http://ravichandrae.wordpress.com/feed/

Syndicate content అంతర్వాహిని
గుండె లోతుల్లోంచి...
Updated: 12 sec ago

గోల్కొండ కోట సౌండ్ అండ్ లైట్ షో

Thu, 06/24/2010 - 01:23

గోల్కొండ కోటను ఎవరైనా సందర్శించాలని ఉంటే అక్కడ తప్పక  చూడవలసింది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు నిర్వహించే సౌండ్ అండ్ లైట్ షో. అందులో గోల్కొండ చరిత్రను ఒక నాటక రూపకంలో వివరిస్తారు.  కథను అమితాబ్ బచ్చన్ తన ధీరగంభీరమైన స్వరంతో వినిపిస్తాడు. మధ్యలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు పాత్రలు, సంభాషణల రూపంలో ఉంటాయి.  ఒక్కో సన్నివేశానికి సంభందించిన  సంభాషణలు కోటలో ఎక్కడ జరుగుతాయో అక్కడ లైట్లు వెలుగుతాయి. సంభాషణలు అక్కడి నుంచే వినిపిస్తున్నట్లుండి ఆ సన్నివేశం మన కళ్ళెదురుగా జరుగుతున్నట్లుగా ఉంటుంది.

ముఖ్యంగా రామదాసు ఘట్టం వచ్చినపుడు ఆయన్ను దాచి ఉంచినట్లుగా భావిస్తున్న చెరసాల నుంచి భావగర్భిత మైన బాలమురళీకృష్ణ గాత్రంలో “ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా పలుకవే రామచంద్రా…”  అనే పాట వినగానే నిజంగానే అక్కడ రామదాసు ఉన్నట్లు, పాట పాడినట్లు అనిపించి ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించినట్లయింది నాకు. ఇంకా కులీ కుతుబ్ షా, భాగ్ మతీ దేవి ల మధ్య జరిగే ప్రేమ ఘట్టాలు, ఔరంగజేబు దండయాత్ర సమయంలో కోటను రక్షించడానికి రాజ కుటుంబం పడే తాపత్రయం చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఈ నాటకాన్ని వింటే ఎప్పుడో చిన్నప్పుడు విన్న రేడియో నాటకాలు గుర్తుకు వచ్చాయి. ఒక్కసారిగా నవాబుల కాలంలోకి వెళ్ళి తిరిగి వచ్చినట్లయింది.

పైన నేను చెప్పిన విశేషాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే  సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదర్శనను మాత్రం తప్పక చూడండి.


Categories: Right

నువ్వే తీసుకో…

Tue, 06/22/2010 - 07:45
స్వీడన్ జోకు:

ఓ పట్నం నుంచి ఒకతను వేటాడదామని అడవి చివర్లో ఉన్న గ్రామానికి వెళ్ళాడు. గ్రామం దగ్గరికి వెళ్ళగానే ఓ కుందేలు పారిపోతూ కనిపించింది. గురిపెట్టి కాల్చాడు అంతే… అది ఎగిరి పక్కనే ఉన్న పొలంలో పడింది.

పక్కనే ఉన్న ఆ పొలం యజమాని

“నా పొలంలో పడింది కాబట్టి అది నాదే” అన్నాడు.

“కాదు నేను కాల్చాను కాబట్టి నాదే” అన్నాడు.

అలా కొద్ది సేపు ఇద్దరూ వాదులాడుకున్నాక పొలం యజమానికి ఓ ఆలోచన వచ్చి పట్నం అతనితో ఇలా అన్నాడు.

“ముందుగా నేను నిన్ను డొక్కలో ఒక్కసారి తంతాను. తర్వాత నువ్వు కూడా నన్ను అదేలాగా తన్ను. ఇద్దర్లో ఎవరు తక్కువగా అరుస్తారో ఆ కుందేలు వాళ్ళకి చెందుతున్నమాట.”

ఈ పందేనికి అతను ఒప్పుకున్నారు.

ముందుగా రైతు అతన్ని ఈడ్చి డొక్కలో ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక పట్నం అతను విల విల్లాడిపోతూ కాసేపు నేల మీద పడిపోయాడు. కొంచెం సమయం తర్వాత ఎలాగోలా తేరుకుని

“ఇప్పుడు నా వంతు అన్నాడు” బాధను బలవంతంగా ఆపుకుంటూ.

రైతు నెమ్మదిగా “ఒక్క చిన్న కుందేలు కోసం ఇంత గొడవ అవసరమా చెప్పు? ఆ కుందేలేదో నువ్వే తీసుకో” అన్నాడు.


Categories: Right

కాంచితి అమరావతీ నగర అపురూప శిల్పాలు…

Mon, 06/21/2010 - 01:20

మిత్రుల సమాగమం

అమరావతి శిల్పం

గత శుక్రవారం మా స్నేహితుడు కొండారెడ్డి పెళ్ళి. వినుకొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాస్కర్ నగర్ అనే చిన్న పల్లెటూర్లో వాళ్ళ స్వంత ఇంట్లోనే పెళ్ళి. మా ఎంటెక్ క్లాస్ మేట్స్ రవికుమార్, మురళి, వేణు, ప్రతాప్, ప్రభాకర్, జూనియర్ ప్రవీణ్ వచ్చారు. ఇక సందడే సందడి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత  కలుసుకున్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు. భలే సరదాగా గడిచిపోయింది. ముహూర్తం రాత్రి 2 గంటలకు కావడంతో అప్పటి దాకా మేలుకుని ఊరంతా తిరుగుతూనే గడిపాం.

శనివారం రోజు మధ్యాహ్నం దాకా ఓ కునుకు తీసి అమరావతి చూడడానికి బయలు దేరాం. వినుకొండ నుండి అమరావతి చేరేసరికి సాయంత్రం నాలుగైంది. అమరావతి లో భోజనం అద్భుతంగా ఉంది. హైదరాబాద్ లో ఉప్పు చప్పని కూరలు తిని మొహం మొత్తేసిన చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నట్టనిపించింది. తర్వాత మ్యూజియం చూడ్డానికి వెళ్ళేసరికి సమయం నాలుగన్నరైంది. ఓ అర్ధగంటలో అన్నీ మ్యూజియం మూసేస్తామన్నారు. కానీ లోపల గంట సేపటి దాకా గడిపాం.

లోపల శిల్పాలు సుమారు 2000 ఏళ్ళ కాలం నాటివి. వాటిని చెక్కడానికి వాడిన రాయి ఇప్పటిదాకా నేనెక్కడా చూడలేదు. బౌద్ధ సాంప్రదాయంలోని అనేక చిహ్నాలైన త్రిపీఠకాలు, బుద్ధుడి జీవిత విశేషాలు మొదలైనవాటిని శిల్పాల్లాగా మలచి ఉన్నారు. చిన్నప్పుడు తరగతి పుస్తకాల్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూసి,చదివిన అపురూప శిల్పాలను కళ్ళారా చూసినప్పుడు కలిగిన ఆ అనుభూతే వేరు.

తర్వాత పక్కనే ఉన్న మహా స్థూపాన్ని చూడ్డానికి వెళ్ళాం. దీన్ని కట్టడానికి వాడిన ఇటుకలు చాలా పెద్దవి, బలమైనవి కూడా. చాలా వరకు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చుట్టూ పేర్చి ఉన్న శిలలపై అక్కడకక్కడా శాసనాలు చెక్కించి ఉన్నారు. ముందుగా కొంచెం అమరావతి గురించి రీసెర్చి చేసుకుని వెళ్ళాను కాబట్టి నేనే అక్కడక్కడా మా వాళ్ళకి గైడునయ్యాను . తర్వాత కృష్ణానదీ ఒడ్డునే ఉన్న అమరేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి.ఇక్కడ  శివలింగం మామూలు విగ్రహాలకన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. కొండవీడు కోట కూడా చూద్దామనుకున్నాం కానీ సమయం చాల్లేదు. మళ్ళీ ఎపుడైనా వెళ్ళినప్పుడు చూడాలి.


Categories: Right

సామాజిక ‘వేదం’

Thu, 06/17/2010 - 00:52

నేను ఇటీవల చూసిన మంచి సినిమా, నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా వేదం. నిజానికి  నేను పదిరోజుల క్రితమే చూసినా రాయడానికి ఇన్ని రోజులకు కుదిరింది. ఈ సినిమా గురించి నాకు తోచిన నాలుగు మాటలు…

Spoiler Alert: ఒక వేళ మీరు ముందుగా కథ తెలుసుకోకుండా సినిమా చూడదలుచుకుంటే కింది భాగం చదవద్దు.

ఈ సినిమా నిజానికి ఒక కథ మీద ఆధారపడి తీసింది కాదు. ఐదు కథలు సమాంతరంగా నడుస్తూ ఒక చోట కలుస్తాయి. నాడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను  తనదైన శైలిలో తెరకెక్కించాడు క్రిష్.  సినిమాలో నాకు అక్కడక్కడా కొన్ని  సన్నివేశాలున్నాయి అద్భుతంగా అనిపించాయి. ఉదాహరణకు కిడ్నీ అమ్మేసి  సంపాదించుకున్న డబ్బుల్ని రాములు దగ్గర్నుంచి అల్లు అర్జున్ లాక్కునే సీన్, వెంటనే వచ్చే సీన్ లో హీరోయిన్ ‘న్యూ ఇయర్ పార్టీకి పాసెస్ తీసుకున్నావా?’ అని అడిగితే చేతులో డబ్బులుంచుకుని ‘నా దగ్గర డబ్బుల్లేవనడం’ అనే సన్నివేశం నాకు చాలా బాగా నచ్చిన సన్నివేశాలు.

వేశ్య పాత్రలో నటించిన అనుష్క నటన కూడా నాకు  బాగా నచ్చింది. ఇప్పటి దాకా వచ్చిన సినిమాల్లో వేశ్య పాత్రలను ఆటవస్తువులుగా చూపిస్తే ఇందులో క్రిష్ వాళ్ళను ఓ సమాజంలో భాగంగా చూపిస్తూ వాళ్ళ మానసిక స్థితిని, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను జెన్యూన్ గా చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయం.

కానీ సినిమా సుఖాంతం కాకపోతే తెలుగు ప్రేక్షకులు సరిగా ఆదరించరని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకుల ధోరణిని మార్చే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.నాకు ముగింపు ఏ మాత్రం అసంతృప్తిని కలిగించలేదు. నాకే కాదు థియేటర్లోని మిగతా ప్రేక్షకులు కూడా అలాగే ఫీలయినట్లు అనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ చివర్లో చనిపోతూ సినిమాలో తన ఊతపదమైన ‘దీనమ్మ జీవితం’ అనగానే ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున నవ్వులు విరబూశాయి. దీంతో దర్శకుడి కృషి ఫలించినట్లే అని చెప్పవచ్చు.

ఒకేసారి అన్ని కథలు కలగాపులగంగా నడుస్తుంటే సగటు ప్రేక్షకుడికి కొంచెం కన్ఫ్యూషన్ కలిగించక మానదు. కానీ ఈ రకం సినిమాలు ప్రయోగాత్మకంగా భావించాలి. మొత్తం మీద చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. మిమ్మల్నీ నిరాశపరచదని భావిస్తున్నాను.


Categories: Right

టాలీవుడ్ ట్రోఫీ అప్‌డేట్స్

Sun, 06/13/2010 - 01:29

టాలీవుడ్ టీ20 ట్రోఫీ లైవ్ చూడలేని వారికోసం కేకలో అప్ డేట్స్.


Categories: Right

అశాశ్వతం

Fri, 06/11/2010 - 04:53

ఇక్క్యూ అనే జెన్ గురువు చిన్నప్పటి నుంచే చాలా తెలివైన వాడు. అతను విద్యాభ్యాసం చేసే సమయంలో గురువు దగ్గర ఒక విలువైన టీకప్పు ఉండేది. అది చాలా పురాతనమైనది, విలువైనది. అది ఒకసారి పొరపాటున ఇక్క్యూ చేతిలోంచి జారిపడి పగిలిపోయింది. అతను ఆందోళనలో పడిపోయాడు. గురువు సమీపిస్తున్నాడనగా ఆ ముక్కలను తీసుకుని వెనక దాచుకుని
గురువును ఇలా అడిగాడు “మనుషులు ఎందుకు చనిపోవాలి?”
“అది చాలా సహజం. పుట్టిన ప్రతిదీ ఒక నిర్ణీత సమయం తరువాత మరణించక తప్పదు” అన్నాడా గురువు.

అప్పుడు అతను వెనుక దాచిపెట్టిన ముక్కలను చూపిస్తూ “మీ టీకప్పుకు కూడా ఆ నిర్ణీత సమయం దాటిపోయింది” అన్నాడు.

గురువు నవ్వుతూ అతని భుజం తట్టాడు.


Categories: Right

అంతా మార్కుల మయం

Wed, 06/09/2010 - 01:05

ఈ వారాంతం శ్రీకాళహస్తి కెళ్ళినపుడు తెలుసుకున్న విశేషాలు కొన్ని మీతో పంచుకోవాలనే ఈ టపా.

ఎక్కడ చూసినా కర పత్రాలు, వాటి నిండా ర్యాంకులు, మార్కులు. ఈ సారి పట్టణంలో కొత్తగా నాలుగు కార్పొరేట్ పాఠశాలలు ప్రారంభమౌతున్నాయట.

నేను ఇంటర్ చదివేటపుడు మాకు మ్యాథమేటిక్స్ బోధిస్తూ ఉండి, ప్రస్తుతం ఓ కార్పొరేట్ కళాశాలలో పనిచేసే మా పూర్వ అధ్యాపకులు నాకో ఆసక్తికరమైన సంఘటన తెలియజేశారు.

నెల్లూరు కు సమీపంలో ఉన్న నరసింహ స్వామి కొండ ప్రాంతం. అక్కడ ఓ కార్పొరేట్ కళాశాలకు చెందిన ఐఐటీ కోచింగ్ సెంటర్ ఉంది.

ఓ ఉదయం అక్కడికి ఓ తండ్రి తన కొడుకుని చేర్చాలని వెంటబెట్టుకొచ్చాడు. అక్కడున్న ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నాడు.

“సార్, మా అబ్బాయికి పదో తరగతిలో 536 మార్కులొచ్చాయి. ఐఐటీ కోచింగ్ లో చేరుద్దామని, మీ దగ్గరైతే బాగా చెబుతారని విని తీసుకొచ్చాను సార్.”

“దాందేముంది? అలాగే చేర్చండి. ఫీజు సంవత్సరానికి 60,000. అది కట్టేసి అడ్మిషన్ తీసుకోండి” అన్నాడు చాలా మామూలుగా.

“అంత కట్టలేను సార్. 30,000 అయితే కట్టగలను. కానీ మా అబ్బాయి లెక్కలు బాగా చేస్తాడు సార్. అందరూ మీ దగ్గరికి పొమ్మని సలహా ఇచ్చినారు. అందుకనే వచ్చాం. ఎలాగోలా సర్దుకోండి సార్ ” ప్రాధేయపడ్డాడు ఆ తండ్రి.

అయినా ప్రిన్సిపల్ మనస్సు కరగలేదు. “మేమేం చెయ్యలేమయ్యా. ఫీజు అంతా కట్టేపనైతే చేర్చండి. లేకపోతే వేరే కాలేజీలో చేర్చుకోండి” అన్నాడు కరుగ్గా.

అయినా సరే ఆ తండ్రి తన పట్టు విడవలేదు. “ఎలాగోలా సర్దుకోండి సార్. మా అబ్బాయి నిజంగా లెక్కలు బాగా చేస్తాడు సర్ ” అడుక్కుంటూనే ఉన్నాడు.

కాసేపటి తర్వాత “సరేనయ్యా! నువ్వింతగా అడుక్కుంటున్నావు కాబట్టి మీ అబ్బాయికి మేమో పరీక్ష పెడతాం. అందులో గనక మంచి మార్కులు వస్తే మీరు చెప్పిన ఫీజు కట్టించుకుని చేర్చుకుంటాం” అన్నాడు.

ఆ తండ్రి మొహం ఆనందంతో వెలిగిపోయింది. “అలాగే సార్. మా అబ్బాయి రాస్తాడు” అన్నాడు సంతోషంగా…

ఆ అబ్బాయి మాత్రం ఏ భావం లేకుండా అమాయకంగా ఉన్నాడు.

వెంటనే ఆ అబ్బాయికి 120 మార్కులకు ఓ పేపరిచ్చి ఓ గంటసేపు రాయమన్నారు. ఆ అబ్బాయి పెద్దగా కష్టపడకుండానే పూర్తి చేసేశాడు. పేపర్ దిద్దితే 116 మార్కులు వచ్చాయి.

కాలేజీ వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాలేదు.  ఆ అబ్బాయిని ఓ గంట సేపు విశ్రాంతి తీసుకోమని మళ్ళీ రెండో సారి పరీక్ష పెట్టారు. ఈ సారి అబ్బాయికి 112 మార్కులొచ్చాయి.

అయినా సరే వాళ్ళు సంతృప్తి చెందలేదు. ఆ అబ్బాయికి అలా కొద్ది విరామంతో అయిదు సార్లు టెస్టులు పెట్టారు. ఆ అయిదు పరీక్షల్లో ఆ అబ్బాయి సగటు 115 మార్కులు.

ఇక లాభం లేదనుకుని ఆ ప్రిన్సిపాల్ తమ బాస్ కు ఫోన్ చేశాడు.

“ఏంటయ్యా! అంత మంచి స్టూడెంట్ విషయం లో ఇంత దూరంలో ఆలోచిస్తారా. ఫీజు కట్టేను కట్టకపొయ్యేను. ముందుగా ఆ అబ్బాయికి అడ్మిషన్ ఇచ్చి లాగెయ్యండి” అని ఫోన్ లోనే చీవాట్లు పెట్టాడా బాస్.

అదీ సంగతి. కార్పొరేట్ కళాశాలలకు పేరు తెచ్చేది ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులే…


Categories: Right

నా చందమామ జ్ఞాపకాలు

Tue, 06/08/2010 - 03:13

నా చందమామ జ్ఞాపకాలు ఇక్కడ చదవండి.

చందమామ ప్రతిస్పందనను ఇక్కడ చూడండి.


Categories: Right

సాంకేతిక పుస్తకాల సమీక్షలు… తెలుగులో

Thu, 06/03/2010 - 00:38

పుస్తకం.నెట్ వారు ఈ నెల ఫోకస్ లో భాగంగా వృత్తి నైపుణ్యాలు మెరుగుపరిచే పుస్తకాల సమీక్షలకు చోటివ్వడం ముదావహం. అందులో మొదటి వ్యాసం నాది కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చరిత్రను కీలకమైన మలుపు తిప్పిన సీ భాష కు సంబంధించిన పుస్తకాన్ని పరిచయం చేశాను. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. అలాగే మీకు నచ్చిన, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాల గురించి కూడా రాయండి.


Categories: Right

మనకా సత్తా ఉందా?

Thu, 05/27/2010 - 06:11

శ్రీకాళహస్తి గాలిగోపురం కూలిపోయిన నేపథ్యంలో కొంతమంది నాయకులు భిక్షమెత్తైనా సరే గోపురాన్ని తిరిగి నిర్మిస్తామని ఆవేశంగా ప్రతిజ్ఞలు చేసేశారు. వాటి సంగతలా ఉంచితే ఇంజనీరింగ్ లో మన పూర్వీకుల కన్నా బాగా అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న మనకు నిజానికి మన పూర్వీకుల కట్టడాలను యధాతథంగా పునరుద్ధరించే సత్తా ఉందా? అంటే నాకు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.

నేను వరంగల్ లో ఎంటెక్ చదివేటప్పుడు వేయిస్థంభాల గుడిని చాలా సార్లు సందర్శించాను. అది ఒకే డిజైన్ కలిగిన రెండు ఆలయాలు ఎదురెదురుగా ఉన్నట్లు నిర్మించబడి ఉంటుంది. ఒక్కో ఆలయం గోడలపై ఐదువందల స్థంభాలు చెక్కబడి ఉన్నాయి. కానీ వాటిలో ఒక భాగం నేను మొదట్లో అక్కడికి వెళ్ళినప్పుడే (2006 లో) శిథిలావస్థకు చేరుకున్నది. పురావస్తు శాఖ వారు ఎన్‌ఐటీ వరంగల్ లోని కొంత మంది సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ల సాయంతో ఆలయంలోని రాతి స్థంభాలకు ఏదో నంబర్లు వేసి కూల్చివేశారు. ఈ పనిలో చాలా రాతి స్థంభాలు దెబ్బతిన్నాయి కూడా.

ఇప్పటికి నాలుగేళ్ళు అవుతున్నా ఆలయ పునర్నిర్మాణాభివృద్ధిలో అతీ గతీ లేదు. దీన్ని మన పాలకుల నిర్లక్ష్యంగా అర్థం చేసుకోవాలో లేక మన ఇంజనీర్ల అసమర్థతగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితిలో పర్యవేక్షణా లోపం వలన శ్రీకాళహస్తి గోపురం లాంటి మనకున్న అనేక ప్రాచీన కట్టడాలు కాలక్రమేణా చరిత్రలో కలిసిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదనిపిస్తున్నది. ప్రభుత్వం వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దృష్టి సారిస్తే తప్ప ప్రాచీనమైన దేవాలయాలను కాపాడుకోలేం.


Categories: Right

అయ్యో కూలిపోయింది…

Wed, 05/26/2010 - 11:57

శ్రీకాళహస్తి రాజగోపురం

మా ఊరు శ్రీకాళహస్తికే తలమానికంగా నిలిచిన రాజగోపురం నిట్ట నిలువునా కూలిపోయింది. 1516 సంవత్సరంలో గజపతులపై విజయానంతరం  శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని విజయోత్సవ చిహ్నంగా శ్రీకృష్ణ దేవరాయలు ఈ గోపురాన్ని  నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఏడు అంతస్తులతో 135 అడుగుల ఎత్తు గలిగిన ఈ గాలిగోపురం ఉన్న పళంగా కూలిపోవడానికి మాత్రం ఖచ్చితమైన కారణాలు తెలియరావడం లేదు. గోపురంలో చీలికలు ఏర్పడ్డట్టు కొన్ని రోజుల ముందే కొన్ని టీవీ చానళ్ళు కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు అప్రమత్తమై ఆర్కియాలజీ నిపుణుల్ని పిలిపించారు. వారు ఆ చీలికలను పరిశీలించి గోపురం చుట్టూ 150 మీటర్ల దూరం వరకు డేంజర్ జోన్ గా ప్రకటించారు. చుట్టు పక్కలా ఉన్న ప్రజల్ని తమ నివాసాల్ని ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

గోపురంలో ఇంతకు ముందే పగుళ్ళున్నప్పటికీ ఇటీవల సంభవించిన లైలా తుఫాను ధాటికి సమస్య మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా గోపురంపై పక్షులు నివాసముండటం వల్ల వాటి రెట్టల వల్ల గోపుర పై భాగంలో అక్కడక్కడా చెట్లు మొలుస్తాయి. వాటిని ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాల సమయంలో తొలగిస్తుంటారు. వీటి వల్ల కూడా చీలికలు వచ్చి ఉంటాయని కొంతమంది భావిస్తున్నారు.

అలవాటు ప్రకారం ప్రతిపక్ష నాయకులు అధికారులపై, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నా నిర్మాణం 450 సంవత్సరాల క్రితంది కావటం, మట్టితో నిర్మించడం, తుఫాను ప్రభావం మొదలైన ఎన్నో కారణాలున్నాయి. టీవీలు ప్రసారం చేసిన కథనాలకు వెంటనే స్పందించిన అధికార గణం, ఆలయ అధికారుల అప్రమత్తత వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడ గలిగాయన్నది నిర్వివాదాంశం.

మరి ఉన్న చోటనే మళ్ళీ గాలిగోపురం నిర్మిస్తారో, లేక అలానే వదిలేస్తారో ఆ శ్రీకాళహస్తీశ్వరునికే తెలియాలి.


Categories: Right

కొంటె ప్రశ్నలు – తుంటరి సమాధానాలు

Tue, 05/25/2010 - 00:27

నేను ఐదారు తరగతుల్లో ఉన్నప్పటి సంగతి. పిల్లకాయలం అందరం రోజూ ఉదయం చెరువులోకి వెళ్ళి తిరిగొస్తూ దారి మధ్యలో పేపర్ చదవడం కోసం ఒక రైస్‌మిల్లు దగ్గర ఆగేవాళ్ళం. పేపర్ అంటే మాకు కేవలం ఆటల పేజీనే… క్రికెట్ అంటే అంత పిచ్చి మాకు.

అక్కడ మాలాంటి వాళ్ళను ఆటపట్టించడం కోసం ఒకాయన కూచొని ఉండేవాడు. ఆయన భలే సరదా మనిషి. మేం వెళ్ళి పేపర్ దగ్గర కూర్చోగానే మమ్మల్ని కొన్ని ప్రశ్నలడిగేవాడు.అవి ఎలా ఉండేవంటే

“ఒరేయ్… మీరు చదువుకున్న వాళ్ళైతే నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండ్రా”

“రాయి నీళ్ళలో వేస్తే ఎందుకు మునిగిపోతుంది?”

“ఆ మాత్రం మాకు తెలీదా… రాయి బరువు గా ఉండటం వల్ల మునిగిపోతుంది” అనేవాళ్ళం.

“ఓస్ ఇంతేనా మీకు తెలిసింది? చేప బరువుగా ఉంది కదా మునిగిపోతుందా? కాదు కదా. రాయి మునిగిపోయింది ఈత రాకపోవడం వల్ల” అని తేల్చేవాడు.

హ్మ్మ్ సరే.. ఇంకో ప్రశ్న అడుగుతాను దీనికైనా సరైన సమాధానం చెప్పండి చూద్దాం.

“చెరువులో నీళ్ళు ఎట్టా ఉంటాయి?”

దానికి మేము తెల్లగా ఉంటాయని ఒకడు, బురదగా ఉంటాయని ఒకడు ఇలా ఎవరికి తోచిన సమాధానం వాళ్ళం చెప్పేవాళ్ళం.

ఆయన మాత్రం “ఓర్నీ ఇంతేనా మీకు తెలిసింది. చెరువులో నీళ్ళు గట్టు వేస్తే ఉంటాయి” అనే వాడు.

సరే ఇంకో ప్రశ్న “దారిన పోయే మనిషి ఎట్టుంటాడు?”

మేం ఏం చెప్పినా దానికి కౌంటర్ ఏస్తాడని మేం గమ్మునే ఉండిపోతే…

“మీ అయ్యోర్లు మీకు ఏం పాఠాలు జెప్తాఉండారో ఏమో… ఒక్క ప్రశ్నక్కూడా కరట్టుగా జవాబు చెప్పలేకుండా ఉన్నారు. నేం జెప్తా జూడు”

“దారిన పోయేవాణ్ణి ఉండమంటే ఉంటాడు. ఇది కూడా తెలీదు. ఏం జదవతుండార్రా మీరు!”

అలాంటిదే ఇంకో ప్రశ్న అడిగేవాడు.

“ఒక రైలు పది గంటలకు కాళాస్తిర్లో బయల్దేరింది. పన్నెండు గంటలప్పుడు అది ఎక్కడ వెళుతుంటుంది?”

మేం మధ్యలో ఉండే ఊర్లు పేర్లు ఏదేదో చెప్పేవాళ్ళం. ఆయన మాత్రం “దానిగ్గూడా అంత ఆలోచిస్తుండారేంది మీరు? దానికోసం అంత ఆలోచించ బళ్ళే…
పన్నెండు గంటలప్పుడు అది పట్టాల మీద బోతా ఉంటది” అనేవాడు.

మళ్ళీ ఎప్పుడు కనిపించినా ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడు. ఒక్కోసారి మళ్ళీ “రాయి నీళ్ళలో వేస్తే ఎందుకు మునిగిపోతుంది?” అని అడిగేవాడు.

అప్పుడు గానీ ముందుగా ఆయన సమాధానం గుర్తు బెట్టుకుని “రాయికి ఈత రాక మునిగిపోయింది” అన్నామనుకో ఇంకా గట్టిగా నవ్వేసేవాడు

“ఒరే పిచ్చోడా! రాయికి ఏడైనా ఈతొస్తుందటరా…” అనేవాడు.

ఇంక ఈయన్తో మనకెందుకులే అని మా పిల్ల గ్యాంగంతా సాధ్యమైనంతవరకు తప్పించుకుని తిరిగేవాళ్ళం.


Categories: Right

వేటూరి అవార్డు పాటలు ఒకే చోట వినండి.

Sun, 05/23/2010 - 06:27

వేటూరి పరమపదించిన సందర్భంగా అవార్డులకే వన్నె తెచ్చిన ఆయన పాటలు ఒక చోట చేరుద్దామని ఈ చిన్న ప్రయత్నం వినండి. ఆయనకు మొత్తం ఎనిమిది నంది అవార్డులు, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకు జాతీయ అవార్డు వచ్చాయి. ఈ 9 పాటల్ని పక్కన ఉన్న బాక్స్.నెట్ విడ్జెట్ లో వినవచ్చు. పాటను వినడానికి విడ్జెట్ లో ఆ పాటపై నొక్కండి.

  1. మానసవీణ మధుగీతం – పంతులమ్మ
  2. శంకరా నాద శరీరా పరా – శంకరాభరణం
  3. బృందావని ఉంది – కాంచనగంగ
  4. ఈ దుర్యోధన దుశ్శాసన – ప్రతిఘటన
  5. పావురానికి పంజరానికి – చంటి
  6. ఆకాశాన సూర్యుడుండడు – సుందరకాండ
  7. ఓడను జరిపే ముచ్చట కనరే – రాజేశ్వరి కల్యాణం
  8. ఉప్పొంగెలే గోదావరి – గోదావరి

Categories: Right

కన్ఫ్యూషియస్ సందేశం

Sat, 05/22/2010 - 05:33

క్రీ.పూ 6 వ శతాబ్దంలో చైనాలో జీవించిన ప్రఖ్యాత తత్వజ్ఞుడు కన్ఫ్యూషియస్ మరణ శయ్య మీదున్నాడు. ఆయన చుట్టూ ఆప్తులు, అనుయాయులు గుమికూడారు. అంతా విషాదంలో మునిగి ఉన్నారు. అప్పుడు కన్ఫ్యూషియస్ అతి హీనస్వరంతో

“నా నోట్లో ఏముందో చూసి చెప్పగలరా?” అన్నాడు.

అప్పటికే వయోవృద్ధుడైన ఆయన ఆ తాత్వికుని పళ్ళు ఊడిపోయాయి. కాబట్టి వాళ్ళు,

“అయ్యా మీ నోట్లో నాలుక మాత్రం ఉందండీ ” అని జవాబిచ్చారు.

ఆయన కాసేపాగి “మీ నోట్లో ఏమున్నాయి?” అని అడిగాడు.

“మా నోట్లో పళ్ళు, నాలుకా రెండూ ఉన్నాయండీ” అన్నారు వాళ్ళు తటపటాయించకుండా.

“చూశారా మనిషి పుట్టినపుడు నోట్లో నాలుక మాత్రమే ఉంటుంది. కాలక్రమంలో పళ్ళు మొలుస్తాయి. కానీ అవి నాలుక కన్నా బలంగా, దృఢంగా ఉంటాయి. క్రమంగా మనిషి వృద్ధుడయ్యేసరికి బలమైన పళ్ళు క్రమేణా రాలిపోతాయి. కోమలమైన, సున్నితమైన నాలుక మాత్రమే మరణం వరకు ఉంటుంది.”

ఆయన కాసేపు ఊపిరి తీసుకోవడం ఆగి

“మీ అందరికి ఇదే నా చివరి సందేశం. సున్నితమైనది, సరళమైనది చిరకాలం నిలుస్తుంది. కనుక సదా సరళ ప్రవర్తనులై మెలగండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా, సరళంగా మాట్లాడటం అలవర్చుకోండి” అని చెప్పి కన్ను మూశాడు.

*శ్రీరామకృష్ణ ప్రభ సౌజన్యంతో…


Categories: Right

మెదడుకు మేత – వంతెన దాటడం ఎలా?

Thu, 05/20/2010 - 04:34

A, B, C, D అనే నలుగురు వ్యక్తులు ఒక వంతెన దాటడానికి ప్రయత్నిస్తున్నారు. అది రాత్రి సమయం. వాళ్ళ దగ్గర ఒక లాంతరు మాత్రమే ఉంది. ఆ వంతెన మీద ఒక్కసారి కేవలం ఇద్దరు వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంది. వంతెన దాటడానికి నలుగుర్లో ఒక్కొక్కరు ఒక్కో సమయం తీసుకుంటారు. ఇద్దరు కలిసి వంతెన దాటుతున్నపుడు వేగంగా వెళ్ళగలిగే వ్యక్తి నిదానంగా వెళ్ళగలిగే వ్యక్తిని అనుసరించవలసి ఉంటుంది. అందరు వంతెన దాటడానికి కనీసం ఎంత సమయం పడుతుంది?

ఒక్కో వ్యక్తి వంతెన దాటడానికి పట్టే సమయం కింద ఇవ్వబడింది.

A – 1 నిమిషం

B – 2 నిమిషాలు

C – 5 నిమిషాలు

D – 10 నిమిషాలు

మీ మెదడుకు పదును పెట్టండి. జవాబు వ్యాఖ్యల్లో రాయండి.


Categories: Right

చెంప దెబ్బలు

Wed, 05/19/2010 - 00:33

ఈ మధ్య ఊరికెళ్ళినపుడు కాళహస్తి నుంచి మా ఊరెళ్ళడానికి ఎర్రబస్సెక్కాను. అప్పటికే బస్సంతా నిండిపోయి ఉండటంతో ఒక సీటు పక్కగా నిల్చున్నాను. బస్సు బయలుదేరింది.

క్రిక్కిరిసిన బస్సులో ఉక్కపోతకు చొక్కా ముందుకు లాగి ఉఫ్ఫూ ఉఫ్ఫూ అని ఊదుకుంటున్నా.

పక్క సీట్లో ఓ అమ్మాయి ఓ పిల్లాడ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూంది. పక్కన ఆమె భర్తనుకుంటా, కూర్చుని కొడుకునే మురిపెంగా చూస్తున్నాడు.

ఆమెను చూడగానే నా మెదడు పాదరసంలా పనిచేసి ఒక పేరును బయటకులాగింది.

వెంటనే ” ఏం సుజాతా, నన్ను గుర్తు పట్టలేదా!” అడిగాను.

ఆ అమ్మాయి క్షణం ఆలోచించి ఆశ్చర్యం నిండిన మొహంతో “ఓ రవిచంద్రా! ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. ఇంతకాలమైనా నన్ను గుర్తు పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అంది

ఓ చిరునవ్వు నవ్వాను.

“ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. ఇన్నాళ్ళకిలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్? అమ్మా, అక్కా, అవ్వ, తాత వాళ్ళంతా బాగున్నారా?” అని ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించింది.

“అందరూ బాగున్నారు. నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నా. మీ అమ్మ నాన్న అంతా బాగున్నారా?” అని అడిగాను.

“బాగున్నారు” అనేసి వాళ్లాయన నా గురించి అడిగేసరికి ఏదో చెబుతోంది. ఆయన నవ్వుతూ నా వంక చూస్తున్నాడు. నా మనసు మాత్రం ఆరో తరగతి క్లాస్ రూం లోకి వెళ్ళిపోయింది.

********************************************************************************

మా తెలుగు మాస్టారు మునిక్రిష్ణారెడ్డి గారు  ఒక్కోకర్ని లేపి జిహ్వ చాపల్యం అనే పదానికి అర్థం అడుగుతున్నారు.

ఎవరూ చెప్పలేకపోతున్నారు. చివరికి నా వంతు వచ్చింది.

“జిహ్వ చాపల్యం అంటే ఏదైనా రుచి చూడాలనే కోరిక సార్” అన్నాను.

“వెరీ గుడ్. ఇప్పుడు లేచి ఉన్నవాళ్ళందరికీ చెంప దెబ్బలెయ్” అన్నాడు.

మొదటి వాడి దగ్గరికెళ్ళి వాడి బుగ్గలకు గంధం రాసినట్టు అలా రెండు దెబ్బలేశాను. గట్టిగా వేస్తే ఎలాంటి సమస్యలొస్తాయో మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి అవిక్కడ చెప్పుకోవడం అనవసరం.

దాంతో మా మాస్టారు “ఇదిగో రవీ, చెంపదెబ్బలంటే అలా వెయ్యకూడదు. వేశావంటే చెంప చెళ్ళుమనాలి. నువ్వు గానీ ఇప్పుడు వేసినట్టు వేశావంటే ముందు నీకు పడతాయి దెబ్బలు” అన్నాడు.

“దేవుడా! చివరికి నా ప్రాణం మీదకే వచ్చిందా,” అనుకుంటూ రెండో వాడి నుంచి చెళ్ చెళ్ మంటూ దెబ్బలేసుకుంటూ వెళ్ళిపోయాను.

దెబ్బలు తిన్న వాళ్ళలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.

తిరిగి వచ్చి నిశ్శబ్దంగా నా సంచీ పక్కన కూర్చున్నాను. మిగతా క్లాసంతా మాస్టారు పాఠం చెబుతుంటే గంభీరంగా జరిగిపోయింది. క్లాసు పూర్తయింతర్వాత మాస్టారు వెళ్ళిపోయాడు.

క్లాసు ఇంకా నిశ్శబ్దంగానే ఉంది. ఆ నిశ్శబ్దంలోంచి సన్నగా ఓ ఏడుపు వినిపిస్తోంది.

వెనక్కి తిరిగి చూశాను. నా చేత దెబ్బలు తిన్న ఒకమ్మాయి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుస్తూ ఉంది. మా క్లాస్‌మేట్సంతా నా వైపు ఉరిమి చూస్తున్నారు. నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు.

నెమ్మదిగా ఆ అమ్మాయి దగ్గరికెళ్ళాను.

“గట్టిగా తగిలిందా!… సారీ” అన్నాను.

ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. చుట్టుపక్కల ఉన్న స్నేహితులు అసలు విషయం చెప్పారు. ఆ అమ్మాయికి నిన్నటి నుంచి పక్క పన్ను నొప్పిగా ఉందట. నేను కొట్టిన దెబ్బకి ఆ నొప్పి ఇంకా ఎక్కువయ్యిందేమో పాపం. ఇంక ఏడవక ఏం చేస్తుంది?

ఇక నేను దగ్గరికెళ్ళి బ్రతిమాలడం మొదలు పెట్టాను. “నిజంగా సారీ తెలియక కొట్టాను. ఇంకెప్పుడూ గట్టిగా కొట్టను. ఐనా నీకు నొప్పి ఉన్న సంగతి సార్ తో చెప్పుంటే ఇంత దాకా వచ్చేదా!” అని ఏదో నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఎలాగోలా ఏడుపు మానిపించగలిగాను.

అప్పట్నుంచీ అమ్మాయిలకు చెంపదెబ్బలెయ్యాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవాణ్ణి.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పనే లేదు కదూ… పైన నాకు బస్సులో కనబడ్డ సుజాత.


Categories: Right

ముక్కు గిల్లే ఆట

Tue, 05/18/2010 - 00:45

చిన్నప్పుడు ముక్కుగిల్లే ఆట అని ఒక ఆట ఆడేవాళ్ళం.దీన్ని మిగతా ఊర్లలో ఆడతారో లేదో, ఆడితే ఏ పేరుతో పిలుస్తారో నాకు తెలియదు. ఇందులో ముందుగా ఆడేవాళ్ళు రెండు జట్లుగా విడిపోతారు. రెండు జట్లు ఎదురెదురుగా కూర్చుంటారు. ఉదాహరణకు A, B అని రెండు జట్లు ఉన్నాయనుకుందాం.

A జట్టు లో ఒకడు లేచి వెళ్ళి  B జట్టులో ఒకరికి కళ్ళు మూస్తాడు. A జట్టు లోనుంచి మరొకరు లేచి వెళ్ళి కళ్ళు మూయబడిన వాడి ముక్కు గిల్లి రావాలి.

వాడు వచ్చి కూర్చున్నాక గిల్లించుకున్న వాడు గిల్లిన వాడు ఎవరో కనిపెట్టాలి.మిగతా వాళ్ళెవరూ అతనికి క్లూస్ ఇవ్వకూడదు. ఇదీ ఆట.

సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిల కన్నా కొంచెం సున్నితంగా గిల్లుతారు. కానీ అవతలి వాళ్ళను తికమక పెట్టడానికి దీనికి ఖచ్చితంగా వ్యతిరేకంగా చేస్తుంటారు.

ఇక ఇందులో మజా ఏంటంటే అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఆడతారు. ఆడపిల్లలకేమో చేతులకు గాజులు, కాళ్ళకు గొలుసులు ఉంటాయి. నడిచేటప్పుడు శబ్దం చేస్తుంటాయి కాబట్టి సులభంగా కనిపెట్టేయచ్చనుకుంటారు. కానీ జట్టులో ఉండే మిగతావాళ్ళు అబ్బాయిలు నడిచి వెళుతున్నాగానీ గాజుల శబ్దం చేయడం, గొలుసుల శబ్దం చేయడం వంటి కొంటె పనులు చేస్తుంటారు. కాబట్టి కనిపెట్టడం అంత వీజీ కాదు.

ఇంకొక కొసమెరుపు ఏంటంటే మన విరోధులెవరైనా అవతలి జట్టు లో ఉన్నారంటే వాళ్ళ పని అయిపొయినట్టే… వాళ్ళ ముక్కు ఎర్రగా కదిపోయేది పాపం. అంత గట్టిగా గిల్లేసే వాళ్ళం.


Categories: Right

చౌర్యపు చిట్కా

Mon, 05/17/2010 - 00:40

ఒక ఊర్లో ఒక దొంగ ఉండేవాడు. ఒకసారి అతని కొడుకు తన తండ్రి వృద్ధుడైపోతున్నాడని భావించి తనకు వృత్తిలో కొన్ని చిట్కాలు నేర్పించమన్నాడు.

తండ్రి మౌనంగా ఉండిపోయాడు. ఆరోజు రాత్రి కొడుకుని తనతోపాటు కన్నం వేయడానికి తీసుకెళ్ళాడు.

ఒక్కసారి లోపలికెళ్ళగానే ఒక అల్మారా తెరిచి కొడుకుని అందులోకి దూరి ఏముందో కనుక్కోరమ్మన్నాడు. కొడుకు అలా లోపలికి వెళ్ళగానే అల్మారా తలుపు దభీమని అందరికీ వినిపించేటట్టుగా మూసేశాడు. తను మాత్రం నెమ్మదిగా అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.

అల్మారా లోపల దాక్కున్న కొడుక్కి కోపంతో ముచ్చెమటలు పడుతున్నాయి, ఏం చేయాలో తోచడం లేదు, ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు.

అలా ఆలోచించగా ఒక ఆలోచన తట్టింది. ఉన్నట్టుండి పిల్లిలా అరిచాడు. దాంతో ఆ ఇంట్లో పని చేసే సేవకుడొకడు ఒక కొవ్వొత్తి వెలిగించుకుని వచ్చి అల్మారా తలుపు తెరిచాడు. తలుపు తెరుచుకున్న వెంటనే ఒక్క ఉదుటున అక్కడి నుంచి దూకి పారిపోసాగాడు. దొంగ దొంగ అంటూ అందరూ అతన్ని వెంబడించసాగారు. అతను కొద్ది దూరం పరిగెత్తాక దారి పక్కనే ఒక బావి కనిపించింది. వెంటనే ఒక పెద్ద బండరాయి తీసుకుని అందులో వేసి పక్కనే చీకట్లో దాక్కున్నాడు.

అతన్ని వెతుకుతూ వస్తున్నవాళ్ళు అతను బావిలోనే మునిగిపోయుంటాడని అక్కడే వెతుకులాడుతున్నారు. అదే అదనుగా భావించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళి ఆ ఇంటిని దోచుకున్నాడు.
ఇంటికి రాగానే తన కోపమంతా ఎగిరిపోయింది. తండ్రితో ఏదో చెప్పబోయాడు. తండ్రి అతన్ని ఆపి
“కథంతా అవసరం లేదు. నువ్వొచ్చేశావు కదా చాలు. నేను నేర్పాల్సింది నేర్పేశాను” అన్నాడు.


Categories: Right