కూడలి
జల్లెడ
హారం
ఇంట్లో ఉండే చిన్న పిల్లల దగ్గరనుండి,ఏదో ఫీల్డ్ లో ఉన్నా వారిదాకా ప్రతీవాళ్ళనూ ఇంకోరితో పోల్చడం అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను.మన ఇంటికి ఎవరైనా వచ్చేరనుకోండి,ఇంట్లో చిన్న పిల్లలు అంటే నాలుగైదేళ్ళ వాళ్ళుంటారనుకోండి. వాళ్ళ ప్రజ్ఞా పాటవాలు, ఆ వచ్చినవాళ్ళెదురుగా ప్రదర్శింపచేయాలని, చాలామంది తల్లితండ్రులు ప్రయత్నిస్తారు. ‘ ఏదీ ఒక ఇంగ్లీషు రైమ్ చెప్పమ్మా’అని.ప్రతీ రోజూ,ఇంట్లో వాళ్ళతో బోరుకొట్టేసిన, ఆ చిన్నపిల్ల ఇంక బ్రేక్ లేకుండా,రైమ్ములు చెప్పడం మొదలెడుతుంది. కొంతసేపైన తరువాత, మీ పాప/బాబు కి ఎన్నేళ్ళండీ అని అడుగుతారు. ‘అయ్యో అంతేనా! మా వాళ్ళ పిల్ల ఈ పిల్లకంటే ఆరునెలలు పెద్ద,అయినా సరే ఇంకా స్పష్టంగా మాటలు కూడా రావు’అంటారు.
కొంతమంది పిల్లల్లో పెరుగుదల కొంచెం ఆలశ్యం అవుతుంది,ఆ కారణం చేత కొంచెం టైము తీసికోవచ్చు.ఏం కొంప ములిగిపోదు,అయినా అందరు పిల్లలూ, పుట్టీ పుట్టగానే జీనియస్సు అవాలని అనుకుని వాళ్ళమీద ‘ప్రెషర్’ తీసికొని రావడం చాలా అన్యాయం.
ఈ మధ్యన సచిన్ తెండూల్కర్ గురించి చెప్పేవాళ్ళు ప్రతీ వాడూ,అతనిని డాన్ బ్రాడ్ మన్ తో పోల్చడం. అసలు ఇద్దరికీ పోలికలు ఎక్కడున్నాయంట?బ్రాడ్ మన్ క్రికెట్ ఆడింది 60 సంవత్సరాల క్రింద.అప్పటి పరిస్థితులు వేరు.పైగా సచిన్ అభిమానులు ప్రతీసారీ, ‘డాన్’స్వయంగా ఒప్పుకున్నాడూ,తన కంటే సచినే బెటర్ అనీ అనడం.అది డాన్ బ్రాడ్ మన్ గ్రేట్నెస్!ఎన్ని యుగాలు ఎందరు క్రికెట్ ఆడినా, బ్రాడ్ మన్ సాధించిన
ఏవరేజ్ సాధించగలరా? పైగా అలా అంటే, ఆయన ఆడినవి అరవై టెస్టులుకూడా లేవూ,ఏవరేజ్ అంత వచ్చిందంటే రాదా అని ఓ ఆర్గ్యుమెంటూ.
సచిన్ గొప్పవాడు కాడూ అనడం లేదు.20 సంవత్సరాలనుండి ఆడుతూ,అన్ని సెంచరీలూ టెస్టుల్లోనూ, ఓ.డీ.ఐ ల్లోనూ చేయడం మజాకా కాదు.
కానీ అతనిని కావలిసిస్తే ఈ శతాబ్దం లో ఆడిన బ్రియాన్ లారా తో పోల్చండి.
ఈ మధ్యన గారీ సోబర్స్ ఒక ఫంక్షన్ లో చెప్పాడు–’ నా ఉద్దేశ్యంలో సచిన్ కంటె గవాస్కర్ గొప్పా’ అని.కారణాలు కూడా చెప్పాడు. గవాస్కర్ తన కెరీర్ లో ఎప్పుడూ,హెల్మెట్లూ,ఇంకో రకమైన గార్డులూ పెట్టుకోలేదు.అయినా ధైర్యంగా ప్రపంచంలోని ఫాస్టెస్ట్ బౌలర్స్ మీద సెంచరీలు కొట్టాడు.
ఇప్పుడు క్రికెట్ లో ఆడుతున్న బౌలర్లేమీ, వాళ్ళకంటే ఫాస్ట్ కాదు.అయినా ఇప్పటి ప్లేయర్లు,నెత్తిమీద నుండి ప్రతీ భాగం,రక్షణ లేకుండా మైదానం లోకి దిగలేరు.
ఎవరితోనైనా కంపారిజన్ చేసేటప్పుడు అన్ని పారామీటర్లూ ఇద్దరికీ ఒకేలాగ ఉండాలి.యువరాజ్ సింగూ, సెహ్వాగ్గూ, రిచర్డ్స్ తో పోల్చడం కూడా ఇలాటిదే. ఎవరి గొప్ప వారిదే.
ప్రతీ క్రీడ లోనూ ఇలాగే.ఎవడో మొదలెడతాడు,ఫలానా వాడు ఈ శతాబ్దానికి చాలా గొప్పవాడూ అంటూ.అయినా ఈ సతాబ్దం మొదలయి ఇప్పటికి 10 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇంకా వచ్చే 90 ఏళ్ళలోనూ, ఏమో వీళ్ళందరినీ మించేవాడు రావొచ్చేమో!ఏదో ఫలానా శతాబ్దానికి ఫలానా వాడు’గ్రేటెస్ట్’ అనడం వేరూ,’ఆల్ టైం గ్రేట్’ అనడం వేరూ.
అలాగే సినిమా పాటలగురించి కూడా.ఏదో తాత్కాలికంగా ఓ పాట పాప్యులర్ అవుతుంది. దానిగురించి ప్రతీవాడూ మాట్లాడేవాడే.ఈ ఏడాది వచ్చిన పాటల సంగతి వదిలేయండి- గత అయిదేళ్ళలోనూ ఎన్నో పాటలు వచ్చాయి, అందులో ఎన్ని పాటలు ఎంతమందికి గుర్తున్నాయీ? ఇప్పుడొస్తున్న పాటలకి ‘షెల్ఫ్ లైఫ్’-ఓ ఏడాది, మహా అయితే ఇంకో ఆరు నెలలు. మరి 60 సంవత్సరాలక్రింద వచ్చిన హిందీ,తెలుగు పాటలు ఇప్పటికీ, ప్రతీ వాడూ హం చేస్తున్నారంటే కారణం ఏమిటి? వాటిలో ఉన్న జీవం.ఆ పాటలు ఎప్పటికీ చిరంజీవులే.
ఎవరి అభిమానులు వాళ్ళకి ఉంటారు.వాళ్ళు చెప్పిందే వేదం అని ప్రతీవారిమీదా రుద్దకూడదు. కావలిసిస్తే ప్రస్తుత రాజకీయ నాయకుల గురించి, కంపారిజన్లు చేయండి. ఎందుకంటే వీళ్ళలాటి వాళ్ళు కారణ జన్ములు! దేశ పరిస్థితిని నాశనం చేయడమే వీళ్ళ అల్టిమేట్ టార్గెట్.వీళ్ళలాటి నమూనాలు మనకి ఎక్కడా దొరకరు.శాసనసభ/ పార్లమెంటు లో ఈ మధ్యన జరుగుతున్న ‘నౌటంకీ’ వాటికి సాక్ష్యం.
చందమామ సీనియర్ చిత్రకారులు శంకర్ గారు జూన్ చందమామ -2010 జూన్ సంచిక- కథలకు ప్రస్తుతం చిత్రాలు గీస్తున్నారు.జూన్ నెల చందమామకోసం రెండు దయ్యం కథలు ఎంపిక చేయడం జరిగింది. వాటిలో ఆర్ కుమార రత్నం గారు రాసిన ‘చింతచెట్టు దయ్యం’ అనే ఒక పేజీ కథకు ఆయన ప్రస్తుతం బొమ్మలు వేస్తున్నారు. ఏదో పని మీద ఆయనకు ఇవ్వాళ ఫోన్ చేసి మాట్లాడితే ఆ కథ చాలా బాగుందని తన అభిప్రాయం చెప్పారు.
చిన్న కథే అయినా మనిషి కష్టాలు చూసి దయ్యమే భయపడి మనుషులను పీడించుకు తినడం ఆపేసిందని ముగించడం చాలా బాగుందని శంకర్ గారు చెప్పారు. దయ్యం కథ మళ్లీ చాన్నాళ్ల తర్వాత చందమామలో రాబోతోందని సంతోషపడ్డారు. ‘ఇలాంటి కథలే కావాలి. ఎందుకు చందమామలో కార్టూన్లు, లోకజ్ఞానం ఇలా రకరకాల విషయాలు రాస్తున్నారం’టూ బాధపడ్డారు.
‘చందమామ అంటే పూర్తి పేజీలలో కథలు ఉండాలని కథలు లేకుండా చందమామను నింపడం ఏమిట’ని ఆయన దెప్పి పొడిచారు. ఇన్ని సంవత్సరాలుగా చందమామ వస్తోందంటే కారణం కథలేనని, కథల కోసమే చందమామను చదువుతున్నారని ఆయన అమూల్యమైన అభిప్రాయం చెప్పారు.
పేదవాళ్లకు, పనిపాటలు చేసుకుంటూ కాస్త తీరిక సమమంలో చదువుకునేందుకు కథలు తప్ప జీకేలు, కార్టూన్లు ఉపయోగపడవని, కష్టజీవులకు కాస్త సరదా తెప్పించేందుకు, శ్రమను మరిపించేందుకోసమే చందమామ కథలు ముందునుంచి ప్రయత్నించాయని కథల స్థానంలో కార్టూన్లు, జీకెలు వేస్తే ఎవరికి అవసరమని ఆయన ఢంకా భజాయించారు.
ఆయన మాటలు వింటూంటే ఆ క్షణం నా నోట్లో ఎవరో అమృతం పోసినట్లయ్యింది. చందమామ కథలు ఎవరికోసం ఉంటూ వచ్చాయో. ఎవరికి ఉపయోగపడ్డాయో ఇంత అధ్భుతంగా చెప్పగా నేనింతకు ముందు ఎన్నడూ వినలేదు. ఒక్కసారిగా నా బాల్యం కళ్లముందు సాక్షాత్కరించింది.
పల్లెల్లో వ్యవసాయానికి కరెంట్ పగలు నాలుగు గంటలు, రాత్రి నాలుగు గంటలు మాత్రమే ఇచ్చిన ఆ కాలంలో -1970లు- అప్పుడే మా ప్రాంతాల్లో పరిచయమయిన కరెంట్ మోటర్ను ఆన్ చేసి పొలాలకు నీళ్లు మలపడం, బావిలో నీళ్లు అయిపోతాయోమే మోటర్లో గాలిపోతే మళ్లీ ఆన్ కాదేమో అని భయంతో పొలంకాడికి, దగ్గరే ఉన్న బావికాడికి చక్కర్లు కొడుతూ ఉన్నప్పుడు మాకు చందమామే అప్తబంధువయ్యేది.
ఒక పొలంలో నీళ్లు తడుపుతూ మరో పొలానికి నీళ్లు మలిపే మధ్య కాలంలో దొరికే విరామాన్ని చందమామను చదువుతూనే గడిపేశాం. ఇంకా రాత్రి పూట పొలాలకు నీళ్లు పెట్టవలసి వస్తే లైటు అవసరం లేని సమయంలో కూడా ఆపివేయకుండా దాన్ని అలాగే వుంచి ఆ వెలుతురులో కొత్త చందమామను చదివి సంతోషపడిన రోజులు మావి. ఎందుకంటే పగటిపూట చందమామ చదివేందుకు ఇళ్లలో చాలా పోటీ ఉండేది. ఒక పట్టాన దొరికేది కాదు.
‘నెలరోజులు పనిచేయవలిసిన లైట్ అప్పుడే కాలిపోయిందేమిట్రా బ్యాటరీలు తింటున్నారా ఏమి అంటూ మా పెద్దవాళ్లు ఎగిరితే మాకేం తెలుసు పొలంకాడికి తీసుకుపోయాం అంతే’ అని అమాయకంగా ముఖం పెట్టి తప్పుకోవడం మర్చిపోగలమా..
శంకర్ గారూ! ఎంత మంచి విషయాలు మళ్లీ గుర్తుచేశారు మీరు. నిజంగా చందమామ పేదవాళ్లకు, పని పాటలు చేసుకుని అలసట తీర్చుకునే వాళ్లకు ఎంత చక్కగా ఉపయోగపడిందో. పేరుకు దయ్యం కథ అనగానే మూడనమ్మకాలను మళ్లీ ప్రచారం చేస్తున్నట్లు విమర్శలు రావడం సహజమే కానీ, చీకటిని ఇంకా అనుభవిస్తున్న, చీకటిలో ఇంకా ప్రయాణాలు కొనసాగిస్తున్న భారతీయ ప్రజలకు దయ్య్యం అనే భావనను మర్చిపోవడం సులభం కాదు.
నడిరాత్రులు పక్క ఊళ్లనుంచి వస్తూ దట్టంగా ఉన్న చెట్ల ఆకులు కదిలితే, ఉన్నట్లుండి పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి పడితే చచ్చాన్లో బాబోయ్ అంటూ పరుగుపెడుతున్న గాఢాంథకారపు అనుభవం ఇంకా మన మనస్సులలో మిగిలే ఉంది.
ఇలాంటి వారు చింతచెట్టుమీద దయ్యం గురించి చదివితే, ఆ దయ్యం కూడా మనిషి కష్టాలు దయ్యం పెట్టే బాధల కంటే ఎక్కువ అనే సత్యాన్ని గ్రహించి అప్పటినుంచి అది మనుషులను పీడించడం మానుకున్న వైనం చదివితే వారి మనస్సుకు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే చందమామ కథను లక్షలాది మంది భారతీయులు తమ స్వంత జీవిత అనుభవాలతో పోల్చుకుని పరవశించడం. దశాబ్దాలుగా ఇదే తీరు.
చందమామలో దయ్యం కథలు మళ్లీ వేస్తే ఎక్కడ విమర్శలు వస్తాయో అనే భయంతోనే వేసి చూద్దాం ఏమవుతుందో అని సాహసించి జూన్ చందమామలో రెండు దయ్యం కథలు ఎంపిక చేశాము. అది ఇంకా బయటకు రాకముందే. బొమ్మలు కూడా ఇంకా తయారు కాకముందే చందమామ చిత్రమాంత్రికులు శంకర్ గారు అమాంతంగా వాటిని ఆకాశానికి ఎత్తి ప్రశంసించడం. నిజంగా గుండె పొంగిపోతోంది నాకయితే..
‘దయ్యం కోరిక’ అనే మరో కథ ఆరుపల్లి గోవిందరాజులు గారు -విశాఖపట్న- పంపారు. ఇది కూడా ముగింపు కాస్త మార్చి జూన్ నెలకే ఎంపిక చేయడమైంది. శంకర్ గారు రెండు కథలూ బాగున్నాయని ప్రశంసించారు. చాలాకాలం తర్వాత ఇంత స్పష్టంగా ఉన్న కథలకు బొమ్మలు వేస్తున్నానని ఆయన చక్కటి తెలుగులో మాట్లాడుతుంటే వాటిని ఎంపిక చేసుకోవడంలో తప్పు లేదనిపిస్తోంది.
జగమెరిగిన చిత్రకారులు ఒకే చెప్పారు. ఇక పాఠకుల తీర్పు కావాలి. ఈసారి చందమామలో ఎన్నడూ లేనివిధంగా అయిదు కథలు కొత్తవి ఎంపిక చేయడమైంది. అన్నీ మంచి కథలే. జూన్ చందమామ వచ్చాక అభిమానులుగా మీరే తీర్పు చెప్పండి.
శంకర్ గారూ! ఒక పేజీ కథ అయినా వెంటనే దాని గొప్పతనాన్ని పట్టేశారు. నా కథల ఎంపికకు గౌరవం కలిగించారు. జీవితం ధన్యమైంది.
మీరు చల్లగా ఉండండి. చందమామ కథల సారం విప్పిచెప్పారు. ఎవరి కోసం చందమామ కథలు వేయాలో కూడా తేల్చి చెప్పారు.
మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండి, ఇలాగే బొమ్మలు గీస్తూ ఉండండి.
లక్షలాది ప్రజలకు ఉపశమనం కలిగించిన, కలిగిస్తున్న మీకు మా వందనాలు…
రాజు.
ఇవి కూడా చూడండి ... ఆస్కార్ అవార్డు-2008
చాలా మందికి డబ్బులదగ్గరకు వచ్చేసరికి,అవతలివాళ్ళమీద ఖర్చు చేసిన డబ్బు,అడగడానికి మొహమ్మాట పడిపోతూంటారు! ఆందరితో కలిసి ఏ సినిమాకో, హొటల్ కో వెళ్ళినప్పుడు ఇలాటి మొహమ్మాటాలు ఎదురౌతూంటాయి.ఎందుకంటే ఈ రెండింటికీ ఖర్చు కొంచెం ఎక్కువే.ముందర, ఏదో అతి ఉత్సాహానికి వెళ్ళి, టిక్కేట్లు అందరికీ కలిపి తీసేసికోవడం, ఆ తరువాత చూసుకుంటే తడిపి మోపెడయ్యేటంత ఖర్చు.అడిగితే ఏం అనుకుంటారో అని సిగ్గూ, మొహమ్మాటం! పోనీ మనతో వచ్చినవాళ్ళైనా, అడిగి,టిక్కెట్టుకి ఎంతయిందో తిరిగి ఇచ్చేస్తే బాగానే ఉంటుంది.అబ్బే వాళ్ళనుకుంటారూ, మనం అడిగితే ఇచ్చేద్దామనుకుంటారు,కానీ మనం అడగం!ఏదో నెలలోనూ ఏ మూడో, నాలుగో సినిమాలకి వెళ్ళి అందరూ తలోసారీ తీసికున్నా బాగానే ఉంటుంది.కానీ ఆ గుంపులో, అవతలివాళ్ళమీదే బ్రతికేసే ‘ప్రాణులు’ ఉంటారు!
ఇంకొంతమంది-వాళ్ళ పనిమీద ఎక్కెడెక్కడికో వెళ్ళవలసివస్తుంది.బస్సుల్లో వెళ్ళడానికి నామోషీ, ఓ ఆటో పిలుస్తారు.సరే బాగానే ఉందికదా,వెళ్ళేది అవతలి వాడి పనిమీదే కదా అని, ఎక్కుతాము.వాడు ఆటో దిగినప్పుడల్లా, ఓ అయిదువందల రూపాయల నోటో, వెయ్యిరూపాయల నోటో తీస్తాడు.అంత పెద్ద నోటుకి, ఆటో వాడిదగ్గర చిల్లరెక్కడుంటుందీ,ఇంకో దిక్కులేక, పోన్లే అని మనం ఇచ్చేస్తాము.మనవాడు రోజంతా ఆటోలో తిరిగి, మనచేతే ఇప్పించేస్తాడు. ఇలాటివారికి మందేమిటంటే,మనం జేబులో, వెయ్యి రూపాయలకి చిల్లర పెట్టుకుని, వీడు మొదటిసారి చిల్లర లేదనగానే, ఠక్కున తీసి ఇచ్చేస్తే, వాడికి తెలుస్తుంది , ‘ అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్నా’ అని! ఇక్కడ మనం ఏం మొహమ్మాట పడఖ్ఖర్లేదు!
పెళ్ళిళ్ళల్లో ఖర్చులన్నీ చూసుకోవడానికి, ఓ దగ్గర చుట్టానికి, ఈ బాధ్యతంతా అప్పచెప్పుతాడు. ఆయనేమో, ఓ బ్యాగ్గు పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూంటాడు.ఎక్కడ డబ్బు అవసరం ఉన్నా ఆయన గురించే చూస్తారు.మరి అలాటప్పుడు, ఆ పెద్దమనిషి, కూతవేటు దూరంలో ఉండాలికదా. మన అదృష్టం బాగోకపోతే,అవసరానికి ఈయన కనిపించడు.కన్యాదాత పీటలమీదనుంచి లేవకూడదు, ఏం చేస్తాడు?
దగ్గరలో ఉన్న మీలాటివాడినో, నాలాటివాడినో అడుగుతాడు.ఇంక అలాటివాటిమీద ఆశ వదులుకోవాల్సిందే!మనం చేయవలసిన పని ఏమిటా అంటే,ఆ ఆర్ధిక సలహాదారుడి మూవ్మెంట్స్ కనిబెడుతూ,కన్యాదాత గారు అడగ్గానే ఈయనని పిలవడం !
ఇలాటిదే, ఎవరైనా పోయినప్పుడు, ఆసమయంలో అయే ఖర్చులు.తమ దగ్గరవాళ్ళు పోయినప్పుడు,పాపం ఆఇంటిపెద్ద ఎన్నని చూసుకుంటాడూ,
పోయినవారిని సాగనంపడానికి సవాలక్ష ఖర్చులుంటాయి. ఎవరో ఒకరు ముందుకు వచ్చి, కావలిసిన ఎరేంజ్ మెంట్స్ చేయడానికి, ముందర డబ్బు ఖర్చు పెడతాడు.ఆయన సంస్కారవంతుడైతే ఫర్వాలేదు. అంతా పూర్తయిన తరువాత, ఎంత ఖర్చయ్యిందో అడిగి అణాపైసలతో ఇచ్చేస్తారు. వచ్చిన గొడవల్లా,రెండో రకం వారితో. మనం అడిగితేనే కానీ, పైస రాల్చడు.ఆర్ధికంగా బాగుండని వారైతే వేరే విషయం.పైగా అలాటి సమయాల్లో, అడగడానికి కూడా మొహమ్మాటం. పదిరోజులూ ఈయన ఆ ఇంటికి వెళ్తూనే ఉంటాడు. అయినా సరే ఒక్కరోజు కూడా, మొదటి రోజున అంత్యక్రియల సమయంలో ఎంత ఖర్చు అయిందో, చచ్చినా అడగడు. అలాగని ఈయనా ఇంతయిందీ అని అడగా లేడు.ఆ పోయినాయనకేదో, మనం ఋణం ఉన్నామనుకుని దండం పెట్టడమే !( మా అమ్మగారు పూణే లో దివంగతులైనప్పుడు, మాస్నేహితుడొకరు,ముందుగా అన్ని ఖర్చులూ చేశారు.అదేరోజు రాత్రి, మా అబ్బాయిని, వాళ్ళింటికి పంపించి, అణాపైసలతో ఎంతయిందో అంతా ఆయనకిచ్చేశాను. చెప్పడానికి ముందర ఆయన మొహమ్మాట పడ్డారు. అయినా నాబలవంతంమీద, చెప్పించి, ప్రతీ స్టేజ్ లోనూ ఎంతంతయిందో అడిగి ఇచ్చేశాము.) ఇలాటివి చాలా సున్నితమైన పరిస్థితులు. అవతలి వాళ్ళు అడుగుతారులే అని ఊరుకోకుండా, మనమే బాధ్యతతో ఉండాలి.
ఇంకో సీన్ ఏమిటంటే, మన ఇంటి ఆడవారు ఏవేవో బిసీ పార్టీలనీ, చిట్ ఫండనీ , కిట్టీ పార్టీ అనీ నెలనెలా ఏదో కొంత డబ్బు వేసికుని,ఒక్కొక్క నెలా ఒక్కక్కరికి వచ్చేలా ఏదో వాళ్ళకి చేతనైనంత సేవింగ్ చేస్తూంటారు.ఏదో ఒకనెల ఒకావిడ రాలేదనుకోండి, మొహమ్మాటానికి ఇంకొకావిడ, తన డబ్బుతోపాటు, ఆవిడ డబ్బుకూడా ఇచ్చేస్తుంది.అంతదాకా బాగానే ఉంది, ఇంకో నెల వచ్చేదాకా, వీలున్నంతవరకూ, ఎవరో ఒకరి దగ్గర, ఈ టాపిక్కు తెస్తూండాలి. లేకపోతే,ఆ రెండో ఆవిడ మర్చిపోవచ్చు. ఆ గ్రూప్ లో ఒకళ్ళైనా ఉంటారు, ఈ సంగతి గుర్తుచేయడానికి!