలో అడిగినంత రుసుములు చెల్లించేది భక్తులు. సుందర్రావుకి జుట్టు దుర్లభమైనట్లు, ఈ సామాన్య భక్తులకు దైవదర్శనం దుర్లభం.

వెరసి దేవాదాయ శాఖ ఉద్యోగులకి, మంత్రులకి ఆదాయం సమకూర్చేందుకు, ఈ సామాన్య భక్తులు పుణ్య క్షేత్రాలకు వెళ్తున్నారన్న మాట.

6]. చివరి అనువర్తన, సగటు ఉద్యోగి జీవితానికి సరిపోలుతుంది. హక్కులూ ఆదాయలూ దండిగా ఉన్న ప్రభుత్వ ఉన్నతోద్యోగులని మినహాయిస్తే... ప్రైవేటు సంస్థల్లో పని చేసే సామాన్య ఉద్యోగులతో సహా, చాలామంది పరిస్థితి, సుందర్రావు జుట్టు వంటిదే!

కుటుంబ సభ్యుల సుఖసంతోషాలు , అభివృద్ది, అవసరాల కోసమే, ప్రతీ ఒక్కరూ ఉద్యోగం చేస్తారు. రోజుకి దాదాపు 12 పని గంటలూ, కనీసం రెండు గంటల రాకపోకలు, మరో రెండు గంటలు స్నానపానాలు! వెరసి రోజుకి 16 గంటలు ఖర్చయి పోగా, మిగిలిన 8 గంటలు నిద్రకే సరిపోదు. ఇక కుటుంబ సభ్యులతో మాటమంతీ ఎక్కడ? కలిసి కూర్చొని తినే తిండి ఎక్కడ? వెరసి సుఖసంతోషాలు ఎక్కడ? అవసరాలు అంతంత మాత్రంగా తీరటమే తప్ప, అభివృద్ది సైతం అందరాని పండే! [అందరి స్థితి ఇదిగాక పోయినా, ఈ రోజు సామాన్యులలో అత్యధికుల పరిస్థితి ఇదే!]

వెరసి కుటుంబం కోసం ఉద్యోగం కాస్తా, ఉద్యోగం కోసమే ఉద్యోగం అయిపోయింది. సుందర్రావుకి జుట్టు మిగలనట్లే కుటుంబసుఖసంతోషాలు మిగలటం లేదు. సుందర్రావు సౌందర్య చికిత్సా నిపుణుడికి ఆదాయం సమకూర్చటం కోసం దొంగ పరుగులు పెడితే, సామాన్య ఉద్యోగులు, తాము పనిచేస్తున్న ప్రైవేటు సంస్థకు ఆదాయం సమకూర్చేందుకు ఉద్యోగ పరుగులు పెడుతున్నారు.

వెరసి సుందర్రావుకి జుట్టు మిగిలింది లేదు!

సామాన్య ప్రజలు సుఖసంతోషాలు పొందుతుందీ లేదు!!

[పై అనువర్తనలో దొంగతో, సామాన్యులను ఎందుకు పోల్చి చెప్పానంటే - ప్రజలను ఈ ప్రభుత్వం క్రమక్రమంగా అవినీతిపరులను చేయటమే ధ్యేయంగా పనిచేస్తున్నందున! పన్నులు ఎగ్గొట్టేటట్లు, లంచాలు ఇచ్చిపుచ్చుకునేటట్లు, గట్రాగట్రాలు.]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

వ్యాపారం నాడు – నేడు ![భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర - 01]

Fri, 06/04/2010 - 22:48
డిగ్రీ చదివే రోజుల్లో, ఆసక్తి కొద్దీ, నా స్నేహితురాలి ఆర్ధిక శాస్త్రపు టెక్ట్స్ బుక్ తీసుకుని చదివాను. అందులో, తొలి పాఠపు తొలి వాక్యాలుగా ‘వాణిజ్యం [business] అన్నది అంతటా ఉన్న వ్యవహారమే! వ్యాపారం జీవితంతోనే ప్రారంభమౌతుంది. పసి పాప పాల కోసం ఏడుస్తుంది. బిడ్డ ఏడుపు వినగానే తల్లి వచ్చి బిడ్డ అవసరం తీరుస్తుంది. ఆ విధంగా, పసిబిడ్డ తన ఏడుపుని అమ్మి, అమ్మ దగ్గరి నుండి పాలు కొనుక్కుంటుంది. ఆ విధంగా అది కూడా వ్యాపారమే’ అని ఉంది. [ఇప్పుడదే సిలబస్ ఉందో లేదో నాకు తెలియదు.]

వ్యాపారాన్ని నిర్వచించటానికి, దాని గురించి వివరించటానికి, ఈ విధమైన పోలికని విద్యార్ధులకి చెప్పటం, ఏపాటి ఔచిత్యమో నాకు తెలియదు. ఆర్ధిక వేత్తలకే తెలియాలి. వ్యాపార, వాణిజ్యాలకి ఆర్ధిక శాస్త్రంరీత్యా వేర్వేరు నిర్వచనాలున్నాయోమో గాని, ఈ టపాల మాలికలో, నేను మాత్రం రెండింటినీ ఒకే అర్ధంలో ఉపయోగిస్తున్నాను. ‘వస్తు మార్పిడితో, లేదా వస్తు ద్రవ్య మార్పిడితో లాభాన్ని సంపాదించటం, జీవన భృతి పొందటం’ అనే సామాన్య అర్ధంలో!

ఒకప్పుడు మన దేశంలో [బహుశః ప్రపంచమంతా కూడా] బార్టరు పద్దతి, అంటే వస్తు మార్పిడి విధానం అమలులో ఉండేది. ఇప్పటికీ పల్లెల్లో, చాకలి మంగలి వైద్యుడు వగైరా సేవలకు ప్రతిగా, రూపాయల బదులు వడ్లు కొలవటం అనే పద్దతి ఉంది. అదే ఒకప్పుడు, నేత పనివాళ్ళు, కమ్మరి, కుమ్మరులు చేసి ఇచ్చే దుస్తులు, కుండలూ, మట్టి పాత్రలూ, గునపం పారవంటి పనిముట్లకు బదులుగా కూడా, ధాన్యమే కొలిచేవారు.

వస్తుమార్పిడి లేదా బార్టరు విధానం నేపధ్యంలో ఓ చిన్న కథ చెబుతాను.

అనగా అనగా....

ఒకానొక పట్టణంలో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు. అతడు ధనికుడూ, సమర్ధుడూ! అతడికి గుణశేఖరుడనే కుమారుడున్నాడు. గుణశేఖరుడు అందమైన వాడు, సద్గుణ శీలి. అయితే వ్యాపార మెళకువలు గ్రహించటంలో అంత చురుకైన వాడు కాడు.

ఆరీత్యా, ధనగుప్తుడు తన కుమారుడి కోసం తెలివైన వధువుని వెదకాలని నిశ్చయించుకున్నాడు. నిజానికి ఆ వూళ్ళోని చాలామంది ప్రముఖ వర్తకులు, తమ కూతళ్ళని గుణశేఖరుడికిచ్చి పెళ్ళి చేయటానికి సిద్దంగా ఉన్నారు. అయితే ధనగుప్తుడు మాత్రం తనకు కాబోయే కోడలు రూపవతి, గుణవతి మాత్రమే గాక, చురుకైనది కూడా అయి ఉండాలని కాంక్షించాడు. ఆ విషయంలో అతడు రాజీ పడదలుచుకోలేదు.

దాంతో ధనగుప్తుడు తీవ్రంగా ఆలోచించాడు. చక్కని ఆలోచన తట్టింది. సేవకుణ్ణి పిలిచి "ఊళ్ళో వీధుల వెంట తిరిగి, బియ్యం అమ్ముకురా! అయితే నీదగ్గర బియ్యం కొనాలనుకున్న వారందరికీ, బియ్యానికి బదులుగా నువ్వుల నూనె ఇవ్వాలని చెప్పు. ఏ పాత్రతో అయితే బియ్యం కొలిచారో అదే పాత్రతో నూనె కొలవాలని చెప్పు. ఎవరికైతే నువ్వు ఈ విధంగా బియ్యాన్ని, నూనెకు బదులుగా మారకం వేసి అమ్మావో, వెంటనే వచ్చి వాళ్ళ గురించి నాకు వివరాలు చెప్పు. ఊళ్ళో వర్తకుల కుటుంబాలు నివసించే వీధులలోనే బేరానికి వెళ్ళు" అని అజ్ఞాపించాడు.

యజమాని చెప్పిన ప్రకారం ఆ సేవకుడు, బియ్యపు మూట నెత్తిన పెట్టుకుని, వీధుల్లో తిరుగుతూ "బియ్యమయ్యా బియ్యం. బంగారు తీగల్లాంటి బియ్యం. ముత్యాల్లాంటి గింజలు బాబూ!" అంటూ అరవసాగాడు. అతణ్ణి పిలిచి బియ్యం బేరమాడబోయిన వారంతా, బియ్యానికి బదులుగా నువ్వుల నూనె ఇవ్వాలనీ, అదీ ఒకే పాత్రతో కొలవాలన్న షరతు విని బేరం వదులు కున్నారు. ఏ ఒక్కరూ నూనె ఇచ్చి, బియ్యం కొనేందుకు సిద్దపడలేదు. ఎందుకంటే - ఆ రోజుల్లో బియ్యం ధరకి నూనె ధర ఏడు రేట్లు ఎక్కువ మరి! దాంతో ధనగుప్తుడి సేవకుడి షరతు విని, అందరూ నవ్వసాగారు. వాళ్ళకయితే అతడిది ఆశబోతుతనంగా కనిపించింది.

కానీ ధనగుప్తుడి సేవకుడు మాత్రం, యజమాని అజ్ఞ ప్రకారం వీధుల వెంట అరుస్తూ తిరుగుతూనే ఉన్నాడు. "బియ్యమండీ బాబూ బియ్యం. ముత్యాల వంటి బియ్యం. బంగారు తీగల్లాంటి బియ్యం" అంటూ!

రెండు మూడు రోజులు తిరిగినా ఎవరూ బియ్యం కొనలేదు. చుట్టుప్రక్కల పల్లెపట్టణాల్లో కూడా అమ్మబోయాడు. ఓ రోజు ఓ అందమైన యువతి, అతణ్ణి పిలిచి బియ్యం చూపెట్టమంది. ధనగుప్తుడి సేవకుడు మూట దించి బియ్యం చూపెడుతు తన షరతుని వివరించాడు. "అమ్మా! ఏ పాత్రతో బియ్యం కొలిచావో, దాంతోనే నువ్వుల నూనె కొలిచి ఇచ్చేటట్లయితే బియ్యం తీసుకో!" అన్నాడు.

ఆ పిల్ల చిరునవ్వుతో "సరే!" అంది.

సేవకుడు ‘హమ్మయ్యా!’ అనుకుని "అయితే పాత్ర తీసుకు రామ్మా!" అన్నాడు. ఆ అమ్మాయి, వెడల్పాటి అంచుల్లేని పళ్ళెం తెచ్చింది. పళ్ళెం నిండా ఎత్తుగా రాశిలా బియ్యం పోసి తీసుకుంది. తర్వాత అదే పళ్లెంలో నువ్వులు నూనె పోసి అతడికి ఇచ్చింది. ఎలా చూసినా ఆ పిల్లకే లాభం. అప్పటికి ఉన్న ధర ప్రకారం చూసినా, దాదాపు నూనె కన్నా పదిరెట్లు బియ్యాన్ని తీసుకుంది. అంటే కిలో నూనెకి ఏడు కిలోల బియ్యంగా మార్కెట్ ధర ఉంటే, ఆ అమ్మాయి కిలో నూనెకి 10 కిలోల బియ్యం తీసుకుందన్న మాట!

సేవకుడు వెంటనే వెళ్ళి తన యజమానికి జరిగిందంతా చెప్పాడు. ధనగుప్తుడు ఎంతో సంతోషంతో, ఆ పిల్ల తల్లిదండ్రులని సంప్రదించి, ఆమెతో తన కుమారుడు గుణశేఖరుడి వివాహం జరిపించాడు.

ఆమె భర్తకి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండటంతో, తదుపరి వాళ్ళ వ్యాపారం మరింత వృద్దిలోకి వచ్చింది.

ఇదండీ కథ!

ఈ విధంగా.... వ్యాపార మన్నది తెలివి తేటలతో ముడిపడి ఉండాలి గానీ, దగాకోరుతనంతో కాదు. మోసపూరితధోరణి వ్యాపారంలో ఉంటే, ఎప్పుడూ నష్టపోయేది వినియోగ దారుడు మాత్రమే!

వెయ్యేళ్ళ క్రితం [అంటే ఈ దేశంలోకి ముస్లింలు అనబడే ఎడారి దొంగలూ, యూరోపియన్లు అనబడే సముద్రపు దొంగలూ రాకముందు] భారతదేశంలో, బాటసారి, ఏ ఇంటి గడప ముందైనా నిలబడి, తాగేందుకు మంచినీళ్ళు అడిగితే, అతడికి మజ్జిగ ఇవ్వబడేదని చెబుతారు. [అతిధి, అభ్యాగతులకు భోజనం పెట్టటం పుణ్యకార్యంగా భావించే వాళ్ళు] ఆ స్థితి నుండి, తాగునీటిని పాకెట్లలోనూ, సీసాల్లోనూ కొనుక్కునే స్థితికి ప్రయాణించాము. కొన్ని పట్టణాల్లో ప్రభుత్వం సైతం నీళ్ళ వ్యాపారం చేస్తోంది. ప్రజలకి మంచినీటి సౌకర్యం సమకూర్చటం ప్రభుత్వ విధి అని నారదనీతి చెబుతుంది.

ఇలాంటి వ్యాపార దృక్పధంతో, ఎవరైనా... పసిపాప ఏడుపుతో తల్లి దగ్గర పాలు కోరటాన్ని.... ఆకలేసిన చిన్నారి పెదవుల కోసం, భగవంతుడు అమ్మ రొమ్ములలో దాచిన అమృత ధారగా కాకుండా, తల్లిగుండెల్లో మాతృప్రేమగా మూర్తీభవించిన ఆ సృష్టికర్త దివ్య ప్రేమగా గాకుండా.... పసిబిడ్డ ఏడుపుని అమ్ముకుని, తల్లి దగ్గర నుండి పాలను కొనుక్కోవటంగా చూస్తే... ఎంత కౄరమైనది ఆ ఆలోచన?

అంత వ్యాపార దృష్టీ, పదార్ధ వాద దృష్టీ అలవడ్డాక, బిడ్డ ఏడవక పోయినా... గుండెలకు హత్తుకుని, బొజ్జనిమిరి, ఆకలి కనిపెట్టి పాలుపట్టే అమ్మప్రేమ అసలు కనబడదు.

కాబట్టే... ఇంత వ్యాపారం దృష్టి, పదార్ధ వాద దృక్పధమూ తెలియక ముందు... భారతదేశంలో చాలామంది, కొన్ని గృహస్థ నియమాలు పాటించే వాళ్ళు. ప్రతీ రోజూ కనీసం కొంతమందికైనా భోజనం పెట్టిగానీ, తాము భుజించే వాళ్ళు కాదు. అతిధి అభ్యాగతులు దొరకని నాడు భోజనం మానేసే వాళ్ళు. ‘అతిధి దేవోభవ’ అంటూ, ఆకలితో గడపలో అడుగుపెట్టేవాడు దేవుడితో సముడన్నట్లు గౌరవించేవాళ్ళు. [తిధీ నక్షత్రం వంటి వేవీ చూడకుండా వచ్చేవాణ్ణి అతిధి అంటారట.]

పుణ్యం వస్తుందన్న నమ్మకంతో, పేదలనీ, బిచ్చగాళ్ళనీ పిలిచి భిక్ష వేసేవాళ్ళు. జంగమ దేవరలని, గొరవయ్యలని, బుడబుడకల వాళ్ళని, సాక్షాత్తూ ఆదిభిక్షువు శివుడి అవతారంగా తలచి, భక్తీ గౌరవాలతో ఆదరించటం, నాలుగు తరాలకు ముందు కూడా ఆచరణలో ఉన్న విషయమే! సోదమ్మి సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వరుని ప్రతిరూపమే! వీధి భాగవతులూ, హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు.... వీళ్ళెవరినీ ‘బిచ్చగాళ్ళు’ అన్న చులకనతో చూసే వాళ్ళు కాదు. వాళ్ళకుల వృత్తి, గౌరవాదారాలు పొందుతూ ఉండేది. అది ఆనాటి భారతీయుల జీవన సరళి!

ఆ విషయం ప్రక్కన బెడితే.... క్రీస్తు పూర్వమే భారతదేశంలో గొప్ప వర్తకులున్నారని చరిత్ర చెబుతుంది. గుప్తుల కాలంలో కొందరు వర్తకశ్రేష్ఠులు, చక్రవర్తికి సైతం ధన సహాయం, ఋణ సదుపాయం ఇవ్వగల స్థితిలో ఉండేవారనీ, సీమాంతర వ్యాపారం నౌకా వ్యాపారం కూడా నిర్వహించారనీ అంటారు. ప్రాక్పశ్చిమ దేశాల నుండి వచ్చిన [ఇటు చైనా, అటు గ్రీసు] యాత్రికుల రచనలతో సహా, ఎన్నో చారిత్రక ఆధారాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

గ్రీసుతో సహా అనేక ఇతర దేశాలు, ఒక వ్యక్తి ఎన్ని అంకెలు గుర్తుంచుకోగలిగితే అంత మేధావిగా పరిగణించే స్థాయిలో ఉన్నప్పుడే, భారతీయులు 10 to the power of 55 వరకూ అంకెలు తెలిసిన స్థాయిలో ఉన్నారు. ‘సున్న’ వినియోగంతో, దశాంశ పద్దతి తెలిసిన స్థితిలో ఉన్నారు.

[‘సున్నా’ని కనుగొన్నది భారతీయులైతే, కొన్ని శతాబ్దాల క్రితం దాన్ని ప్రచారించింది అరేబియన్ లట. అందుచేత దాన్ని ఇండో-అరబిక్ పద్దతిగా, అయిదవ తరగతి పిల్లలకి గణిత శాస్త్ర పాఠంగా వ్రాసారు. పాపం భారతీయులు కనుక్కోవటమే గానీ, ప్రచారించుకోవటం తెలియక.... అలా.... నీరుగారి ఉంటే, అరేబియన్లొచ్చి ప్రచారించి ప్రయోజనం చేకూర్చారన్న మాట! ప్రచారంలో తిమ్మిని బమ్మి చేయటం, బమ్మిని తిమ్మి చేయటం, నకిలీ కణికులకి వెన్నతో బెట్టిన విద్య. ఎటూ భారతీయులని చిన్నబుచ్చటం, అరబ్బులని ఆకాశానికెత్తటం, ముస్లిం గారాబం నకిలీ కణిక గూఢచర్య లక్ష్యాలయ్యె!]

నిజానికి రామాయణంలో వాల్మీకి మహర్షి, రావణుడి సైన్యశక్తిని వర్ణిస్తూ మాఘనం అనే ఈ సంఖ్యని 10 to the power of 55 గా పేర్కొన్నాడు. రావణుడి సైన్యం 1 ప్రక్కన 55 సున్నాలు పెట్టినంత పెద్దది కావచ్చు, కాకపోవచ్చు. కవి అతిశయోక్తిగా చెప్పి ఉండవచ్చు. కానీ, అప్పటికే 10 to the power of 55 అనే సంఖ్య, వాల్మీకితో సహా ఆనాటి వాళ్ళకి తెలుసన్నదే ఇక్కడ విషయం.

ఆనాటి భారతీయులకే కాదు, శతాబ్దం క్రితం వరకూ కూడా, భారతీయులకి వ్యాపారం తెలుసు గానీ, కార్పోరేట్ వ్యాపారం తెలియదు. భారతదేశపు వర్తకులు వ్యాపారం చేసినా, దానికీ కొన్ని నీతి నియమాలున్నాయి. ధర్మాధర్మ విచక్షణ ఉంది. వారి వ్యాపారం మానవతా విలువలకు ఆవల లేదు. మానవత్వపు పరిధిలోనే ఉంది.

వ్యాపారం చేసేందుకు వాళ్ళు, ప్రజల అవసరాలని అందుకున్నారే గానీ, ప్రజలకు అవసరాలని సృష్టించలేదు. మరో మాటలో చెప్పాలంటే - వాళ్ళు వ్యాపారం చేసేందుకు ‘డిమాండ్’ ని Meet అయ్యారే గానీ, ఈనాటి కార్పోరేట్ కంపెనీలు చేస్తున్నట్లు డిమాండ్ ని సృష్టించలేదు.

నేనీ మాటలు ‘భారతదేశం మాత్రమే గొప్పది, భారతీయులు మాత్రమే నీతిపరులు’ అనే జాత్యహంకారంతో, గర్వంతో, వెనకటి నాజీలు చెప్పినట్లు చెప్పటం లేదు. భారతదేశం మాత్ర్రమే గొప్పది, మిగిలిన దేశాలన్నీ పనికిమాలినవనటం లేదు. నా దృష్టిలో ప్రతీ దేశం, ప్రతీ జాతి, తమమైన గొప్పదనం కలిగి ఉంటాయి. ఎవరికైనా సరే, వారి వారి గొప్పదనాలు[Advantages], బలహీనతలు [Disadvantages] ఉంటాయి. ప్రతిఒక్కరూ అన్ని దేశాలని, అన్ని జాతుల ప్రజలని గౌరవించాలి. ప్రతి ఒక్కరూ తమ మాతృదేశాన్ని తమ స్వంత తల్లిలా గౌరవించి, ప్రేమించాలి. ప్రక్క దేశాన్ని, పొరిగింటి పినతల్లిలా గౌరవించి ఆదరించాలి. అప్పటికి గానీ ప్రపంచశాంతి అనేమాటని ఉచ్చరించలేం.

తల్లినే గౌరవించని స్థితి నుండి, మాతృదేశాన్ని ప్రేమించే స్థితికి ఎప్పటికైనా ప్రయాణించక తప్పదు, ఎవరికైనా సరే! తాలిబాన్లకైనా ముంబై ధాకరేల కైనా! ఈ విషయాంతరం ప్రక్కన బెట్టి, మళ్ళీ ఆర్దిక రంగం ద్వారా కుట్ర దగ్గరికి తిరిగి వస్తాను.

భావవాదం, ఆర్దిక వాదం, కార్పోరేట్ వాదం ల గురించి ఒక చిన్న పోలిక చెబుతాను.

భావవాదం.... అందమైన, ప్రేమమూర్తి అయిన యువతి వంటిది. అది కరుణా హృదయం కలిగిన, సుకుమారి అయిన అమ్మాయి వంటిది. అంతే కాదు, సహనం కలిగిన అమ్మవంటిది. మనిషి మాత్రమే కాదు, సకల ప్రాణ కోటి అనుభవించే భావనలు, చేసే ఆలోచనలు... ఇవన్నీ భావవాదంలోని భాగమే!

ఇక పదార్ధ వాదం.... అందమైన, ధృఢగాత్రుడైన యువకుడి వంటిది. అది స్థిరచిత్తుడైన, బలిష్ఠుడైన, సమర్ధుడైన, సాహస యువకుడి వంటిది. పట్టుదల కలిగిన, లక్ష్య సాధకుడైన నాన్న వంటిది.

భావ వాదమూ, పదార్ధ వాదమూ కూడా.... తమవైన పరిమితులూ, నియమితులూ కలిగి ఉన్నాయి. కాబట్టి భావవాదాన్ని స్త్రీతోనూ, పదార్ధ వాదాన్ని పురుషుడి తోనూ పోల్చాను. అయితే కార్పోరేటిజానికి ఏ నీతి నియమాలూ లేవు, పరిమితులూ లేవు. కాబట్టే అది నపుంసకుడి వంటిది.

ఒక కుటుంబంలో... భార్యభర్తలిద్దరూ, ఒకరి నొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, ఎవరి హద్దులని వాళ్ళు గుర్తుంచుకుంటూ, ఒకరి నొకరు గాయపరుచుకోకుండా, పరస్పరం సహకరించుకుంటూ, గడుపుతున్నారనుకొండి. ఆ కుటుంబం ఎంత హాయిగా, ఆనందంగా ఉంటుంది?

అదే విధంగా, ఒక సమాజంలో... భావవాదమూ, పదార్ధ వాదమూ కూడా, వాటి వాటి అవధుల మేరా ఆదరింపబడితే.... ఆ సమాజం ఎంత శాంతిగా, సౌఖ్యంగా ఉంటుంది?[భావవాదం అంటే మట్టిగొట్టుకు పోవటం కాదు. పదార్ధ వాదం అంటే యాంత్రికంగా బ్రతకటం అంతకంటే కాదు.]

ఒక కుటుంబంలో స్త్రీపురుషులు, భార్యభర్తలుగా సఖ్యంగా జీవిస్తే, వాళ్ళకి ‘సంతానం’ అనబడే భవిష్యత్తు ఉంటుంది. అంతే కానీ.... స్త్రీ అయినా, పురుషుడైనా, ఒక నపుంసకుడితో కలిసి జీవిస్తే, పిల్లలూ పుట్టరూ, భవిష్యత్తూ ఉండదు.

ప్రస్తుతం కార్పోరేటిజం.... సమస్త ప్రపంచాన్ని, సమస్త మానవ జాతిని, సమస్త ప్రాణకోటినీ, అలాంటి భవిష్యత్తు లేని పరిస్థితికే తరుముకెళుతోంది.

ఇక్కడ నేను చెప్పిన పోలిక గురించి, కొంచెం వివరణ ఇవ్వదలుచుకున్నాను. పై పోలికతో ‘హిజ్రాల’ను నేను అగౌరవించలేదని మనవి. వాళ్ళు శారీరకంగా మాత్రమే వికలాంగులు. నాకు వారి పట్ల గౌరవం, సానుభూతి ఉన్నాయి. ఈ పోలికలో నేను, కార్పోరేట్ వ్యాపార సంస్థలని [స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, సూపర్ బజార్లు, వస్తు విక్రయశాలలు, వస్తూత్పత్తి కర్మాగారాలతో సహా] మాత్రమే నపుంసకులతో పోల్చాను. ఎందుకంటే - సదరు కార్పోరేట్ కంపెనీలు మానసికంగా నపుంసకులు గనుక!

నాలుగైదు దశాబ్దాల క్రితం, ప్రపంచవ్యాప్తంగా కార్పోరేట్ కంపెనీలు, తమ ఆయుధాల అమ్మకాల కోసం, దేశాల మధ్య యుద్దాలు సృష్టించాయి. జగమెరిగిన సత్యమిది. ఎందరో చర్చించగా, వ్రాయగా, వినీ చదివి ఉన్న విషయం ఇది. 1990లో రష్యా కుప్పకూలిపోయాక, ఈ ప్రచ్ఛన్న యుద్దపు పైకారణం[over leaf reason] చిరిగిపోయింది.

ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలు, తమ వ్యాపారం కోసం కొత్తదారులు వెదుకుతున్నాయి. కొత్త రోగాలు, కొత్త మందులూ కనుక్కుంటున్నాయి. కొత్త మోజులు సృష్టిస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ – మరో స్ట్రాటజీ!

Thu, 06/03/2010 - 23:08
ఇక పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ చేసినట్లే - ఈ స్ట్రాటజీ గురించి మరో చిన్న కథ! ఇది ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథ!

అనగా అనగా....

ఓ కాలనీలో ఓ విశ్రాంత ఉద్యోగి ఉన్నాడు. పెద్దవయస్సురీత్యా అతడికి పెద్ద చప్పుళ్ళంటే చిరాకుగా ఉండేది. ఆ వీధిలో పిల్లలు పగలూ రాత్రీ లేకుండా, అలుపెరగకుండా, క్రికెట్టు ఆడుతుండే వాళ్ళు. వాళ్ళ అరుపులూ కేకలతో ఈ పెద్దమనిషికి అసహనంగా ఉండేది.

ఆ పిల్లలతో క్రికెట్టు ఆడటం మాన్పించటం ఎలాగా అని ఆలోచించాడు. అనునయంగా చెబితే వినే రకాలుగా కన్పించలేదు. అదీ గాక చుట్టు ప్రక్కల వాళ్ళు ఆ పిల్లలకి చెప్పి చూశారు. ఆ పిల్లలు వింటే కదా! ఓ ఉపాయం తట్టింది.

వెంటనే ఆ పిల్లల దగ్గరికి చేరి "నాకూ క్రికెట్టు ఆటంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మీలాగే బాగా ఆడేవాణ్ణి. మీరు ఈ వీధిలో క్రికెట్టు ఆడినప్పుడల్లా నేను మీకు పాతిక రూపాయలిస్తాను" అన్నాడు.

పిల్లలు మహాదానంద పడిపోయారు.

మర్నాడు మహోత్సాహంగా క్రికెట్టు ఆడేసారు. చెప్పినట్లుగానే మన పెద్ద మనిషి కూడా పిల్లలకి పాతిక రూపాయలిచ్చాడు. నాలుగురోజులు గడిచాయి.

ఆ తర్వాత ఆ పెద్దమనిషి పిల్లలతో "నా పెన్షన్ డబ్బులు తక్కువ వస్తున్నాయి. అందువలన ఇప్పుడు పాతిక రూపాయలు ఇవ్వలేను" అంటూ పది రూపాయలిచ్చాడు. పిల్లలు ముఖాముఖాలు చూసుకున్నారు. ఆ మర్నాడు అయిదు రూపాయలే ఇచ్చాడు.

పిల్లలు ఓ మూలకి చేరి గుసగుసలు పోయారు.

"ఈ అంకుల్ మొదట్లో పాతిక రూపాలిచ్చాడు. ఇప్పుడు మరీ అయిదు రూపాయలిస్తానంటున్నాడు. రేపటి నుండి అదీ ఇవ్వనంటాడేమో! ఎంచక్కా తేరగా మాత్రం మన ఆటని ఆనందిస్తున్నాడు. రేపటి నుండి ఈ వీధిలో మనం క్రికెట్టు ఆడనే వద్దు. ప్రక్క వీధిలో ఆడుకుందాం" అనుకున్నారు.

దెబ్బతో పెద్దమనిషికి సమస్య పరిష్కారమై పోయింది.

ఇదీ కథ!

ఇందులో ప్రయోగింపబడింది.... ‘కొంచెం మేలు చేసి, దాన్ని తొలిగిస్తే కీడు చేసినట్లే’ అన్న తంత్రమే! అంటే పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ చేసినట్లన్నమాట! నిజానికి పెద్దమనిషి పిల్లలకి పాతిక రూపాయలు ఇస్తాననటానికి ముందూ వెనకా, పిల్లలకి సంబంధించి, క్రికెట్ట్ ఆడుకోవటంలో తేడా ఏం లేదు. కాని తమ ఆటకి ముందు డబ్బులు వచ్చి, తరువాత రాకపోవటం తమకి నష్టంగా, కష్టంగా అంటే నెగిటివ్ గా అన్పించింది.

సాధారణంగా ఈ స్ట్రాటజీని, నకిలీ కణిక వ్యవస్థ ప్రజల మీద ప్రయోగించదు. ఎందుకంటే - ఎట్టి పరిస్థితులల్లోనూ, ఏ సమయంలోనూ, నకిలీ కణిక వ్యవస్థ ప్రజలకి మేలు, అంటే పాజిటివ్ చేయదు గనక! చేస్తున్నట్లు పిక్చర్ ఇస్తుంది అంతే!

అయితే ఈ ‘పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ జరిగినట్లే’ అన్న స్ట్రాటజీని, తాము గురిపెట్టిన వ్యక్తుల మీద [అంటే రాజకీయులు, సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలూ మొదలైన ప్రముఖల మీద] ప్రయోగిస్తారు.

ఉదాహరణకి....

‘ఫలానా నటి లేదా నటుడికి, ఫలానా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వారి సినిమాలో వేషం వచ్చింది’ అంటూ తెగ ఊదర పెట్టటం, ఆ తర్వాత సదరు అవకాశం, సదరు నటి లేదా నటులకు దక్కలేదనీ, మరో తార ఆ అవకాశాన్ని ఎగరేసుకు పోయిందనీ వార్తలు చదువుతుంటాం. పెద్దగా పట్టించుకోం. అయితే ఆ స్ట్రాటజీ ఎవరి మీదైతే ప్రయోగింపబడిందో వాళ్ళకి మాత్రం, తమకి నెగిటివ్ జరిగిందనే అన్పిస్తుంది.

నిజానికి సదరు వార్తకి ముందూ వెనకా పరిస్థితిలో మార్పేమీ లేదు. ప్రతిష్ఠాత్మక సంస్థలో అవకాశం రావడం, పోవడం.... అంతే. అసలు ఆ అవకాశమే రాలేదనుకుంటే సరిపోదా? తేడా ఏమిటీ? చుట్టూ ఉన్న వాళ్ళలో.... చులకన అవుతామనీ, తమకి నెగిటివ్ లేదా ఓటమి వచ్చిందని, తమ చుట్టూ ఉన్నవాళ్ళు తమని గురించి అనుకుంటున్నారని... అనుకుంటే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి సదరు ప్రముఖ వ్యక్తులు దాన్ని నెగిటివ్ జరిగినట్లుగానే పరిగణించక తప్పదు.

అదే రాజకీయ నాయకుల జీవితాల్లో అయితే, ఈ స్ట్రాటజీ ప్రయోగం మరింత బలంగా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడి గురించి.... ‘ఫలానా నాయకుడికి మంత్రి పదవో మరో పదవో రానున్నదని’ ఓ ప్రచారం వచ్చిందనుకొండి. చుట్టూ ఉన్న వారిలో అతడి పరపతి, ప్రాముఖ్యత పెరుగుతుంది. అది పాజిటివ్ i.e. మేలు జరిగినట్లు! ఈ ప్రచారం బాగా జరిగాక.... ఎవరో ఎక్కడో అడ్డం పడినందునో, ఎవరో చక్రం తిప్పినందునో, మరింకో కారణంతోనో ‘పదవి రాలేదన్న’ ప్రచారం వస్తుంది. దెబ్బతో సదరు నాయకుడికి గౌరవభంగం కలుగుతుంది. అతడి బలం తగ్గిపోయినట్లూ సర్వత్రా మాట వస్తుంది. అది నెగిటివ్ i.e.కీడు.

మరో స్పష్టమైన ఉదాహరణ చెప్పాలంటే - 2009, మే ఎన్నికలకి ముందు, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్., విపరీతంగా ఇందిరమ్మ ఇళ్ళు, ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ కార్డులు, ఇతర ఆకర్షణీయ పధకాలు ఇబ్బడిముబ్బడిగా ఇచ్చేసాడు. అది మరింత పాజిటివ్ చేయటం అన్నమాట.

ఒకవేళ ఎన్నికల్లో గెలవలేదనుకొండి. అప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటారు. ఎటూ అతి భారమయ్యే సంక్షేమపధకాలని [ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళూ గట్రాలతో సహా] అధికారంలోకి వచ్చిన పార్టీ అమలు చేయలేక.... కోతలూ, రద్దులూ విధించక తప్పదు. అప్పుడు పాజిటివ్ లో పాజిటివ్ కట్ అవుతుంది. అంటే నెగిటివ్ జరిగినట్లే కదా!

దాన్నే ఆయుధంగా అందుకుని, అరిచి గోల చేస్తే, ప్రతిపక్షంలో ఉన్నందుకు పైకారణమూ[over leaf reason] సరిపోతుంది. అధికార పక్షాన్ని ఇరుకునా పెట్టినట్లూ అవుతుంది. ఒకవేళ గెలిచారనుకొండి. అప్పుడెలాగో ఒకలా సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రచారంతో కమ్ముకోనూ వచ్చు. ఎటూ ఆర్దిక మాంద్యం కారణం ఉండనే ఉంది.

ఏది ఏమైనా గెలవడం ముఖ్యం! ఇదే అప్పట్లో వై.యస్. వ్యూహం. కాబట్టే.... తెదేపా, తెరాస, ఎర్రపార్టీలతో కూడిన అలయెన్స్ ప్రకటించిన ‘నగదు బదిలీ పధకపు’ ఆలోచన తమకు ముందుగా రాలేదని, వచ్చి ఉంటే సాధ్యసాధ్యాలు చూసుకుని, అదీ తమ హామీలలో ఉండి ఉండేదనీ, అప్పట్లోనే అన్నాడు వై.యస్.!

అయితే ఈవిఎం ల పుణ్యామా అని, ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్సే గెలిచి, వై.యస్సే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. దాంతో మెల్లిగా బోగస్ కార్డులు ఏరివేత గట్రా నసుగుళ్ళు నసుగుతూ ఉండగానే, అర్ధాంతరంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు.

అప్పుడు తండ్రి అమలు పరిచిన ‘పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే, అదే నెగిటివ్ జరిగినట్లు’ అన్న స్ట్రాటజీని వై.యస్. కుమారుడు జగన్, రోశయ్య మీద ప్రయోగిస్తున్నాడు. అందుకే ప్రతిసభలోనూ రోశయ్య, ‘వై.యస్. పధకాలని కొనసాగించటం తప్ప, మరో అజెండా ఏదీ తమకు లేదని’ పదేపదే ప్రకటిస్తుంటాడు. వై.యస్. పధకాల అమలు సరిగా లేదని జగన్ అరుస్తుంటాడు. ఆపై కారణాల వెనక నడుస్తున్న వ్యవహారం సంపూర్తిగా వేరనుకొండి. మరికొంత పరిపక్వం అయ్యాక గానీ, మనకి దాని రంగు రుచి వాసనా స్పష్టం కావు, అది వేరే విషయం.

మా జీవితంలో రామోజీరావు ప్రయోగించిన ఈ ‘పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే అదే నెగిటివ్’ అనే స్ట్రాటజీ యొక్క పర్యవసానాలు, అనుభవాలు చాలానే ఉన్నాయి.

ఒకోసారి మనల్ని మనచుట్టూ ఉన్న అందరూ తెగ పొగిడేస్తారు. ఎంతో స్నేహంగా మెలుగుతూ, మనకి చాలా ప్రాముఖ్యత నిస్తారు. హఠాత్తుగా అదంతా కట్టి పెట్టి, చాలా ముభావంగా, మనం కన్పిస్తే ముఖం తిప్పుకుంటారు. అందరూ! ఆ విధంగా మేలు చేసినట్లే చేసి, దాన్ని ఆపేసి, కీడు జరిగిందనటం - పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేసి నెగిటివ్ జరిగిందనటం!

నిజానికి ముందంతా మనల్ని ఉబ్బేయటం అంటేనే, మన అహన్ని సంతృప్తి పరచటం! ఒక్కసారిగా నిర్లక్ష్యానికి గురి చెయ్యట మంటే అహం మీద దెబ్బకొట్టటం. ఎటూ నకిలీ కణికులకి వచ్చిన పది స్ట్రాటజీలలో ముఖ్యమైనవి అవే! అహం తృప్తి పరచటం లేదా అహాన్ని రెచ్చగొట్టటం!

ఆ విధంగా పాజిటివ్ ఇచ్చినట్లే ఇచ్చి, దాన్ని కట్ చేస్తే అదే నెగిటివ్!

నిజానికి ఇవి మనస్తత్వపు శాస్త్రంతో మేళవించి ప్రయోగించే స్ట్రాటజీలు! మరో మాటలో చెప్పాలంటే - మానసిక యుద్దతంత్రాలు! ప్రస్తుతం నకిలీ కణిక వ్యవస్థ చాలామంది మీదా ప్రయోగిస్తున్న తంత్ర్రాలు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

నెగిటివ్ లో నెగిటివ్ కట్ చేస్తే పాజిటివ్ - ఒక స్ట్రాటజీ!

Thu, 06/03/2010 - 02:40
మామూలుగా, సాదా సీదాగా నడుస్తున్న వ్యవహారంలో, మరింత కీడు చేసి, అందులో కొంచెం తగ్గిస్తే - మంచి చేసినట్లే! ఇదే ‘నెగిటివ్ లో నెగిటివ్ కట్ చేస్తే పాజిటివ్ చేసినట్లు’ అనే స్ట్రాటజీ!

అలాగే.....

మామూలుగా, సాదా సీదాగా నడుస్తున్న వ్యవహారంలో, కొంచెం పాజిటివ్ చేసి, దాన్నే తగ్గిస్తే - కీడు జరిగినట్లే! ఇది ‘పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ చేసినట్లు’ అనబడే స్ట్రాటజీ!

కొంచెం గందరగోళంగా అన్పించే ఈ స్ట్రాటజీలని వివరించడానికి రెండు చిన్న కథలు చెబుతాను.

ముందుగా నెగిటివ్ లో నెగిటివ్ గురించి!

అనగా అనగా....

ఒక ఊళ్ళో ధనపాలుడు అనే దర్జీ ఉండేవాడు. అతడి పేరులో ఉన్న ధనం, పాపం అతడి ఇంట్లో లేదు. భార్య, ముగ్గురు పిల్లలతో చిన్న ఇంట్లో ఉండేవాడు. ఇంట్లోనే కుట్టుపని చేసుకు బ్రతికేవాడు. అంతంత మాత్రపు సంపాదనతో సర్ధుకుపోలేక, అతడి భార్య అతడి మీద ఎప్పుడూ అరుస్తూ ఉండేది.

తల్లిదండ్రుల కీచులాటలతో సహజంగానే పిల్లలూ అల్లరిగా తయారయ్యారు. వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళు.

ఓ రోజు ధనపాలుడు గుడికి వెళ్ళాడు. గుళ్ళో పండితుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. ధనపాలుడు అక్కడ కూర్చొని కాస్సేపు పురాణం విన్నాడు. అందరూ వెళ్ళిపోయాకా పండితుణ్ణి కలుసుకుని "స్వామీ!" అని పిలిచాడు.

"ఏం నాయనా?" అన్నాడు పండితుడు. తన బాధలన్నీ చెప్పుకుని పరిష్కారం చూపమన్నాడు ధనపాలుడు. సంతోషంగా గడపటానికి తగిన మంత్రమో తంత్రమో చెప్పమన్నాడు.

పండితుడు ఒక్కక్షణం ఆలోచించి "రేపు రా నాయనా!" అన్నాడు.

మర్నాడు ధనపాలుడు, పండితుణ్ణి కలుసుకున్నాడు. ప్రశాంతంగా గుడి ఆవరణలో కూర్చొన్న పండితుడు "మీ ఇంట్లో కోళ్ళున్నాయా?" అనడిగాడు.

ధనపాలుడు లేవన్నట్లు తల అడ్డంగా ఊపాడు.

"రేపు ఓ కోడిని కొనుక్కుని ఇంటికి వెళ్ళు. దాన్నిపెంచుకో! ఓ వారం ఆగి వచ్చి పరిస్థితేమిటో నాకు చెప్పు" అన్నాడు పండితుడు.

‘కోడిని పెంచితే తన పరిస్థితి బాగుపడుతుంది కాబోలు’ అనుకొని, ధనపాలుడు ఓ కోడిని కొనుక్కుని ఇంటికి పోయాడు.

వారం తర్వాత పండితుణ్ణి కలుసుకున్న ధనపాలుడు "స్వామీ! అసలే ఇరుకు ఇల్లు! కోడి ఇల్లంతా తిరుగుతూ రెట్టలు వేస్తోంది. అదంతా శుభ్రం చెయ్యలేక నా భార్య నన్ను నానా తిట్లూ తిడుతోంది. ఆ కోడి నా సూదులూ, దారాలూ కూడా చిందర వందర చేస్తోంది. ఈ సందట్లో నా పిల్లలు సూదులు, కత్తెర్లతో ఆడుకుంటున్నారు" అన్నాడు ఏడుపు ముఖంతో!

పండితుడు అదేం పట్టించుకోకుండా "మీ ఇంట్లో పిల్లి ఉందా?" అన్నాడు. ధనపాలుడు తెల్లబోయి "ఎందుకు స్వామీ? లేదు" అన్నాడు ప్రశ్నాజవాబు ఒకేసారి చెబుతూ!

"ఓ పిల్లిని పెంచుకో! వారం ఆగి వచ్చి కనబడు" అన్నాడు పండితుడు.

‘సరే! పిల్లిని కూడా పెంచితే మంచి జరుగుతుందేమో’ అనుకుంటూ ధనపాలుడు తెలిసిన వాళ్ళనుండి ఓ పిల్లిని తీసికెళ్ళాడు. వారం గడిచింది. పండితుణ్ణి కలుసుకున్నప్పుడు "స్వామీ! నిరంతరం పిల్లి, కోడిని తరుముతోంది. ఇల్లంతా అవి పరుగులు పెట్టడంతో కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. వాటి అరుపులతో పాటు నా భార్య కేకలతో, చెవులు చిల్లులు పడుతున్నాయి" అన్నాడు.

పండితుడు "అయితే ఈ సారి ఓ కుక్కని కూడా పెంచుకో!" అన్నాడు. ధనపాలుడు నీరసంగా సరేనన్నాడు. కుక్కనీ ఇంటికి తీసికెళ్ళాడు. వారం తర్వాత పండితుణ్ణి కలిసినపుడు లబోదిబో మన్నాడు. పండితుడు చిరునవ్వు నవ్వుతూ "ఓ గాడిదని కూడా ఇంటికి తీసుకెళ్ళు" అన్నాడు.

ఈ సారి వారం కంటే ముందే ధనపాలుడు పండితుణ్ణి కలుసుకుని బోరుమన్నాడు. అతడి ముఖం దైన్యంగా ఉంది. కళ్ళక్రింద నల్లటి చారలు ఏర్పడ్డాయి. మనిషి తిండీ నిద్రా లేనట్లు నీరసించి ఉన్నాడు.

"స్వామీ! పగలంతా కుక్కా, పిల్లీ, కోడి ఒక దాన్నొకటి తరుముకుంటూ అరుస్తున్నాయి. నా భార్య నాతో మాట్లాడటం కూడా మానేసింది. ఇక రాత్రిపూట ఇంట్లో పడుకునేందుకు కూడా చోటు లేకుండా పోయింది. వీధి ఆరుగు మీద పడుకుంటే గాడిద వెనక్కాలితో ఈడ్చి తంతోంది" అన్నాడు.

పండితుడు ప్రశాంతంగా "గాడిదని అమ్మెయ్! కుక్కనీ పిల్లినీ ఇంట్లోంచి తరిమెయ్! కోడిని వండుకు తినండి. వారం తర్వాత వచ్చి కనబడు. అప్పుడు, నీకు సంతోషంగా గడిపేందుకు తగిన మంత్రం చెబుతాను" అన్నాడు.

వారం గడిచింది. ధనపాలుడు పండితుణ్ణి కలుసుకున్నాడు. ఈ సారి ధనపాలుడి ముఖం వెలిగిపోతోంది. పెదవుల మీద చిరునవ్వు మెరుస్తోంది.

"ఎలా ఉన్నావు నాయనా?" అన్నాడు పండితుడు.

"స్వామీ! సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మా ఇంట్లో తరుముకుంటూ పరుగులెత్తే కుక్కాపిల్లీ లేవు. ఈడ్చి తన్నే గాడిదని అమ్మి పారేసాను. హాయిగా ఇంట్లో నిద్రపోతున్నాను. మా ఆవిడ కోడి కూరని అద్భుతంగా వండింది. నిజంగా అది కోడికూర కాదు, వెన్నపూసే! నోట్లో వేసుకుంటే కరిగిపోయింది" అన్నాడు ధనపాలుడు సంతోషంగా!

"అయితే ఇప్పుడు నీ ఇల్లు ఇరకటంగా, ఆలి మరకటంలా లేవా?" అడిగాడు పండితుడు.

"నాకేం స్వామీ? మా ఇల్లు చిన్నదైనా చక్కని ఇల్లు. మా ఆవిడ చాలా మంచిది. పరమ సాధ్వి. నా పిల్లలు ముగ్గురూ మూడు రత్నాలు!" అన్నాడు సంతృప్తిగా.

పండితుడు చిరునవ్వు నవ్వుతూ "అదే సంతోష రహస్యం! ఉన్నదానితో సంతృప్తి పడటమే, సంతోషంగా గడపటానికి ఉన్న మంత్రం. ఉండడానికి నీకు ఇల్లుంది. ఇల్లూ వాకిలీ లేని బికారుల కంటే నువ్వు చాలా మేలు. గయ్యాళిదే అయినా, వేళకన్నీ అమర్చి పెట్టే భార్య ఉంది. అల్లరి చేసినా ముచ్చటైన పిల్లలున్నారు. భార్యాబిడ్డలు లేని ఒంటరి వాడితో పోల్చుకుంటే నీ పరిస్థితి మెరుగైనదే! మనకి ఉన్నదానితో తృప్తి పడుతూ, లేని దాని కోసం కృషి చేస్తూ ముందుకు సాగితే జీవితం సంతోషంగా నడుస్తుంది. అభివృద్ది లోకి రావాలన్న కాంక్ష, అందుకు తగిన కృషీ ఉండాలి గానీ, ఉన్న దాని పట్ల అసంతృప్తి ఉండకూడదు. జీవితం పట్ల అసంతృప్తి ఉంటే ఆనందం మనకి ఆమడ దూరంలో ఉంటుంది" అన్నాడు.

ధనపాలుడు అంగీకార సూచనగా నవ్వుతూ "అర్ధమైంది స్వామీ!" అన్నాడు.

ఇదీ కథ!

ఈ కథలో, పండితుడు చెప్పిన నీతి విలువైనది. ఇందులో ప్రయోగించ బడ్డ స్ట్రాటజీ.... మరింత కీడు, లేదా ఇబ్బంది కలిగించి, ఆనక దాన్ని తొలగించి.... మేలు జరిగిందనటమే! అదే ‘మరింత నెగిటివ్ చేసి, అందులో కొంత కట్ చేసి పాజిటివ్ జరిగిందనే’ స్ట్రాటజీ!

పండితుణ్ణి కలిసినప్పటికీ, తర్వాతకీ ధనపాలుడి జీవితంలో మార్పేమీ లేదు, దృక్పధంలో తప్పితే! అదే ఇరుకు ఇల్లు, అదే గయ్యాళి భార్య, అదే అల్లరి పిల్లలు, అదే అంతంత మాత్రపు సంపాదన! అతడి పరిస్థితిలో ఏమార్పూ లేదు. పండితుణ్ణి కలవటానికి ముందూ, తర్వాతా కూడా! కానీ కోడీ, కుక్క, పిల్లీ, గాడిదలతో పరిస్థితి మరింత దిగజారి పోయి, తర్వాత మెరుగైనందున ధనపాలుడు ఎంతో సంతోషించాడు.

సరిగ్గా ఈ స్ట్రాటజీనే... నకిలీ కణిక వ్యవస్థ, అన్నిదేశాలలో ఆయాప్రభుత్వాల ద్వారా, ప్రజల మీద ప్రయోగిస్తుంది. మచ్చుకి మన దేశంలోని కొన్ని ఉదాహరణలు చూడండి!

ఆర్టీసీ బస్సు, గ్యాసు ధరలు అమాంతం పెంచుతుంది. జనం ఘోల్లు మంటారు. ప్రతిపక్షాలు గయ్యిమంటాయి. ఆనక పెంచిన రేట్లలో కొంచెం తగ్గిస్తుంది ప్రభుత్వం. ఏదో మేలు జరిగినట్లు ప్రజలూ నిట్టూరుస్తారు. ప్రతిపక్షాలూ, మీడియా మెల్లిగా మౌనం పాటిస్తాయి. అందుకు ఎవరి కారణాలు వాళ్ళవి. ఇందులో ఉన్నది ‘నెగిటివ్ లో నెగిటివ్ కట్ చేస్తే పాజిటివ్’ అన్నదే!

అలాంటిదే దొడ్డు బియ్యంతో సహా బియ్యం,పప్పు ధరల విషయంలోనూ ఇదే స్ట్రాటజీ! రెండేళ్ళ క్రితం కిలో 14 నుండి 18 రూపాయలున్న సన్నబియ్యపు ధర, 35 నుండి 40 రూపాయలకు పెరిగాక, దాన్ని 29-31 కి తగ్గించి "చూశారా ధరలు నియంత్రించాం" అన్న ఫోజులు పెట్టాడు మరణించిన ముఖ్యమంత్రి వై.యస్.[కృష్ణ పట్నం రేవు నుండి దొంగ రవాణా అయిన బియ్యం గురించి మాట్లాడ లేదు.]

పప్పు ధరలైతే కిలో 25/-రూపాయలు నుండి 100/- కి పెరిగి ఇప్పుడు 65-70 కి దిగితే... అదే గొప్ప పాజిటివ్ అని చెబుతున్నాడు, ఆర్ధిక వేత్త అవతారం నుండి ప్రస్తుతం ప్రధానమంత్రి అవతారంలోకి పరకాయ ప్రవేశం చేసిన మన్మోహన్ సింగ్. ఇంకా మాట్లాడితే ప్రపంచమంతా ఆర్ధిక మాంద్యంతో ధరలు పెరిగాయంటున్నాడు. [కాండ్లా నుండి దుబాయ్ కి దొంగ రవాణా అవుతున్న బియ్యం గురించి మాట్లాడడులెండి.]

మా జీవితంలో అయితే, రామోజీరావు ఈ స్ట్రాటజీని పలుమార్లు ప్రయోగించాడు. పరిశ్రమ అధినేత్రి స్థాయి నుండి లెక్చరర్ స్థాయికి, అక్కడి నుండి ఇల్లూ వాకిలీ లేని బికారి స్థాయికీ చంద్రబాబు మమ్మల్ని తరిమాడు. 1995 నవంబరులో మేం ఫ్యాక్టరీ వదిలి నంబూరు పల్లెకు చేరాల్సి వచ్చింది. ఆ విధంగా... ఆర్ధికస్థాయి, సాంఘీక స్థాయి, పరిశ్రమ అధిపతి స్థాయి నుండి దిగువకి జారింది.

ఆపైన వై.యస్. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక - శ్రీశైలంలో ఓ చిన్న గదిలో, 60 మంది విద్యార్ధులతో, నాలుగేళ్ళ పాటు, ఓ చిన్న బడి నడపగలగటం - అన్నది, మాకు చేసిన `గొప్ప మేలన్న' మాట. ఇదే ఊదర మాకు పెట్టటం గురించి గతటపాలలో కూడా వ్రాసాను. చంద్రబాబు, వై.యస్.ల ఇద్దరి వెనకా ఉన్నది రామోజీరావే నన్న విషయం... సాక్ష్యాధార పత్రాలూ, దృష్టాంతాలతో సహా నిరూపించి మరీ, ఇది చెబుతున్నాను.

ఈ విధంగా `నెగిటివ్ లో నెగిటివ్ కట్ చేసి పాజిటివ్ చేశామనటం' - పరిశ్రమ అధినేత్రి స్థాయి నుండి బికారి స్థితికీ, అక్కడి నుండి బడిపంతులమ్మ స్థితికి తరమటం!

ఇలాంటి మానసిక యుద్దతంత్రాలే నకిలీ కణిక వ్యవస్థ.... ప్రజల మీదా, తాము గురిపెట్టిన వ్యక్తుల మీదా ప్రయోగిస్తుంది.

ఓపికతో పరిశీలించాలే గానీ పేద్ద జాబితా తయారౌతుంది.

ఇక పాజిటివ్ లో పాజిటివ్ కట్ చేస్తే నెగిటివ్ చేసినట్లే - ఈ స్ట్రాటజీ గురించి మరో చిన్న కథ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

పిల్లితల్లి తన చిన్నకూనకి ఏం నేర్పుతుంది ? [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 12]

Tue, 06/01/2010 - 22:55
విద్యార్దుల ర్యాంకులూ, మార్కులలో అక్రమాలని గమనించకుండా, తల్లిదండ్రులు తమ పిల్లలు అధిక మార్కులు, ర్యాంకులూ తెచ్చుకోవటం తమ ప్రతిష్ఠకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తున్నారు. పిల్లల కంటే ఎక్కువగా వారి తల్లిదండ్రులకే.... ర్యాంకులూ, మార్కుల మీద మోజులున్నాయి. ‘మా వాడు టౌన్ ఫస్ట్, మండలం ఫస్ట్, స్టేట్ ఫస్ట్.... చివరికి స్ట్రీట్ ఫస్ట్ అయినా రాకపోతే, ఎంత అవమానం?’ అనుకొని, పిల్లల్ని వత్తిడి చేయటమూ కద్దు!

ఇక ప్రభుత్యోద్యోగులూ, విద్యాశాఖ ఉన్నతోద్యోగులూ, అదే బాటలో రాజకీయూలూ కూడా, ఇవేవీ ఆలోచించకుండా డబ్బుపట్ల మోజుతో పరుగులెత్తుతున్నారు. తల్లిదండ్రులది మార్కులూ, ర్యాంకుల మోజులైతే, వీరివి డబ్బుల మోజులూ. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకి [టీచర్లకి, ఇతర డిపార్ట్ మెంట్లలో పనిచేసే వారికి కూడా] బినామీ పేర్లతో లేదా భార్యల పేరుతో విద్యాసంస్థలున్నాయి.

మా నంద్యాలలో అయితే... సగం స్కూళ్ళు, కాలేజీలు ప్రభుత్యోద్యోగులవే! ఒక్క నంద్యాలలోనే కాదు చాలా ఊళ్ళల్లో ఇదే బాపతు! రాజకీయ నాయకులకి ఇంజనీరింగ్ కాలేజీలతో సహా పాఠశాలలు, కళాశాలలూ ఉన్నాయి. విద్యా వ్యాపారం అత్యంత లాభసాటి వ్యాపారం, ever green వ్యాపారం మరి!

ఇక్కడ ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. ఓ పిల్లి తల్లిని పరిశీలించండి. అది తన చిన్నకూనకి ఎలుకని ఎలా వేటాడాలో, ఇల్లిల్లు తిరుగుతూ ఆహారాన్ని ఎలా వెదుక్కోవాలో శిక్షణ ఇస్తుంది. సగం చచ్చిన ఎలుకని తెచ్చి, పిల్లికూన ముందు పెట్టి వేటాడటంలో శిక్షణనిస్తుంది. ఓ కుక్క తల్లిని చూడండి. తన పిల్లల్ని వెంట బెట్టుకుని, చెత్త కుండీల దగ్గర నుండి ఇంటి గడపల దాకా, వీధిలో తిండి ఎలా వెదుక్కోవాలో నేర్పిస్తుంది.

తమ టెరిటరీని కాపాడుకుంటూ వేరే వీధి కుక్కలు తమ వీధిలోకి రాకుండా నియంత్రిస్తూ కుక్కులు గ్యాంగ్ వార్ చేస్తాయి. ఆ గుంపు తగాదాలని కూడా, తల్లి కుక్క తన పిల్లలకి నేర్పిస్తుంది. ఎందుకంటే వాటికి మార్కుల, డిగ్రీల, సర్టిఫీకెట్లు ఇచ్చే వాళ్ళు లేరు. ఆ సర్టిఫీకెట్లు చూపిస్తే తిండి దొరకదు. అడ్డదారుల్లో సంపాదించిన సర్టిఫికెట్లు ఉపయోగించి, అంతే అడ్డదారుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కుదురుకుంటే పనిచెయ్యకుండానే జీతపు రాళ్ళు, పైరాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం ఆయా జంతువులకు లేదు. అందుచేత పని[విద్య] నేర్చుకోవటం, తప్పని సరి!

ప్రస్తుతం మన సమాజంలో, జంతు సహజమైనదీ, ప్రకృతి సహజమైనదీ అయిన ‘తరం నుండి తరం నేర్చుకోవటం’[అది గురువుల నుండి కానివ్వండి, తల్లిదండ్రుల నుండి కానివ్వండి.] అన్న ప్రక్రియ ప్రాభవం కోల్పోయింది.

ఇప్పుడు చాలామంది, విద్యాభ్యాసం విషయంలో ‘ఏదో ఒకటి చేసి’ మార్కులూ, ర్యాంకులూ సంపాదించినట్లే, ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగాల్లో చేరితే [చాలు! ఆ ‘ఏదో ఒకటి చేసి’ అన్న దాంట్లో లంచం ఇవ్వటానికే కాదు, ఏ అవినీతికైనా సిద్దపడటానికి సందేహించటం లేదు. ఏం చేస్తేనేం? ప్రభుత్యోద్యోగం సంపాదిస్తే చాలు. జీవిత లక్ష్యం నెరవేరినట్లే! అది ఇక జీవిత సాఫల్యమే!

పని చెయ్యాల్సిన అవసరం అంతగా లేదు. పని సామర్ధ్యంతో పనిలేదు. ప్రతిభా పాటవాలతో అంతకంటే పనిలేదు. ప్రైవేటు సంస్థలలో లాగా, ఒళ్ళిరగొట్టుకునే అవసరం లేకుండా, హాయిగా.... జీతంతో పాటు ‘పై డబ్బులూ’ సంపాదించుకుంటూ, రిటైర్ అయ్యేసరికి భారీ మొత్తం అందుకోగల సుఖమయమైన, భద్రమైన జీవితాన్ని పొందవచ్చు.

ఇందుకోసమే.... చివరికి కాంట్రాక్టు పద్దతిలోనైనా సరే ప్రభుత్వ సర్వీసులో చేరేందుకు లంచాలతో పాటు, ఇతరత్రా మార్గాలు కూడా తొక్కుతున్నారు, చాలామంది! ఎప్పటికో ఒకప్పటికి ఈ కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా క్రమబద్దీకరింపబడి ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాలు కాకపోతాయా అన్నదే ఆశ!

ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు భద్రతా లేదు, ‘తక్కువ పనితో ఎక్కువ రాబడి’ వచ్చే మార్గమూ లేదు. వెరసి పని చెయ్యకుండా ఫలితం కావాలనుకునే మనస్తత్వం, మర్రి విత్తనంలా పుట్టి మహా వట వృక్షమై ఎదిగింది.

పరీక్షా ఫలితాలలో అవకతవకలు ఆ విత్తనాల నుండి వచ్చిన మొలకలే! చదువుల్లో ప్రారంభమైన ఈ ‘అవినీతి’ -[చదవకుండానే పక్కదారిలో ఫలితాలు పొందే అవినీతి] ఇచ్చిన పంట - కౌశలం, నైపుణ్యాలు లేని యువతరం! నూటికి నూరు మందీ ఇలాగే లేకపోయినా, పట్టాలు పుచ్చుకు బయటికి వచ్చిన వారిలో... అత్యధికుల ప్రతిభాపాటవాలు సర్టిఫికేట్లలో మాత్రమే ఉన్నాయి, ప్రాక్టికల్ గా కాదు. కాబట్టే చాలా ప్రైవేటు కంపెనీలు, ఉద్యోగుల్ని నియమించుకున్నాక, వాళ్ళకి మళ్ళీ శిక్షణ నిచ్చుకోవాల్సి వస్తోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుండి, స్ర్కిప్టు, రచనా, డ్రాఫ్టింగుల దాకా.... అన్నిటిలో!

అయితే చాలామంది ఇదేమీ ఆలోచించటం లేదు. సామాన్యులు అలోచించ లేదంటే అది వేరే విషయం. అజ్ఞానం కొందరిదైతే, అలసత్వం కొందరిది. తెలిసినా, ఆలోచించినా, ఏమీ చెయ్యలేని అసహాయత కొందరిది. విచారకరమైన విషయం ఏమిటంటే - ఈ ‘విద్యారంగంలోని అవినీతి’ గురించి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గృహమంత్రులు కూడా ఆలోచించకపోవటం లేదా స్పందించక పోవటం! మీదు మిక్కిలి అమాయకత్వం నటించటం!!

నిజానికి ఒక దేశమ్మీద మరో దేశం ఈ విధంగా కుట్ర చేస్తే చాలు! ఏ యుద్దమూ చెయ్యకుండానే, సదరు దేశాన్ని సర్వనాశనం చేయవచ్చు. ఒకటి రెండు తరాల విద్యార్ధుల్ని నిర్వీర్యం చేస్తే చాలు! మొత్తం యువతరం అసమర్ధులు గానూ, నిష్ర్పయోజనంగానూ తయారౌతుంది. క్రికెట్టూ, పబ్బులూ తప్ప మరేం పట్టకుండా మిగిలిపోతుంది.

ఇది సామాన్యులకు సైతం అర్ధమైనా.... ప్రధానమంత్రికీ, గృహమంత్రికీ, కేంద్రప్రభుత్వానికీ అర్ధం కావటం లేదంటే, లేదా అమాయకత్వం చూపిస్తున్నారంటే అర్ధం.... ఆ కుట్రలో వీళ్ళూ భాగస్థులే అని! ఇది ప్రత్యక్ష నిరూపణ! ఇది గూఢచర్యంతో కూడిన కుట్ర! ఈ విషయాన్ని ప్రక్కన బెడితే....

పూర్వపు రోజుల్లో [ఎంతో గతంలోకి వెళ్ళక్కర్లేదు. ముందటి తరం వరకూ కూడా] విద్యార్ధులకీ ఉపాధ్యాయులకీ [గురు శిష్యులకి] మధ్య, చక్కని ఆరోగ్యకరమైన ఆనందదాయకమైన సంబంధాలు ఉండేవి. శిష్యులు, విద్యార్ధులు తమ టీచర్లని తల్లిదండ్రులన్నంతగా గౌరవించే వాళ్ళు. టీచర్లు తమ విద్యార్ధులని తమ బిడ్డలన్నంతగా మన్నించే వాళ్ళు. పిల్లలకి టీచర్ల పట్ల భక్తి, గౌరవం ఉంటే, టీచర్లకి పిల్లల పట్ల వాత్సల్యం, ప్రేమా ఉండేవి. మాష్టారి గారి భార్యని తమ తల్లిగా, మాష్టారి సంతానాన్ని తమ తోబుట్టువులతో సమంగా విద్యార్ధులు భావించేవాళ్ళు.

ఈ మాట ఎవరైనా అనగానే.... కుట్రదారుల మద్దతు దారులు "అదే అయితే వారి హిందూ పురాణాలలోని ‘తారా శశాంకం, కచ దేవయానిల కథల ’ మాటేమేమిటి?" అంటూ.... అవహేళన మేళవించి వాదనకు దిగుతారు. దాని గురించిన వివరణ Coups On Hinduism and Epics లో వ్రాసాను. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను. ప్రస్తుతం విద్యారంగంపై కుట్రని అనువదిస్తున్నందున, ఆ వివరణ ఇక్కడ ఇవ్వటం లేదు.

భారతీయుల జీవన సరళిలో, సుప్రసిద్ద సంస్కృత సూక్తులను గమనించండి.
మాతృదేవో భవ
పితృదేవో భవ
ఆచార్య దేవో భవ
అంటూ.... మాతా పితరులు, గురువు దైవ సమానులుగా భావించటం మనకి తెలిసిందే!

మరో గురుస్తుతి మనం చిన్నప్పుడు కంఠస్తం చేసిందే!

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

‘గురువు శ్రీమహావిష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుల ప్రతిరూపుడు. గురువు సాక్షాత్తూ ఆ పరబ్రహ్మ స్వరూపుడే! అలాంటి గురువుకి నమస్కారం’ అన్నది విద్యార్ధులు ప్రతిరోజూ పఠించే స్తుతి మంత్రం.

హిందీ సారస్వతంలో ఒక దోహ ఉంది. నాకు గుర్తుండి ఇది భక్త కబీరు చెప్పిన పద్యం. ‘గురువూ, దైవమూ తనకి ఒకేసారి సాక్షాత్తరిస్తే.... తాను ముందుగా గురువుకే నమస్కరిస్తాడట. ఎందుకంటే భగవంతుణ్ణి చూపించింది ఈ గురువే కదా!’ అంటాడు కవి. ఎంత గొప్ప భావన అది?

దైవం అంటే సత్యం. సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం అంటే - దైవాన్ని సాక్షాత్కరింప చేయగలదే!అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించి, దైవాన్ని చూపిన గురువు, దైవం కంటే కూడా ఎక్కువ!

అలాంటి నేపధ్యం నుండి ఎక్కడికి దిగజారింది మన సమాజం? విద్యార్ధులకి, టీచర్లకి మధ్య ప్రేమాయాణాలు నెలకొంటున్నాయి. టీచర్ల నుండి విద్యార్ధులు, లైంగిక వేధింపులనీ, అవమానాలని, అత్యాచార ప్రయత్నాలని ఎదుర్కొంటున్నారు. ఒకోసారి విద్యార్ధుల నుండి టీచర్లూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు రికార్డులూ, మీడియా వార్తలూ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

యదార్ధం చెప్పాలంటే - సినిమా మీడియా మొదటగా దీన్ని సమాజంలోకి ప్రవేశ పెట్టింది. క్రమంగా దాన్ని పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమాజంలోకి మరింత లోతుగా చొచ్చుకు పోయేందుకు [తమ వార్తల కవరేజి పద్దతితోనూ, క్రైం రిపోర్టు, నేరాలు-ఘోరాలూ వంటి కార్యక్రమాలతోనూ] దోహదపడింది.

దాదాపు 30-40 ఏళ్ళక్రితం.... The Bed Room Eyes అనో The Bed Room Windows అనో [పేరు సరిగ్గా గుర్తులేదు] ఒక ఆంగ్ల చిత్రం భారత దేశంలోకి ప్రదర్శన నిమిత్తమై వచ్చింది. తల్లిదండ్రులు స్వసుఖానురక్తులూ, స్వార్దపరులూ అవ్వటంతో.... నిర్లక్ష్యానికి గురైన 12 ఏళ్ళ పిల్లవాడు, ట్యూషన్ టీచర్ చేత `seduce' చేయబడతాడు. మొదట మానసికంగా దగ్గరవ్వటం నుండి, అనుకోకుండా శారీరకంగా దగ్గరవ్వటం... తదనంతర పరిణామాలతో కూడిన చిత్ర కధ!

అలాంటి చిత్రాలు సమాజానికి మేలు చేస్తాయా? కీడు చేస్తాయా? ఈ అంశంతో ఓ పేద్ద డిబేట్ జరిగింది. పత్రికలలో వ్యాసాలు, సమీక్షలూ వచ్చాయి. విద్యావేత్తలూ, మేధావులూ, చివరికి రాజకీయ నాయకులు కూడా అందులో పాలుపంచుకున్నారు. అయితే ఆ చర్చలన్నీ కూడా ఆ సినిమాకి వాణిజ్య ప్రకటనలుగా పరిణమించేటట్లే మొత్తం ఆ తంతంతా నడిచింది. ఆ విధంగా మరింత ప్రచారం వచ్చింది. అంతే తప్ప చిత్ర ప్రదర్శన నిషేధింపబడలేదు.

మెల్లిగా ఆ ఒరవడి బాగానే వంట బట్టింది. క్రమంగా అది అలవాటు చెయ్యబడింది. తదుపరి ఎన్నో సినిమాలలో గురుశిష్యుల మధ్య ప్రేమలూ, పెళ్ళిళ్ళూ చోటు చేసుకున్నాయి. ఇక ‘సుందరకాండ’ వంటి చెత్త సినిమాలలో అయితే పెళ్ళైన మగ లెక్చరర్ వెనక మంగళ సూత్రం పట్టుకుని వెంటబడే విద్యార్దిని! ఆనక ఆ పిల్లకేదో మాయా రోగం అనీ, ఆ బాధ నుండి తప్పించుకోవటానికి ఈ ప్రేమ గోలంతా చేసిందనీ చెబుతాడు దర్శకుడు. రోగం వస్తే Divert అవటానికి ఇంకే మార్గం లేదు కాబోలు! పైగా ఇలాంటి చెత్త సినిమాకి రామాయణంలోని ‘సుందర కాండ’ పేరు పెట్టటం కూడా భారతీయత మీద కుట్రలో భాగమే! ఇక ఈ కోవలో పరాకాష్ట మొన్నటి ‘హైస్కూలు’ సినిమా! 30+ ఏళ్ళ పంతులమ్మకీ 12 ఏళ్ళ కుర్రాడికి మధ్య ‘ఎఫైర్’ అట!

నిజానికి విద్య మనిషిని, చెడు ఆలోచనల నుండి, చెడు మాటల నుండి, చెడు చర్యల నుండి నియంత్రించాలి. ఇందుకు ఉదాహరణగా చిన్న కథ చదవండి. గతంలో ఈ బ్లాగులో ప్రచురించినదే!


విద్య పరమార్ధం మనిషికి మంచి నేర్పాలి. సత్యాన్ని తెల్పాలి. మంచి జీవితాన్నివ్వాలి. కేవలం డబ్బు సంపాదించటమే చదువు పరమార్ధం కాదు. ప్రతి మనిషీ సౌకర్యంగా, సుఖంగా బ్రతకాలనుకుంటాడు. నిజానికది ప్రతి ఒక్కరి హక్కు కూడా! పుట్టిన ప్రతి ప్రాణీ కోరే కోరిక అదే! సుఖంగా, సౌకర్యంగా, సంతోషంగా బ్రతకాలన్నది గమ్యం! ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే గమ్యంతో పాటు దాన్ని చేరే మార్గం కూడా సరైనదై ఉండాలి కదా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left

విద్యార్ధుల సమీకరణకు, ఫలితాల పంపకానికి నెట్ వర్క్! [భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 11]

Thu, 05/27/2010 - 04:04
నిజానికి విద్య అన్నది ఉప్ప ప్యాకెట్టో, బిస్కట్ ప్యాకెట్టో కాదు. సూపర్ మార్కెట్ కు వెళ్ళి, లేదా వీధి చివరికి చిల్లర కొట్టుకొళ్ళి, పది రూపాయలిచ్చి ఓ ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ విద్య అలాంటి వస్తువు కాదు, డబ్బిచ్చి పొందేందుకు! దుకాణదారుకి డబ్బు ఇవ్వటం, దుకాణపు యజమాని మనకి ఉప్ప ప్యాకెట్ ఇవ్వటంతో ఇక్కడ వ్యవహారం [deal] పూర్తయిపోతుంది.

కానీ విద్య విషయంలో అలా కాదు. పాఠశాలలో ఫీజు కట్టి చేరడంతో డీల్ మొదలౌతుంది. ఇక్కడ డబ్బుకి అతీతమైన సంబంధం - విద్యార్ది, ఉపాధ్యాయుల మధ్య ఉంటుంది. విద్యార్ధికి తమ టీచర్ పట్ల గౌరవం ఉండాలి. టీచర్ కి తమ విద్యార్ధుల పట్ల ప్రేమా, వాత్సల్యం ఉండాలి. [ఆవుదూడని వత్స అంటారు. గోమాతకి తన బిడ్డ పట్ల ఉండే ప్రేమని వాత్సల్యం అంటారు.] అప్పుడే టీచర్ చెప్పింది పిల్లల బుర్రలకి పడుతుంది.

కానీ చాలామంది తల్లిదండ్రుల దృష్టి ‘ఫీజు డబ్బు కట్టటంతో తమ కర్తవ్యం పూర్తయ్యింది’ అన్నట్లు ఉంటుంది. దాంతో మొత్తం భారం పాఠశాలల మీద పడుతుంది. పాఠశాలల యాజమాన్యాలు, ఆ భారాన్ని పూర్తిగా తమ ఉద్యోగులైన ఉపాధ్యాయుల మీదికి జారుస్థాయి. దాంతో ఈ మొత్తం జంఝటాన్ని - పాఠశాలలు, ఉపాధ్యాయులతో సహా... కష్టపడి పిల్లలకి చదువు నేర్పించి గాక, పైసలు ఉపయోగించి... మాస్ కాపీయింగ్, మార్కులు వేయించటం, ర్యాంకులు కొనటం వంటి ప్రక్కదారి మార్గాలలో వదిలించుకుంటున్నారు.

పిల్లలకి చదువు నేర్పటం, క్రమశిక్షణాది మంచి లక్షణాలు నేర్పటం.... అందుకోసం మంచి, సమర్ధులైన ఉపాధ్యాయులని సమీకరించటం, వాళ్లకి ఎక్కువెక్కువ జీతాలు చెల్లించటం.... ఇదంతా జంఝటమే! ఇంతకంటే తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో ఫలితాలని సంపాదించవచ్చు.

కష్టపడి పిల్లలకి చదువు చెప్పటం, నయానో భయానో క్రమశిక్షణ నేర్పటం, కష్టపడి చదువుకునే తత్త్వం నేర్పటం - వీటన్నిటి కంటే.... ప్రశ్నాపత్రాలు లీక్ చెయ్యటం, మాస్ కాపీయింగ్ చేయించటం, వంటి పనులకు టీచర్లు పాల్పడుతుంటారు. స్వయంగా టీచర్లే బిట్స్ డిక్టేట్ చేయటం, కాపీలందించటం మొన్నటి పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో కూడా చూశాను. ఇంటర్నల్ పరీక్షల్లో సైతం, కొన్ని పాఠశాలల్లో, కొందరు ఉపాధ్యాయులు ఇదే పద్దతి నడపటం, నడవనివ్వటం మేము స్వయంగా పరిశీలించివే!

ఇక పాఠశాలలు యాజమాన్యాలు... డబ్బూ, పరపతి ఉపయోగించి, తమ విద్యార్దులుకి మార్కులు వేయించటం, ర్యాంకులు కొనటం సర్వ సాధారణం. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, ఫలానా పాఠశాల విద్యార్ధులు ఎవరెవరు తమ గదిలో పరీక్ష వ్రాస్తున్నారో విచారించి మరీ మాస్ కాపీయింగ్ కి సహకరించటం కూడా మొన్నటి పదవ తరగతి పరీక్షల్లో చూశాను.

ఇన్ని రకాలుగా, డబ్బుతో ఫలితాలని కొనవలసిన రావటంతో కూడా, యాజమాన్యాలు ఉపాధ్యాయులకు జీతాలు అంతంత మాత్రంగా ఇస్తుంటాయి. వాక్ ఇన్ ఇంటర్యూ అంటూ కార్పోరేట్ పాఠశాలలు, జిల్లా స్థాయిలో నెంబర్ వన్ విద్యాసంస్థలు కూడా, టీచర్లకు[IIT ఫౌండేషన్ శిక్షణ ఇచ్చేవారికి సైతం] పాతిక వేల దాకా జీతపు స్థాయి ప్రకటిస్తారు. అది కేవలం వాణిజ్య ప్రకటన మాత్రమే. తీరా చూస్తే... ఉదయం నుండి సాయంత్రం వరకూ ఏడెనిమిది పీరియడ్లు చెప్పించుకుని, పది పన్నెండు వేలు చేతిలో పెట్టటమూ నాకు తెలుసు.

పత్రికా ప్రకటనలలో మాత్రం, నెలకు పాతిక ముప్పై వేలు టీచర్లకు చెల్లిస్తున్నట్లు చెప్పుకుంటారు, అందులో సగం వాస్తవంగా చెల్లిస్తారు. టీచర్లను సైతం అలాంటి అబద్దాలనే చెప్పుకొమ్మంటుంది యాజమాన్యం. నిజం బయటపడితే ఉద్యోగం Fire out.

నిజాని కిది రంగు మారిన వాణిజ్య ప్రకటనే, ఉద్యోగ ప్రకటన కానే కాదు. ఆ విధమైన ప్రకటన ఇవ్వటం ద్వారా ‘ఫలానా పాఠశాల వారు నెలకు పాతిక వేలు చెల్లించి మరీ సమర్ధులైన టీచర్లతో చదువు చెప్పిస్తారు!’ అనుకొని, తల్లిదండ్రులు పాతిక వేల నుండి ఏభైవేల దాకా, సంవత్సరపు ఫీజులు తమకు చెల్లించాలన్నది ఇక్కడ వ్యూహం! అదే జరుగుతోంది రాష్ట్రస్థాయి ర్యాంకులు పొందిన విద్యా సంస్థలలో కూడా!

నిజం చెప్పాల్సి వస్తే - ఈ ఫలితాల అవకతవకలకు కూడా తక్కువేం ఖర్చవ్వదు. మంచి టీచర్ల చేత, తగినంత జీతభత్యాలిచ్చి, నిజాయితీగా చదువు చెప్పించినా ఇంతా ఖర్చవుతుంది. అలాంటప్పుడు ‘అదే ఖర్చుపెట్టి నిజాయితీగా ఫలితాలు సాధించవచ్చుగా?’ అనే అనుమానం మనకు వస్తుంది. సరిగ్గా ఇక్కడే కుట్ర కోణం బలంగానూ, అప్రకటితంగానూ పని చేస్తుంది.

నిజాయితీగా, సమర్ధులైన టీచర్లని పెట్టి చదువు చెప్పించినా, పిల్లలు కష్టపడి చదివినా.... ఫలితాలు అంత నిజాయితీగా రావు. ప్రభుత్వమో మరో అధికారామో నియంత్రిస్తే తప్ప! నూటికి ఒక విద్యాసంస్థ, నిజాయితీ దారిలో వెళ్తే పరాజయం పాలు కావాల్సిందే! పైనున్న కార్పోరేట్ సంస్థలు, ఫలితాలని హైజాక్ చేసి తొక్కేస్తాయి. కాబట్టి కూడా విద్యా వైద్యాలు ప్రైవేటీ కరించబడ కూడదు. అందుకే ఇందిరాగాంధీ హయాంలోని గత ప్రభుత్వాలు, అందుకోసం ఒడ్డి పోరాడాయి. గూఢచర్యపు పట్టు అప్పట్లో లేక ఓడిపోయాయి.

ఇక ఈ ఫలితాలని నిర్వహించే [organaise చేసే] తీరు, వాటి తాలూకూ నెట్ వర్క్, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకోసం పెద్ద కార్పోరేట్ విద్యాసంస్థలు కొందరు మధ్యవర్తులని [లైజాన్ ఆఫీసర్లు]ని నియమించుకుంటుంది. సంవత్సరమంతా ఉన్నతోద్యోగులకి, ఎం.ఎల్.ఏ., మంత్రుల వంటి రాజకీయులకి అందుబాటులో ఉంటూ, అవసరాలు[?] తీరుస్తూ, సత్సంబంధాలు కొనసాగించటమే సదరు ఉద్యోగుల/డైరక్టర్ల పని!

ఇవి ఫలితాల సాధన విషయంలో అయితే, ఇక విద్యార్ధుల సమీకరణ గురించిన నెట్ వర్క్, మరింత ఆసక్తి కరమైనది. కార్పోరేట్ విద్యాసంస్థలే కాదు, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ కూడా... విద్యార్ధులని సమీకరించేందుకు తమ తమ PRO లని ఆయాప్రాంతాల్లో అప్రకటితంగా అపాయింట్ చేసుకుంటాయి. మాటకారి వారిని, వ్యాపార నైపుణ్యం, ఎదుటి వారికి నచ్చచెప్పి ఒప్పించగల ఓపిక ఉన్నవారిని చూసుకుని, తమ దగ్గరికి ఎంత మంది విద్యార్ధులని పంపితే అంతగా, తలకు ఇంతని కమీషన్ ముట్టచెబుతాయి.

ఇందుకోసం కొన్ని కాలేజీలు, పాఠశాలలు తమ బోధనా సిబ్బందినీ ఉపయోగిస్తుంది. యాడ్ కాంపైన్ పేరుతో, ఆడియో వీడియోలతో సహా కరపత్రాలూ, బ్రోషర్స్ తో, ఆకర్షణీయమైన స్కీములతో... వేసవి సెలవులంతా ఇదే పని! ఎంతగా ఆశలు పెడతారంటే - తల్లిదండ్రులకి, ముఖ్యంగా అంతగా చదువుకోని గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకి, ఏకంగా అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు.

చిన్న ఉదాహరణ చెబుతాను. మాకు తెలిసిన ఒక అమ్మాయికి పదవ తరగతిలో 541 మార్కులు వచ్చాయి. ఆ అమ్మాయికి లెక్కలంటే ఇష్టం. బాగా చేస్తుంది. కప్ప, బొద్దింకలని చూసినా, ఒక్కసారిగా చీమల కుప్పల్ని చూసినా, ఆ పిల్లకి ఒళ్ళు జలదరిస్తుంది. జంతువుల పట్ల చాలా అయిష్టత. ఆమెకి MPC ఇష్టం.

స్థానిక కాలేజీ వాళ్ళు ఆ పిల్ల తల్లిదండ్రులకి "మీ అమ్మాయిని మా కాలేజీలో చేర్పిస్తే, ఫ్రీగా చదువు చెబుతాం. Bi.PC ఇప్పించండి. బాగా చదువుచెబుతాం. పూర్తిగా ఆమె మీద కాన్ సెంట్రేషన్ చేస్తాం. ఆమె గనుక మెడిసిన్ ర్యాంకు సాధిస్తే, రెండు తులాల బంగారు గొలుసు బహుమతిగా ఇస్తాం" అంటూ ఊదర పెట్టారు.

గత సంవత్సరం మా ప్రక్కింటి అమ్మాయికి 574 మార్కులు వచ్చాయి. ఆమె ఐఐటీ, ఎంసెట్ అంటూ ఉంటే, ఇదే కాలేజీ వాళ్ళు ఇదే ప్రపోజల్ తో "నువ్వు మా పాలిట లక్ష్మీదేవివి తల్లీ! సరస్వతీ దేవి కటాక్షం నీకుంది. ఏదో నీలాంటి వాళ్ళు మా కాలేజీలో ఉండి బాగా చదివి ర్యాంకు తెచ్చుకుంటే మాకు పేరు వస్తుందని మా ఆశ! Bi.P.C. తీసుకో, రానుపోనూ మేమే ఆటో కూడా ఏర్పాటు చేస్తాం" అంటూ ఇంటి చుట్టూ తిరగటం ప్రత్యక్షంగా చూశాము మేము. అదే తంతు ఈ సంవత్సరం ఈ అమ్మాయిది కూడా!

తల్లిదండ్రులకి ఆశ కలగటం సహజం. రెండు తులాల బంగారం అంటే 40 వేలు. ‘తమ పిల్ల చదివేసి మెడిసిన్ సీటు తెచ్చేసుకుంటే...?’ అని ఆశ! అదెంత కష్టమో, ఏపాటి సంభవమో తెలియదు. పదవ తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంది కాబట్టి, మెడిసిన్ ర్యాంకూ తెచ్చేసుకుంటుంది అనుకుంటారు.

ఇక ఇలా ఆశపెట్టే కాలేజీ వాళ్లకి కూడా మెడిసిన్ ర్యాంకు ఎలా వస్తుందో తెలియదు. అసలిక్కడ ఎంసెట్ అన్నదే ఓ పెద్ద ఫార్సు! కాబట్టి, ఎంసెట్ లో ఈ అమ్మాయికే కాదు, ఏ విద్యార్ధికీ మెడిసిన్ ర్యాంకు తెచ్చుకునేంత శిక్షణా తామివ్వలేమని సదరు కాలేజీ వాళ్ళకీ తెలుసు. కానీ ఇవాళా రేపూ, ఇంజనీరింగ్ ర్యాంకులకి విలువ లేదు. ఐఐటీ తాము అందుకోలేరు. చదవగల విద్యార్ధులని సమీకరిస్తే, ఆశపెడితే, వాళ్ళు చదివి ఎలాగోలా ఒక్క మెడిసిన్ సీటు తెచ్చుకున్నా, అది తమకి కాసులు పండిస్తుంది.

ఒక వేళ మెడిసిన్ ర్యాంకు రాకపోయినా ఇంటర్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అవి ప్రచారస్త్రంగా ఉపయోగపడతాయి. ఈ ఆశ కంటే వాస్తవికతా తెలియదు. ఇంటర్ తమ దగ్గర చదివి, లాంగ్ టర్మ్ లో మెడిసిన్ ర్యాంకులు తెచ్చుకున విద్యార్ధుల వివరాలతో, ప్రచారాలు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఆశ వాళ్ళది!

ఇవేవీ తెలియని తల్లిదండ్రుల ఆశ తల్లిదండ్రులది. దాంతో లెక్కలంటే ఇష్టమో, జువాలజీ అంటే కష్టమో ఉన్న అమ్మాయిని Bi.P.C. లో చేరమన్న ఒత్తిడితో, ఆ బుడ్డిది బేర్ మంటోంది. ఏం చేస్తాం? అందుకే నిన్నటి టపాలో.... పిల్లలు విద్యాసంస్థలకీ, తల్లిదండ్రులకీ కూడా ఆదాయ వనరులుగా మాత్రమే కనబడుతున్నారని వ్రాసాను.

ఈ విషయం ప్రక్కన బెడితే.... PROల సాయంతో విద్యాసంస్థలు, విద్యార్ధులని సమీకరించుకునే ప్రక్రియలో.... అచ్చంగా ఎవరి మార్కెట్ సర్వే వారికుంటుంది. ఏ ప్రాంతంలో ఏయే వయస్సు పిల్లలు, ఏఏ తరగతుల్లో చేరేందుకు, ఎంతమంది ఉన్నారన్న వివరాలతో సహా, తల్లిదండ్రుల ఆర్ధిక స్థాయిల గురించి కూడా సమాచారం సేకరిస్తారు. ఆయా ప్రాంతాల్లో, ఏ విద్యార్ధుల తల్లిదండ్రులకి ఎంతెంత పలుకుబడి ఉందీ, ప్రభావపరచగల సత్తా ఏమాత్రం ఉందీ.... లాంటి వివరాలూ పరిశీలిస్తారు. దాన్ని బట్టి ఫలితాల పంపకం ఉంటుంది.

ఎవరి పిల్లలకి మంచి మార్కులూ, ర్యాంకులూ కట్టబెడితే, ఆయా ప్రాంతాల నుండి తదుపరి సంవత్సరం తమకు ఎంతమంది విద్యార్ధులు రవాణా అవుతారో చూసుకుని, దాన్నిబట్టి ఫలితాలని మేనేజ్ చేస్తారన్న మాట! ఇదంతా గమనించినప్పుడు, ఇంత శ్రమా, శ్రద్దా, సమయమూ... విద్యార్ధుల జ్ఞానాన్ని పెంపొందించటానికీ, వారి వ్యక్తిత్వాన్ని నిర్మించటానికీ ఉపయోగిస్తే.... ‘ఈ దేశపు యువత, ఎంత ధృఢతరంగా, సుసంపన్నంగా తయారౌతారో కదా!’ అన్పిస్తుంది.

ఈ విధమైన ఫలితాల అవకతవకల గురించి రాజకీయ రంగం ద్వారా భారతీయత మీద సుదీర్ఘ కుట్ర అనే టపాల మాలికలో ఎంసెట్ అవకతవకల మీద వ్రాసిన టపాలలో వివరించాను.

2000 సంవత్సరం ఫలితాల మీద మేము ఫిర్యాదు చేసిన తరువాత నుండి, ఇంటర్ ఫలితాలలోనూ, ఎంసెట్ ఫలితాలలోనూ, ఈ మధ్య కాలంలో ఐఐటీలోనూ, ‘మట్టిలోని మాణిక్యాలు’, ‘పేదింట విద్యాకుసుమాలు’ అంటూ శీర్షికలతో మార్కులూ, ర్యాంకులలో కొన్నింటిని, డబ్బూ పరపతి, ప్రభావశీలతా గల తల్లిదండ్రుల పిల్లలకి గాక, సామాన్యులకి కూడా రానిస్తున్నారు.

ఎందుకంటే - క్రమంగా ర్యాంకు ఫిక్సింగులూ, మార్కుల అవకతవకలూ బహిరంగ పడుతున్నాయి కదా!? జారిపోయే నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, కొంత సహజత్వాన్ని అద్దేందుకు, ఇలాంటి చర్యలు చేపట్టారన్న మాట. ఇవే మట్టిలోని మాణిక్యాలు 2000 సంవత్సరానికి ముందు స్టేట్ ర్యాంకుల జాబితాలో లేకపోవటం గమనార్హం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
Categories: Left